Sunday, August 18, 2019

రైతుల్లో పెరిగిన ధీమా : వనం జ్వాలా నరసింహారావు


రైతుల్లో పెరిగిన ధీమా
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (18-08-2019)
కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. సంక్షోభంలో చిక్కుకున్న జాతీయ వ్యవసాయ రంగం భవిష్యత్తు నిరాశాజనకంగా ఉండగా దేశంలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ తన భూముల్లో సరికొత్త విప్లవాన్ని చూస్తోంది. రైతులు విత్తనాలు వేయడంలోను, భారీగా ఆదాయాలను ఇచ్చే పంటలను పండించడంలోను బిజీబిజీగా ఉంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే దీనికి కారణం. వ్యవసాయ రంగంలో ఈ చరిత్రాత్మక మార్పు సాధించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండేలా చూడడంతోపాటు సాగునీటి సామర్థాన్ని గణనీయంగా పెంచడం.

గొలుసు చెరువులు ఇతర నీటి వనరులను పూడిక తీయడం ద్వారా తిరిగి చైతన్యవంతం చేయడం, ఆ పూడికను వ్యవసాయ భూములకు ఉపయోగించడం, ‘తెలంగాణకు హరితహారం’ ద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టడం, విత్తన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడం పంటలను వేయడానికి ముందే రెండు విడతల్లో వ్యవసాయం కోసం ఏడాదికి రూ. 10,000 పెట్టుబడి మద్దతు అందించడం లాంటి చర్యలు చేపట్టారు. ఈ చర్యలతో వ్యవసాయం పట్ల రైతుల్లో విశ్వాసం పెరిగింది. చాలా రాష్ట్రాలు ఈ పథకాల్లో కొన్నింటిని అనుసరిస్తూ ఉండగా విధాన కర్తలు, విద్యావేత్తలు వాటిని లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అంతేకాదు వ్యవసాయాన్ని వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కొద్ది మంది కూడా తిరిగి తమ గ్రామాలకు తరలివచ్చి మళ్లీ వ్యవసాయం కొనసాగిస్తున్నారు.

2030 నాటికి తెలంగాణ ప్రజల్లో 60 శాతానికి పైగా హైదరాబాద్‌కు 100 కి.మీ. పరిధిలోనే నివసించనున్నారు. ఇందులో 25 కి.మీ. పరిధి ప్రాంతం విస్తరించిన సేవలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కాగా మిగతా 75 కి.మీ. పరిధి ప్రాంతం టెక్నాలజీ ఆధారిత ఉత్పాదక కేంద్రాలుగా ఎదుగుతోంది. సులభతర వాణిజ్యం, మెరుగైన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన కేంద్రంగా మారుతోంది. స్థానిక ఉత్పాక సామర్థాలు, మానవ పెట్టుబడులు, పారిశ్రామిక నైపుణ్యాలకు తగిన చైతన్యవంతమైన వినూత్న సర్కులర్ ఎకానమిగా ఎదిగేందుకు తెలంగాణలోని మిగతా నగరాల్లో కూడా ఇదే ప్రక్రియ అమలవుతోంది. రాష్ట్ర జనాభాలో 15 శాతం ఈ కొత్త నగరాలకు మారే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టుల రీఇంజినీరింగ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మొత్తం రాష్ట్రానికి సాగు నీరు అందేలా చూస్తున్నారు.

సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను అందించడం కోసం పంట కాలనీలను అభివృద్ధి చేయాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఇందు కోసం గ్రామీణాభివృద్ధి రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ “సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ కన్సర్న్” చెందిన కె.ఎస్ నీటికి సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నారు. వ్యవసాయాభివృద్ధి ఆదాయాల పెంపులో అనుబంధ, పంట తోటల రంగాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అయితే దీనికవే స్వతంత్రంగా ఉండడం కారణంగా ఆశించినంత మేర అభివృద్ధి కాని, పెట్టుబడిల కేటాయింపులో తగిన పాత్రకాని ఇప్పటివరకు లేవు. అయితే ఆదాయాలు పెరగడం, పట్టణీకరణ కారణంగా వినియోగ రంగంలో మార్పులు వస్తున్నాయి. భారీగా సాగు నీరు అవసరమైన వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకులాంటి పంటలకు డిమాండ్ తగ్గిపోతోంది. అయితే స్టార్చ్, పౌల్ట్రీ కారణంగా మొక్క జొన్నకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పంటలకు కనీస మద్దతు ధరలు, సేకరణ హామీల కారణంగా కృత్రిమంగా డిమాండ్ పెరుగుతోంది.

మరో వైపు పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలకు మార్కెట్ అవకాశాలు పెరుగుతున్నాయి. పత్తి నల్లరేగడి భూముల్లో పండిస్తున్నారు. అంతేకాక ఎక్కువ పెట్టుబడి పాటు దీర్ఘకాలిక పంటగా ఉంటోంది. మార్కెట్ డిమాండ్ తగ్గుదలను ఎదుర్కొంటున్న ఉత్పత్తులకు రెండు పంట సీజన్లకు విలువైన గోదావరి జలాలు లభించడం లేదు. ఈ అసమానతలను అధిగమించడానికి గోపాల్ ఒక ప్రతిపాదనను సూచిస్తున్నారు. అదేమిటంటే ఖరీఫ్ కాలంలో పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలు, తృణ ధాన్యాలు, పశువుల దాణాలాంటి వాటిపై దృష్టి పెట్టి నాణ్యమైన విత్తనాలు, రక్షిత సాగు నీటి వినియోగం, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పాదకతను పెంచుకోవాలి. ఈ పంటలకు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాక రాష్ట్రం రబీ కాలంలో పండించే జీవద్రవ్యం, పుష్కలమైన పోషక విలువలు కలిగి ఉన్న పశువుల దాణాకలిగి ఉంటుంది. రబీకాలంలో కాలువల ద్వారా సరఫరా చేసే వరద నీటిని ఉపయోగించుకుని రైతులు వరి, పత్తి, గోధుమలాంటి పంటలను పండించుకోవచ్చు. ఆధునిక విత్తనాలు సరియైన పోషక విలువల నిర్వహణ ద్వారా ఈ పంటల దిగుబడి రెట్టింపు చేసుకోవచ్చు.


అంతేకాక ఈ ప్రాంతాలలోని రైతులు తమ ఆదాయాలను పెంచుకోడానికి, అలాగే భూసారాన్ని పెంచుకోడానికి, చీడ పీడలను అదుపు చేయడానికి సహజమైన మార్గాలుగా ఉండడం కోసం వ్యవసాయక అటవీకరణ(అగ్రో ఫారెస్ట్రీ) తప్పక చేపట్టాలి. దీని తర్వాత ఫిబ్రవరితో మొదలయ్యే ఐదు నెలల పాటు కొనసాగే, పండ్లు, పూలు, కూరగాయలు లాంటి వాటికి ఎక్కువ ధర లభించే వేసవి కాలం మొదలవుతుంది. బిగ్ బజార్ బెంగళూరు నగరం నుంచి సేకరించే తాజా పళ్లు, పూలు, కూరగాయలకు సంబంధించి జరిపిన ఒక అధ్యయనంలో పదేళ్ల క్రితం ఈ సేకరణ 75 కి.మీ. పరిధిలో ఉండగా ఇప్పుడది 200 కి.మీ. విస్తరించినట్లు గుర్తించారు. త్వరగా చెడిపోయే సరకుల కోసం అంత దూరం వెళ్లడం మంచి కాదని ఈ అధ్యయనం చెబుతోంది. రైతుల ఆదాయాలు గణనీయంగా పెంచుకోడానికి అలాగే పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తట్టుకోడానికి ఇది ఒక సదవకాశం. అలాంటి మార్కెట్ ఆధారిత పంటలను పండించడం వల్ల రైతుల ఆదాయాలు నాలుగు రెట్లు పెరుగుతాయి.

నీటి లభ్యత(భూగర్భ,ఉపరితల)వినియోగం ఇలా ఉండాలి
వర్షపు నీటిలో ఖరీఫ్ కాలానికి 10 శాతం అంతకన్నా కాస్త్త ఎక్కువ. రబీలో వరద విధానాన్ని ఉపయోగించి 50 శాతం, ఫిబ్రవరి నుంచి జనవరి వరకు కూరగాయలు, పండ్లు, పూలు పండించడానికి 25 శాతం, రవాణా, ఆవిరి నష్టాలు, పశువులు హరిత హారం వినియోగం కోసం మరో 15 శాతం ఉండాలి. వేసవి కాలంలో అత్యంత విలువైన పండ్ల తోటలు, అగ్రోఫారెస్ట్రీ పంటల సాగుకు నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ఎంతైనా అవసరం. దీనికి అత్యంత సరియైన విధానం డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం). పంట భేదాలు, కాలం( సీజన్), మొక్క వయసు, దిగుబడి స్థాయి, భూముల రకాలు లాంటి వాటి ఆధారంగా పండించే వివిధ పంటలకు వ్యవసాయ శాస్త్రజ్ఞులు సూచించిన నీటి కన్నా 60 శాతం ఎక్కువ నీరు రైతులు ఉపయోగించే బిందు సేద్యం విధానంలో ఉపయోగిస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది.

భూగర్భ జలాల ఈ భారీ దుర్వినియోగాన్ని సరియైన చర్యలు తీసుకోడం ద్వారాను, రైతుల్లో అవగాహన కల్పించడం ద్వారాను నివారించవచ్చు. సుదీర్ఘ వడగాడ్పులతో కూడి ఉండే వేసవి వాతావరణంలో నీటిని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోడానికి సరియైన మార్గం బిందు సేద్యం విధానంలో మార్పు చేసుకోడం ఒకటే. భూ ఉపరితలం పైన నీటిని పంపించడానికి బదులు మొక్క వేరు ప్రాంతంలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడం మంచిది. ఎంత నీటిని సరఫరా చేశామని కొలుచుకోడానికి బదులు మొక్క వేరు ప్రాంతంలో ఎంత తేమ ఉందో చూచుకోడం సరియైన సాగు విధానంగా ఉంటుంది. దీని వల్ల ప్రస్తుతం డ్రిప్ విధానంలో ఉపయోగించే నీటిలో సగం తగ్గడమే కాకుండా సాగు నీటి లభ్యత విషయంలో రైతుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కలుపుమొక్కలు పెరగడం ఉండదు.

అలాగే నీటి ఆధారిత, మొక్క వేరు ప్రాంతంలో సంభవించే చీడ పీడలు కూడా తగ్గుతాయి. రాష్ట్రంలో డ్రిప్ పైపు లైన్లలో ప్లాస్టిక్‌ను ఎక్కువగా ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ 30 మైక్రాన్ల ప్లాస్టిక్ షీట్‌ను రైతు ప్రతి సంవత్సరం మార్చాల్సి ఉంటుంది. కొన్నేళ్లు గడిచేటప్పటికి ఇవి గుట్టలా పెరిగిపోయి సమాజానికి సమస్యగా మారుతాయి. అన్నిటికన్నా మించి భూమిలో వాయు పూరణం లేకుండా పోవడం వల్ల కొంత కాలం గడిచేటప్పటికి ఆ భూమి నిర్జీవంగా మారిపోయి రైతులు అత్యంత ఖరీదైన రసాయనిక ఎరువులపై ఆధారపడాల్సి వస్తుంది. సరైన పద్ధతిలో మొక్క వేరు ప్రాంతంలో తేమ ఉండేలా చూచుకోవడం వల్ల ఈ సమస్య పరిష్కారమవుతుంది.

రీసెర్చ్, ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన టి హబ్‌లో వివిధ రకాల పంటలపై, పండ్ల తోటలు, ఆగ్రో ఫారెస్ట్రీ కోసం వాడే భూములలోను ఈ వినూత్న విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు కూడా. ఈ వినూత్న విధానంలో ప్రధాన మార్పు ఏమిటంటే భూ ఉపరితలంపై నీటికి బదులు మొక్క వేరు ప్రాంతంలో తగినంత తేమ ఉండేలా చూడడమే. ఈ విధానంలో మామూలు పద్ధతి కంటే 40 శాతం తక్కువ నీరు వినియోగం ఉండడమే కాకుండా మొక్క జీవించే రేటు ఎక్కువగా ఉండడం, దిగుబడిపెరగడం, జీవద్రవ్యం ఎక్కువగా ఉండడం, వేళ్లు మెరుగ్గా విస్తరించడం లాంటివి ఉండడం ఐసిఎఆర్ సంస్థ గుర్తించింది.

మండు వేసవి నెలల్లో సైతం డ్రిప్ తో పోలిస్తే ఈ టెక్నాలజీని ఉపయోగించే రైతులు 50 శాతం దాకా నీటిని ఆదా చేసుకోగలిగారు. అంతేకాకుండా కలుపు పెరగడం గాని, వేరు ఆధారిత చీడ పీడలు గాని లేవు. డ్రిప్ సాగుకు ఇది ఒక కొనసాగింపే అయినందున దీనికి పెద్దగా ఖర్చు కూడా కాదు. చెరువులు నిండి కాలువలు పొంగి పొర్లుతూ ఉంటే భూగర్భ జలాలు కూడా మెరుగుపడతాయి. అయితే భూగర్భ జలాలనన్నింటినీ తోడేస్తున్నారు. అందువల్ల సరఫరా మెరుగుపడినప్పటికీ పరిస్థితి దారుణంగా మారుతోంది. 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసుకోవచ్చు. వివిధ కాలాల్లో నీటి పంప్ చేసే గంటలను రైతు తగ్గించుకోడానికి, ఏమేరకు తోడుకోవాలి, భూగర్భ జలాల ప్రాంతాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలనే దానికి ఇది ముఖ్యంగా తోడ్పడుతోంది. వివిధ కాలాల్లో ఈ స్థిర జలాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో రైతు నిర్ణయించుకోవచ్చు.

No comments:

Post a Comment