Sunday, April 9, 2023

మా ముత్తారం శ్రీ సీతారామచంద్ర స్వామి, అమ్మపేట వెంకటేశ్వర స్వామి దేవాలయాలు : వనం జ్వాలా నరసింహారావు

 మా ముత్తారం శ్రీ సీతారామచంద్ర స్వామి,

అమ్మపేట వెంకటేశ్వర స్వామి దేవాలయాలు

వనం జ్వాలా నరసింహారావు

శ్ర్రీరామ నవమి (30-04-2023) నాడు ముత్తారంలో జరిగిన సీతారామ కల్యాణానికి, వారంరోజుల తరువాత చైత్ర శుద్ధ పౌర్ణమి (06-04-2023) నాడు అమ్మపేట గుట్ట దగ్గర జరిగిన శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామి కల్యాణానికి సతీసమేతంగా వెళ్లి వచ్చాను. కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలు మినహా, చిన్నతనం నుండి బహుశా ఏ సంవత్సరం కూడా ఈ రెండు కళ్యాణాలకు పోకుండా లేము. అశేష జనవాహిని మధ్య, అంగరంగ వైభోగంగా జరిగే ఈ కల్యాణాలకు చుట్టుపక్కల పలు గ్రామాల భక్తులు హాజరవడం విశేషం.   

ఖమ్మం జిల్లా, (ఒకనాటి ఖమ్మం తాలూకా) ముదిగొండ మండలం, ముత్తారం గ్రామంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం; అలాగే అమ్మపేట గ్రామానికి కొన్ని ఫర్లాంగుల దూరంలో పెద్ద గుట్టమీద వెలసిన  వెలగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం వున్నాయి. ఈ రెండూ అతి పురాతనమైనవని స్థలపురాణం ఆధారంగా తెలుస్తున్నది. ముత్తారం రెవెన్యూ గ్రామ పరిధిలో నా జన్మస్థలం వనంవారి కృష్ణాపురం గ్రామం (శివారు) వుండగా, ఆ గ్రామానికి మరో పక్క సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అమ్మపేట గట్టు, ఆలయం వున్నాయి.   

మా పూర్వీకులైన వనం కృష్ణరాయల గారి కోరిక తీర్చేందుకు, శ్రీరామచంద్రుడు, భద్రాచలంలో వున్నట్లు మా గ్రామంలో కూడా వెలిసి, ముక్తి వరం ముత్తవరం - ముత్తారం రామాలయంగా దాన్ని ప్రఖ్యాతి గావించాడని చుట్టుపక్కల వారి నమ్మకం. దీనికి తగిన ఆధారాలు తెనాలి దగ్గరున్న అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం వారు ప్రచురించే ‘భక్తి సంజీవని’ అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో దొరికాయి. గ్రామస్తులంతా కలిసి జీర్ణావస్థలో వున్న ముత్తారం రామాలయాన్ని పునర్మించి, ఆ ప్రాంతంలో పెద్ద దేవాలయంలాగా చేసారు.

మా పూర్వీకుల్లో ప్రసిద్ధిచెందిన వనం కృష్ణ రాయలు గారు అచంచలమైన శ్రీ సీతారామ భక్తుడు. ప్రతిఏటా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు, స్వయంగా గోటితో వలిచిన బియ్యం తలంబ్రాలుగా తీసుకుని, విధిగా హాజరయ్యే వాడట. కాలంగడుస్తున్నకొద్దీ, వయసు మీరుతుండడంతో, వెళ్ళిరావడానికి ఇబ్బందిపడుతుండేవాడు. అప్పట్లో ఆయన గుర్రంమీద వెళ్లొచ్చేవాడు. చివరకో సంవత్సరం గోదావరి నది దాకా వచ్చి, ఇక ముందుకు వెళ్లలేక, అలసిపోయి అక్కడే పడిపోయాడు. భద్రాచలంలో రాముడి కల్యాణానికి వేళవుతుండడంతో, ఉత్సవ విగ్రహాలను కల్యాణ మంటపానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఉత్సవ విగ్రహాలనుంచిన వాహనం లేపడం సాధ్యపడడం లేదు. ఎంతో బరువనిపించింది. చివరకు ఏం చెయ్యాలో పాలుపోని నిర్వాహకులకు, అశరీర వాణి అసలు విషయం బయటపెట్టింది. తన భక్తుడు గోదావరిలో అలసటతో పడిపోయాడని, అతడిని తోడ్కొనిరమ్మని దాని సారాంశం. నిర్వాహకులు అలాగే చేసి కృష్ణ రాయలుగారిని తీసుకొచ్చారు. ఆయన వస్తూనే తన చేయి వాహనం మీద వేయడంతో అది తేలికగా వాహకులకు మోసేందుకు అనువుగా మారింది. కృష్ణరాయలెంత భక్తుడో అందరికీ అర్థమయిందప్పుడు.

కల్యాణోత్సవం అయిపోగానే, ఎప్పటిలాగే తిరుగు ప్రయాణమయ్యారు కృష్ణ రాయలుగారు. కొంచం దూరం వెళ్లింతర్వాత ఆయనకు తన ముందు ఒక రథం పోతూ కనిపించింది. దాన్ని చేరుకుందామని ఆయన చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. తన ముందు రథం, దాని వెనుక ఈయన గుర్రం వూరిపొలిమేరవరకు చేరుకున్నారు. ముత్తారం సమీపంలోకి చేరుతూనే, కృష్ణ రాయలుగారు చూస్తుండగానే ముందున్న రథం అదృశ్యమైపోయింది. మర్నాడుదయం జరిగిన విషయాన్నంతా గ్రామస్థులకు వివరించి, రథం అదృశ్యమైన ప్రదేశానికి సమీపంలో అన్ని వైపుల ఏదన్నా వుంటుందేమోనన్న ఆశతో గాలించారు. ఆశ్చర్యంగా కొంత దూరంలో, భద్రాచలంలోని రామాలయంలో వున్న సీతారామ లక్ష్మణ విగ్రహాల లాంటి విగ్రహాలే కనిపించాయి వారికి. (వామాంక స్థిత జానకి) వామాంకంమీద సీత కూర్చున్న రీతిలో, భద్రాచల రాముడి విగ్రహాలు దొరకడంతో ఏం చెయ్యాలన్నది ఆలోచించసాగారు.

ఆ రాత్రి కృష్ణ రాయలుగారి కలలో కనిపించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనకు వయసు మీరడంవల్ల భద్రాచలం రావడం కష్టమవుతుందని భావించిన తానే ఆయన దగ్గరకొస్తున్నానని, ముత్తారంలో తనకు గుడి కట్టించి యథావిధిగా పూజలు జరిపించమని చెప్పాడు. ఆయన ఆదేశానుసారం కృష్ణ రాయలుగారు ముత్తారం రామాలయాన్నీ, పక్కనే శివారు గ్రామమైన వనం వారి కృష్ణాపురాన్నీ నిర్మించారు. కృష్ణ రాయలుగారు నిజమైన భక్తుడై నందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు.

భద్రాచలం రామాలయం కట్టిన కొన్నాళ్లకు ముత్తారం రామాలయం కూడా కట్టబడింది. అయితే మూడు, నాలుగువందల సంవత్సరాల క్రితపు కట్టడమై నందువల్ల శిథిలావస్థకు చేరుకుంది. గ్రామస్థులంతా ఆలయాన్ని పునర్నిర్మించేందుకు నడుంకట్టారు. ఆలయ పునర్నిర్మాణం కేవలం మానవ సంకల్పమే అయితే ముందుకు సాగక పోవచ్చు గాని, దైవ సంకల్పం అయితే దాన్ని ఆపేవారుండరనేది అనుభవపూర్వకంగా జరిగింది. దైవం నా వంతు సేవ చేసే అవకాశమిచ్చాడు భగవంతుడు. ప్రతిఏటా రామాలయంలో గోదాదేవి కల్యాణం జరిపించడం మన కుటుంబం చేయాల్సిన పనుల్లో ఒకటని, అది నేను కొనసాగించాలనీ, అది సక్రమంగా జరగాలంటే రామాలయంలో శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం (ఉత్సవ) ప్రతిష్టించాలనీ మా నాన్న వనం శ్రీనివాసరావు గారు చనిపోవడానికి మూడు రోజుల ముందర నాపై ఒక భాద్యతపెట్టారు. అయితే వివిధ కారణాల వల్ల ఆ బాధ్యత చాలాకాలం వరకు నెరవేర్చ లేకపోయాను. నెరవేర్చే క్రమంలో దేవాలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ జరుగనున్నదని ముందు నేనూహించలేదు.

2006 సంవత్సరం చివర్లో కృష్ణుడి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించే ఆలోచన కార్యరూపం దాల్చడం మొదలైంది. గ్రామంలోని నా చిన్ననాటి స్నేహితుడు ఏటుకూరి నారాయణ సహాయంతో విజయవాడ సమీపంలో విగ్రహాన్ని తయారు చేయించి, 2007 లో ప్రతిష్టకు సన్నాహాలు చేశాం. దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడు వాసు (శ్రీనివాసరావు) మహాపండితుడు. వేదాధ్యయనం చేసినవాడు. యువకుడు. కళ్యాణోత్సవాలు, ప్రతిష్టలు చేయించడంలో దిట్ట. ఆగమశాస్త్రం తెలిసినవాడు.  ఆయన అధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగవైభోగంగా ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట విజయవంతంగా జరిగింది. మా కుటుంబం ఆ మూడు రోజులూ అక్కడే వున్నాం. వూరిపెద్దలు, చిన్నలు, విభేదాలు మాని ఏదో సమయంలో కార్యక్రమం చూడడానికి వచ్చారు. నాటి జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ జిల్లా అధికారులు, మంత్రి సంభాని చంద్రశేఖర్ కూడా వచ్చారు. నాడు గోదా, రంగనాథుల శాంతి కళ్యాణంతో ప్రారంభమైన కల్యాణం అవిచ్చిన్నంగా నేటికీ కొనసాగుతున్నది. భవిష్యత్తులో కూడా కొనసాగడం తధ్యం. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది. సాధ్యమయినంతవరకు (కరోనా కాలంలో కూడా) ఈ కార్యక్రమానికి హాజరవుతుంటాం.

కార్యక్రమం పూర్తయిన తర్వాత దేవాలయ పునర్నిర్మాణ విషయంలో కొంత చర్చ జరిగింది. మా గ్రామ అప్పటి సర్పంచ్ ముండ్ర అప్పారావు చొరవతో, మా బాబాయి స్వర్గీయ వనం గోపాలరావు ప్రోద్బలంతో, గ్రామస్తులలో పలుకుబడి కలిగిన వారందరూ దేవాలయానికి వచ్చారు. జీర్ణావస్థలో వున్న దేవాలయాన్ని ఎలా పునర్నిర్మించాలని అంతాకలసి ఆలోచన చేశాం. ప్రభుత్వం దగ్గర నుండి కొంత సహాయం పొందుదామనీ, విరాళాల రూపంలో కొంత వసూలు చేద్దామనీ నిర్ణయించాం. మా గ్రామంలో పుట్టి, పెరిగి, ఇంజనీరయ్యి, సంపాదనపరుడైన పరుచూరి ప్రసాద్ దేవాలయ పునరుద్ధరణకు పెద్దమొత్తంలో సహాయం చేస్తానని గతంలో మాటిచ్చాడు.

ఆ రోజున సమావేశానికి వచ్చిన వారందరికీ, కృష్ణుడొచ్చిన వేళా విశేషంవల్ల రాముడికి కూడా కొత్త ఆలయం తప్పక వస్తుందన్న నమ్మకం కుదిరింది. నాకూ ఆనందం వేసింది. నా వంతు విరాళంగా లక్షా నూటపదహారు రూపాయలు ప్రకటించాను. మరుక్షణమే ఒకరి తర్వాత ఇంకొకరు తాహతుకు మించి విరాళాలు ప్రకటించారు. కొందరైతే దేవాలయంలోని కొన్ని నిర్మాణాలకు పూర్తి ఖర్చు తామే భరిస్తా మంటూ ముందుకొచ్చారు. సమావేశానికి పర్చూరు ప్రసాద్ హాజరై, దేవాలయానికి సంబంధించిన మొత్తం నిర్మాణానికి అయ్యే వ్యయమంతా భరిస్తానని మాటిచ్చి, ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలకు పైగా వ్యయం చేశాడు.  

2009 ఫిబ్రవరి నెలవరకల్లా ఆలయ నిర్మాణం పూర్తయింది. దేవాలయం పూర్తికావడానికి సర్పంచ్ అప్పారావు చేసిన కృషి నిజంగా అభినందించాలి. ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగవైభోగంగా, అశేష జనవాహిని మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించిన ఘనత అర్చకుడు వాసుగారిది. నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరిగింది. ఉత్తర ద్వారం నిర్మాణంకూడా జరిగింది. పవళింపు సేవకు అద్దాలమేడ నిర్మాణంకూడా జరిగింది. సుమారు 50లక్షల రూపాయల వ్యయంతో చుట్టు పక్కల ఏ గ్రామంలో లేనంత గొప్ప దేవాలయం-రామాలయం మా ముత్తారంలో నిర్మించబడింది. వనం కృష్ణరాయలు గారి విగ్రహ ప్రతిష్ట కూడా ఆలయ ఆవరణలో జరిగింది.

భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. భద్రాచలం నుండి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ముత్తారంలో సీతారాముల కల్యాణానికి పంపడం ఆనవాయితీ. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరు కృష్ణాపురం నుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు, జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. అదే కోలాహలం అమ్మపేట వెంకటేశ్వర స్వామి కల్యాణం నాడు కూడా వుంటుంది.

పల్లెటూళ్లల్లో ఆ సందడిని ‘తిరునాళ్లు’ అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. చిన్నపిల్లల ఆటల కూడా వుండేవి. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ముత్తారం, అమ్మపేటలో జరిగే కళ్యాణాలకు మా పక్క గ్రామం వల్లాపురంలో నివసించే మా దాయాదులు, వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది. అందరం కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు. ఇప్పటికీ అక్కడికి వెళ్లినప్పుడల్లా ఆ మధుర స్మృతులు, కోలాహలం పదేపదే గుర్తుకు వస్తుంటాయి.  

శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఈ జనవరి 21, 2012 వ తేదీ, శనివారం నాడు దర్శించారు. ఆ సందర్భంగా చినజీయర్ స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రతిఒక్కరు విగ్రహ రూపంలో వున్న ఆ దేవుళ్లను విశ్వసనీయతతో పూజించాలని సూచించారు. నిత్యం భగవన్నామ స్మరణతో, చింతనాతత్పరతతో, ఆధ్యాత్మిక జీవన సాధకులుగా ముందుకు సాగాలని భక్తులకు ఉపదేశించారు. వైష్ణవ సాంప్రదాయానికి కులమతాలు లేవని ఆయన అన్నారు. అన్నింటిలోనూ వైష్ణవ సంప్రదాయం ఉత్తమమైనదని ఆయన అన్నారు. ఆనాడు భక్త రామదాసు ఎన్నో కష్టాలు పడి భద్రాచలం లాంటి ఆలయాలు నిర్మించారని, వనం కృష్ణరాయలు శ్రీరాముడిని పూజించి ముత్తారం దేవాలయం నిర్మించి, రాముడిని ఇక్కడకు తీసుకొచ్చారని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులందరిదీ అని చినజీయర్ స్వామి అన్నారు.  ఆ కార్యక్రమంలో మా వూరి పెద్దలందరితో పాటు నేనూ పాల్గొన్నాను.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముత్తారం గ్రామంలోని ప్రాచీన కాలంనాటి వామాంక సీతా సమేత శ్రీరామ లక్ష్మణ విగ్రహాలతో కూడిన రామాలయానికి వచ్చి (ఫిబ్రవరి 16, 2016) స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి, సుమారు గంట సేపు అక్కడ గడిపారు. సిఎం గారి వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు వచ్చారు. ఎంతో ప్రాశస్త్యం, పౌరణిక నేపధ్యం వున్న ఈ పురాతన ఆలయాన్ని ఎందరో ప్రముఖులు దర్శించుకున్నారు. భద్రాచలం తరహాలో వున్న ముత్తారం దేవాలయం అపర భద్రాచలం లాగా భవిష్యత్ లో మరింత జనాదరణ పొందేదిగా కాబోతున్నదనవచ్చు. దేవాలయ అభివృద్ధికి సిఎం కేసీఆర్ మంజూరు చేసి విడుదల చేసిన  ఒక కోటి పాతిక లక్షల రూపాయల నిధులతో కంకిపాటి హనుమంతరావు (స్వర్గీయ వనం రంగనాయకమ్మ జ్ఞాపకార్థం) విరాళంగా ఇచ్చిన సుమారు ఎకరం స్థలంలో ఒక కళ్యాణ మంటపాన్ని, పక్కనున్న మరో స్థలంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది.  

అలాగే అమ్మపేట గట్టుమీద వున్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల విరాళాలతో, అర్చక స్వాముల చొరవతో, గతంలో కంటే ఎక్కువ సౌకర్యాలతో అభివృద్ధి చెందింది. గట్టుమీదికి ఎక్కడానికి వెనుకటి మెట్లను ఆధునీకరణ చేయడం జరిగింది. కొత్తగా కళ్యాణ మండపం కట్టారు. గుట్ట చుట్టూ స్వామి వెంట కల్యాణం నాడు ప్రదక్షిణ చేయడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నరోజుల్లో చక్కటి రోడ్డు వేయించారు. మా నాన్న స్వర్గీయ వనం శ్రీనివాసరావు గారు, పెదనాన్న స్వర్గీయ వనం శ్రీరాంరావు గారి రోజులనాటి గతవైభవం గుర్తుకొస్తున్నది.  

No comments:

Post a Comment