Friday, March 2, 2012

నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ సంస్కృతి: వనం జ్వాలా నరసింహారావు


నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ సంస్కృతి
వనం జ్వాలా నరసింహారావు

మేకపాటి రాజమోహన రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను సభాపతి మీరాకుమార్ ఆమోదించడంతో మరో కాంగ్రెస్ ధిక్కార స్వరం పార్టీని అధికారికంగా వీడినట్లయింది. ఆయన మద్దతిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ఏనాడో పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. మరో ఎంపీ సబ్బం హరి కూడా పార్టీని వీడడమో, లేక, పార్టీ ఆయనను దూరం చేసుకోవడమో జరగొచ్చు. పార్టీని వదిలినా, "యుపిఎ" కు తన మద్దతుంటుందని చెప్పకనే చెప్పారు పరోక్షంగా జగన్. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, పార్టీని ధిక్కరించి ఓటు వేసిన వారి వ్యవహారం కూడా తేలిపోయింది. ఆ ధిక్కార స్వరాలన్నింటిపైనా వేటు పడింది. వీరంతా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లే లెక్క! వీరిలా కాంగ్రెస్ పార్టీని వీడడం, కొంత కాలానికి స్వగృహ ప్రవేశం చేయడం, కొత్తేమీ కాదువీరిలో కొందరి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాబోయే ఉప సమరంలో పోటీ చేసినా, మళ్లీ ఎన్నడో ఒకనాడు సొంత గూటికి చేరుకోరన్న నమ్మకం లేదు. మనరాష్ట్రంలోను, ఇతర రాష్ట్రాలలోనూ ఇది మామూలు వ్యవహారమే!

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి భారత జాతీయ కాంగ్రెస్ () కు పోలికే లేదనాలి. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం. ఉదాహరణగా జైపాల్ రెడ్డి  లాంటివారిని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ () లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న మర్రి చెన్నారెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే.

పార్టీ వీడిన జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్ లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? శరద్ పవార్ గురించి ఏమనాలి ? సోనియా గాంధి విదేశీయతను తెర పైకి తెచ్చిన మొదటి వ్యక్తి ఆయన కాదా ? ఇవ్వాళ ఆయన లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో ప్రధాన కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా? కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తే ధిక్కార స్వరాల, అసంతృప్తి జ్వాలల భారత కాంగ్రెస్ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుచేసుకోవచ్చు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో, 1907 లో పార్టీలో చీలి కొచ్చింది. అలా వంద సంవత్సరాల పూర్వమే ధిక్కార స్వరాలకు అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 1920 లో కలకత్తాలో నిర్వహించిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు అధిష్టానాన్ని వ్యతిరేకించినప్పటికీ, మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం ఆది నుంచీ జరుగుతున్నదే.

1948-1950 మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య (నెహ్రూ బలపర్చిన వ్యక్తి), తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ (పటేల్ పక్షం) చేతిలో ఓటమి పాలయ్యారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, రాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాలాచారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్ కు ఆ పీఠం దక్కింది. ఆయన అధ్యక్షుడైన మరుక్షణం నుంచే, రాష్ట్రపతికి, ప్రధానికి వుండే అధికారాల-హక్కుల విషయంలో చర్చ మొదలైంది. ఒకవిధంగా అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. వల్లభాయ్ పటేల్ చనిపోవడంతో, టాండన్ కు చిక్కులు మొదలయ్యాయి. ప్రధానిగా వున్న నెహ్రూ టాండన్ కు వ్యతిరేకంగా తన నిరసన తెలియచేసేందుకు, పార్టీ పదవులన్నిటి కీ రాజీనామా చేశారు. దేశానికి నెహ్రూ వల్ల కలిగే మేలు ఎక్కువని భావించిన టాండన్, స్వచ్చందంగా, అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. వెంటనే సమావేశమైన వర్కింగ్ కమిటీ, నెహ్రూను ఆయన స్థానంలో ఎన్నుకోవడంతో, పార్టీ పదవి-ప్రధాని పదవి ఒకే వ్యక్తి చేపట్టారు. నెహ్రూ మద్దతున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారని అంటారు. 1952 ఎన్నికలొచ్చాయి. రాజగోపాలా చారి మద్రాస్ ముఖ్య మంత్రయ్యారు. విద్యాధికుడైన దామోదరం సంజీవయ్యను, నెహ్రూ సలహామీద, మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజాజీ. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతులు రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు.

1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక మంత్రిగా సర్దుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చేసినాయన, తన మంత్రివర్గంలో ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తి కింద ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు, పివిజి రాజు ప్రభృతులు ఏకమై సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీగా అవతరించి, నీలంకు వ్యతిరేకంగా పనిచేశారు.

నీలం సంజీవరెడ్డిని జాతీయ రాజకీయాల్లోకి లాగడంతో, 1960 లో, రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. అప్పట్లో ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. అంతకుముందే అనధికారికంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీని, 1962 ఎన్నికల్లో, కాంగ్రెస్ లో విలీనం చేశారు మర్రి చెన్నారెడ్డి ప్రభృతులు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు. 1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి, అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి, బాహాటంగానే నాయకత్వం వహించారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది.

పీవీ మంత్రివర్గంలో పనిచేసిన జలగం వెంగళరావు, ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ ధిక్కార ధోరణి ప్రదర్శించిన వాడే. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. పీవీ స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో ఎమర్జెన్సీ హోం మినిస్టర్గా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ్ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో (తన స్వంత జిల్లా) కనీసం గెస్ట్ హౌజ్ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్, 1989 లో గెలిచింది. కష్టం మీద చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కాగలిగారు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి.

నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. కాకపోతే ఆ తర్వాత సర్దుకు పోయేవారు. మూడు సార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోతీలాల్ నెహ్రూ అధిష్ఠానాన్ని ధిక్కరించి స్వరాజిస్ట్ పార్టీలో చేరారు. స్వతంత్రం రాక పూర్వం మూడు పర్యాయాలు, వచ్చిన తర్వాత రెండు సార్లు అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు టాండన్ ను రాజీనామా చేయించేందుకు ధిక్కార ధోరణితో వ్యవహరించారు. సుభాష్ చంద్ర బోసును దింపే ప్రయత్నంలో గాంధీజీ అంతటి వాడే రాగ ద్వేషాలకు లోనయ్యారు. స్వతంత్రం వచ్చిన సమయంలో ఆచార్య కృపలానీ అధ్యక్షుడిగా వున్నారు. 1961-69 మధ్య కాలంలో నీలం సంజీవరెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్పల పర్వం కొనసాగింది. 1969 లో ఇందిరా గాంధీ శకం మొదలై, పార్టీ చీలిపోయి, జగ్జీవన్ రాం అధ్యక్షుడయ్యారు. అధిష్ఠానాన్ని సిండికేట్పేరుతో ధిక్కరించిన ఇందిర పార్టీనే చీల్చారు. కొన్నాళ్లు ఇతరులకు అవకాశమిచ్చిన ఇందిరా గాంధీ 1983 నుంచి 1985 వరకు స్వయంగా తానే అధ్యక్ష పీఠాన్ని అధిష్టించింది. 1985 లో కొడుకు రాజీవ్ గాంధీకి అధ్యక్ష వారసత్వం లభించింది. ఇక అప్పటినుంచి హత్యకు గురయ్యేవరకు ఆయనే అధ్యక్షుడు. పీవీ, కేసరిల తర్వాత ఆ పీఠాన్ని 1998 లో అధిష్టించిన సోనియా గాంధీ, గత 14 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా, ఒంటి చేతితోఅధిష్ఠానం అంటే తానే అన్న రీతిలో వ్యవహరిస్తోంది. పార్టీలో ఏకాభిప్రాయంఅంటే, సోనియా గాంధి అనే ఏక వ్యక్తి అభిప్రాయంగా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం విభజించి పెత్తనం సాగించడంఅనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే.

ఈ నేపధ్యంలో, ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్తున్న కాంగ్రెస్ వారి వలసలు, మరో వైపు "తెరాస" ఆకర్షణ, రాబోయే సాధారణ ఎన్నికలలో ఓటమి పాలవుతామన్న కాంగ్రెస్ వారి భయం, రాష్ట్రంలో పార్టీని ఏ దిశగా తీసుకుపోనున్నదో అనే విషయంలో వేచి చూడాల్సిందే! నేడు పార్టీని వీడుతున్న వారిలో-లేదా-పంపబడుతున్న వారిలో అందరూ కాకపోయినా కొందరైనా సొంత గూటికి రాక మానరు. కథ మళ్లీ మామూలే!End 

No comments:

Post a Comment