Saturday, December 15, 2012

బ్రాహ్మణులంటే ఎవరు?: వనం జ్వాలా నరసింహారావు


బ్రాహ్మణులంటే ఎవరు?

వనం జ్వాలా నరసింహారావు

నువ్వెవరివి? అని అడుగుతే తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని స్థితిలో వున్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. తమ గురించి తాము చెప్పుకోలేని పరిస్థితి బ్రాహ్మణులకు కలిగింది. ఈ నేపధ్యంలో పాత్రికేయులు డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావు రాసిన "సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర" బ్రాహ్మణేతర విమర్శకులకు అసలు-సిసలైన సమాధానం అనాలి. ఇది చదివిన వారు-ముఖ్యంగా బ్రాహ్మణ విమర్శకులు, "ఓహో...బ్రాహ్మణులంటే ఇంత గొప్ప వారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన చేయవచ్చా?" అన్న ఆలోచన చేయక మానరు.
          
సామూహిక జన జీవన వ్యవస్థే సమాజం అంటూ ప్రారంభించి, అనేకానేక విషయాలను, సంక్షిప్తంగా అంటూనే, వివరంగా తెలియచేసే ప్రయత్నంలో పాలకోడేటి సఫలమయ్యారనడంలో సందేహం లేదు. వివరాలలోకి పోతే.... ప్రపంచంలో ఎన్ని మతాలున్నా హైందవ మతానికి, లేదా, వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే కాలంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. మరో వాదన ప్రకారం, ఆర్యులు ఆంధ్ర దేశం రాక ముందు, చాతుర్వర్ణ పద్ధతి లేదు. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే ఐనా, కొంత వ్యత్యాసం వుంది. లోతుగా పోతే, బ్రాహ్మణులని పిలిపించుకోవాలంటే, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం తప్పని సరి. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, చాతుర్వర్ణాలుండవచ్చు కదా! ఇలాంటి వ్యవస్థ ప్రాచీన కాలం నాటి ఈజిప్ట్, బాబిలోనియాలతో సహా, చైనా దేశంలోనూ వుండేదట. అక్కడి వాడుక ప్రకారం వారిని పూజారులుగా, పాలకులుగా, వృత్తి దారులుగా, బానిసలుగా విభజించారు. అలానే ప్రాచీన ఇరాన్‌లో "పిస్త్రీ" అనే నాలుగు వర్ణాలుండేవి.
          
ఇక "కులం" అంటే ఏమిటో చూద్దాం. ఒక అర్థం ప్రకారం కులమంటే "నివాసం". వర్ణాలు వేరు, జాతులు వేరు. వర్ణం అనే మాట "వర్గం" ను సూచిస్తే, జాతి అనేది "కులం" ను సూచిస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే "క్లాస్", "కాస్ట్" అన్న మాట. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, ఒక విషయం మాత్రం వాస్తవం. అది ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ పడాల్సిన అవసరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు. బ్రాహ్మణుల విషయానికొస్తే, వారు సమాజంలో దైవ చింతనను పెంచాలని, సమాజ హితం కోరే "పురోహితులు” గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను చాలా కాలంపాటు, బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. కాలానుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బ్రాహ్మణులు కూడా మార్పులకు లోనుకాక తప్పలేదు. ఒకటి మాత్రం వాస్తవం. బ్రాహ్మణులు కులవ్యవస్థకు కారకులు కాదు. వారు కుల వ్యవస్థను పెంచి పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ.
          
"బ్రాహ్మణులు" అనే మాట "బ్రహ్మన్" అనే పదం నుంచి వచ్చింది. బ్రహ్మన్ అంటే "యజ్ఞం’ అనే అర్థం కూడా వుంది. అంటే యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే "బ్రహ్మ" అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు. అంటే వేదాధ్యయనం చేసిన వాడు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. ఒకానొక రోజుల్లో బ్రాహ్మణులకు బ్రహ్మ-క్షత్రియ గుణాలుండేవి. కాని, ఆ తరువాత, వారు తమ క్షత్రియ గుణాలను పూర్తిగా వదిలి, పాలన, మంత్రాంగం, పురహితాల వైపు దృష్టి మరల్చారు. బ్రాహ్మణులకు అనాది నుంచీ, సమాజంలోని ఇతరుల నుంచి ఎంతో గౌరవ ప్రపత్తులు లభించేవి. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు పనిచేసే "పంచ ప్రధానుల" లో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణులుండేవారు. అదే నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఐంది. సుమతి శతకం ప్రకారం, ఒక ప్రదేశం గ్రామం అనిపించుకోవాలంటే, దానికి వుండాల్సిన ప్రాధమిక లక్ష్యాలలో వూళ్లో బ్రాహ్మణుడు వుండడం కూడా ఒకటి. సమాజాన్ని మార్క్సిస్టు కోణంలో నిశితంగా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రంధంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా గొప్ప యోగ్యతా పత్రం ఇచ్చారు. ఆర్య, ఆదిమ వాసుల పునఃకలయికవల్ల ఏర్పడిన కులంగా బ్రాహ్మణులను అభివర్ణించి, ప్రాచీన పవిత్ర గ్రంథాలలో లభ్యమైన వాటిని భద్ర పరిచింది వారేనని, దాని విలువ అపారమని పేర్కొన్నారు. 
          
బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని "మాత్రులు" అని; వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని "బ్రాహ్మణులు" అని; బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని "శ్రోత్రియులు" అని; నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులను "అనూచానులు" అని; ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్న వారిని "భ్రూణులు" అని; ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని "ఋషికల్పులు" అని; రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని "ఋషులు" అని; సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని "మునులు" అని అంటారు.
          
అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచ గౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే బ్రాహ్మణులు, భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో "బహున్" లుగా, మయన్మార్‍లో "పొన్న" లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త  బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది వరకూ వున్నాయి. వారిని, తెలగాణ్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణ కమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ పది తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగం వారిని నియోగులంటారు.
          
వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమైన కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని "వైదికులు" అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ వుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన ఈ బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మారిపోయాయి.
          
వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు "నియోగులు". వారిలో, ఆరు వేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి నియోగులని రకరకాల ఉప శాఖల వారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే వినియోగించబడిన వారని. నియోగులు సంప్రదాయ బ్రాహ్మణులు కారనే వాదన కూడా వుంది. కొందరి దృష్టిలో సంప్రదాయ బ్రాహ్మణులంటే వైదిక కార్యాలు చేసే వైదికులు మాత్రమేనని. పౌరోహిత్యం వృత్తిగా కాకుండా, లౌకిక ఉద్యోగాల మీద ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరు వేల నియోగులది పెద్ద ఉప శాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో అనే విషయం ఇదమిద్ధంగా తేలలేదు. శతాబ్దాల క్రితం ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజులు పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాధమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల పరిపాలనా కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించి నందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న పేరొచ్చిందంటారు. అంతవరకూ యుద్ధాలలో కూడా పాల్గొన్న బ్రాహ్మణులు పాలనా రంగంలోకి వచ్చారు. మరో కథనం ప్రకారం, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి వుండవచ్చు.     వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంత వరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో వున్నాయి. వేటిలో ఏది నిజమో, ఏవి కావో మరింత పరిశోధనలు చేయాల్సి వుంటుంది.

వైదికులైనా, నియోగులైనా, తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?

4 comments:

  1. "అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ పడాల్సిన అవసరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు"
    ఈ ఒక్క మాట మన పెద్దలు అనుకుని ఉంటే మనకు ఈ తిప్పలు తప్పేవి.
    "పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు"
    ఏదైనా "ఆది శంకారా చార్య" గారి వాఖ్యలు కరెక్ట్.

    ReplyDelete
  2. ఒకప్పుడు రాజ్యంలో ఉద్యోగులందరూ సమ్మె చేసారట. రాజుగారు ఒకడిని పంపించి రాజ్యంలో ఖాళీ గ ఎవరు ఉన్నారో చూసి రమ్మన్నారట. వాడు చూసి వచ్చి బ్రాహ్మణులు ఖాళీగా ఉన్నారని చెప్పాడు. అందులో ఆరువేల కుటుంబాలని ఉద్యోగులుగా నియోగించారట . అల నియోగించిన వల్లే నియోగులు అని విన్నాను.

    ReplyDelete
    Replies
    1. పనీ పాట తో బుర్ర కూడా లేని వాళ్ళను చూడమన్నాఋట నువ్వు గాని ఉన్నావా ఆ లిస్ట్లో

      Delete
  3. nijamga dayaneeyam. charitra punaraavrutam autundi. ee paristidi taatkalikam maatrame. brahmana dvesham unnamaati satyam. kaani digulu avasaram ledu.
    mee antarangam chakkaga avishkarinchaaru.
    santosham.
    vijaya raghavacharyulu

    ReplyDelete