Thursday, October 6, 2016

హనుమదే అసలు సిసలైన సర్జికల్ దాడి : వనం జ్వాలా నరసింహారావు

హనుమదే అసలు సిసలైన సర్జికల్ దాడి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర భూమి దిన పత్రిక (07-10-2016)

సర్జికల్ దాడి....ఏ నోట విన్నా ఆమాటే...దీనర్థం ఇప్పుడందరికీ తెలిసిపోయింది. బహుశా కొద్దిమందికైనా తెలియందల్లా, వాల్మీకి మహర్షి తన రచనా చాతుర్యంతో, ఈ దాడి మూలాలను సుందరకాండలో వర్ణించిన వైనం. రామాయణ కాలం నాటి ఆ దాడిలో ఆర్మీ జనరల్, సైనికుడు, వ్యూహకర్త అంతా ఒకే ఒక్కడు. రావణ శత్రు సైన్యంలో మూడొంతులమందిని ఆ ఒక్కడే తుదముట్టించాడు. శత్రురాజు బలాబల సంపద తెలుసుకోవాలని తనంతత తానుగా పట్టుబడ్డాడు. ఉపాయంగా బయటపడి, శత్రు బలాల రహస్యాలను తన నాయకుడికి తెలియచేసి భవిష్యత్ యుద్ధానికి అంతా సమాయత్తం చేశాడు. అతడే సుందరకాండ కథానాయకుడు హనుమంతుడు. వివరాల్లోకి పోతే....

వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని, అర్థ ప్రతిపాదిత మంత్రపూతం. గాయత్రీ బీజ సంయుతం. రామాయణంలో అందమైన కాండ "సుందర కాండ". నిజానికది "హనుమత్కాండ". ఆద్యంతాలు హనుమంతుడు ఆచార్యుడుగా, వ్యూహకర్తగా, కార్యాచరణ కర్తగా దర్శనమిచ్చే అద్భుత కాంద సుందర కాండ. ఈ కాండ వృత్తాంతమంతా రోజున్నరలోనే గడచింది. వాల్మీకి కోకిల ఆలపించిన ఆనందమయ కావ్యగానమే సుందర కాండ. ఇందులో హనుమంతుడు మహాయోగి...మహా జ్ఞాని....విశిష్ట వశిష్ఠుడు....మహాచార్యుడు. ఇక ప్రధానంగా కథ విషయానికొస్తే....హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, లంకకు చేరడం, సీతాదేవి కోసం వెతకడం, ఆమెను చూడడం, రామలక్ష్మణుల సమాచారం చెప్పడం, లంకా ధ్వంసం-దహనం, మరలి పోవడం, రాముడికి సీతమ్మ సందేసాన్ని ఇవ్వడం...ఇంతే. దీనికొక పెద్ద పుస్తకం అక్కర్లేదు. ఐనా అక్కరకొచ్చింది. అందులో భాగమే హనుమ సర్జికల్ దాడులు. స్థూలంగా చెప్పాలంటే....సీతాదేవితో కలయిక తరువాత, ఆమె దగ్గర శెలవు తీసుకుని, శత్రువుల బలాబలాలు తెల్సుకోవాలనుకున్న హనుమంతుడు, వెంటనే తిరిగి పోకుండా, మెరుపుదాడిలా ముందు అశోకవనాన్ని పాడు చేస్తాడు. దొంగతనంగా రామలక్ష్మణులు లేని సమయం చూసి (పాకిస్తాన్ యూరీ తరహా చర్య) , సీతాపహరణం చేసిన రావణుడి చర్యకు ఇది తొలి ప్రతీకార చర్యగా భావించాలి. సహజంగానే రావణుడికి కోపం వచ్చే విధంగా హనుమంతుడు కయ్యానికి కాలు దువ్వాడు. ఆయనకు కోపం వచ్చి పంపిన కింకరులను మట్టుపెట్టాడు. చైత్య పాలకులను చంపాడు. జంబుమాలి వధ, మంత్రి పుత్రుల చావు, సేనానాయకుల మృతి, అక్షకుమారుడి వధ, కావాలనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం, రావణుడి దగ్గరకు తీసుకుని పోగా అతడికి బుద్ధి చెప్పడం, దండనకు గురికావడం, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లంకా దహనం చేయడం, మరలి పోవడం క్లుప్తంగా సుందర కాండలో కథ.

మరింత లోతుగా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనేక అంశాలు అవగతమౌతాయి. సీతాదేవి దగ్గర శెలవు తీసుకున్న తరువాత "కార్య శేషం" ఆలోచించాడు హనుమంతుడు. కేవలం సీతాదేవి ఉనికి గురించి రాముడుకి వివరించడంతో తన పని పూర్తి కాదని భావించాడు. చేయాల్సిన పని మరికొంచెం వుందనిపించిందాయనకు. సుగ్రీవుడు సీతను వెతకమనీ, లంకను చూడమనీ, హనుమకు రెండు పనులు అప్పగించాడు. ఒకటైపోయింది. మరోటి మిగిలింది. లంకను చూడడమంటే మిద్దెలు-మేడలు చూడడం కాదు. రాక్షసుల బలాబలాలు బేరీజు వేయడం. అతడి మాటల్లోనే రావణుడి అభిప్రాయం తెల్సుకోవడం కూడా మిగిలిపోయింది. ఇవన్నీ జరగాలంటే, సామ-దాన-బేదోపాయాలు (పాకిస్తాన్ విషయంలో లాగ) పనికి రావు. దండోపాయమొక్కటే సరైన మార్గమని నిర్ణయించాడు. తమోగుణం ఎక్కువున్న రాక్షసులు (పాకిస్తానీయుల లాగా) మంచి మాటలకు, ధర్మ వాక్యాలకు లోబడేవారు కాదు. దైవ బలం, దేహ బలం, ధర్మ బలం వున్న తనకు యుద్ధమే శరణ్యమనుకుంటాడు హనుమంతుడు. దాని వల్ల వాళ్లెంత బలవంతులో తెల్సిపోతుందనుకున్నాడు. మరో మేలు కూడా జరుగుతుందని భావించాడు. రామ లక్ష్మణులు సహాయం లేనివారు, ఏమీ చేయలేని వారు (పాకిస్తాన్ భారత్ ను భావించినట్లే) అనే దురభిప్రాయంతో వున్న రాక్షసుల అపోహ తొలగిపోవాలంటే, యుద్ధం చేసి కొందరినైనా చంపాలని అనుకుంటాడు. ఇలా జరుగుతే, మిగిలిన వారు ద్వేషం వదలి మెత్తబడడమో, వారిలో వారికి విభేదాలు రావడమో జరుగుతుందని భావించాడు.


ఎంత చిన్న పనైనా చక్కగా చేయడానికి పూనుకుంటే, అది నెరవేరడానికి ఎన్ని ఉపాయాలు అవసరమో అవన్నీ వెతకాలి. రామకార్యం కూడా పలువిధాలుగా చేయడమే మంచిదని భావించాడు హనుమ. బలంలో తనకూ, రాక్షసులకూ వున్న భేదాన్ని తెలుసుకుని, రాముడి దగ్గరకు పోతే, భవిష్యత్ లో జరగబోయే యుద్ధానికి అది పునాది అవుతుందనుకుంటాడు. రాక్షస రాజు రావణుడు తనంత బలవంతుడు లేడన్న మదంతొ వున్నాడు....అ మదమణిగితేనే కాని వాడు లొంగడు అనుకుంటాడు. కొందరు రాక్శసులను యుద్ధానికి ఈడ్చి సులభంగా చావకొడ్తే, రావణుడే యుద్ధానికి రాక తప్పదు. అప్పుడు వాడి బలం కూడా తేల్చుకోవచ్చనుకుంటాడు. కాబట్టి ఏదో విధంగా రావణుడిని, వాడి మంత్రులను, సైన్యాన్ని, యుద్ధానికి ఈడ్వడానికి మార్గం ఆలోచించాడు. కన్నుల పండుగగా, మనస్సుకు ఇంపుగా, ఇంద్రుడి నందనవనంలా వున్న అశోక ఉద్యానవనాన్ని "టార్గెట్" చేద్దామనుకున్నాడు. సొగసుగా వున్న, రావణుడికిష్టమైన దీన్ని ధ్వంసం చేస్తే, రావణుడికి కోపం తప్పక వస్తుందనుకున్నాడు. ఆ కోపంతో తన సైన్యాన్ని తనమీదకు పంపుతాడని, వాళ్లను సంహరించి సంతోషంతో కిష్కిందకు మరలిపోదామని నిర్ణయించుకుంటాడు.

హనుమంతుడు అశోకవనాన్ని పాడు చేసిన వైనాన్ని, ఆ తరువాత రావణిడి యోధానయోధులను సంహరించిన వైనాన్ని, వాల్మీకి సంస్కృత సుందర కాండలో, ఆంధ్ర వాల్మీకి వాసు దాసు తెలుగు సుందర కాండ మందరంలో, అద్భుతంగా వర్ణించారిలా: "విజృంభించిన హనుమంతుడు మహా వాయువులాంటి తన తొడల వేగంతో, అశోకవనం లోని చెట్లన్నీ కూకటి వేళ్లతో సహా పీకి నేల మీద పడేయడం ఆరంభించాడు. నానా రకాల చెట్ల తీగలతో, మదించిన పక్షుల ధ్వనులతో నిండిన ప్రమదావనాన్ని పాడు చేశాడు. క్రీడా పర్వతాలను నేలమట్టం చేశాడు. క్రీడా సరస్సులను విరగ గొట్టాడు. తెగిన తీగలతో, విరిగిన చెట్లతో, పాడైన సరస్సులతో, ఆ వనం కార్చిచ్చు తగిలి కాలిపోయినట్లుంది. తీగలు అల్లుకునేందుకు ఆధారంగా వుండి, భూమిలోదాకా పాతుకు పోయి తల్లి వేళ్లున్న చెట్లు కూడా పడిపోవడంతో, వాటి కొనలందున్న తీగలు దిక్కులేనివారిలా, భయంతో వణకుతూ కనిపించాయి. చెట్లు పడడంతో వాటి సందుల్లో వున్న పాములు కూడా నలిగి చచ్చాయి. చెట్టు తొర్రలు నేల కూలాయి. పొదరిండ్లు పాడైపోయాయి. రాతి ఇళ్లు నేలపై తూలి పడ్డాయి. ఇదంతా చూడడానికి ఘోరంగా కనిపించింది. రావణాసురుడి భార్యలకు ప్రమదావనమైన ఈ ఉద్యానవనాన్ని మూలమట్టంగా నాశనం చేసి, సంతోషంతో కయ్యానికి కాలుదువ్వి, యుద్ధానికి ఎదురుచూస్తూ, ఆ వనం తలవాకిటి మీదెక్కి కూర్చున్నాడు హనుమంతుడు".

హనుమంతుడి "టార్గెట్" కేవలం అశోకవనమే తప్ప దాని పరిసర ప్రాంతాలు కాదప్పటికి. ఈ విషయన్నే రావణుడికి తెలియచేశారు రాక్షస స్త్రీలు. రౌద్రాకారంతో విజృంభించిన ఒక "కోతి" ప్రమదావనాన్నంతా నిర్మూలించిందనీ, సీతాదేవి వున్న ప్రదేశాన్ని మాత్రం తాకలేదనీ పిర్యాదు చేశారు వాళ్లు. సీతాదేవికి రక్షణగా వుండాలనే వుద్దేశంతోనే చెట్లన్నీ తుంచినా, ఆమె వున్న అశోక వృక్షాన్ని మాత్రం ఏమీ చేయలేదనీ, సీతా సౌఖ్యం కొరకే దాన్ని పాడు చేయలేదనీ చెప్పారు వాళ్లు. రావణుడి స్పందనను, ఆ తరువాత జరిగిన యుద్ధాన్ని చాలా గొప్పగా వర్ణించారు సుందర కాండలో. కోపంతో ఊగిపోయాడు రావణాసురుడు. గిరగిరా తిరిగే గుడ్లున్న ఆయన కళ్ల నుండి బొటబొటా రాలిన నీళ్లు, దీపం నుండి మండుతూ, మీద పడే చమురు బొట్లలా కనిపించాయి. మహాగర్వంతో కన్ను-మిన్ను కానని, తనతో సమానమైన కింకరులనే వాళ్లను వెంటనే వెళ్లి, ఆ కోతిని పట్టుకు రమ్మని పంపుతాడు. రకరకాల ఆయుధాలు ధరించిన ఎనభై వేల మంది కింకరులు ఒక్క మూకగా హనుమంతుడి మీదకు యుద్ధానికి వచ్చారు. దేహాన్ని పెంచిన హనుమంతుడు లంకంతా ప్రతిధ్వనించే విధంగా సింహనాదం చేసి వారి మీదకు దాడికి దిగాడు. వారందరినీ చంపాడు. వారి చావు వార్త విన్న రావణుడు అజేయ బలమున్న ప్రహస్తుడి కొడుకు జంబుమాలిని హనుమంతుడి పైకి యుద్ధానికి పంపాడు.

ఈ లోపు జయ గర్వంతో వున్న హనుమంతుడు, సమీపంలోనే వున్న లంకాధి దేవత గుడి శిఖరాన్నెక్కి దానిని ధ్వంసం చేసే పనిలో వుండిపోతాడు. ఆయన సింహనాదాన్ని విన్న గుడి కాపలాదారులు (చైత్య పాలకులు) హనుమంతుడి మీదికి దూకారు. గుడి ధ్వజ స్థంబాన్ని పీకి దాంతో గుడిని ధ్వంసం చేసి, రాక్షసులందరికీ చంపాడు. అక్కడే ఒక హెచ్చరిక చేస్తాడు. అదీ యుద్ధ తంత్రంలో భాగమే! "ఓ లంకా వాసులారా! వినండి. నా లాంటి (అంతే బలం కల) వేల-లక్షల-కోట్ల వానరులు మీ మీదికి యుద్ధానికి రాబోతున్నారు. వీళ్లందరికీ అమేయ బలుడు సుగ్రీవుడు సైన్యాధిపతిగా వుంటాడు. సీతను రావణాసురుడు ఎత్తుకు వచ్చి ఇక్కడ బంధించి, నిష్కారణంగా శ్రీరాముడితో విరోధం తెచ్చుకున్నాడు. వాడితో పాటు మీరందరూ విరోధం తెచ్చుకున్నారు. రావణుడికీ, మీకూ, లంకకూ ఇక రుణానుబంధం తీరినట్లే!" అని అందరూ వినేట్లు చెప్తాడు. దీంతో ఇంతవరకూ సీతను లంకలో వుంచిన వార్త అంతఃపురానికి వచ్చే వారికి తప్ప తెలియని ఇతరులకు కూడా తెలిసి రహస్యం బయట పడింది.

ఇక ఆ తరువాత వెంట వెంట రావణుడు పంపిన జంబుమాలిని, మంత్రి (ఏడుగురు) పుత్రులందరినీ, విరూపాక్షుడు, దుర్ధరుడు, యూపాక్షుడు, బాసకర్ణుడు, ప్రఘసుడు అనే ఐదుగురు సేనానాయకులను, రావణుడి కొడుకు అక్షకుమారుడినీ యుద్దంలో చంపుతాడు. హతాశుడైన రావణుడు, తన మరో కొడుకు ఇంద్రజిత్తును హనుమంతుడిపైకి యుద్ధానికి పొమ్మంటాడు. న్యాయ మార్గంలో, అస్త్రాలతో హనుమంతుడిని చంపడం సాధ్యపడకపోతే, మాయ చేసైనా చంపమని అతడికి చెప్పాడు. యుద్ధానికి పొయీన ఇంద్రజిత్, ఎంతకూ హనుమంతుడిని గెలవలేక పోవడంతో, అరుదుగా వాడాల్సిన బ్రహ్మాస్త్రం ప్రయోగించి బంధించాడు. కించిత్తు దైవ శాపం వుండడం వల్ల తాత్కాలికంగా బంధించబడిన హనుమ, ఆ అవకాశాన్ని రావణుడి దగ్గరకు పోవడానికి ఉపయోగించుకుంటాడు. రావణుడి కొలువులో వాడికి బుద్ధి చెప్పి, అతడి కోపానికి గురవుతాడు. దూతను చంపడం భావ్యం కాదన్న విభీషణుడి సలహా మేరకు హనుమ తోక కాల్చమని ఆజ్ఞాపించాడు రావణుడు. కాల్చిన తోకతోనే రాక్షసులు హనుమను లంకంతా తిప్పారు. ఆ విధంగా లంకా నగర రహస్యమంతా హనుమకు తెలిసిపోయింది.


          తరువాత తన కట్లన్నీ వూడ తీసుకుని, లంకా దహనం చేస్తాడు. రాక్షస నాయకుల ఇళ్లన్నింటికీ నిప్పు పెట్తాడు. అలా....అశోక వనాన్ని పాడు చేసి, రాక్షసులను చంపి, మేడలు-మిద్దెలు నేలమట్టం చేసి, లంకా దహనం చేసి, సీతాదేవిని మరో మారు దర్శించుకుని, సముద్రాన్ని లంఘించి, మరలి వచ్చి రాముడికి సీతా వృత్తాంతం చెప్తాడు. హనుమదే అసలు సిసలైన సర్జికల్ దాడి! End

2 comments:

  1. "ఓ లంకా వాసులారా! వినండి. నా లాంటి (అంతే బలం కల) వేల-లక్షల-కోట్ల వానరులు మీ మీదికి యుద్ధానికి రాబోతున్నారు. వీళ్లందరికీ అమేయ బలుడు సుగ్రీవుడు సైన్యాధిపతిగా వుంటాడు. సీతను రావణాసురుడు ఎత్తుకు వచ్చి ఇక్కడ బంధించి, నిష్కారణంగా శ్రీరాముడితో విరోధం తెచ్చుకున్నాడు. వాడితో పాటు మీరందరూ విరోధం తెచ్చుకున్నారు. రావణుడికీ, మీకూ, లంకకూ ఇక రుణానుబంధం తీరినట్లే!" అని అందరూ వినేట్లు చెప్తాడు.

    haribabu:ఇదే అసలైన యోధ లక్షణం!దీంతోనే రావణుడి పతనం మొదలైంది.ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఎంతటి వాదైనా మట్టి కావల్సిందే.అంతకుముందు దేవతల్ని కూడా గెల్చిన రావణుదు ఈ యుద్ధంలో రాముడి చేతిలో మట్టి కరవటానికి లంకానగరప్రజల ఆగ్రహం కూడా తోడైంది - రాజనీతి తెలిసిన రచయిత మాత్రమే ఈ సంవిధానాన్ని స్ర్ష్తించగలడు.

    ReplyDelete