Monday, October 31, 2016

బ్రాహ్మణ సంక్షేమం….ఈశ్వరుడికి సంతోషం : వనం జ్వాలా నరసింహారావు

బ్రాహ్మణ సంక్షేమం….ఈశ్వరుడికి సంతోషం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (01-11-2016)

"ఋషుల నుంచి అందిపుచ్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారి వంశస్తులే-’బ్రాహ్మణులు’. పరాయి పాలనలో అవి దెబ్బతినకుండా సంరక్షికుంటూ వస్తున్నారీ బ్రాహ్మణులు. ’పురోహితులు’గా సమాజానికి మార్గదర్శకులుగా వుంటూ వస్తున్నారు. యజ్ఞం అంటేనే త్యాగం. యజ్ఞానికి త్యాగమే మూలం. బ్రాహ్మణుడి జీవన విధానమే త్యాగంతో కూడుకున్న మహాయజ్ఞం" - సంపాదకుడు

సమాజానికి సంబంధించిన సేవే బ్రాహ్మణులు చేస్తున్నారని, అయినా ఆ కులస్తుల్లో కొందరి పరిస్తితి దీనంగా వుందని, మంగళహారతి పళ్లెంలో భక్తులు వేసే డబ్బులకోసం అర్చకులు ఎదురు చూసే దుర్భర పరిస్థితులను అధిగమించాలని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలను విశ్లేషించాల్సిన తరుణమిది. ప్రభుత్వం, మేధావులు కలిసి బ్రాహ్మణుల సంక్షేమానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా సీఎం కేసీఆర్ సూచించారు. ఇందులో భాగంగానే మొదలు అన్ని హంగులతో కూడిన ఒక రాష్ట్ర స్థాయి సదనాన్ని హైదరాబాద్ లో నిర్మించుకుందాం అని అంటూ, దాని నిర్వహణ బాధ్యత కోసం ఒక ధర్మకర్తల మండలి ఏర్పాటు చేద్దామనిఆ కేంద్రంలో బ్రాహ్మణ సాంప్రదాయ పరమైన కార్యక్రమాలు జరుపుకునేందుకు ఏర్పాటు చేసుకుందామని సీఎం అన్నారు. బ్రాహ్మణ సంక్షేమం దిశగా సీఎం సూచన మేరకు పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇంతకూ బ్రాహ్మణులు చేసుకుంటూ వస్తున్నారన్న సమాజ సేవ ఏమై వుంటుందని విశ్లేషించి చూస్తే....అది వ్యక్తిగత, మతపరమైన, దోష నివారణ సంబంధమైన సేవేననీ, రకరకాల కర్మకాండలందులో వున్నాయనీ, శుభాశుభ కార్యాలందులో భాగమేననీ అర్థం చేసుకోవాలి. అలానే సామాజిక, సాంస్కృతిక ప్రవచనాలిస్తూ, తద్వారా వాజ్ఞయ విస్తరణ, ధర్మ ప్రబోధన చేస్తున్నారు. అలానే ముక్తి ప్రదాయినైన పరావిద్యను, జ్ఞాన సముపార్జనకు అవసరమైన అపరావిద్యను వ్యాప్తిచేసేందుకు కృషి చేస్తున్నారు. ఇదంతా స్వయంగా స్వాధ్యాయనం చేస్తూ, ఆ విధంగా సమాజ సేవకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

సృష్టి ఆదినుండీ బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతి ఎలా రూపాంతరం చెందిందీ అనే విషయంలో కొందరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పడం కూదా జరిగింది.

సృష్టికీ, బ్రాహ్మణులకూ అనిర్వచనీయమైన అనుబంధం వుంది. "ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!" అనేది ఋగ్వేదంలోని సంస్కృత శ్లోక సారాంశం. అయోధ్య తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ అగర్వాల్ చెప్పినట్లు "సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. అన్నీ తెలిసిన పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు-ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?"

            సుందరకాండలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన వుంది. సృష్టించే వాడు బ్రహ్మ అని, సంహరించే వాడు రుద్రుడు అనీ అనుకుంటారు. అయితే అనంతకోటి బ్రహ్మాండానికి "పరబ్రహ్మం" ఒక్కరే! అతడికి (లేదా అమెకు) సమానులైన వారు-అధికులైన వారు ఎవరూ లేరు. గడ్డిపోచ కదలాలన్నా ఆయనే కారణం. ఆ పరబ్రహ్మమే సృష్టికొక అధికారినీ, సంహరించడానికి మరొకరినీ, నియమించారు. "బ్రహ్మ, రుద్రులు" నిమిత్త మాత్రులు. భగవంతుడైన "విష్ణుమూర్తి" రజో గుణం విశేషంగా వుండే జీవులందు ప్రవేశించి వారితో సృష్టి కార్యాన్ని, తమో గుణం వున్నవారిలో ప్రవేశించి సంహార కార్యాన్ని, సత్వ గుణం వున్న వారిలో ప్రవేశించి రక్షించే పనినీ చేయిస్తారు. అందుకే సమస్త ప్రయోజనకర్త ఆ "భగవంతుడే".

            ఆదివారం, అక్టోబర్ 26 , హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన బ్రాహ్మణ సంక్షేమ సమావేశంలో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ కమీషనర్ కేఆర్ నందన్ గారి మాటల్లోని సారాంశంతో పైన పేర్కొన్న అంశాలను జోడించి, అన్వయించి, విశ్లేషిస్తే బ్రాహ్మణుల ఆవిర్భావం, అవసరం, రూపాంతరం, తదనంతర స్థితిగతులు కొంతవరకు అర్థం చేసుకోవచ్చునేమో.

ప్రపంచ వ్యాప్తంగా వందల-వేల సంవత్సరాల చరిత్ర, ఒక దేశంపై మరొక దేశం దాడులు, దాడి తరువాత ఆ దేశాన్ని ఆక్రమించుకుని అంతకు పూర్వం నెలకొన్న నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాల విధ్వంసం లాంటి విషయాలను విశ్లేషించి చూస్తే కొన్ని విషయాలు అవగతమౌతాయి. ఉదాహరణకు ఒకానొకప్పుడు ముస్లిమేతర దేశాలైన ఇరాన్-పర్షియా, టర్కీ, ఈజిప్ట్ లను ఆక్రమించుకున్న ఇస్లాం దేశాలు అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మం కు విరుద్ధంగా వాటిని మార్చడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఉదాహరణకు, అగ్నిహోత్రం చేసుకుంటూ బ్రతికే భారతీయులున్న ఇరాన్ ను మార్చేశారు. ఐదారు వేల ఏల్ల చరిత్ర వున్న పర్షియాను, టర్కీని, ఈజిప్ట్ ను మార్చడానికి కేవలం రెండు దశాబ్దాల కాలం సరిపోయింది. అయితే 800 సంవత్సరాల ముస్లిం రాజుల పాలనలో కాని, 200 ఏళ్ల ఆంగ్లేయుల క్రైస్తవ పాలనలోకాని భారత దేశాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని లొంగదీయడం వారికి చేతకాలేదు. దీనికి కారణం మనల్ని పాలించిన ఆ పరాయి వారి సంస్కృతి పరిమితమైన-ఎక్స్క్లూజివ్ సంస్కృతి....కొందరికే నిలయమైందది. ఇక మనదేమో ఇన్‍క్లూజివ్-సంఘటిత సంస్కృతి...అనేక ఏళ్ల నాటి ఆర్య సంస్కృతి....అందులో అందరికీ స్థానం వుంది.

            ఆర్య సంస్కృతి కాబట్టే పరాయి దాష్టీకాన్ని తట్టుకుని నిలదొక్కుకుంది. అలా తట్టుకోవడానికి బ్రాహ్మణుల పాత్ర కీలకం. అనాదిగా ఆ సంస్కృతికి సంరక్షకులు బ్రాహ్మణులు కావడమే దీనికి కారణం. ఇండిక్ నాగరకతను నిరంతరం పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ, తరతరాలకు అందించిన ఘనత కూడా బ్రాహ్మణులదే. మన ఈ నాగరకత, దానిలోని విలువలు, అందులోని సద్గుణాలు, సత్ప్రవర్తన, నీతి, ధర్మాలు...ఇవన్నీ వ్యక్తికీ, వ్యక్తితోపాటు సమిష్టికీ స్థానమిచ్చింది. మరోవైపు ఇస్లాం, క్రిస్టియానిటీ, తదనంతరం రూపుదిద్దుకున్న కమ్యూనిజం లాంటి ఇజాలు, సమిష్టికో లేదా వ్యక్తికో స్థానమిచ్చాయి కాని రెండింటికీ కలిపి ఇవ్వలేదు. ఈ మన సాంప్రదాయాలు, నాగరకత, ఆర్య సంస్కృతి, లోక కళ్యాణకారిగా విలసిల్లుతూ వస్తున్నది అనాదిగా. ఇటువంటి ఉత్కృష్టమైన నాగరకత బ్రాహ్మణుల సంరక్షణలోకి రావడానికి కారణం ఋషులు. వీరే "కార్య బ్రహ్మలు" అని కూడా పిలువబడ్డారు. సృష్టి కంటే ముందు మనందరం సృష్టి మూలం అనుకుంటున్న చతుర్ముఖ బ్రహ్మను "కారణ బ్రహ్మ" అని కూడా అంటారు. ఆయనే తొలుత ఋషులను సృష్టించి వారిని "కార్య బ్రహ్మలు" గా నియోగించాడు. మొత్తం రూపకల్పన చతుర్ముఖ బ్రహ్మ చేసినప్పటికీ, అమలు మాత్రం కార్య బ్రహ్మలకు అప్ప చెప్పాడాయన. అనంతకోటి బ్రహ్మాండాన్ని శాసించే పరబ్రహ్మ-విష్ణువును "కారణ కారణ బ్రహ్మ" అంటారు.


            బ్రహ్మాండంలో త్రిమూర్తి మండలాలున్నాయి. అవే వారి లోకాలు కూడా. వాటికి దిగువగా ఋషుల మండలం లేదా తపోలోకం వుంటుంది. ఇవన్నీ అంతరిక్షంలో వున్నాయి. మొత్తం బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలున్నాయి. మనుషులకు  మాదిరిగానే యక్ష, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, దేవతలకు కూడా లోకాలున్నాయి. ఋషుల్లో కూడా వివిధ రకాల వాళ్లుంటారు. పద్నాలుగు లోకాలను ఏడు ఊర్ధ్వ లోకాలని, ఏడు అధో లోకాలని నామకరణం చేశారు. త్రిమూర్తులది అందరికంటే పైనుండే లోకం-సత్య లోకం. ఇక మిగిలినవాటిని తపోలోకం, జనలోకం, మహర్లోకం, సువర్లోకం, భువర్లోకం, భూలోకం అని అంటారు. ఊర్ధ్వ లోకాలలలో చివరిది-దిగువది భూలోకం. అలాగే పాతాళం, రౌరవాది నరకాలను అధోలోకాలుగా పిలుస్తారు. అవి: అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు. మహర్లోకం పైన జనలోకం ఉంది. ఆ లోక ప్రవేశం మొదలుకొని శాశ్వత సుఖం ఆరంభమవుతుందంటారు. అది అమృతరూపం. జనలోకంపైన ఉన్న తపోలోకంలోని సుఖం శాశ్వతమైందే కాక క్షేమరూపంలో ఉంటుంది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం శాశ్వతం, మోక్షప్రథం కూడా.

దేవతల కంటే పూర్వమే ఋషులను సృష్టించాడు చతుర్ముఖ కారణ బ్రహ్మ. ఆ తరువాతనే మిగిలినవారందరూ వచ్చారు. కార్య బ్రహ్మల్లో ఒకరైన మరీచుడి కొడుకు కశ్యప ఋషి. ఆయన సంతానమే దేవదానవులు. దేవతలు అదితి ద్వారా, దానవులు దితి ద్వారా కలిగారాయనకు. కశ్యప ఋషిని ప్రజాపతి పదవిలో నియమించాడు బ్రహ్మ. ఆయన కూడా ఒక కార్యబ్రహ్మే. ఆయనే భూమిని సృష్టించాడు. అలా, భూమండలాన్ని కోట్లాది సంవత్సరాల క్రితం సృష్టించడం జరిగింది. కశ్యప సృష్టి వల్ల ఉద్భవించిన భూమిని ఆయన కూతురుగా భావించి "కాశ్యపి" అని కూడా పిలుస్తారు. దరిమిలా భూమండలలో జనాభాను సృష్టించడం జరిగింది. మానవుల ఆవిర్భావం జరిగింది. నాగరిక జీవనానికి ముందు ఆది మానవులుండేవారు. అప్పుడు ఈశ్వరుడి ఆజ్ఞానుసారం తపోలోకంలో నివసిస్తున్న ఋషులు భూలోకంలో జన్మించారు. తోటి మానవులకు జీవాత్మ, పరమాత్మ, మానవ జన్మ శ్రేష్టత, సృష్టి, నిర్మాణం, మానవుల స్థానం లాంటి వాటిని గురించి తెలియచేయమని వారిని ఈశ్వరుడు కోరాడు. ఆ విధంగానే మానవులకు గమ్యం, గమనం, ధర్మాధర్మాలు చెప్పి వారిని సంస్కరించి, మార్గదర్శకత్వం ఇచ్చి తపోలోకానికి మరలి పోయారు.

            ఆ విధంగా ఋషులు భూలోకంలో మనకు సంతానంగా జన్మించి, తపస్సు చేసి, సంస్కృతిని నెలకొల్పారు. అందుకే ఆర్య సంస్కృతిని "ఋషి ప్రోక్తమ్" అంటాం. శాస్త్రాలతో సహా అత్యంత విలువైన వాజ్ఞయ సంపద మనకిచ్చారు. ఇలా నడచుకోమని బోధించారు. సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకునే సంస్కృతిని మనకు దారాదత్తం చేశారు. మానవుల సంతానాన్ని వివాహం చేసుకున్నారు. పిల్లలను కన్నారు. అలా కలిగిన వారి సంతానాన్ని, వారు మనకందించిన జ్ఞానం, వాజ్ఞయ సంపద పరిరక్షిస్తూ సమాజానికి ఉపయోగపడమని, దాన్నే తరతరాలకు అందించమని, సమాజానికి సేవచేయమని చెప్పి, అప్పుడు తపోలోకానికి మరలి పోయారు. ఆ ఋషులు తమ తపోధనాన్ని ధారపోసి అధ్యయనం చేసిన వేదవేదాంగాలను బ్రాహ్మణులకు అప్పచెప్పారు. జీవన విధానం, ఆర్య సంస్కృతి నేర్పారు. అలా ఋషుల నుంచి అందిపుచ్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారి వంశస్తులే "బ్రాహ్మణులు". పరాయి పాలనలో అవి దెబ్బతినకుండా సంరక్షించుకుంటూ వస్తున్నారీ బ్రాహ్మణులు. "పురోహితులు" గా సమాజానికి మార్గదర్శకులుగా వుంటూ వస్తున్నారు.

            బ్రాహ్మణుడి జీవితం త్యాగంతో కూడుకున్న యజ్ఞం అని అనాలి. దీనికి ఉదాహరణగా అగస్త్య మహర్షి వృత్తాంతం చెప్పుకోవచ్చు. ఎప్పుడూ తపో నిష్టలో వుండే ఆ మహర్షి, తను దేవతలను శాసిస్తే, ఓ రాజు రాజ్యంలో క్షామం పోతుందని తెలిసి, వెనకా-ముందూ ఆలోచించకుండా, అక్కడికి పోయి, తన కమండలంలోని నీళ్లు చేతుల్లోకి తీసుకుని, రాజ్యం సుభిక్షం చేయడానికి తన యావత్ తపోశక్తిని ధారబోశాడు. ఫలితంగా రాజ్యం సుభిక్షమైంది...ఆయన మరలి తపో నిష్టలోకి పోయాడు. అదే మహర్షి తన సొంత కూతురి వివాహం విషయం వచ్చే సరికి, అది తన స్వవిషయం కాబట్టి, తపస్సు ఉపయోగించలేదు. బిక్షాటనకు బయలుదేరాడు. దీన్నే "స్వఛ్చంద బీదరికం" అంటారు. అది బ్రాహ్మణులే చేయగలరు-చేశారు-చేస్తున్నారు కూడా. తపస్సు అంటే వారికి జ్ఞాన సముపార్జన లాంటిది. వారలానే జీవించారు. విలువలను పాటించారు. అలానే జీవించమని తోటి బ్రాహ్మణులకు కూడా ఉద్భోదించారు. అందుకే బ్రాహ్మణుడు విద్యను అభ్యసించేవాడు. యోగ్యుడైన వాడికి తన విద్యను దానం చేసేవాడు. ఇంత చేసి గురుదక్షిణగా కేవలం "ధర్బ పుల్ల" నే తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. వారి జీవన భృతి గురు దక్షిణ కాని, లేదా, బిక్షాటన కాని మాత్రమే. వేరే మార్గంలో పోలేదెప్పుడూ. ఈ క్రమంలోనే నిత్యాగ్నిహోత్రం చేస్తాడు. అందులో లోక కళ్యాణం అనే సంకల్పం తప్ప మరేదీ వుండదు.

            స్వఛ్చంద బీదరికంలో వుంటూనే బ్రాహ్మణుడు, స్వాధ్యాయం, జ్ఞాన సముపార్జన తప్ప మరేదీ ఆలోచించడు. విద్యను అమ్ముకోడు. జీవించడానికి బిక్షాటన చేస్తాడు. అలా బ్రాహ్మణుడి జీవితమంతా త్యాగమే...త్యాగంతో కూడుకున్న యజ్ఞమే! అసలు యజ్ఞం అంటేనే త్యాగం. యజ్ఞానికి త్యాగమే మూలం. బ్రాహ్మణుడి జీవన విధానమే త్యాగంతో కూడుకున్న మహా యజ్ఞం. అగస్త్యుడి లాంటి మహర్షులు తమ వంశంలో పుట్టిన బ్రాహ్మణులను ధర్మంగా జీవించండి, సమాజానికి సేవ చేయండి, సమాజం కోసం బతకండి అని ఆదేశించారు. తమ గురించి ఏమీ ఆలోచించని, కోరని బ్రాహ్మణులను అందుకే "భూ సురులు" అని అంటారు.

సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశం భవిష్యత్ లో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఒక బహుముఖ వ్యూహం రూపొందించుకునేందుకు దోహద పడుతుంది. వైదిక విద్యకు ప్రోత్సాహం, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే వారికి ఆర్థిక చేయూత, సంప్రదాయలు కాపాడే వారికి, ఆధ్యాత్మిక రచనలు చేసే వారిని ఆర్థికంగా ప్రోత్సాహం, బ్రాహ్మణుల విద్య, వైద్య వివాహాది అంశాలకు ప్రాధాన్యత, ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులకు తగు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి, యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటుకు దారి తీస్తుంది. హైదరాబాద్ లో నిర్మించే బ్రాహ్మణ సదనం బ్రాహ్మణ సమాజోధ్ధరణ వేదికగా ఉపయోగపడుతుంది. వేరే ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, పండితులు వచ్చినా అక్కడ బస చేసే వీలు కలగడంతో పాటు, ఆచార, సంప్రదాయాల పరిరక్షణకు వీలు కలుగుతుంది. ధర్మ సంరక్షణకు, బ్రాహ్మణ సంక్షేమానికి ఇంతకంటె ఇంకేం కావాలి? దీనర్థం...అనాదిగా ధర్మాన్ని, అర్య సంస్కృతిని, నాగరకతను, సంప్రదాయాలను సంరక్షించుకుంటూ వస్తున్న బ్రాహ్మణులకు వాటిని భవిష్యత్ లో కూడా కొనసాగించడానికి ప్రభుత్వ పరంగా చేయూత లభించనుందనే కదా!

బ్రాహ్మణుల సంక్షేమంతో ఈశ్వరుడికి సహితం సంతోషం కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదేమో!

8008137012 (M)

No comments:

Post a Comment