Sunday, February 19, 2017

విధి బలీయం-ధర్మం కన్న దైవం మిన్న .....వనం జ్వాలా నరసింహారావు

విధి బలీయం-ధర్మం కన్న దైవం మిన్న
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (20-02-2017)

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం రసరమ్యం. అందులో చెప్పినవన్నీ ధర్మాలే. అయితే ఆ ధర్మాలన్నింటికన్నా మించింది దైవమని చెప్పే విషయం అయోధ్య కాండలో వుంది. శ్రీరాముడుని అడవులకు పంపాలని, ఆయన స్థానంలో తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని కైక దశరథుడిని కోరడం, ఆ విషయాన్ని ఆయన మాటగా కైకే స్వయంగా రాముడుకి తెలియచేయడం, రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడానికి అడవులకు పోవడానికి సిద్ధపడి తల్లి కౌసల్య అనుమతి-ఆశీర్వాదం కొరకు ఆమె దగ్గరకు పోవడం, ఆ సమయంలో కౌసల్య, తమ్ముడు లక్ష్మణుడు కైకను దూషించి రాముడు అడవులకు పోవద్దని అభ్యంతర పెట్టడం నేపధ్యంలో ధర్మం, అధర్మం, నీతి, న్యాయం లాంటి విషయాలెన్నో లక్ష్మణుడికి వివరిస్తాడు రాముడు. ధర్మాన్ని మించిన దైవం వుందని, కైక మోసం చేసిందనే నెపంతో ఆమెను కోపగించుకో కూడదనీ, అందులో ఆమె తప్పేమీ లేదని అంటాడు రాముడు. తనకు పట్టాభిషేకం చేయాలని ప్రయత్నం చేసిన వాడు దశరథుడు కాదని, విఘ్నం కలిగించింది కైక కాదని, తాను అడవుల పాలవడానికి తన దోషం ఏదీ లేదని, ఇవన్నీ కేవలం దైవ కృత్యాలేనని అంటాడు. విధి బలీయం అంటాడు శ్రీరాముడు.

విధి చేష్ట ఎలా వుంటుందో సోదాహరణంగా తెలియచేశాడు రాముడు. ఇంకా ఇలా అంటాడు: "ఇంత దూరాలోచన దైవ ప్రేరణ వల్లనే కలిగింది. అలా కాకపోతే తనకు ఏ అపరాధం చేయని నన్ను నిష్కారణంగా కష్టపెట్టాలని కైక మనసుకు కలగడం సాధ్యమా? మన ముగ్గురు తల్లులలో, నా మీద ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ప్రేమ అని చెప్పడానికి, వారిలో కొంచెమైనా తారతమ్యం కనిపించడం నేను చూడలేదు. ఇదే కైకకు నిన్నటి దాకా తన కొడుకుపై ఎక్కువ ప్రేమ కాని, నామీద తక్కువ ప్రేమ కానీ, విరోధ భావం కానీ లేదు. ఇదంతా ఇవ్వాళే కలగడానికి కారణం చెప్పగలమా? ఉన్నట్లుండి ఇంతటి ప్రేమ, విరోధంగా మారడానికి కారణం దైవం కాకుండా మరెవరు? తన కన్న కొడుకు కంటే నాపై ఎక్కువ ప్రేమగల కైక, ఏ అపరాధం చేయని నన్ను, నిష్కారణంగా కఠినోక్తులు మాట్లాడి, ఊళ్లో కూడా వుండనీయకుండా, అడవులకు పొమ్మని అనడం అంటే, ఇదంతా విధి చేష్టకాకుండా ఇతరుల చేష్ట ఎలా అవుతుంది? ఇతరులకు ఇది సాధ్యం కూడా కాదు".

రాముడు ఇంకా ఇలా అంటాడు:"ఆమె స్వభావ రీత్యా దుష్టురాలు. ఆ దుష్ట స్వభావమే ఇప్పుడామెను ప్రేరేపించింది. ఇక దైవం ఏమి చేసిందంటావా? సహజంగా ఆమె దుష్టురాలు కాదు. ఆమె పుట్టడం తోనే ఆమెతో గుణాలకు తోడు గౌరవం కూడా పుట్టింది. కులం కొలది గుణం అంటారు. ఆమె గొప్ప వంశంలో రాజకుమారిగా పుట్టింది. గొప్ప జాతిలో, గొప్ప వంశంలో పుట్టి, గొప్పవారి సాంగత్యంలో పెరిగిన దానికి నీచగుణం సహజమని ఎలా చెప్పగలం? సాలగ్రామాల గనుల్లో గులకరాళ్లు కూడా వుంటాయికదా? సముద్రంలో విషం పుట్టలేదా? అలా ఐతే బాల్యం నుంచే ఆమె నీచురాలై వుండాలి. అలా కాకుండా, దానానికి, దయకు స్థానంగా కీర్తి సంపాదించింది. సహజంగా నీచురాలైతే ఆమెకు ఈ కీర్తి కలిగేదా? తనతో సమానమైన సవతుల మీద ద్వేషం పెంచుకుంది. అది నీచమే కదా? ఆమె ద్వేషించింది సపత్నీత్వాన్ని కాని సవతులను కాదు. వారు సవతులు కాకపోతే వారిని ద్వేషించేది కాదు. అందరు ఆడవారిని ద్వేషించలేదే? తమ యోగ క్షేమాలకు హాని కలిగిస్తారేమోనని అనుమానం కలిగిన తోటి రాజులను అణచివేసే ప్రయత్నాన్ని పట్టాభిషిక్తులైన రాజులు కూడా చేయడం లేదా? ఒకరికె ఎంతైనా దానం చేయగల కైక పరుల సొత్తును ఎందుకు ఆశించింది? ఎంతో దయా గుణం కల ఆమె ఇలాంటి క్రూరమైన పనికి ఎందుకు సాహసించింది? ఎందుకు భర్తను ఎదిరించింది? ప్రీతిపాత్రుడనైన నన్ను ఎందుకు పనికిమాలిన, బాధాకరమైన మాటలను అనగలిగింది? దైవం ఆవేశించకున్న ఇలా చేయగలిగేదా? సహజమైతే ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు? కాబట్టి ఇంత మహిమగలది, ఊహించలేనిది, అసాధ్యమైన ప్రభావం కలదైన దైవం ఎలాంటివారికైనా అందలేనిదే. దానికి ఎదురులేదు. ఆమెకు ఆ దుర్భుద్ధి పుట్టడానికి, నాకు దారిద్ర్యం రావడానికి దైవమే కారణం. ఆ దైవమే ఇంత పని చేసింది".

"దైవం వుందనడానికి ప్రమాణం ఏంటి? దైవాన్ని ఎదిరించి ఇలాంటివి జరగకుండా మనం పురుషకారం చేయలేమా? ఒక పని మనం చేస్తున్నప్పుడు దైవం అనేదొకటున్నదని, అదేంటో చేస్తున్నదని, మనకు తెలియదు. ఫలితం కలిగేటప్పుడు మాత్రం ఆ దైవం కనపడి అదెలా చేయదల్చుకున్నదో, అలానే చేస్తుంది. ఫలితంలో మాత్రం కనిపించి, వేరే విధంగా కనిపించక, ఆ కారణం వల్ల దానిని జయించలేక సతమతమయ్యే మనం దైవంతో పోరాడగలమా? అది ఏ రూపంలో, ఎలా, ఏం చేస్తున్నదో మనకు తెలియనప్పుడు దానితో పోరాటం చేయగలమా? ఎలా చేస్తాం? ఫలానా సమయంలో, ఫలానా కార్యం సాధించేందుకు, ఫలానా సాధనాలను (దైవం) సిద్ధం చేసుకుని వుందని మనకు ముందే తెలుస్తే కదా, మనం ప్రతీకారం చేయగలం? కార్యస్వరూపంలో కనిపించకుండా, ఫలితం స్వరూపంలో కనిపించేదే దైవం. కాబట్టి దైవం వుందనడానికి అనుమానమే ప్రమాణం...బుద్ధి బలంతో మాత్రమే దానిని ఊహించగలం. కారణం లేకుండా కార్యం జరగదు. నిష్కారణం అంటే...కారణం మనకు తెలియదని అర్థమే కాని, కారణం లేదని అర్థం కాదు. కాబట్టి, మన సంతోషానికి, సౌఖ్యానికి, వ్యసనానికి, శాంతికి, రోషానికి, లాభనష్టాలకు, జననమరణాలకు, మరెన్నో ఇతర ఫలితాలకు....వేటినైతే కారణం లేకుండా కలుగుతున్నాయని అనుకుంటామో, వాటన్నిటికీ మూలకారణం దైవమే సుమా! ఇది తప్పదయ్యా తప్పదు!".


"పామరులమైన మన సంగతలా వుంచితే, ఘోరమైన తపస్సు చేసి, ఎంతో జ్ఞానాన్ని-మహిమను సంపాదించి, నిత్యనియమవ్రతులై, శాంతులై, నిష్కాములై, అడవిలో ఒక మూల నివసించే మునులు కూడా దైవాన్ని ఎదిరించి ఏమీ చేయలేరు. ఇలాంటి వారిలో కొందరు హటాత్తుగా కామానికి, కోపానికి లోబడి, దీర్ఘకాలంగా అభ్యసిస్తున్న నియమనిష్ఠలను నీటిపాలుచేసి, మర్యాద తప్పి, భ్రష్టులై పోవడం దైవ చేష్ట కాదా? పురుష ప్రయత్నంలో ఏ లోపం వుంది? విశ్వామిత్రుడంతటి వాడే నిమిషంలో కామానికి, క్రోధానికి వశుడై చెడి పోయాడో విన్నాం కదా? శివుడు కూడా అలానే అయ్యాడు కదా? ఎప్పుడు కూడా ఇదిలా జరుగవచ్చని ఊహించని పనులు తటాలున వున్నట్లుండి అయిపోవడం, అందరూ తప్పక అవుతుందనుకున్న కార్యం విఘ్నం కావడం లాంటివన్నీ దైవ చేష్టలే! ఇది సత్యం. ఈ విధంగా సప్రమాణంగా, నిస్సందేహంగా నిశ్చయించుకుని, ఇతరుల ఉపదేశాల వలనే కాకుండా, నాలో నేనే కార్యాచరణ ఆలోచించాను. ఇది దైవ కృత్యమని, దీనిలో మన దోషం లేదని, కైక నిమిత్త మాత్రమేనని, ఆమె దైవానికి సాధనం అయిందని, సాధించేది దైవం మాత్రమేనని, నాకు అర్థమైంది. దానివల్ల నాకు వ్యసనం, బాధ కలగలేదు. లక్ష్మి పోయింది...దారిద్ర్యం వచ్చింది అని దుఃఖించవద్దు. నా అభిప్రాయంలో, లెక్కింపనలవి కాని ఈ రాజ భోగాలు, అరణ్యవాసం, రెండూ ధర్మ కార్యాలే. రెండూ ఒకటిగానే అనిపిస్తున్నది. ఒక విధంగా ఆలోచిస్తే, వనవాసమే సుఖమనిపిస్తున్నది. ఎందుకంటే...రాజభోగం సుఖరూపక దుఃఖం; వనవాసం దుఃఖరూపక సుఖం. రాజభోగం ఇప్పటికి సుఖంగా కనిపించినప్పటికీ, నిర్వహణలో దుఃఖంతో కూడుకున్నదవుతుంది. వనవాసం నిశ్చింతం. నిరుపద్రవం. పుణ్యఫలదం. కాబట్టి, తాత్కాలికంగా దుఃఖంగా తోచినప్పటికీ, పోనుపోను సుఖమిస్తుంది. సుఖాన్ని, దుఃఖాన్ని ఇచ్చేవారెవరూ లేరు. ఎవరో ఇతరులు అవి కలిగిస్తారని మనం అనుకుంటాం. నేనే ఈ పని చేశాననడం వృధాభిమానం. ప్రతి మనిషి తాని చేసిన కర్మకు కట్టుబడి వున్నాడు. కైకలో స్వతస్సిద్ధమైన దోషం లేదు. పిశాచం పట్టిన వారు, సన్నిపాత జ్వరంతో బాధ పడేవారు, దూషించినప్పుడు, అది రోగబలమంటామే కాని వ్యక్తిని తప్పు పట్టం కదా? అలానే, దైవం కైక నోటి నుండి ఇలాంటి కీడు మాటలు పలికించింది. కైక మీద కోప్పడి ప్రయోజనం లేదు".

శ్రీరాముడు చెప్పినదంతా విన్న లక్ష్మణుడు ఆయనతో విభేదించి ఇలా అంటాడు: "కైకేయీ దశరథుల ఆలోచనను నువ్వు దైవ తంత్రంగా పోల్చావు. అలాంటి దైవం నాకిష్టం లేదు. కుట్రలు ప్రేరేపించు దైవం ఎలా దైవం అవుతుంది? ఎలా పూజ్యనీయమవుతుంది? బలం లేనివారు, అల్ప తేజస్సు కలవారు దైవ బలం అంటారు. ఎందుకు? వాళ్లకు కార్యసాధనకు కావాల్సిన బలం, తెలివితేటలు లేకపోవడం వల్ల, నింద తమ మీద వేసుకోకుండా దైవం మీద పెట్తారు. ఇక బలవంతులు, కీర్తిని కోరేవారు, దైవం అనేదొకటున్నదని కలలో కూడా అనుకోరు. పురుషకారంతో స్వకార్యాన్ని సాధించి కీర్తిని పొందుతారు. అలాంటివారిని దైవం ఏం చేస్తుంది? బలం గల గొప్పవాడు పౌరుష బలంతో దైవాన్ని దగ్గరకు రాకుండా తరిమికొట్టి, చివరకు, దైవం వల్ల ఏ బాధ పడకుండా, సమర్థతతో తన పని తాను చేసుకుంటాడు. నువ్వు దైవ బలం ఎక్కువ అంటున్నావు. నేను పురుష బలం ఎక్కువ అంటున్నాను".

కైకేయిని దూషించవద్దని లక్ష్మణుడితో రాముడంటాడు. రాజ్యాభిషేక విఘ్నం ఆమె చేసింది కాదని, దైవకృతం అని, ఆమె నిమిత్త మాత్రమే అని, ఆమె మీద కోప పడవద్దని, దైవమే మేలు-కీలుకు కారణం అని, ఆమెకు ఆ బుద్ధి కలిగించింది దైవమే అని, అలా కాకుంటే తన మీద ఎంతో ప్రేమ కలిగిన ఆమెకు నిమిషాల్లో విషమ బుద్ధి ఎందుకు కలిగిందని, దైవం అప్రతిహతమని, అలాంటి దైవంతో ఎవరు పోరగలరని, రాముడు సమాధానం చెప్పాడు. బదులుగా లక్ష్మణుడు...రాముడు చెప్పింది సరైంది కాదని, దైవం పరాధీనమైందని, అది స్వతంత్రించి ఏ పనీ చేయలేదని, అలాంటి దాన్ని నమ్ముకుని, దైవం ఇస్తుందని పురుష ప్రయత్నం చేయకుండా వుండడం సరికాదని అంటాడు. దైవం కంటే పౌరుషమే శ్రేష్టమని లక్ష్మణుడు వాదించాడు.

మహాభారతంలో చెప్పినట్లు, లోకం దైవాన్ని ఆలంబనంగా తీసుకుని పురుషకారంలో ఉదాసీనులు కాకూడదు. మనుష్యుడు చేయాల్సిన కర్మం చేయకుండా దైవమే ఇస్తాడని భావించకూడదు. ఇలాంటి మాటలు చూస్తుంటే, దైవం కంటే పౌరుషం బలమని అనిపిస్తుంది. రాముడు దైవమే బలిష్టమని అన్నాడు. దైవ-పౌరుషాలకు పరస్పర విరోధం కనిపిస్తున్నది. ఇదెలా అంటే....పురుషకారం లేకుండా దైవం ఏ కార్యం చేయలేదు...అలానే, దైవ సహాయం లేకుండా ఏ కార్యం ఫలించదు. కాబట్టి ఏదైనా ఫలితం కావాలంటే రెండూ అవసరమే! ఇదిలా వుంటే...రామచంద్రమూర్తి ఎందుకు పురుషకారానికి అనమతి ఇవ్వలేదు? ఆయన అభిప్రాయం ప్రకారం...పురుష ప్రయత్నం వ్యర్థం...దైవమే కార్యసాదకం. నిజంగా అలాంటి అభిప్రాయమే ఆయనకుంటే, సీతకొరకై పురుషకారం చేసి వుండేవాడు కాదు. దైవమే సీతను తెచ్చి ఇస్తుందని వూరకే వుండేవాడు. ధర్మ విరుద్ధ పురుషకారం శ్రీరాముడికి సమ్మతం కాదు. లక్ష్మణుడి పురుషకారానికి ప్రధమ కబళం దశరథుడు. రాజ్యం కోసం తండ్రిని పీడించిన వాడవుతాడు. అందుకే రాముడొప్పుకోలేదు. రాముడు పురుషకార విరోధి కాదు. అలానే, అన్న అరణ్యాలకు పోయి కష్టపడడం ఇష్టం లేక, ఎలాగైనా అయోధ్యలోనే ఆయన వుండేట్లు చేయడానికి సద్భావంతో లక్ష్మణుడు రాముడితో వాదించాడే కాని ఆయన దైవ విరోధి కాదు. అలాంటప్పుడు లక్ష్మణ వాదన సాధువాదమా? దుర్వాదమా? అని విచారించాలి.


            రామాయణంలో సీతారామలక్ష్మణుల చరిత్ర వల్ల, వారి మాటల వల్ల, బోధ పడేదేంటంటే...పౌరుషం కంటే దైవమే ప్రబలం కాబట్టి, దైవాన్నే సేవించాలనే విషయం. భారతంలో కూడా ఇదే చెప్పబడింది. కాబట్టి మనుష్యులు దైవాన్ని ధిక్కరించి పౌరుషాన్నే ఆశ్రయించక దైవాన్ని ఆశ్రయించి, యథాశక్తి, యథాశాస్త్రం ప్రకారం, నిష్కాములై స్వకర్మలు చేయాలి. రామాయణంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. భగవద్గీతోపదేశం కూడా ఇదే. రాముడు చెప్పిన ప్రతి మాట అందరికీ అన్ని వేళలా వర్తిస్తుందనడంలో సందేహం లేదేమో! END

1 comment:

  1. ఈ ఒక్క పేరాగ్రాఫ్ సరిగ్గా చదివి తలకెక్కించుకొంటే ఇంక మరేజ్ఞానాన్ని సంపాదించనక్కరలేదు. అద్భుతంగా వ్రాసారు.

    "దైవం వుందనడానికి ప్రమాణం ఏంటి? దైవాన్ని ఎదిరించి ఇలాంటివి జరగకుండా మనం పురుషకారం చేయలేమా? ఒక పని మనం చేస్తున్నప్పుడు దైవం అనేదొకటున్నదని, అదేంటో చేస్తున్నదని, మనకు తెలియదు. ఫలితం కలిగేటప్పుడు మాత్రం ఆ దైవం కనపడి అదెలా చేయదల్చుకున్నదో, అలానే చేస్తుంది. ఫలితంలో మాత్రం కనిపించి, వేరే విధంగా కనిపించక, ఆ కారణం వల్ల దానిని జయించలేక సతమతమయ్యే మనం దైవంతో పోరాడగలమా? అది ఏ రూపంలో, ఎలా, ఏం చేస్తున్నదో మనకు తెలియనప్పుడు దానితో పోరాటం చేయగలమా? ఎలా చేస్తాం? ఫలానా సమయంలో, ఫలానా కార్యం సాధించేందుకు, ఫలానా సాధనాలను (దైవం) సిద్ధం చేసుకుని వుందని మనకు ముందే తెలుస్తే కదా, మనం ప్రతీకారం చేయగలం? కార్యస్వరూపంలో కనిపించకుండా, ఫలితం స్వరూపంలో కనిపించేదే దైవం. కాబట్టి దైవం వుందనడానికి అనుమానమే ప్రమాణం...బుద్ధి బలంతో మాత్రమే దానిని ఊహించగలం. కారణం లేకుండా కార్యం జరగదు. నిష్కారణం అంటే...కారణం మనకు తెలియదని అర్థమే కాని, కారణం లేదని అర్థం కాదు. కాబట్టి, మన సంతోషానికి, సౌఖ్యానికి, వ్యసనానికి, శాంతికి, రోషానికి, లాభనష్టాలకు, జననమరణాలకు, మరెన్నో ఇతర ఫలితాలకు....వేటినైతే కారణం లేకుండా కలుగుతున్నాయని అనుకుంటామో, వాటన్నిటికీ మూలకారణం దైవమే సుమా! ఇది తప్పదయ్యా తప్పదు!".



    ReplyDelete