Monday, May 1, 2017

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది : వనం జ్వాలా నరసింహారావు

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (02-05-2017)

తెలంగాణ రాష్ట్రం లోని వెనుకబడిన తరగతులుషెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల వారికి విద్యా సంస్థల్లో, ఉద్యోగ నియమాకాల్లో, రాష్ట్రానికి చెందిన వివిధ సర్వీసుల్లోని పదవుల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన 2017 బిల్లును, ఆదివారం, ఏప్రిల్ 16, 2017న తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలిలో ప్రవేశ పెట్టడం, ఉభయసభల ఆమోదం పొందడంతో ఒక చారిత్రత్మాక ఘట్టానికి నాంది పలకడం జరిగింది.   ఏకకాలంలో, మరో చారిత్రాత్మక నిర్ణయానికి తెరతీస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్రాలకుండాల్సిన రాజ్యాంగ హక్కులను పునరుద్ఝాటిస్తూ శాసనసభలో మాట్లాడడం, తద్వారా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో ఒక నూతనాధ్యాయానికి నాందిపలకడం కూడా జరిగింది. యాధృచ్చికమే కావచ్చు...మరేదైనా కావచ్చు...కాని యావత్భారతదేశం ఆధ్యతన భవిష్యత్ లో సుదీర్ఘంగా ఆలోచించాల్సిన, చర్చించాల్సిన, ఒక నిర్ణయానికి రావాల్సిన అంశమిది అనాలి.

     ఈ నేపథ్యంలో ఒక విషయం మననం చేసుకోవడం అవసరమేమో! నేటి భారత ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో, 2012 గణతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్న విషయంగా పరిగణించాలి. "భారత సమాఖ్య నిర్మాణంలో ఒక క్రమ పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడి" ఆందోళన కలిగిస్తున్నదని ఆనాడాయన అన్నట్లు వార్తలొచ్చాయి.  "రాష్ట్రాలకు న్యాయబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను వాటికి దక్కేట్లు చేయడం వల్ల కేంద్రం బలహీనపడిపోదు. రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహాయ-సహకారాలను అందించాలే కాని, కేంద్రానికి అణగి-మణగి వుండాల్సిన అవసరం లేదు. సహకార సమాఖ్య పద్ధతి వుండాలే కాని, బలాత్కార సమాఖ్య పద్ధతి వుండరాదు" అనే భావనని మోడీ ఆనాడు స్పష్టంగా వ్యక్త పరిచారు.

     బహుశా అంతకన్నా ఇనుమడించిన గుండె ధైర్యంతో, సాహసంతో, ఉత్సాహంతో, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ముస్లిం మైనారిటీలకు బిసి ఇ కేటగిరీ కింద, అదే విధంగా షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్ కోటా పెంచే బిల్లును ప్రవేశ పెట్తూ మాట్లాడిన పద్ధతి, బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందడానికి అవసరమైన భూమికను తయారు చేసుకుంటున్నట్లు భావించాలి. శాసనసభలో సీఎం వ్యాఖ్యలు కుండ బద్దలు కొట్టినట్లుగా తేట తెల్లంగా వున్నాయనాలి. ‘‘నేను కేంద్రాన్ని అర్థించడం లేదు. పోరాటం చేయబోతున్నాను. నీతి అయోగ్ సమావేశంలో ఈ విషయం ప్రస్తావిస్తాను. అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను" అని ముఖ్యమంత్రి స్పష్టంగా, అరమరికలు లేకుండా చెప్పడం గమనించాల్సిన విషయం.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, తమిళనాడుతో సహా దేశంలోని ఐదు రాష్ట్రాలలో అమల్లో వున్న రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ  అక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారుప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి సుప్రిం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించిందని, అలాంటి పరిస్థితులు తెలంగాణలో కూడా వున్నాయని సీఎం అన్నారురాష్ట్రాలు ఇప్పుడమల్లో వున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి, అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్న"సరైన గణాంకాలు", "స్పష్ఠమైన లెక్కలు" తెలంగాణ రాష్ట్రంలో కూడా వున్నాయని సీఎం అన్నారు. శాసనసభలో వివిధ సందర్భాలలో జరిగిన చర్చలో సీఎం, "రిజర్వేషన్ల లాంటి కొన్ని కొన్ని విధాన పరమైన ముఖ్యమైన అంశాలకు సంబంధించి, రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన, తదితర ప్రాధాన్యతాంశాల క్షేత్రస్థాయి వాస్థవాల ఆధారంగా, నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రాలకే వుండాలి. వాటిని రాష్ట్రాలకే కేంద్రం వదిలేయాలి. పరిణితి చెందిన, సచేతనమైన మన దేశంలాంటి ప్రజాస్వామ్యంలో, రాష్ట్రాల అవసరాలకనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన సౌలభ్యం కేంద్రం రాష్ట్రాలకే వదిలేయాలి. 1947 లో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి స్థితిగతులు, పరిస్థితులు నేడు లేవు. 70 సంవత్సరాలకు పూర్వం మనం మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఇప్పుడు జనాభా పెరిగింది-పెరుగుతున్నది. ప్రజల్లో అవగాహన పెద్ద ఎత్తున పెరిగింది. అందుకు తగ్గ అవకాశాలు కల్పించాల్సిన  సమయం ఆసన్నమయింది. ప్రజలు తమతమ అవసరాలకు అనునుగుణంగా కొత్త కోరికలు కోరటం జరుగుతున్నది. దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగి పోవడానికి, పరుగులు తీయడానికి, ముందంజ వేయడానికి, రిజర్వేషన్ల అంశాన్ని ఆయా రాష్ట్రాల నిర్ణయానికి వదిలిపెట్టేయాల్సిన తరుణం ఆసన్నమయింది. తెలంగాణకు జరిగిన అన్యాయానికి, వివక్షకు, వ్యతిరేకంగా మేం పోరాటం చేసినప్పుడు మాకు లభించిన, అందించిన సహకారం, కలిసి వచ్చిన నేపథ్యం ఇప్పుడు కూడా కావాలి. భిన్నత్వంలో ఏకత్వం మన సిద్ధాంతం...మన నైజం..అదే మనకు ప్రాతిపదిక. లేని పక్షంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగి ఉద్యమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది" అన్నారు.


ఈ సందర్బంగా షెడ్యూల్డు కులాల వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ  ఆ సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజల సహకారం అందిందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అదో పెద్ద విషయం కాకపోవచ్చనీ, తెలంగాణలో మాత్రం ప్రాధాన్యత చాలా వుందని సీఎం అన్నారు. కాబట్టే ఇలాంటి అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు, సౌలభ్యం, అధికారం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు  వుండాల్సిందే అని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను, ఆలోచనలను గౌరవించాల్సిన అవసరం ఉందని, కేంద్రంలో పార్టీలు మారవచ్చునేమో కానీ పఠిష్టమైన కేంద్ర వ్యవస్థ కొనసాగుతూనే వుంటుందని, అదో నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారుతమిళనాడు రాష్ట్రంలో యుపిఎ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం ఎన్డీయే కొనసాగించక తప్పలేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావద్భారత దేశం దృష్టిని ఆకర్షించడంతో పాటు, జాతీయ స్థాయిలో  విస్తృత స్థాయి చర్చకు దారితీసే అవకాశాలున్నాయి. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ నాయకులైన ములాయం సింగ్ యాదవ్ (సమాజ్ వాది పార్టి) బిఎస్పి కి చెందిన మాయావతి లాంటి వారిని కూడా తన ఆలోచనలకనుగుణంగా కలిసొచ్చేలా చేసుకోవచ్చు కూడా. టిఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, తొలుత ప్రాథమిక స్థాయిలో, పలువురు జాతీయ నాయకులతో సమావేశమై, ఈ అంశాలను ప్రస్తావించి, వారి అభిప్రాయాలను సేకరించి, త్వరలో ముఖ్యమంత్రి డిల్లీ పర్యటన చేసేనాటికి పటిష్టమైన భూమికను తయారు చేయవచ్చు కూడా.

ఆశించిన విధంగా, అనుకున్నవిధంగా, అభాగ్యులను ఆదుకోవాలనే ఆశయ సాధన వున్న వ్యక్తి సీఎం కేసీఆర్. అలా చేస్తే అవాంతరాలు ఉండవన్నది ముఖ్యమంత్రి బలమైన నమ్మకంసమాజంలోని వెనుకబడిన వర్గాలను ప్రగతిపధాన నడిపించడానికి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం నిర్విఘ్నంగా ముందుకు సాగగలదు ఆయన నమ్మకం. ఎరువుల కొనుగోలు విషయంలో ఎకరానికి 4000 సబ్సిడీ అందించడంలో, ఉచిత విద్యుత్తును అందిస్తూ వ్యవసాయ రుణాల రద్దుకు ఉపక్రమించిన క్రమంలో, ఒంటరి మహిళలకు సహాయం అందించటంలో, గర్బిణీ స్త్రీలకు 12 వేల ఆర్థిక సహాయం, కేసిఆర్ కిట్ లను అందించే ఆలోచన క్రమంలో, రిజర్వేషన్లు పెంచే ఆలోచన క్రమం వంటి చారిత్రాత్మక నిర్ణయాల నేపథ్యానికి మూలం తెలంగాణలో యావన్మంది ప్రజల మెరుగైన జీవనానికి, అభ్యున్నతికి, పురోభివృధ్దికి నాంది పలకడం మాత్రమేనన్నది నిర్వివాదాంశం.

ఆత్మ నిబ్బరం, నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం జరిగిన రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్వయంగా తానే చారిత్రాత్మక రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, బిసి-ఇ కేటగిరిలో 4 శాతం నుండి 12 శాశాతానికి, షెడ్యూల్డు తెగలకు 6 శాతం నుండి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచారుకాంగ్రేస్, ఎంఐఎం పార్టీలుఈ ప్రతిపాదనకి అంగీకారం తెలుపగా బిజేపి వ్యతిరేకించింది. బిల్లు ప్రవేశపెట్తూ, ఎన్నికల ముందు తమ పార్టీ ప్రకటించిన ప్రధానాంశాలలో చేసిన వాగ్దానాల్లో రిజర్వేషన్ల పెంపు ఒకటని, ఆ వాగ్దానాన్ని ఇప్పడు అమలు చేస్తున్నామని సీఎం అన్నారునిబంధనలకు అనుగుణంగా, ఒక క్రమ పద్ధతిన, దీనికవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని, అమలులో కూడా అన్ని నిబంధనలను పాటిస్తామని, షెడ్యూల్డు కులాలకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా 1 శాతం పెంచి, మొత్తం 16 శాతానికి చేరుస్తామని, తెలంగాణలోని షెడ్యూల్డు కులాల జనాభాను పరిగణలోకి తీసుకుని ఆ ప్రకారం పెంపుదల చర్యలు చేపడతామని, వెనుకబడిన తరగతుల వారి రిజర్వేషన్లను కూడా పెంచడానికి చర్యలు చేపట్టామనీ, అందుకు బిసి కమిషన్ సమగ్ర అధ్యయనం చేస్తున్నదని, బిసిల సామాజిక ఆర్థిక స్థితిగతుల ఆధారంగా పెంపుదల అంశం ముందుకు తీసుకువెళతామని చెప్పారు.

న్యాయపరమైన చిక్కిలన్నింటినీ అధిగమించి, సుప్రీం కోర్ట్ విధించిన 50 శాతం వున్న సీలింగ్ దాటి 62 శాతానికి పెంచిన రిజర్వేషన్లు అమలు చేస్తామని, అలా చేయగలమన్న నమ్మకం తనకున్నదని సీఎం స్పష్టం చేశారు. భువనేశ్వర్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన సారంశాన్ని సీఎం శాసన మండలిలో చదివి వినిపించడంతో, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యూహం పూర్తిగా దెబ్బతినిందనాలి. "చారిత్రాత్మక నిర్ణయం మీద శాసనమండలిలో చర్చ జరుగుతున్న సందర్భంలోనే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశం మీదే వ్యాఖ్యానించడం యాధృఛ్చికమే అయినా ఆహ్వానించాల్సిన విషయం. ముస్లింలలో వెనుకబాటుదనాన్ని గురించి ప్రధాని ప్రస్తావించారు. వాళ్ల సమగ్రాభివృద్ధి గురించి కూడా పీఎం మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే, కేంద్రం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలుపుతుందన్నఆశకు బలం చేకూరుతున్నది" అని సీఎం మండలిలో అన్నారు.  ప్రధాని ప్రకటనతో ఆశయ సిద్దికి మార్గం సుగమమయిందని కనీసం ఇప్పుడైనా సహకరించాలని బిజెపి సభ్యులను కోరారు.

మొత్తం మీద, ఆదివారం జరిగిన రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు, ఆ సమావేశాల్లో బీసీ-ఇ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల బిల్లు ఆమోదం పొందడం, సీఎం కేసిఆర్ రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. ప్రజలకు లాభం చేకూరే విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన పట్టుదల, అందర్నీ కలుపుకుని పోవాలనే ఆలోచన, అవసరమైతే ఎంత దూరమైనా పోవాలన్న నిర్ణయం, ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం. నిజమైన నాయకుడేవరనే దానికి ఒక నిర్వచనం ఉదహరించడం జరిగింది...."నీ చర్యలు, ఇతరులను, మరిన్ని కలలు కలగనడానికి, మరింతగా చైతన్యం కావడానికి, మరి కొన్ని గొప్ప గొప్ప పనులు చేయడానికి దోహదపడగలిగితే....నువ్వే నిజమైన నాయకుడివి". ఇది బహుశా పూర్తిగా కేసీఆర్ కు వర్తిస్తుందేమో! కాపు నాయకుడు, ఆంధ్రాప్రాంతానికి చెందిన ముద్రగడ పద్మనాభం, సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ, అందులో రిజర్వేషన్ల పెంపుదల విషయంలో తెలియచేసిన అభినందనలు, సీఎం ను అసలు సిసలైన నాయకుడిగా  కొనియాడడం, సందర్భోచితంగా వుందనాలి.


No comments:

Post a Comment