Sunday, April 1, 2018

వాసుదాసు వ్యాఖ్యానం "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-2: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-2
వాసుదాసు వ్యాఖ్యానం "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం
వనం జ్వాలా నరసింహారావు

వాసుదాసుగారు, తాను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. ఇక ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా ప్రయోగించారు. వాటిలో, "మత్తకోకిలము" , "పంచ చామరం" , "కవిరాజ విరాజితము" , "తరలము" , "ప్రహరణకలిత" , "సుగంధి" , "ఉత్సాహం" , "మనోహరిణి" , "వనమయూరము" , "తోటకము" , "మానిని" , "ఇంద్రవంశము" , "లయగ్రాహి" , "తోదకము" , "మాలిని", "కలితాంతము" , "మధురగతిరగడ" , "వనమంజరి" , "కమల విలసితము" , "వసంతమంజరి" , "మంజుభాషిణి" , "స్రగ్ధర" , "వసంతతిలక" , "మాలి" , "కరిబృంహితము" , “చారుమతి", "వృషభగతిరగడ", "స్రగ్విని", "మనోరంజని", "తామరసం", "పద్మనాభ వృత్తం", "అంబురుహ వృత్తం", "మందాక్రాంత" లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో. ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందో యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.


         వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒక సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా, మరో చోట ఇంకో శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు, పరిశోధనా దృక్ఫదంతో చదివితే. ప్రతి కాండ చివర వాసుదాసుగారు రాసిన ఆఖరు పద్యంలో, ఆ కాండలో వున్న మొత్తం పద్యాలెన్నో తెలియచేసే పంక్తులుంటాయి.

         ఆంధ్ర వాల్మీకిరామాయణం రాయడానికి ప్రేరణ-స్ఫూర్తి, భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన సంకల్పం ద్వారానే తనకు లభించిందంటారు వాసుదాసుగారు. పోతనను కరుణించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనతో భాగవతాన్ని తెనిగింపచేసి భవ బంధ విముక్తుడిని చేసాడని, అందుకే, పలుకుపలుకులో తేనెలొలికించి, వ్యాస భాగవతాన్ని మరిపించగలిగాడని వాసుదాసుగారి అభిప్రాయం. ఆ విధంగానే, శ్రీరాముడి కరుణ తనపైన కూడా ప్రసరించిందని వాసుదాసుగారు భావించి వుండాలి. తద్రూపమే ఆంధ్ర వాల్మీకం. వాల్మీకాన్ని ఆమూలాగ్రంగా పరిశోధించిన పరమ భాగవతోత్తముడు వాసుదాసస్వామి.108సార్లు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని పఠించి-పారాయణం చేసి, పట్టాభిషేకాలు, సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించిన ఏకైక మహానుభావుడు వాసుదాసస్వామి.

         తనకంటే ముందు కాలం నాటి పూర్వ కవులెవరు, రామాయణాన్ని (పూర్వ కాండలు, ఉత్తర కాండ కలిపి) సంపూర్ణంగా తెనిగించలేదని గ్రహించిన వాసుదాసుగారు, అన్ని కాండలను తెనిగించి, విశేషించి తెలుగు పాఠక లోకానికి ఆవిష్కరించాలని సంకల్పించుకున్నారు."వాల్మీకిరామాయణాన్ని సమగ్రంగా, యథామూలంగా పలికినవారు పూర్వ కవులందూ-నేటి (ఆయన కాలం నాటి) కవులందూ లేరు. నేటి (ఆయన కాలం నాటి) రామాయణాలలో మూలానుసరణంగా వుంది, సమగ్రం కాదు. సమగ్రమయింది మూలాను సరణం కాదు. తమ అభిప్రాయాలను, ఇతరుల అభిప్రాయాలను మూలంగా చేర్చిపెడితే, అది వాల్మీకి పలికిందెలా అవుతుంది?" అని ప్రశ్నించాడు వాసుదాసుగారు.

1 comment:

  1. కేసీయార్ జాతీయ రాజ్కీయాలలోకి వెళ్తున్నట్టు ప్రకటించీన్ సందర్భంలో నా వూహలు కొన్ని ఈ పోష్టులో పొందుపర్చాను.మీరు చూస్తే బాగుంటుందని అనుకుంటూన్నాను.ఇప్పటివరకు ఇట్లా ఎదగాలనుకున్నవారికి తొలి అడుగు బలమైనదిగా ఉండాలని నా అభిప్రాయం.అది కేవలం అభిప్రాయం కాదు - పరిశీలన.దానికి నేను కేసీయార్ అయోధ్య సమస్యని పరిష్కరించడం ఒక శుభారంభం అవుతుందని ప్రతిపాదించాను.అది కొంచెం గందరగోళపు వ్యవహారమే అయినా అట్లా ఆలోచించడం విపరీతమైన ఆలోచన మాత్రం కాదని అనుకుంటున్నాను.బీజేపీ చేసినట్టు కెలికి వద్లెయ్యడం కాకుండా పరిష్కరించెయ్యాలని నా సూచన.మీరూ రామభక్తులే కదా,ఈ పద్ధతిలో తప్ప రామాలయ నిర్మాణం మరొకలా జరగదు.అది అపరిష్కృతంగ ఔన్న్నతకాలం అశాంతి అత్ప్పదు.మ్మీకు న అసూచాన్ నచ్చితే కేసీయార్ గారికి అందించగలరు కాబట్టి మీకు నా పోష్టుని పరిచయం చేస్తున్నాను.ఆక్కద కామెంట్లలో బీజేపీ అభిమానుల వాదనల్ని కూడా గమనించండి - మీకు నా ప్లానులో ఉన్న ఫోర్సు తెలుస్తుంది!
    http://harikaalam.blogspot.in/2018/03/blog-post_30.html

    ReplyDelete