Saturday, July 14, 2018

విపత్తుల వేళ జనగళం విన్పించిన నేత ..... మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-5:వనం జ్వాలా నరసింహారావు


విపత్తుల వేళ జనగళం విన్పించిన నేత
మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-5
మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (15-07-2018)
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)
తుఫాను సంభవించిన వెంటనే, కేంద్ర ప్రభుత్వ తక్షణ సహాయం గురించిన వివరాలు టెలిప్రింటర్లో సందేశం వచ్చింది. (ఫాక్సులు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవలేదు అప్పటికింకా). అందులో సహాయం మొత్తం ఇంత అని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినప్పుడు ఆ మొత్తం అంకె తప్పని వెంటనే స్పందించారు. మాకు అర్థం కాలేదు. ఇంతలో వచ్చిన మరో మెసేజ్ లో ముఖ్యమంత్రి చెప్పిన రు. 86 కోట్ల మొత్తం గురించి సవరణ వచ్చింది. అదీ ఆయన జ్ఞాపక శక్తి. ఆ సహాయం గురించి ఆయనే మాకు వివరించారు. రకరకాల అంశాలను అధ్యయనం చేసి ఆర్థిక కమీషన్ "ఇంత మొత్తం" ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన రాష్ట్రానికి తక్షణ సహాయం కింద ఇవ్వాలని నిర్ణయిస్తుందని, ఆ మొత్తం అప్పట్లో రు. 86 కోట్లుగా మాకు విశదీకరించారు. అందులో కూడా మూడొంతులు కేంద్రం, ఒక వంతు రాష్ట్రం భరిస్తుందని ఆయనే చెప్పారు. అలనాటి తుఫానును "జాతీయ విపత్తు" గా పరిగణించాలని చెన్నారెడ్డి గారు చేసిన ప్రతిపాదనకు స్పందించిన ప్రధాని వీపి. సింగ్ "ఇది జాతీయ విపత్తు కాకపోతే మరింకేదీ జాతీయ విపత్తుగా అనలేం" అని వ్యాఖ్యానించడమంటే, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం అనుకోవాలి. అంతటితో ఆగకుండా, ఇక్కడ వున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని అనుకోకుండా, ఒక ప్రత్యేక అధ్యయన బృందాన్ని కూడా పంపించారు రాష్ట్రానికి వీపి. సింగ్.

అయినా చెన్నారెడ్డి గారు తృప్తిపడలేదు. అందిన సహాయం ఏ మూలకు సరిపోదని ఆయన భావన. ఆ ఆలోచనతో "ప్రపంచ బాంక్" ను కదిపారు. " ఈ ఆధునిక ప్రపంచంలో కొంత బియ్యాన్ని పంచడంతో నో, మరో రకమైన ధాన్యాన్ని-పప్పు దినుసులను సమకూర్చడంతో నో, గుడిసెల మరమ్మతుకు అంతో-కొంతో ధనం సహాయం చేయడంతో నో సరి పుచ్చుకోవడం మన సంస్కృతిని-సాంప్రదాయాన్ని-ప్రపంచం దృష్టిలో మన గౌరవ ప్రతిష్ఠలను ప్రతిబింబించవు. శాశ్వతమైన ఏర్పాట్లు చేసినప్పుడే ఫలితం వుంటుంది" అన్నారాయన. ఏం జరిగిందో-ఎలా జరిగిందో అని అర్థం చేసుకునే లోపల, ప్రపంచ బాంక్ బృందం, తుఫాను సంభవించిన అతి కొద్ది రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించింది. ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలో అధికారులు వెంట రాగా రెండు రోజులు పర్యటించింది బృందం. మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన వారికిచ్చిన "తుఫాను ప్రాంత సంగ్రహ సమాచారం (Detailed Brief on what is to be done ?)" వివరించిన తీరు ఆయన మేథస్సుకు నిదర్శనం. బహుశా ఆయన తప్ప మరొకరు ఆ విధంగా చేయలేరని నా ఉద్దేశం. ఆయన ఆ రోజు ప్రపంచ బాంక్ బృందానికి చేసిన సూచన (తుఫాను ప్రాంత) భావి తరాల వారికి శాశ్వత పరిష్కారం. తర్వాత ప్రభుత్వాలు నిజంగా అందులో ఎన్ని అమలు చేసాయోగాని అమలు చేసే వుంటే తుఫాను తాకిడికి జరిగే నష్టం చాలా వరకు నివారించగలిగే వీలుండేది. ఆయన ఇచ్చిన వివరణలో ప్రధానమైంది "కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతంలో పురాతన కాలంలో నిర్మించి అస్తవ్యస్థమైపోయిన డ్రైనేజి ఏర్పాటు" గురించి.

"యావత్ భారత దేశంలో ఆంధ్ర ప్రాంతపు వ్యవసాయ దారులు, వ్యవసాయోత్పత్తిలో అగ్రగణ్యులని, 1924 లో, అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాయల్ అగ్రికల్చరల్ కమీషన్ పేర్కొంది. దానికి ప్రధాన కారణం అక్కడి డెల్టా ప్రాంతం-డ్రైనేజి వ్యవస్థ. అందుకే భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్ర ప్రదేశ్ కు పేరొచ్చింది. దురదృష్టవశాత్తు తుఫాను మూలంగా డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా నాశనమై పోయింది. అలా పాడై పోవడానికి, రాజకీయ నాయకుల-రకరకాల భూ ఆక్రమణదారుల ప్రోత్సాహంతో, డ్రైనేజి ప్రాంతంలో కాలువలకు చెందిన కొంత భాగాన్ని కబ్జా చేసుకోవడమే కారణం. కొందరు దురాశ పరుల మూలాన మొత్తం డ్రైనేజి వ్యవస్థ పగుళ్లకు దారితీసింది-పనికి రాకుండా పోయింది. ఆంధ్ర ప్రాంతంలోని సుమారు వేయి కిలోమీటర్లకు పైగా పొడవనున్న తీర ప్రాంతంలోని చాలా భాగం తుఫాను తాకిళ్లకు గురయ్యే ప్రమాదముంది. ఈ ప్రమాదం నుంచి శాశ్వతంగా అక్కడి ప్రజలను కాపాడాలి". అని ప్రపంచ బాంక్ బృందానికి వివరించి, "తుఫాను ఆవాసాలను" ఆ ప్రాంతాలలో పటిష్ఠంగా నిర్మించేందుకు ఆర్థిక సహాయం చేయమని అడిగారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఆ విషయం గురించి ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడు మొయిన్ కురేషీతో చర్చించాలని చెన్నారెడ్డికి సూచించారు బృందంలోని సభ్యులు.

అప్పట్లో ప్రపంచ బాంక్ సహాయం పొందాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరి. ఇప్పుడూ అవసరమే కాని వారి దృష్టికి తీసుకెళ్తే చాలు. చెన్నారెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధానిని, ఆర్థిక మంత్రిని కలిసి డ్రైనేజి వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రపంచ బాంక్ సహాయం విషయం చెప్పి, వారిచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. మొదట్లో వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణాన్ని వారం-పది రోజుల అనంతరం కొనసాగించారు. అత్యవసరంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సినప్పటికీ, జూన్ 6, 1990 అర్థ రాత్రి ఆసుపత్రిలో చేరేంతవరకు, నిత్యం ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతూనే వున్నారు. డ్రైనేజి వ్యవస్థ పునరుద్ధరణ తన ప్రధమ కర్తవ్యంగా భావించానని అమెరికా నుంచి వచ్చిన చెన్నారెడ్డి సిరి ఫోర్టు ఆడిటోరియంలో చెప్పారు. చెన్నారెడ్డి గతంలో రాష్ట్ర ఆర్థిక-పారిశ్రామిక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన సందర్భంలో మొయిన్ కురేషీని కలిసిన సందర్భాలు ఇరువురూ గుర్తుచేసుకున్నారు. పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను తయారు చేయాలని, చేయించిన తదుపరి, తప్పక ఆర్థిక సహాయం చేస్తామని ఆయన దగ్గర హామీ తీసుకున్నారు చెన్నారెడ్డి. ఇరువురి కలయిక తర్వాత కేవలం పద్నాలుగు రోజుల్లో నిష్ణాతులైన పలువురు ప్రపంచ బాంక్ నిపుణుల బృందం రాష్ట్రానికి రావడం, వివరంగా అంచనాలను రూపొందించడం జరిగింది. భవిష్యత్ లో ప్రపంచ బాంక్ హామీ నెరవేరడం వల్లనే పాడై పోయిన డ్రైనేజి వ్యవస్థ బాగుపడింది ఆ తర్వాత.


చెన్నారెడ్డి పౌర సంబంధాల అధికారిగా ఆ సమయంలో పనిచేసిన నాకు అవన్నీ చాలా దగ్గరగా గమనించే అవకాశం కలగడమే కాకుండా, ఎన్నటికి మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆ జ్ఞాపకాలలో కనీసం కొన్నైనా, నేనే కాకుండా, వాటిని దగ్గరగా వీక్షించిన (మాజీ ముఖ్యమంత్రి రోశయ్య , మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీమంత్రి, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర రెడ్డి, సమరసింహా రెడ్డి ... ఇంకా మరికొందరు) పలువురి తో సహా, బహుశా పలువురు పాత్రికేయులకు, ఆ మాటకొస్తే వర్తమాన రాజకీయాలను గమనించే చాలామందికి అలనాటి సంగతులు గుర్తుండే వుంటాయని భావిస్తున్నాను.

అదే రోజుల్లో, ఆరోగ్యం బాగాలేనందున శస్త్ర చికిత్సకొరకు అమెరికా ప్రయాణానికి సిద్ధమై, ఆరోగ్యం విషయం పక్కనపెట్టి, ఏకంగా తన పర్యటననే వాయిదా వేసుకొని, తదనంతరం అమెరికాకు వెళ్లి, అక్కడకూడా ఆరోగ్యం కంటే ముందు తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకు, ఇబ్బందులకు గురైన ప్రజలకు శాశ్వత పునరావాస చర్యలు చేపట్టేందుకు ప్రపంచ బాంక్ సహకారం కోరడానికి సంబంధిత అధికారులను కలుసుకోవడంలోనే వారం-పది రోజులు గడిపారు. తర్వాతే చికిత్సకు సిద్ధమయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన చెన్నారెడ్డి గారు, న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో, అలనాటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సమక్షంలో చేసిన ప్రసంగంలో, మొట్ట మొదటిసారిగా "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" (National Calamities Corpus-Need of the Hour) ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గురించి ప్రస్తావన చేశారు.

తుఫాను భీభత్సాలను-ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి, అప్పట్లో అమల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిపోదని బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఫైనాన్స్ కమీషన్ సమీక్షల ఆధారంగా అయిదు సంవత్సరాల కాలపరిమితికి సరిపడా ప్రకృతి వైపరీత్యాల సహాయ విధానం అమలు సరిపోదన్నారు. ఒకటి-రెండు రాష్ట్రాల నుంచో, కేంద్ర నుంచో నిధులను సేకరించి "జాతీయ విపత్తుల సహాయక నిధి" ని ఏర్పాటు చేయడంతో సరిపోదని, అన్ని రాష్ట్రాలలోని పౌరులందరి విరాళాలతో-భాగస్వామ్యంతో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక " న్యూక్లియస్ నిధి" ని ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ-అంతర్జాతీయ విపత్తులలో-విషాదాల్లో, తమ వంతు పాత్ర నిర్వహించాలన్న భావన ప్రతి పౌరుడిలో కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు చెన్నారెడ్డి. ప్రణాళికా సంఘం సరైన ఆలోచన చేసి, భారత దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని-ప్రతి పౌరుడిని "విధిగా" తోచినంత విరాళం ఇచ్చే విధంగా "శాశ్వత నిధిని" ఏర్పాటు చేసే, ఆ నిధులతో నడిచే "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ను నెలకొల్పాలని సూచించారు చెన్నారెడ్డి. అలా చేస్తే, ప్రకృతి వైపరీత్యాల్లో, తమ విరాళాలతో, తమ తోటి వారికి సహాయం అందిందన్న సంతృప్తి ప్రతి పౌరుడిలో కలుగుతుందని ఆయన భావించారు. అలా జరిగుంటే బాగుండేదేమో !

"జాతీయ విపత్తుల సహాయక నిధి" పేరుతో ఒకటి, "జాతీయ విపత్తుల ఆకస్మిక ఖర్చుల నిధి" పేరుతో మరొక టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటికీ, చెన్నారెడ్డి సూచించిన దానికి, వీటికి చాలా తేడా వుంది. తుఫానుకు గురైన రాష్ట్రాలకు ఈ రెండు సంస్థలనుంచి నిధులను విడుదల చేసే విధానాన్ని, ఫైనాన్స్ కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఫైనాన్స్ కమీషన్ ఆ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. సిరి ఫోర్టు ఆడిటోరియంలో ప్రసంగించిన చెన్నారెడ్డి గారు తన ఉపన్యాసంలో అవన్నీ వివరించినప్పుడు అధికారులను అభినందించిన తీరు ఆయన పాలనా దక్షతకు మచ్చుతునక.
(సమాప్తం) 

No comments:

Post a Comment