Friday, July 12, 2019

చట్టంలో సంక్లిష్టత...’నిర్ణయం’పై ఉత్కంఠ : వనం జ్వాలా నరసింహారావు


చట్టంలో సంక్లిష్టత...’నిర్ణయంపై ఉత్కంఠ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (13-07-2019)
పదహారు మంది కర్నాటక రాష్ట్ర శాసనసభ సభ్యులు ఒకరివెంట ఒకరు చేసిన రాజీనామాల విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చివరకు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కర్నాటక స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించడం లేదని ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాము రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్ళాలనుకుంటున్నామని వారు కోర్టుకు తెలియచేశారు. తమ రాజీనామాలను ఆమోదించకుందా తమపై అనర్హత వేటు వేసే అవకాసం వుందని కూడా వారు కోర్టుకు తెలియచేశారు. ఈ నేపధ్యంలో, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం సమంజసమా? కాదా? అన్న విషయంలో దాన్ని సమర్థించేవారు ఒక విధంగా, వ్యతిరేకించేవారు దానికి విరుద్ధంగా విడమరిచి మరీ చెపుతున్నారు. మరికొందరు రాజీనామా చేస్తారని ఉహాగానాలు వూపందుకుంటున్నాయి.

సుప్రీం కోర్టు జోక్యంతో వ్యవహారం అంతా పలు కీలక మలుపులు తిరిగింది. కోర్టు ఆదేశాల మేరకు రాజీనామా చేసిన వారిలో పది మంది ఎమ్మెల్యేలు ముంబాయి నుండి వచ్చి స్పీకర్ రమేష్ కుమార్ ను కలిశారు. తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించినప్పటికీ, మెరుపు వేగంతో చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని, రాజ్యంగ నియమ నిబంధనలను పాటించాలని, రాజీనామాలలో నిజాయితీ ఎంత వుందో ఖరారు చేసుకోవాలని స్పీకర్ విలేకరులకు చెప్పారు. రాజీనామాలను క్షుణ్ణంగా పరిసీలిచిన తరువాతే తగు చర్యలు చేపట్తానని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు మరోమారు సరైన ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించినప్పటికీ వారు ఆ రాజీనామాలను స్వచ్చందంగా చేశారా? లేదా అనేది తాను నిర్ణయించుకోవాలని స్పీకర్ అన్నారు.  

స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అంశంపై స్పష్టమైన అవగాహన ఎవరికీ లేదనే అనాలి. దానికి కారణం కూడా లేకపోలేదు. చట్ట సభలకు ఎన్నికైన వ్యక్తులు రాజీనామా చేసిన సందర్భాలు గతంలో చాలా వున్నా కర్నాటక వ్యవహారం కొంత ప్రత్యేకంగా వుంది. ఎవరిమీద కోపంతో వారు రాజీనామా చేసారో, అసలెందుకు చేసారో, వారికి కావాల్సింది ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అలాంటప్పుడు, నిర్ణయం ఎలా వుంటే సరైందన్న విషయంలోను స్పష్టమైన నిబంధనలు కాని, సాంప్రదాయాలు కాని, పద్ధతులు కాని, ప్రక్రియలు కాని వుండే అవకాశం కూడా లేదు. వీటి తోడ్పాటు లేకుండా, కేవలం రాజ్యాంగపరమైన మార్గదర్శకాలుంటే సరిపోదు. వాస్తవానికి, ఇంతమంది రాజీనామా చేసిన సందర్భాలలో, మన దేశంలో కాని-ఇతర దేశాలలో కాని, అందరికీ ఆమోద యోగ్యమైన సంప్రదాయాలే మన్నా వున్నాయేమో అధ్యయనం చేస్తే కొంత ఉపయోగకరంగా వుండేదేమో!

భారత రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలా వరకు, వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ పద్దతితోనే రూపు దిద్దుకుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే భారత, ఇంగ్లాండ్ దేశాలకు, దాదాపు ఒకే రకమైన సంప్రదాయాలు, ప్రక్రియలున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ నియమ-నిబంధనలు, సంప్రదాయాలు భారత దేశం అనుకరించడం జరుగుతున్నప్పటికీ, అ దేశంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు పూర్తికాలం పదవిలో కొనసాగకుండా మధ్యలో రాజీనామా చేయాలనుకున్నప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తితో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సంబంధించిన ప్రకరణ మన రాజ్యాంగంలో పొందుపరచక పోవడం బహుశా పొరపాటే మో! అసలా మాటకొస్తే వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ విధానంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే విధానం అంతర్లీనంగా వుంటుందనాలి. అలాంటివి ప్రజాస్వామ్యం బలపడ్డానికి దోహదపడతాయి. ఉదాహరణకు, ఆ దేశంలో లాగా, ఇక్కడి లోక్ సభ-రాష్ట్ర శాసన సభల స్పీకర్లు, చట్ట సభల కాలపరిమితి తర్వాత జరిగే ఎన్నికలలో, ఏ పార్టీకి చెందని అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కలిగించాలి.

ఇంగ్లీష్ పార్లమెంటుకు ఒక సారి ఎన్నికైన వ్యక్తికి, పదవీ కాలం పూర్తవకుండా-లేదా మళ్లీ ఎన్నిక లొచ్చే వరకైనా, రాజీనామా చేసే అవకాశం లేనే లేదు. పదిహేడవ శతాబ్దంలో, రాచరిక వ్యవస్థ నేపధ్యంలో, బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నిక కావడం, సభ్యులుగా వుండడం అరుదైన గౌరవంగా, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావించినందున ఎవరు రాజీనామా చేసేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ అవసరం దృష్ట్యా, మార్చ్ 2, 1623 న ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు వీలుపడకుండా, సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానమే అమలులో వుందిప్పటికీ. అదే మన దేశం విషయానికొస్తే, ఒక వ్యక్తి ఒకటికి మించిన స్థానాలలో పోటీ చేయవచ్చు- చేసి గెలిచిన స్థానాలలో ఒకటి వుంచుకుని మిగతా వాటికి రాజీనామా చేయవచ్చు. గెలిచిన అభ్యర్థి తన ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేసి, ఉప ఎన్నికలొచ్చిందాకా వేచి వుండి తిరిగి పోటీకి దిగవచ్చు. బహుశా ఈ విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందనాలి.


ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో, చట్ట సభలకు ఎన్నికై నవారు, రాజీనామా చేయదల్చు కుంటే, ఆ విషయాన్ని ఫార్మాట్ లో, స్పీకర్ కు తెలియ చేస్తే సరిపోతుంది. స్పీకర్ తక్షణం రాజీనామాను ఆమోదించవచ్చు, లేదా, నిర్ణయం వాయిదా వేయడమో, రాజీనామాలను తిరస్కరించడమో చేయవచ్చు. ఇలా చేశాం అని చెప్పాల్సిన అవసరం లేదు. స్పీకర్ అందుబాటులో లేకపోతే, రాజీనామా చేయదల్చుకున్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్ కు కాని, కార్యాలయంలో సిబ్బందికి కాని ఇచ్చి పోవచ్చు. రాజీనామా చేయడం అంత తేలికైన విషయమన్న మాట. ఫాక్స్ ద్వారా పంపిన వారు కూడా వున్నారు. ఎంత వేగంగా వారు రాజీనామాలను సమర్పించుకుంటారో, అంతే మోతాదులో, లేదా, అత్యంత నెమ్మదిగా, నిర్ణయాన్ని వాయిదా వేయవచ్చు.

ఇంగ్లాండులో సభ్యులకు రాజీనామా చేసే అవకాశం లేకపోయినా, సభ్యత్వం నుంచి తొలగడానికి రాజ్యాంగం ఒక వెసులుబాటు కలిగించింది. "రాజీనామా" కు బదులుగా "పదవీ విరమణ" చేసే అవకాశం పార్లమెంట్ కలిగించింది . పార్లమెంటు సభ్యులుగా వున్న వారు "ఆదాయం లభించే" పదవులను అంగీకరించ రాదన్న నిబంధన వున్నందున, సభ్యులు ఆ నిబంధన ప్రకారం సభ్యత్వాన్ని కోల్పోయేందుకు, ప్రభుత్వ పరంగా, ప్రత్యేకంగా దీని కొరకే ఉద్దేశించబడిన ఒక పదవి కావాలంటూ అభ్యర్థన చేసుకోవాలి. దాన్ని మన్నించి, బ్రిటీష్ రాణి (లేదా రాజు), ఆర్థిక మంత్రి (ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్) ద్వారా ఆ పదవిలో వారిని నియమించడం, తక్షణమే, సభ్యత్వం రద్దు కావడం జరుగుతుంది. అలాంటి వారు, తాము ఖాళీ చేసిన సీటుకు ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి సాధారణంగా సాహసించరు. పార్టీ టికెట్ కూడా లభించదు. ఆశ్చర్యకరమైన విషయం... దీని కొరకు కేటాయించిన పదవులు కాగితం పై మాత్రమే వుంటాయి. ఎప్పుడో, మాంధాతల కాలంలో, రాచరిక వ్యవస్థ పూర్తిగా వేళ్లూనుకున్న రోజుల్లో, ఏర్పాటైన ఆ పదవులు, ప్రస్తుతం "చట్టపరమైన కల్పితాలు" గా మిగిలి పోయాయి.

ఈ నేపధ్యంలో, ఆ దేశంలోని, వామ పక్ష ఐరిష్ రిపబ్లికన్ రాజకీయ పార్టీ నాయకుడు-పార్లమెంటు సభ్యుడు గెర్రీ ఆడమ్స్, ఆ మధ్యన, బ్రిటీష్ పార్లమెంటు సభ్యత్వానికి చేసిన రాజీనామా, కొన్ని సమస్యలకు దారితీసిందక్కడ. ఆయన రాజీనామా చేయడానికి కారణం, ఉత్తర ఐర్లాండ్ శాసన సభ స్థానానికి పోటీ చేసి-గెలిచి, అక్కడ అధికారం పంచుకుంటున్న తన పార్టీ పక్షాన మంత్రి వర్గంలో చేరడమే. వాస్తవానికి, గెర్రీ ఆడమ్స్ “ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఇష్టపడని” (Abstentionist) వెస్ట్ మినిస్టర్ హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటీష్ పార్లమెంట్ ఎగువ సభ) సభ్యుడుగా 1983 నుంచి 1992 వరకు, తిరిగి 1997 లో ఎన్నికై 2011 వరకు కొనసాగుతున్న నేపధ్యంలో రాజీనామా చేశాడు. అలానే ఆయన సహచర పార్టీ అభ్యర్థులు మరి కొందరున్నారు. ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం, తమ బలాన్ని నిరూపించుకోవడానికి పోటీ చేసి గెలుస్తారు కాని, సభా కార్యక్రమాలలో పాల్గొనరు. అలా 19 వ శతాబ్దం నుంచి కొనసాగుతుందక్కడ.

ఉత్తర ఐర్లాండును యునైటెడ్ కింగ్డం నుంచి వేరు పరచడం వారి నినాదం. ఒకనాటి మిలిటెంట్ ఉద్యమాన్ని ప్రస్తుతం ప్రజాస్వామ్య పద్దతుల ద్వారా కొనసాగించింది ఆ పార్టీ. పార్లమెంటులో ఆ పార్టీ సభ్యులు అనుసరిస్తున్న విధానాన్ని ఉత్తర ఐర్లాండ్ శాసన సభ విషయంలో పాటించడం లేదు. ఐరిష్ శాసన సభకు పోటీ చేసేందుకు, జనవరి 2011 ఆడమ్స్ తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సాంప్రదాయం ప్రకారం, రాజీనామాకు ప్రత్యామ్నాయంగా, అందుకై కేటాయించిన ప్రభుత్వ కొలువులో, ఆయనను నియమిస్తూ, ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్ ఉత్తర్వులు జారీ చేసారు. కాకపోతే, బ్రిటీష్ రాణికి "విశ్వసనీయత" ప్రకటించేందుకు అవసరమైన ప్రమాణాన్ని పార్లమెంటు సభ్యుడుగా చేయడానికి అంగీకరించని ఆడమ్స్, ఆ పదవిని ఒప్పుకోలేదు. తాను ఎన్నికలలో ఐర్లాండ్ శాసన సభకు పోటీ చేసి తీరాల్సిందేనని పట్టు బట్టాడు.

పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా అంగీకరించక పోతే, ఐరిష్ పార్లమెంటుకు పోటీ చేయడానికి వీలుంటుందా? "అవును" అనే సమాధానం యునైటెడ్ కింగ్డం రాజ్యాంగ సవరణ లాంటి "2000 చట్ట సభల సభ్యత్వ రద్దు చట్టం" లో దొరుకుతుంది. ఈ చట్టం ప్రకారం, ఐరిష్ శాసన సభకు ఎన్నికైన వారికి, ఆ సభలో సభ్యులుగా వుంటూనే, బ్రిటీష్ పార్లమెంటు సభ్యులుగా కొనసాగే అరుదైన "హక్కు" కలిగింది. అంటే, ఐరిష్ పార్లమెంటు సభ్యుడుగా పోటీ చేసి-గెలిచి, అక్కడ సభ్యుడుగా వుంటూ, 2015 లో జరగాల్సిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల వరకు, ఆడమ్స్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడుగా వుండవచ్చు. ఇంత చక్కటి అవకాశం వున్నప్పటికీ, తనకు, పార్లమెంటు సభ్యుడుగా వుండేందుకు ఇష్టం లేదని బల్ల గుద్ది చెప్పాడు ఆడమ్స్. ఇక మిగిలిందొకటే దారి. అంతవరకు సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేయని ఆడమ్స్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే పరిష్కారం.

న్యాయ శాస్త్ర పరమైన నియమ-నిబంధనల నేపధ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయ స్థానాల తీర్పులు వుండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిద్ధమైన నిబంధనంటూ ఏదీ వుండాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం నడుచుకోక పోతే దాని పరిణామాలు ఒక విధంగా వుంటాయి. సంప్రదాయాలకు అలాంటి ఇబ్బంది లేదు. చట్టాలను సవరించవచ్చు. సంప్రదాయాలను మెరుగుపర్చవచ్చు. ఎంత మంచి సంప్రదాయమైనా చట్టానికి లోబడితేనే దానికి విలువ వుంటుంది. ఇవన్నీ అధ్యయనం చేస్తే, చట్ట సభల కన్నా, ఆ సభలను నడిపించాల్సిన స్పీకర్ అధికులు కారు. చట్టం స్పష్టంగా వుంటే, స్పీకర్ కు సరైన మార్గదర్శకాలుంటే, ఆయన తీసుకునే నిర్ణయం తిరుగులేనిదే అవుతుంది. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. చట్టంలో స్పష్టత లేనప్పుడు, సంప్రదాయాల ఆసరా దొరకనప్పుడు, స్పీకర్ అత్యంత జాగ్రత్తతో ముందుకు సాగాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు. బహుశా, ప్రస్తుతం కర్ణాటకలో నెలకొన్న సంక్లిష్ట వాతావరణంలో, రాజీనామాలు చేసిన నేపధ్యంలో, నిర్ణయాధికారాన్ని, చట్ట సభలకే, వదిలేస్తే మంచిదే మో!

రాష్ట్ర శాసన సభను సమావేశ పరిచి, సభ నిర్ణయం ఆధారంగా ముందుకు సాగితే, భవిష్యత్ లో అవసరమైనప్పుడల్లా, అదే ఒక కొత్త సాంప్రదాయం అయ్యే అవకాశం వుంది. రాజీనామా కారణాలను సభా ముఖంగా వివరించే అవకాశం కూడా సభ్యులకు ఇచ్చినట్లవుతుంది. రాజీనామాలు ఆమోదించనంత మాత్రాన పదవులను అంటి పెట్టుకుని వుండాల్సిన అవసరం లేదు. శాసనసభ ఎప్పుడు సమావేశమైనా సభాకార్యకాలాపాల్లో పాల్గొనక పోతే, ఆర్నెల్లు సభకు హాజరు కాకపోతే, సభ్యత్వం కోల్పోయినట్లే కదా!

ఏదేమైనా కర్నాటక వ్యవహారం రోజు-రోజుకీ ఆసక్తికరంగా మారడం, ఈ వ్యాసం రాసే సమయానికి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం జరిగింది. 

No comments:

Post a Comment