Saturday, January 11, 2020

శ్రీరాముడికి ధైర్యం చెప్పిన సుగ్రీవుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-12 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడికి ధైర్యం చెప్పిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-12
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (12-01-2020)  
          శ్రీరామచంద్రమూర్తి బాధపడడం చూసిన సుగ్రీవుడు కన్నీళ్లు తన గొంతుకు అడ్డంగా వస్తుంటే ఇలా అన్నాడు. “అయ్యా! రామచంద్రమూర్తీ! ఆ రాక్షసుడు కాపురముండే దేశం కానీ, అతడి బలం కానీ, శక్తికానీ, సామర్థ్యం కానీ, అ అనీచుడి కులంకానీ నాకు నిజంగా తెలియదు. అయితే ఎలా అని విచారపడవద్దు. ఏవిధంగానైనా నీభార్య నీతో కలిసే మార్గాన్ని అన్వేషిస్తాం. నామాట నమ్ము”.

         (ఇక్కడ సుగ్రీవుడు స్పష్టంగా అబద్ధం చెప్పాడు. రావణాసురుడి విషయం హనుమంతుడికి తెలియదుకాని సుగ్రీవుడికి బాగా తెలసు. రావణాసురుడు వాలిచేతిలో ఓడిపోయి సంధి కుడుర్చుకున్నవాడే. అప్పుడు సుగ్రీవుడు కూడా అక్కడ వున్నాడు. అలాంటప్పుడు తెలిసి-తెలిసి అబద్ధం చెప్పడం మిత్రద్రోహం కాదా? కాదు...కానేకాదు. ఇప్పుడే రావణాసురుడి గురించి సుగ్రీవుడు చెప్తే చాలా తొందరలో వున్న రామచంద్రమూర్తి వెంటనే లంకమీదకు యుద్ధానికి పోదామని అనవచ్చు. వాడి బలం ఈయనకు తెలియదు. తానేమో వాలి జీవించి ఉన్నంతదాకా ఈ స్థలాన్ని విడిచి పోవడానికి వీల్లేదు. ఒకవేళ పోయినా ఇప్పుడున్న ఐదుగురితో చేయగలిగింది ఏమీ లేదు. తాము బయల్దేరిపోతే వాలి సైన్యంతో దండెత్తి వస్తాడు. వాలి, రావణుడు ఒకటైతారు. అప్పుడీయన ఎవరితోనని యుద్ధం చేస్తాడు? తొందరపాటు వల్ల కార్యభంగమే కాని అనుకూలంకావు. వాలిని చంపి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇస్తే తానూ సర్వాధికారి అవుతాడు. అప్పుడు నిర్భయంగా లంకమీదకు దండెత్తవచ్చు. ఇలా కార్యభారం, సాధన మార్గం ఆలోచించి సుగ్రీవుడు అబద్ధం చెప్పాడు. దీనివల్ల రామచంద్రమూర్తి పని పాడవలేదు. స్నేహధర్మాన్ని అనుసరించి ఆడిన అబద్ధం తప్పుకాదు. రోగి మేలు కోరిన వైద్యుడు రోగి ఇష్టప్రకారం చికిత్స చేయదు. వాడి మేలు ఆలోచించి చేస్తాడు).

         సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు రాముడితో. “రామచంద్రా! నా ప్రతిజ్ఞ విను. సీతాదేవి ఎక్కడున్నా వెతికి ఆ రాక్షసుడిని బంధువులతో, కొడుకులతో, స్నేహితులతో యుద్ధంలో చీల్చివేసి నీ మనస్సుకు సంతోషం కలిగేట్లు చేస్తాం. నీ ప్రియురాలిని నీతో కలిసేట్లు చేస్తాం. తండ్రీ! నామాట నమ్ము. అయ్యా! బాధపడవద్దు. సాహసం వదలవద్దు. ధైర్యం, తేజం వదిలి పెట్టవద్దు. గౌరవం చెడిపోయేవిధంగా పరితాపపడవద్దు. దేవాత్మా! నీలాంటి మహాత్ములు ఈ విధంగా దుఃఖపడతారా? గౌరవం చెడడానికి బాధపడడమే కారణం అని నీకు తెలియదా? నీ దుఃఖం నాకెలా తెలుస్తుంది అంటావేమో? నీలాగా నేను కూడా భార్యను పోగొట్టుకుని అనేక కష్టాలు అనుభవిస్తున్నాను కదా? అయినా నీలాగా నేను ఏడుస్తున్నానా? ధైర్యం వదిలానా? నేనా కోతిని, మూఢుడను అయినప్పటికీ ఆడదానికై దుఃఖపడను. నువ్వేమో మంచి పండితుడివి. దీరుడివి. మహాత్మా నువ్వు ఇలా చేయడం తగునా?”.


         “రామచంద్రా! కారుతున్న కన్నీటిని ఇనుమడించిన ధైర్యంతో అడ్డగించు. కార్యోన్ముఖుడు నిలకడగా వుండాల్సిన ధైర్యాన్ని విడువవచ్చా? వ్యసనపడేటప్పుడు, ధననష్టం జరిగినప్పుడు, ప్రాణాపద కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, తన బుద్ధిబలంతో ధీరుడనేవాడు ధైర్యంగా వుండాలి కాని అధైర్యపడకూడదు. ఎప్పుడూ ఏడిచే బుద్ధిహీనుడు శోకంతో బరువెక్కిన పడవ సముద్రంలో మునిగినట్లు మునుగుతాడు. చేతులు రెండూ జోడించి నిన్ను ప్రార్థిస్తున్నాను.....నామీద స్నేహభావం వుంచి నన్ను మన్నించు. కొంచెం కూడా దుఃఖపడవద్దు. పౌరుషంగా వుండు పండితాగ్రణీ! రామచంద్రా! శోకమే అన్నిటికీ సమాధానం, అంతకు మించి మనం ఏమీ చేయలేం అనేవాళ్లకు సుఖం వుండదు. శోకంలో మునిగినవాడికి తేజస్సు చెడిపోతుంది. శోక పడేవాడికి బతుకు దుర్లభం అవుతుంది. కాబట్టి శత్రుసంహారకా! ధైర్యాన్ని తెచ్చుకో”.

         “రామచంద్రా! స్నేహం వల్ల నేను నీకు హితమైన దాన్నే చెప్తున్నానుకానీ నీకు తెలియని విషయం ఉపదేశం చేయడం లేదు. నీకు చెప్పేటంతటి వాడినా నేను? కాబట్టి నా స్నేహాన్ని గౌరవించి నేను చెప్పిన మాటలను ఆదరించి మన మేలుకేకదా చెప్తున్నాడని భావించి నీ మొహాన్ని, మనస్తాపాన్ని తగ్గించుకో”.

         స్నేహం, ప్రేమ ప్రకాశించే రీతిలో సుగ్రీవుడు చెప్తుంటే, కళ్ళనుండి కాలువల్లాగా కారుతున్న నీళ్లను నిమ్మదిగా తుడుచుకుని, సుగ్రీవుడిని చూసి, రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. “కౌగిట్లో వుంచుకుని, ప్రేమతో, గుణసంపన్నుడైన స్నేహితుడు తన స్నేహితుడికి ఆపద సమయంలో ఎలా మెసలుకోవాలో. అలాగే నువ్వు నీ మాటలతో నన్ను ఓదార్చావు. మిత్రుడా! బంధువులంటే రక్తసంబంధీకులు మాత్రమే కాదు. అలాంటి సంబంధమున్నా, లేకపోయినా, అవసరానికి సహాయపడేవారే నిజమైన బంధువులు. ఇలా నా హితం కోరేవాడు, అవసరానికి ఆదుకునేవాడు నాకెక్కడ దొరుకుతాడు? సంపదలో తులతూగేవాడికి ఎవరన్నా లభిస్తారేమో కాని, ఆపదలో వున్న నాలాంటివారికి, నీచ స్థితిలో ఎవరూ లేని సమయంలో నీలాంటి స్నేహితులు ఎలా దొరుకుతారు? కాబట్టి నువ్వు నిజమైన చుట్టానివి. నీ మాటలవల్ల నామనసు నిర్మలమైంది”.

         “సుగ్రీవా! నీకు నామీద ఇంత ప్రేమ వుంది కాబట్టి, ఇక నువ్వు ‘ఇలా చేయి, అలా చేయి’ అని చెప్పను. దుష్టబుద్దితో క్రూర కార్యాలు చేసే రాక్షసుడుని వెతకడానికి చేయాల్సిన ప్రయత్నాలు నువ్వే చేయి. ఇక ఆ విషయాలు నేను ప్రస్తావించను కాని, ఇప్పుడు నన్నేమి చేయమంటావో చెప్పు. వానాకాలంలో విత్తనం సిద్ధం చేయబడిన మడికయ్యగా నన్ను భావించు. నువ్వు వేసే విత్తనం కొద్దీ నీకు ఫలితం వుంటుంది. ఆలోచన చెప్పాల్సిన బాధ్యత నీది....అది ఫలించేలా చేయడం నా వంతు. నేను చెప్తున్నది సత్యం అని నమ్ము. ఇంతవరకు నేను అసత్యమాడలేదు. ఇక ముందు ఆడబోయేది లేదు. మిత్రమా! సందేహం వదులు. సత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను”.

            రామచంద్రమూర్తి చెప్పిన హితవాక్యాలు, ప్రతిజ్ఞ, విన్న సుగ్రీవుడు, ఆయన మంత్రులు చాలా సంతోషించారు. ఈ విధంగా రామసుగ్రీవులు వారి-వారి సుఖ దుఃఖాలు ఒకరితో మరొకరు ఏకాంతంగా చెప్పుకున్నారు. ఏక నిశ్చయంతో రామసుగ్రీవులు ఇలా తమ సుఖదుఃఖాలు ఒకరికొకరు చెప్పగా, సుగ్రీవుడు తన కార్యం సఫలమైంది కదా అని మిక్కిలి సంతోషించాడు.

No comments:

Post a Comment