Saturday, January 18, 2020

శ్రీరామునితో స్నేహాన్ని కొనియాడిన సుగ్రీవుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-13 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరామునితో స్నేహాన్ని కొనియాడిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-13
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (19-01-2020)   

          లక్ష్మణుడి సమక్షంలో ఆయన వింటుండగా వానరరాజైన సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. “నీలాంటి గొప్ప మహిమకలవాడు నాకు స్నేహితుడిగా లభించడంవల్ల దేవతలందరి అనుగ్రహానికి నేను యోగ్యుడనయ్యాను. ఇంతవరకూ నన్ను కొండమీది కోతి అని తలచినవారంతా ఇకమీద నన్ను రాముడి స్నేహితుడని ఎంతగానో గౌరవిస్తారు. నువ్వు కొంచెం ఆలోచిస్తే నీ సహాయంతో నాకు కేవలం కపిరాజ్యమే కాదు, స్వర్గలోక ప్రభుత్వం కూడా లభిస్తుంది. రఘువంశంలో పుట్టిన వాళ్లలో శ్రేష్టుడవైన నీతో నాకు స్నేహం లభించడం వల్ల నా చుట్టాలందరికీ, ప్రాణమిత్రులకూ, పూజనీయుడనయ్యాను. నీకారణాన నన్ను ఇక అందరూ గౌరవిస్తారు. నీకు నేను తగిన స్నేహితుడనని కాలక్రమంలో నువ్వే తెలుసుకుంటావు రామచంద్రా! నా గుణాలను గురించి నేను చెప్పుకోకూడదు. ఆత్మ ప్రశంస మరణప్రాయమని పెద్దలంటారు కదా?

“ఇది నా విషయం. నీ విషయంలో నాకేమాత్రం సందేహం లేదు. నీ లాంటి ధన్యులు, కృతకృత్యులు స్థిరచిత్తం కలవారిగా వుంటారు కాని, చపల చిత్తులుగా వుండరు. జ్ఞానులలో ధైర్యంలాగా వారిలో ప్రేమ నిశ్చంచలమై వుంటుంది. ఇద్దరు స్నేహితులు సాదువులైతే, చాలా విలువగల పదార్థాలైన వెండి-బంగారు సొమ్ములను కూడా ఒకరివాటిని ఇంకొకరు తమ సొంత వస్తువుల్లాగే, ఇతరుల ధనమనే భేదం లేకుండా ఉపయోగిస్తారు. తన స్నేహితుడు ధనవంతుడైనా, దరిద్రుడైనా, దుఃఖంలో మునిగివున్నా, సుఖభోగాలు అనుభస్తున్నా, దోషైనా, దోషరహితుడైనా, అతడి గుణదోషాలను నిజమైన స్నేహితుడు ఎంచకూడదు. ధనం పోయినా, సుఖాలన్నీ పోయినా, తన దేహమే పోయినా, తన స్నేహితుడి పని నెరవేరేలా చూడాలికాని, వాడికోసం మనమెందుకు చెడిపోవాలి అనుకోకూడదు”.

ఇలా హితం, ప్రియమైన మాటలను సుగ్రీవుడు చెప్పగా, శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు వింటుండగా “ఔను, నువ్వు చెప్పింది నిజం” అని సుగ్రీవుడితో అన్నాడు. ఆ తరువాత సుగ్రీవుడు, రామలక్ష్మణులు కూర్చున్న శాఖలు వాడిపోయి వుండడం గమనించి, కొత్తవైన, మనోహరమైన శాఖలకోసం నాలుగు దిక్కులా చూశాడు. సమీపంలో వున్న ఒక కొమ్మను, చిగుళ్లు, పూలు బాగా వుండి ఆకులు తక్కువగా వున్న దాన్ని తెచ్చి రామచంద్రమూర్తికి వేశాడు. ఆయన దానిమీద కూర్చున్నాడు. ఆ తరువాత అలాంటిదాన్నే హనుమంతుడు తెచ్చి ఇస్తే, లక్ష్మణుడు కూర్చున్నాడు. అందరిలా కూర్చున్న తరువాత సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అన్నాడు.

“మా అన్న వాలి నామీద పగపట్టి, నన్ను ఇల్లు వెళ్ళగొట్టి, నా భార్యను అపహరిస్తే, ఇక ఇక్కడ వుంటే చంపుతాడన్న భయంతో ఈ ఋశ్యమూక పర్వతంమీద పడివుంటున్నాను. సమస్త జీవరాసుల భయం పోగొట్టగలిగే వాడివి నువ్వు. రక్షకుడు లేని నన్ను, దుఃఖపడే నన్ను రక్షించు”.

ఇలా సుగ్రీవుడు చెప్పడంతో రామచంద్రమూర్తి తాను ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పానుకదా అనుకుంటాడు. అదొక గొప్ప విషయం కాదనుకుంటాడు. చిరునవ్వుతో సుగ్రీవుడితో ఇలా అన్నాడు.

“పుణ్యాత్మా! సుగ్రీవా! మేలు చేయడం స్నేహధర్మం. కీడు చేయడం శత్రువుల లక్షణం. నువ్వు నాకు స్నేహితుడివి. నీ భార్యను అపహరించిన మూర్ఖుడిని ఇప్పుడే చంపుతాను. దీనికొరకు విచారించవద్దు. సుగ్రీవా! నా బాణాలు ఎలాంటివో తెలుసా? అమితమైన వేగంగా పోతాయి. మిరుమిట్లుగొలిపే కాంతికలవి. చూడడానికి భయంకరాకారాలు కలవి. బంగారు పింజలున్నాయి. కుమారస్వామి వనంలో పుట్టాయి. ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైనవి. భయంకరంగా, కోపంతో వున్న పాముల్లాగా, మిక్కిలి వాడికల ముఖాలున్నాయి. నువ్వు వీటిని చూసి ధైర్యం తెచ్చుకో. వాలిని తప్పక చంపుతాను. భయపడవద్దు. పాపపు మనస్సుకల వాలి నేలబడి చావగా సుగ్రీవా! సంతోషంగా చూస్తావు”.

ఈ విధంగా చెప్పిన రామచంద్రమూర్తి మాటలు విన్న సుగ్రీవుడు సంతోషంతో శ్రీరామచంద్రమూర్తిని మేలు-మేలని ప్రస్తుతించి ఇలా అన్నాడు.

“దేవా! శోకపీడితులకు నువ్వే గతి. నేనో శోకపీడితుడిని. కాబట్టి నువ్వే నాకు గతి. అంతమాత్రమే కాకుండా నువ్వు నాకు స్నేహితుడివి. నన్ను రక్షించాల్సిన భారం నీమీదే ఎక్కువగా వుంది. ఈ కారణాన దీనుడినై ఏడుస్తున్నాను. అగ్నిసాక్షిగా నువ్వు నా చేతిలో నీ చేయి వేసి స్నేహం చేసి, నాకు ప్రాణదానాన్ని నిస్సందేహంగా ఇచ్చిన కారణాన ధైర్యంతో వున్నాను. దేవుడైన నిన్నే నా ప్రాణస్నేహితుడివని నమ్మి నా మనస్సును ఎల్లవేళలా కాల్చే దుఃఖాన్ని నీకు చెప్పడానికి ప్రయత్నించాను. అల్పవిషయమైతే నేనెందుకు చెప్పేవాడిని?”.

ఇంతవరకు చెప్పి, కళ్ళనిండా నీళ్లు కారుతుంటే, గొంతు గద్గదమై, నోట మాటరాక మౌనం దాల్చాడు.

ధీరుడైన సుగ్రీవుడు తన కళ్ళవెంట కారుతున్న నీళ్లను అణచుకుంటూ, రాముడేమనుకుంటాడో అని భయపడ్తూ, మళ్లీ ధైర్యం తెచ్చుకుని రామచంద్రుడితో తన కథ ఇలా చెప్పసాగాడు.

వాలి తనను పరాభవించిన విధానం రాముడికి చెప్పిన సుగ్రీవుడు
         వాలి తనకు చేసిన కీడును గురించి సుగ్రీవుడు రాముడికి చెప్పాడిలా. “రామచంద్రా! వాలి నాకు చేసిన కీడు చెప్తా విను. వాలి రాజుగా వుండగా నేను యువరాజుగా వున్నాను. అప్పుడు నన్ను నానావిధాలుగా దూషించి దయలేకుండా వెళ్ళగొట్టాడు. నా ప్రాణాలకంటే ప్రియమైన నా భార్యను అపహరించాడు. నామీద ప్రేమగల స్నేహితులను, బంధువులను, చెరసాలలో బంధించాడు. ఇంతటితో ఆగకుండా నా ప్రాణాలను తీయడానికి ఆలోచిస్తున్నాడు. నన్ను చంపడానికి అనేకమందిని పంపాడు. ఇంకా నన్ను మోసం చేసి చంపడానికి అనేక ఆలోచనలు చేశాడు. అతడు నాకు చేసిన కీడులు చెప్పడం సాధ్యపడదు. నన్ను చంపడానికి వాలి ఎవరెవరినో పంపడం, నేను వాళ్లను చంపడంతో కాలం గడిచిపోతున్నది. ఆ కారణానే నేను మిమ్మల్ని చూసినప్పుడు, మీరు కూడా వాలితో పంపబడిన వారని భయపడ్డాను. ఈ హనుమంతుడు మొదలైన వానరులు మాత్రమే నాకు తగిన సహాయం చేస్తూ వుంటే, ఎన్ని కష్టాలో పడ్తూ, ప్రాణాలతో వున్నాను. నాకు వీళ్లు అన్నివేళలా అండదండలుగా వుంటూ, నా ప్రాణాలను కాపాడుతున్నారు. రామచంద్రా! ఎక్కువగా మాటలు చెప్పకుండా సారాంశాన్ని సంగ్రహంగా చెప్తా విను. వాలి మహా పరాక్రమశాలి. సూర్యుడిలాంటివాడు. శత్రువులకు భయంకరుడు. అలాంటివాడు చచ్చి నేలబడితేనేకాని నా దుఃఖాలు పోవు....అన్నం సహించదు...కంటికి నిద్ర రాదు. రామచంద్రా! నాకు కలిగిన దుఃఖం ఎట్లా పోతుందో ఆ విషయమే చెప్పాను. కష్టాల్లో కానీ, సుఖాల్లోకానీ మిత్రుడికి మిత్రుడే దిక్కు”.

         సుగ్రీవుడు చెప్పినదంతా విన్న రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. “వాలి నీకు అన్న కదా? అతడితో నీకింత విరోధం ఎందుకు కలిగింది? దానికి కారణం ఏమిటి? నువ్వేం తప్పు చేశావు? అంతా వివరంగా చెప్పు. మీ తప్పుల్లోని బలాబలాలు విచారించి, నీ తప్పు చిన్నదే అయితే, అతడి విరోధం ఎక్కువైతే, వాడిని ఇప్పుడే చంపుతాను. నీ తప్పు పెద్దదై, విరోధం చిన్నదైతే, ఇద్దరికీ సమాధానం కుదిరించి కార్యం చక్కదిద్దుతాను. నువ్వు విచారపడవద్దు. ధైర్యంగా మొదటినుండి మీ చరిత్ర చెప్పు. నీకు కలిగిన అవమానం వింటేనే నాకు కోపం వస్తున్నది. మనస్సు చలిస్తున్నది. నీకు విరోధి అయితే నాకూ విరోధే కదా? నేను విల్లు ఎక్కుపెట్టకముందే నీ సమాచారమంతా వివరంగా చెప్పు. నా విల్లు నుండి బాణం బయటికి వస్తే ఇక వాలి చచ్చిపోయినట్లే అని నమ్ము”.

         ఇలా శ్రీరామచంద్రమూర్తి చెప్పగా విన్న సుగ్రీవుడు, తనకు, తన అన్నకు విరోధం వచ్చిన విధం చెప్పడం ప్రారంభించాడు.

No comments:

Post a Comment