Saturday, February 8, 2020

వాలి బలపరాక్రమాలను శ్రీరాముడికి తెలిపిన సుగ్రీవుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-16 : వనం జ్వాలా నరసింహారావు

వాలి బలపరాక్రమాలను శ్రీరాముడికి తెలిపిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-16
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (09-02-2020)   
         తన దుఃఖం ఉపశమించేట్లు చేస్తానని శ్రీరాముడు చెప్పిన మాటలకు సంతోషించిన సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. “అసమాన కీర్తీ! నువ్వు కోపంతో బాణాలను వదిలితే, అవి లయకాలంలోని సూర్యకిరణాల లాగా, లోకాలన్నిటినీ అల్పకాలంలో కాల్చి బూడిద చేస్తాయి. అయినప్పటికీ, వాలి ధైర్యం, ఆయన అద్భుత పరాక్రమం గురించి చెప్తాను. ఏకాగ్రచిత్తంతో విను. విన్నతరువాత ఎలాంటి ఉపాయం చేయాల్నో ఆలోచించి అలాగే చేయి. వాడు పెద్ద-పెద్ద కొండలను పైకి ఎత్తి చిన్నపిల్లలు గోలీలు ఆడినట్లు ఆడుతాడు. ప్రతిరోజూ సూర్యోదయం కాకముందే సంధ్యవార్చడానికి తూర్పు సముద్రంలో స్నానం చేసి, దక్షిణ సముద్రంలో ఆచమనం చేసి, పడమటి సముద్రంలో అర్ఘ్యం ఇచ్చి, మరో సముద్రంలో జపం చేసి, సూర్యోపస్థానం చేస్తాడు. ఇలా వాలి ప్రతిరోజూ నాలుగు సముద్రాలలో సంధ్యవారుస్తాడు. ఇంత తిరిగి వచ్చినా కొంచెమైనా అలసట వుండదు వాలికి. తన బలాన్ని ప్రదర్శించడానికి అడవిలోని పెద్ద-పెద్ద చెట్లను చేతిదెబ్బతో విరగ్గొట్టుతాడు. నిర్మలచిత్తా! అతడి బలం వర్ణించడం కష్టం”.

దుందుభి వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పిన సుగ్రీవుడు
         “వెండికొండ శిఖరంలాంటి తేజస్సుకల దుందుభి అనే మహిష స్వరూపంకల ఒక రాక్షసుడు, వరబలంతో వేయి ఏనుగుల బలం కలవాడై, సముద్రుడిని చూసి, తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు. వీడికి చేటుకాలం సమీపించినదని తలచిన సముద్రుడు, అతడితో యుద్ధం చేయడానికి తాను సరిజోడీకాదని, ఈశ్వరుడి మామ, కొండలరాజు, తపస్సు చేసేవారికి ఆశ్రయం ఇచ్చేవాడు, అనేకమైన గుహలతో ప్రకాశించేవాడైన హిమవంతుడు దానికి సరిపోతాడని చెప్పాడు. సముద్రుడిని భయపడ్డాడని తలచాడు దుందుభి. యుద్దాసక్తుడైన దుందుభి హిమవంతుడి మీదకు పోయాడు. ఇలా పోయి, తన కొమ్ముల బలంతో పెద్ద-పెద్ద బండలను నేలమీద పడవేయసాగాడు. అప్పుడు హిమవంతుడు తెల్లటి రూపంతో శిఖరం మీదనుండి వాడితో ఇలా అన్నాడు”.

         “రాక్షస శ్రేష్టుడా! నన్నెందుకు బాధపెట్టుతున్నావు? నువ్వేమో ధర్మాత్ముడివే? నేను మునులకు ఆశ్రయమిచ్చేవాడిని. నువ్విలా చేస్తే వాళ్లకు హాని చేసినట్లేకదా?”. హిమవంతుడి మాటలకు జవాబుగా దుందుభి, “నువ్వు భయపడితే, నాతో యుద్ధం చేయగలవాడి పేరు చెప్పు” అని అంటాడు. హిమవంతుడు “మహాధైర్యవంతుడు, బలవంతుడు, ఇంద్రుడితో సమానమైనవాడు, చాలా బుద్ధిమంతుడు, వాలి అనే వానరుడు కిష్కింధలో వున్నాడు. అతడు నీతో సంతోషంగా ద్వంద్వ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయాలని నీకు కోరిక వుంటే అతడిమీదకు యుద్ధానికి పో. అతడు వెంటనే నిన్ను చక్కగా చేస్తాడు. నముచికి యుద్ధ బిక్ష ఇంద్రుడు ఇచ్చినట్లు, నీకు వాలి ఇస్తాడు” అని వాలి దగ్గరకు పొమ్మంటాడు దుందుభిని.


వాలిమీదకు యుద్ధానికి పోయిన దుందుభి
         “పాపాత్ముడైన దుందుభి రాక్షసుడు రోషంగా, గర్వంగా, కళ్ళు మూసుకుపోగా, కాళ్ళ తొక్కిడితో భూమి వణకుతుంటే, కిష్కింధకు పోయి, మహిష స్వరూపం ధరించి, వాడి కొమ్ములతో ఏనుగులాగా చెట్లను, నగరం బైటున్న తలుపులను చీల్చాడు. విచ్చలవిడిగా ఆ రాక్షసుడు చెవులు దద్దరిల్లేట్లు నగారాలాగా మధ్య-మధ్యన పెద్ద ధ్వని చేశాడు. అంతఃపురంలో వున్న వాలి ఈ చప్పుడు విని స్త్రీలతో సహా బయటకు వచ్చి ఆ రాక్షసుడితో, ఆతడు దుందుభి అని తనకు తెలుసనీ, దనుజ శ్రేష్టుడైన ఆతడు ఎందుకు ఈ విధంగా బుద్ధిలేకుండా తన పట్టణం వాకిట్లో ధ్వని చేస్తున్నాడనీ, అతడికి ఉపిరితో జీవించి వుండాలన్న ఆశ లేదా అనీ, వుంటే మరెక్కడికైనా పొమ్మనీ అంటాడు”.

జవాబుగా దుందుభి, “వాలీ, ఆడవారి ఎదురుగా పౌరుషపు బింకాలు పలకగానే వచ్చిన లాభం ఏంటి? నువ్వు పరాక్రమంకలవాడివైతే, యుద్ధానికి రా. నీ భుజబలం ఎలాంటిదో అప్పుడు తెలుస్తుంది. అలా కాకపోతే ఉదయం దాకా వేచి వుంటాను. నీ ఇష్ట భార్యలతో అప్పటిదాకా సుఖపడు. నువ్వు ఇంటికి పో. పరలోకంలో నీకు సుఖం కలగడానికి చేయాల్సిన దానాలు చేయి. నీకు ప్రియమైన వారినందరినీ కౌగలించుకో. నీ స్త్రీలతో భోగించు. పట్నమంతా ఒక్కసారి కడసారిగా కలియచూడు. నీతో సమానమైన వాడిని రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయి. ఆ తరువాత రా యుద్ధానికి. నీ పొగరు అణచి వేస్తాను. మత్తు పదార్థాలు తినడం వల్ల, తాగడం వల్ల, శరీరం తెలియని వాడిని, ప్రమాదంలో వున్నవాడిని, నిద్రించేవాడిని, ఆయుధాలు లేనివాడిని, నీలాగా కామంతో వొళ్ళు తెలియనివాడిని చంపితే భ్రూణహత్యాదోషం వస్తుంది” అంటాడు.

“దుందుభి చెప్పిన మాటలు విన్న వాలి, చిరునవ్వు నవ్వి, తన భార్య తారను, ఇతర స్త్రీలను ఇళ్లకు పొమ్మని, రాక్షసుడిని చూసి, “అసుర శ్రేష్టుడా! నువ్వు పిరికివాడివి కాకపోతే నన్ను మట్టుడిగా అనుకోవద్దు. నేను తాగింది వీరపాణం అనుకో. చూడు..కాచుకో” అని చెప్పి, తనతండ్రి ఇచ్చిన బంగారు దండను మెడలో ధరించి త్వరగా పోయి రాక్షసుడైన దుందుభిని తాకాడు. ఇలా తాకి, వాడిమీద పడి గట్టిగా అదిమి, పౌరుషంగా వాడి కొమ్ములు పట్టుకుని రివ్వు-రివ్వున వాడిని తిప్పి-తిప్పి, వాడు బలహీనుడై పోగా, నేలమీద కొట్టాడు. నేలమీద పడ్డ వాడు చెవులనుండి నెత్తురు కారుతుంటే, ధీరుడై లేచాడు. మోకాళ్ళతో, మోచేతులతో, చెట్లతో, పెద్ద రాళ్లతో వాలి మహిషాసురుడిని వలంగా కొట్టినా దుందుభి భయపడకుండా వాలిని ఎదుర్కున్నాడు. ఒకరినొకరు గెలవాలని యుద్ధం చేశారు. క్రమక్రమంగా, అంతకంతకు వాలి బలం పెరిగింది. రామచంద్రా! దుందుభి బలం తగ్గింది. దీనికి కారణం వాలి ధరించిన బంగారు దండ. అది శత్రువు దేహాన్ని తాకినప్పుడల్లా వాడి బలం లాగి వాలి దేహంలో ప్రవేశపెట్టుతుంది. అదే దండలోని మంత్రబలం”.

No comments:

Post a Comment