Sunday, May 9, 2021

శ్రీరామ పత్ని సీతాదేవికి అగ్నిపరీక్షా? : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరామ పత్ని సీతాదేవికి అగ్నిపరీక్షా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (09-05-2021) మధ్యాహ్నం ప్రసారం   

రావణ వధ తరువాత, అతడికి సంస్కారాలు చేసిన అనంతరం, సింహాసనాన విభీషణుడిని కూర్చోబెట్టి, అతడిని అభిషిక్తుడిని చేశారు రామలక్ష్మణులు. అ ఆతరువాత సమీపంలో వున్న హనుమంతుడిని పిలచి రాముడు, విభీషణుడి అనుమతి తీసుకుని లంకకు పోయి, అక్కడ రావణుడి ఇంట్లో వున్న సీతాదేవికి యుద్ధంలో తను గెలిచిన వృత్తాంతాన్ని, సుగ్రీవ లక్ష్మణులతో క్షేమంగా వున్నా సంగతిని,  చెప్పి, సంతోష పరచి, ఆమె ఏమని ప్రత్యుత్తరం ఇస్తుందో తెలుసుకుని రమ్మన్నాడు.

రామాజ్ణ శిరసావహించిన హనుమంతుడు తక్షణమే రావణుడి ఇంట్లోకి ప్రవేశించి, దుఃఖిస్తున్న సీతాదేవిని చూసి సంతోషంతో హనుమంతుడు రాముడి సందేశాన్ని వినిపించాడు. “రావణాసురుడు చచ్చాడు. లంక మన వశంలో వుంది. నిన్ను చెరనుండి విడిపిస్తానని ప్రతిజ్ఞ చేసి, అది నెరవేరేదాకా నిద్రపోకుండా సముద్రం మీద సేతువు నిర్మించి చేసిన ప్రతిజ్ఞను నేరవేర్చుకున్నాను. నువ్వు రావణుడి ఇంట్లో వున్నానని భయపడవద్దు. లంకా నగరం, సర్వైశ్వర్యం రావణుడి తమ్ముడు, విభీషణుడి స్వాధీనంలో వుంది. కాబట్టి నీ సొంత ఇంట్లో వున్నట్లే భావించు. నిశ్చింతగా వుండు. క్షణకాలంలో నిన్ను చూడడానికి విభీషణుడు వస్తాడు”.

         హనుమంతుడు ఇలా అడగగానే సీతాదేవి “నాకు సంతోషం కలిగించిన వార్త చెప్పిన నీకు అంతే సంతోషం కలిగించే మాట ఏదైనా చెప్పాలని ఎంతో ఆలోచన చేశాను. కాని నాకు ఏమీ తోచలేదు. మాట చెప్పక పోయినా ఏదైనా బహుమానం ఇద్దామని అనుకుని ఈ లోకంలో అలాంటిది ఏదైనా వుందా అని ఆలోచించాను. ఒక్కటి కూడా సమానమైనది కనబడలేదు. లోకంలో వున్న వెండికొండ, బంగారుకొండ, రత్నాలు, వేరువేరుగా కాని, కలిపినా కాని సరిపోవని అనిపించింది. ఇతర లోకాలలో ఏదైనా వున్నదా అని ఆలోచన చేశాను.  అక్కడా కనబడ లేదు. ఇన్ని లోకాల ఆధిపత్యమే అంటే బ్రహ్మత్వమే నీకిచ్చిన చాలునేమో అని ఆలోచించాను. అది కూడా చాలదని అనిపించింది” అన్నది.

         సీతాదేవి మాటలు విన్న హనుమంతుడు ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూనే రాక్షస స్త్రీలను చంపడానికి తనకు అనుమతి ఇవ్వమని ఆమెను అడిగాడు. రాజాజ్ఞానుసారం ఆయన్నే ఆశ్రయించి వున్న ఆయన కార్యాన్ని నెరవేర్చాల్సిన ఈ దాసీజనం మీద కోప్పడవచ్చా అని ప్రశ్నించిదామె. రావణుడి కొలువులో పనిచేస్తున్నందున, ఆయన దాసులు కాబట్టి, వాడి ఆజ్ఞానుసారం వినకపోతే వాడు చంపుతాడేమోనని, భయపడి తనను బెదిరించారు వీరంతా అని, ఇప్పుడు వాడు చచ్చాడు కాబట్టి, వీరు ఇక వాడి దాసులు కానందున తనను బెదిరించరని, కాబట్టి వీరిలో పాపం లేదని తన అభిప్రాయంగా చెప్పింది సీతాదేవి. తానూ తన భర్తను చూడాలనుకుంటున్నానని త్వరగా తీసుకుపొమ్మని అంటుంది.  

         సీతాదేవి కోరికను హనుమంతుడు చెప్పగానే రామచంద్రుడు పది నెలలుగా నానా భాధలు పడుతున్న సీతాదేవిని ఇంకా తాను కష్టపెట్టాల్సి వచ్చింది కదా అని కళ్లల్లో నీరు కార్చాడు. చింతతో పరవశుడై ఏమీ తోచక, నేలచూపులు చూస్తూ, ఇలా అనుకున్నాడు. దీర్ఘకాలం, పగవాడి ఇంట్లో వున్నదాన్ని కాముకుడై రాముడు మరల పరిగ్రహించాడని లోకులు అంటారేమో అని బాధపడ్డాడు. అలాంటప్పుడు, నిర్దోషురాలిని, కఠిన వ్రతాలు చేసేదానిని విడిచి, మహాదోషం ఎలా మెడకు చుట్టుకోవాలని చింతించాడు. అలా ఆలోచిస్తూనే, సమీపంలో వున్న విభీషణుడిని చూసి, “రాక్షస రాజా! భూకన్య అయిన సీతాదేవిని వేగంగా శిరస్నానం చేయించి, గంధాదులు పూసుకొనచేసి, ఆభరణాలు ధరింపచేసి తీసుకుని రా” అంటాడు.

రామచంద్రమూర్తి ఇలా చెప్పగానే ఆయన అన్న మాటలు సీతాదేవికి చెప్పగానే, సీత అలాగే చేస్తానని చెప్పి సిద్ధమైంది. ఆమెకు అంతఃపుర స్త్రీలతో స్నానం చేయించి, ఆభరణాలతో అలంకరించి, మంచి వస్త్రాలను ఇచ్చి, పల్లకి ఎక్కించి, విభీషణుడు రామచంద్రమూర్తి దగ్గరికి తెచ్చాడు. దీర్ఘకాలం రావణుడి ఇంట్లో వున్న సీతాదేవి వచ్చిందని వినగానే రామచంద్రమూర్తి మనస్సులో సంతోషం, దీనత్వం, కోపం ఆవేశించాయి. సీతను వెంటనే దగ్గరికి తీసుకు రమ్మన్నాడు రాముడు. స్నేహితులతో కూడి వున్న తనను సీత చూడవచ్చనీ, తీసుకురమ్మనీ చెప్పాడు. శ్రీరాముడు ఇలా అనగానే విభీషణుడు సందేహిస్తూనే సీతాదేవిని శ్రీరాముడి సమీపానికి తెచ్చాడు. సీతాదేవి సిగ్గుతో విభీషణుడి వెంట వచ్చి, రామచంద్రమూర్తి సౌమ్యమైన ముఖాన్ని చూసి, తన ఉత్తరీయాన్ని ముఖానికి అడ్డంగా వేసుకుని, “ప్రాణేశ్వరా!” అని గట్టిగా ఏడ్చింది.

         తన పార్శ్వంలో శరీరాన్ని వంచి నిలబడ్డ సీతాదేవిని చూసి రామచంద్రమూర్తి తన హృదయంలో బాధను దాచుకుంటూ ఇలా అన్నాడు. “విరోధిని యుద్ధంలో చంపాను. నిన్ను గ్రహించాను. పూర్ణ సామర్థ్యంతో ఏది చేయగలనో అదంతా చేశాను. నేను రావణాసురుడిని చంపుతానని చేసిన ప్రతిజ్ఞ వ్యర్థమైపోకుండా చేసి నేను స్వతంత్రుడను అయ్యాను. నేను నీదగ్గర లేని సమయంలో ఆ చపలచిత్తుడు నిన్ను అపహరించాడు కదా! ఈ దోషం దైవానిదే. నీదికాదు, నాదీ కాదు. అలాంటి దైవ దోషాన్ని పౌరుషంతో ఎదుర్కున్నాను. గెలిచాను. నిన్ను శత్రు బాధ నుండి తప్పించాను”.

         సీతాదేవితో సంభాషణను కొనసాగిస్తూ శ్రీరాముడు ఇంకా ఇలా అంటాడు. “యుద్ధంలో శత్రువులను ఓడించి, చంపి, నిన్ను కలవడం నిన్ను గ్రహించడానికి కాదని తెలుసుకో. కులగౌరవం కాపాడడానికి, అపవాదం తొలగడానికి, కీర్తి నిలపడానికి చేయాల్సినదంతా చేశాను. ఇక నీ విషయానికొస్తే నువ్వు లోకులు సందేహించడానికి అవకాశం ఇచ్చే చరిత్ర కలదానివయ్యావు. రావణుడి ఇంట్లో ఇన్నాళ్లు చెడిపోకుండా వున్నావని లోకమెలా విశ్వసిస్తుంది? ఇలాంటి నువ్వు నా పక్కన నిలబడి నన్ను బాధిస్తున్నావు. అందుకే నీకు అనుమతి ఇస్తున్నాను. నీ ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చు. నీతో నాకింక ఏపనీ లేదు”.

“ఉత్తమ వంశంలో, ఉత్తమ జాతిలో పుట్టినవాడు, కీర్తి ప్రతాపాలు కలవాడు, ఎవరైనా పరుడి ఇంట్లో దీర్ఘకాలం వున్న వయసొచ్చిన ఆడదాన్ని స్నేహభావంతో మళ్లీ భార్యగా స్వీకరిస్తాడా? నువ్వే చెప్పు. దుష్కామ దోషంకల చూపులతో దుష్టుడు నిన్ను చూశాడు. వాడి ఒడిలో నిన్ను వుంచుకోవడం వల్ల నువ్వు భ్రష్టవయ్యావు. ఇలాంటి నిన్ను సద్వంశంలో పుట్టి, సదాచార సంపత్తికలిగి, సదాచార సంపన్నుడనని చెప్పుకునే నేను మళ్లీ ఎలా గ్రహిస్తాను? అలాంటి నీచం, గౌరవహానికరమైన కార్యం రాముడు చేయడు సుమా! రాముడు కామదాసుడు కాదు. రాక్షసుడు ఎత్తుకుని పోయిన తన భార్యను విడిపించుకోలేక పోయాడు రాముడనే అపకీర్తి రాకుండా వుండడానికి శత్రువులను వధించి మళ్లీ భార్యను గ్రహించాడన్న కీర్తి దక్కించుకోవడానికి నేను రావణుడిని చంపి నిన్ను వాడి చెరనుండి విడిపించాను కాని, నీమీద కామమోహంతో కాదు. నువ్విక్కడ నుండి నీ ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చు. నీకు అనుమతి ఇస్తున్నాను”.

భర్త నుండి ప్రీతికరమైన మాటలు విందామని, విని సంతోషిద్దామని ఎదురు చూసిన సీతాదేవి అప్రియమైన మాటలు విని దుఃఖంతో కన్నీళ్లు కార్చింది.

         భర్త మాటలకు జవాబుగా గద్గద స్వరంతో సీతాదేవి ఇలా అన్నది. “భద్రచరిత్రా! శిష్టుడవని చెప్పుకునేవాడా! కులాన, శీలాన నీచుడైనవాడు, కులశీలాల నీచురాలైన దాన్ని అన్నట్లు చెవులు చీల్చే కఠినవాక్యాలు ఎలా అన్నావు? అందునా నన్ను ఉద్దేశించి ఎలా అనగలిగావు? నువ్వు శిష్టుడివైతే నీ నోట ఇలాంటి మాటలు రావు. శిష్టులు నీచులనైనా ఇలాంటి మాటలు అనలేరు. నువ్వు క్షుద్రుడవైతే, ఎంత క్షుద్రుడైనా కులశీలాల శిష్టఅయిన దానిని ఇలా మాట్లాడడు. నువ్వెలాంటి వాడివైనా నీ మాటలు నాకు అన్వయించవు. నువ్వు వాస్తవానికి గొప్పవాడివి. గొప్పవాడిలాగా మాట్లాడకుండా ఇలా మాట్లాడడం నీకు తగదు. నా శీలంలో ఏ దోషం వుందని నువ్వు సందేహించావో అలాంటి దోషం నాలో లేదని నా పాతివ్రత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను”.

         “నన్ను రావణుడు అంటుకున్నాడా? లేదా?అది దోషం కాదా? అని అడుగుతావేమో? వాడు నన్ను తాకింది నిజమే. కాదనను. వాడై వాడే నన్ను తాకాడు కాని నేను వాడిని తాకలేదు కదా? వాడెప్పుడు నన్ను తాకాడు? నేను పరవశనై మూర్ఛపోయిన సమయంలో తాకాడు. నేను దానికి సమ్మతించానా? లేదే! నా అనుమతిమీద వాడు నన్ను తాకలేదు. వాడి దుష్టభావానికి నేనెలా బాధ్యురాలిని? నా భావన దుష్టమైతే నన్ను దండించాలి కాని ఇతరుల భావన దుష్టమైతే నన్ను దండించవచ్చా? నన్ను రక్షించాల్సిన భారం నీమీద వుంది. నువ్వు రక్షించలేకపోయావు. నీ కర్తవ్య లోపంవల్ల నాకీ బాధ కలిగింది. కాబట్టి దోషం నీది కాని నాదికాదు. స్త్రీలు ఏవిషయంలోనూ స్వతంత్రులు కారుకదా?”.

         ఇలా గద్గత స్వరంతో చెప్పి సీతాదేవి ముఖమంతా చిన్నబుచ్చుకుని, మరది లక్ష్మణుడిని చూసి ఇలా అన్నది. “లక్ష్మణా! ఈ పెనుశోకం అనే వ్యాధికి ఔషధం అగ్నిప్రవేశం తప్ప మరొకటి లేదు. నా ఇష్టం వచ్చినట్లు పొమ్మని పారతంత్ర్యంనుండి నన్ను నా భర్త విముక్తిరాలిని చేశాడు. ఇక నేను చేసే పనికి అడ్డం వచ్చే అధికారం ఆయనకు లేదు. నీకైనా నామీద పూర్వ భక్తి వుంటే చితి పేర్చు. ఇలాంటి అపనింద వచ్చిన తరువాత జీవఛ్చవమై ఎందుకు బతకాలి? లక్ష్మణా! పతివ్రతకు ఏగతి యోగ్యమో నేను అగ్నిప్రవేశం చేసి ఆ గతికి పోతాను”. సీతాదేవి ఇలా చెప్పడంతో లక్ష్మణుడు పెద్ద చితిని పేర్చాడు. రామచంద్రమూర్తికి సీతాదేవి ప్రదక్షిణ చేసింది. ఆ తరువాత ఆమె అగ్నిహోత్రుడిని సమీపించి, చేతులు మోడ్చి, అగ్నిని ఉద్దేశించి భక్తితో ఇలా అన్నది.

         “నా హృదయం సత్యంగా, నిత్యంగా రాముడిమీదే నిలిచి, తొలగకుండ వుంటే, నమ్మకంగా నన్ను అగ్నిహోత్రుడు సర్వదేశ, సర్వకాల, సర్వావస్థలందు రక్షించుగాక! సదాచార సంపత్తిగలనా భర్త నన్ను దుష్టురాలని భావించాడు. నేను దుష్టస్త్రీని కాదేని సర్వజనులు చేసే కర్మలకు సాక్షైన సూర్యదేవుడు, ఇతర దేవతలు నమ్మితే అగ్నిదేవుడు కీడు తొలగించి నన్ను రక్షించుగాక! సూర్యచంద్రులు, దేవతలు, వాయువు, రాత్రులు, సంధ్యలు, పగళ్లు, భూమి, తక్కిన దేవతలంతా నా శీలాన్ని తెలిసున్నవారై దాని విషయంలో సందేహం లేనివారైతే, ఈ లోకులందరికీ తెలిసేట్లు ఓ అగ్నిహోత్రుడా! నన్ను రక్షించు”. ఈ విధంగా చెప్పి దేహాభిమానం వదిలి అగ్నికి భక్తితో ప్రదక్షిణ చేసి, పెద్ద మంటలతో ధగ ధగా ఎగురుతున్న అగ్నిలో పవిత్రమైన నడవడికల సీతాదేవి ప్రవేశించింది.

         సీతాదేవి అలా అగ్ని ప్రవేశం చేసిన తరువాత కుబేరుడు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, ముక్కంటి శివుడు, బ్రహ్మ, ఇతర దేవతలంతా విమానాలమీద ఆకాశం వరకు వచ్చి, వాటిని అక్కడే నిలిపి, తమ దీర్ఘమైన చేతులు జోడించి, ఎదురుగా భూమ్మీద నిలబడి వున్న రామచంద్రమూర్తిని చూసి “నువ్వు సీతాదేవి అగ్నిజ్వాలల్లో ప్రవేశిస్తుంటే చూసి చలించకుండా వుండతగునా? ఎందుకు నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు? రామచంద్ర ప్రభూ! నువ్వు సామాన్య మనుషిలాగా సీతాదేవిని వదలవచ్చా? కమలాక్షా! నువ్వామెమీద కరుణచూపు”. ఆయనే శ్రీమన్నారాయణుడని బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై ఆయన్ను నుతించాడు.

         ఇలా బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తిని స్తుతిస్తుంటే అగ్నిహోత్రుడు మనిషి రూపంలో సీతాదేవిని ఒడిలో వుంచుకుని బయటకు వచ్చాడు. అగ్నిలో ప్రవేశించినప్పుడు ఎలా వుందో ఇప్పుడూ ఆమె అలాగే వుంది. ఆమెను రాముడికి అప్పగిస్తూ, “ఈమె నీ సీత. ఈమెలో ఏపాపం ఏమాత్రం లేదు. ఏ పాపం ఎరుగని ఈ సాధ్వీమణిని నువ్వు స్వీకరించు” అన్నాడు.  అగ్నిహోత్రుడి మాటలకు బదులుగా శ్రీరాముడు, “జానకిలో ఏ దోషంలేదని నాకు తెలుసు. రావణుడి అంతఃపురంలో వున్న సీతను పరీక్షించకుండా స్వీకరిస్తే నన్ను బుద్ధిహీనుడని అనేవారు పెద్దలు. ఆ నింద పడలేక జానకి పతివ్రత అని తెలిసికూడా లోకులను నమ్మించడానికి నేను ఉపేక్షించాను. నేను సత్యమే చెప్తున్నాను. ఈ స్త్రీరత్నం తన పాతివ్రత్య మహిమతో తనను తాను కాపాడుకోగలదని, ఈమెను మించి రావణుడు పోలేడని. ఆమెను తాకి బతకలేడని నాకు తెలుసు. పవిత్రమైన ఈ సీత నిష్కల్మష హృదయం కలది అన్నాడు. ఈ విధంగా దేవతలకు చెప్పి సీతను చేరదీసి రాముడు సుఖపడ్డాడు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment