Friday, October 13, 2023

తెలంగాణకు ముందు ..... వెనక! (ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సాధన ప్రస్తానం పునశ్చరణ) : వనం జ్వాలా నరసింహారావు

 తెలంగాణకు ముందు ..... వెనక!

(ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సాధన ప్రస్తానం పునశ్చరణ)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (14-10-2023)

          వేదిక ఏదైనా, అంశం ఎలాంటిదైనా, శ్రోతలు ఎవరైనా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసే ప్రసంగాలన్నీ సాక్ష్యం ఆధారిత, అద్భుతమైన, విలువైన సమాచారంతో వుండేవే కావడం వల్ల, శ్రద్ధపెట్టి వినేవారికి సంబంధిత అంశానికి చెందిన సమస్త విషయం స్పష్టంగా అవగతమౌతుంది. కేసీఆర్ మాట్లాడే సందర్భంలో తన ప్రసంగ భావాన్ని వ్యక్తీకరించే విధానం, అమోఘమైన జ్ఞాపకశక్తి, ఏకకాలంలో బహువిధాల వివరణ ఇచ్చే సామర్థ్యం, తప్పులు దొర్లకుండా ఆశువుగా గణాంకాల వెల్లడి, సృజనాత్మకత, ప్రజ్ఞాపాటవాలతో రంగరించిన సూక్ష్మ హాస్యం, తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషా గ్రంథాల నుండి విషయాలను విస్తృతంగా ప్రస్తావించడమనేది అసాధారణమైన ఆయన వ్యక్తిత్వానికి, భగవంతుడు ఆయనకిచ్చిన వరానికి, ఏళ్లతరబడి ఆయన చేసిన కృషికి ప్రత్యక్ష నిదర్శనం. ఆయన హితులు, సన్నిహితులే కాకుండా విరోధులు సహితం అంగీకరించే వాస్తవం ఇది.

         ఇలా కేసీఆర్ చేసిన అనేకానేక ప్రసంగాలలో, ఇటీవల ఆగస్ట్ 6, 2023 న, రాష్ట్ర శాసనసభలో ‘తెలంగాణ రాష్ట్ర సాధన, తదనంతర ప్రగతి పథం అనే అంశం మీద జరిగిన లఘు చర్చకు సమాధానం ఇచ్చిన సందర్భంగా, సుమారు మూడు గంటలపాటు ఆయన వివరించిన తెలంగాణ రాష్ట్ర సాధన ప్రస్తావన నేపధ్యంలో, బహుశా వర్తమాన, భావితరాలవారికి అవగతమయ్యే చాలా విషయాలున్నాయి. ఆయన చేసిన యావత్ ప్రసంగాన్ని దీక్షగా, శ్రద్ధగా వినగలగాలి. అలాగే ఆయన ప్రసంగ భావాన్ని, పదాల మధ్యన, పంక్తుల మధ్యన అంతర్లీనంగా ఇమిడి వున్న అర్థాన్ని, అవగాహన చేసుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ, క్లుప్తంగా క్రోడీకరిస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో ఎవరి పాత్ర ఏమిటో బోధపడుతుంది. ఆ వర్తమాన సంక్షిప్త చరిత్ర సమాహారమే ఈ వ్యాసం.   

         తెలంగాణ రాష్ట్ర సాధన ఒకరోజుతో వచ్చింది కాని, రాత్రికిరాత్రే జరిగింది కాని, లేదా, ఎవరో దయతో ఇచ్చిన బహుమతి కాని కానేకాదు. 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేకమంది తెలంగాణ వాదులు పాల్గొనడం వల్ల మాత్రమే అది సాధ్యమయింది. ఈ సుదీర్ఘ పోరాటానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించుకుంటే నిర్ద్వందంగా వచ్చే సమాదానం, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ప్రధమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఇది తెలియని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే తమ పార్టీ చలువ వల్ల రాష్ట్రం వచ్చిందని అంటుంటారు. ఉన్న (నాటి) తెలంగాణను ఊడగొట్టింది, ఆంధ్రలో కలిపింది నెహ్రూనే. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆనాడు కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు లాంటివారు వ్యతిరేకించారు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ.

         67 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాకపోవడంతో ఎన్నో రకాలుగా ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడి పోయింది ఈ ప్రాంతం. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని మేథావులు, తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఇతరులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూర్గుల రామకృష్ణారావు ధిల్లీ విమానంలో పోయేముందర, తెలంగాణ తప్ప మరేదీ అంగీకారం కాదన్నారు. తిరిగి వచ్చిన తరువాత విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, ‘నెహ్రూ సాబ్ చెప్పిన తరువాత తానేమీ మాట్లాడలేకపోయాననీ, ‘మజ్బూర్లో’ ఒప్పుకున్నానని అన్నాడు. ఇదంతా చరిత్ర. తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పే చరిత్ర.

         ఇక ఆ తరువాత ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాంటి అనేక ఒప్పందాలు. అన్నీ కాలరాసినవే. ఒక్కొక్క హామీ నెరవేర్చకుండా ఉల్లంఘించుకుంటూ పోతుంటే కిమ్మనకుండా ‘ప్రేక్షక పాత్ర’ వహించింది కూడా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులే. 1956 లో విలీనాన్ని వ్యతిరేకించిన అనేకమందిని జైళ్లలో పెట్టారు. హైదరాబాద్ సిటీకాలేజీ దగ్గర పోలీసు కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు పట్టపగలే మరణించారు. ఇవేవీ ఖాతర్ చేయకుండా విలీనం జరిగిపోయింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో, విద్యార్థుల నాయకత్వంలో, ఉద్యోగుల నాయకత్వంలో, ఉవ్వెత్తున ఎగిసిపడిన 1969 నాటి మహోద్యమం కర్కశంగా అణచివేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. నాడు, తెలంగాణలోని కళాశాలలు, హాస్టళ్లు, అన్నీ జైళ్లుగా మారిపోయాయి. ఆ ఉద్యమం సందర్భంగా ఎంతమంది అమాయకులను కాల్చి చంపారో, ఎంతమందిని రాచిరంపాన పెట్టారో, ఎన్ని బాధలు పెట్టారో, తెలంగాణ ఎంత యాతన అనుభవించిందో, ఎన్ని వేలమంది విద్యార్థులను, యువకులను కోల్పోయిందో? ఆ ఘన చరిత్ర ఆసాంతం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే పోతుంది.

         1971 లోక్ సభ ఎన్నికలలో ‘ప్రజాస్వామ్య తెలంగాణ ప్రాంత ఓటర్లు 14 మందికి 11 మందిని గెలిపించి, తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. యావత్తు తెలంగాణ గుండెను చీల్చి, ‘మా తెలంగాణ మాకు కావాలని’ నినదిస్తే, నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి, నిర్ద్వందంగా నిరాకరించి, ‘తెలంగాణ లేదు అన్నారు. ముల్కి నిబంధనలు కొల్లగొట్టబడ్డాయి, ఉద్యోగాలు మొత్తం మాయం అయ్యాయి, నీటిపారుదల ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి పెండింగ్ లో పెట్టారు. తెలంగాణ నిధులను దారి మళ్లించారు. అప్పుడు కూడా మూగ, మౌన ప్రేక్షక పాత్ర వహించింది భారత జాతీయ కాంగెస్ పార్టీ తెలంగాణ నాయకులే తప్ప మరెవరో కాదు. 41 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరచిన వ్యవహారాన్ని పునశ్చరణ చేసుకుని, యావత్ తెలంగాణ సమాజానికి జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఎంతైనా వున్నది.

         తెలుగుదేశం పార్టీ వారు 17 సంవత్సరాలు చేసిన నిర్వాకంలో పరిస్థితులు ఘోరంగా దిగజారిపోయాయి. ఒకానొక సందర్భంలో, ‘తెలంగాణ’ అనే పదం కూడా సభలో అనడానికి వీలు లేదని నాటి సభాపతి రూలింగ్ ఇచ్చే  స్థాయికి దిగజారితే, ప్రతిపక్షంలో వుండి కూడా నోర్లు పెగలకుండా మౌనంగా, ప్రేక్షక పాత్ర వహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇది జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబునాయుడు సంస్కరణల ముసుగులో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి, ఆ విధమైన పెరుగుదల 15% చొప్పున మూడేళ్లు వుంటుందని చెప్పితే, ఉపసభాపతిగా వున్న కేసీఆర్ రాసిన నిరసన లేఖ బహిరంగంగా అన్ని పత్రికలలో ప్రచురించారు. చివరకు కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆగస్ట్ 2000 లో హైదరాబాద్ బషీర్ బాగ్ లో నిరసన చేస్తున్న రైతుల మీద పోలీసు కాల్పులు జరిపి ముగ్గురిని దారుణంగా చంపారు. ఆ సంఘటన తరువాత, ప్రజలకు నిరసన తెలియచేసే హక్కు కూడా లేకుండా పోయిందని, కేసీఆర్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.

         ఇక సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదని భావించిన కేసీఆర్, ఐదారు నెలలు కొందరు సన్నిహిత మిత్రులను కలిసి, వారి అభిప్రాయం తెలుసుకుని, సుదీర్ఘంగా చర్చలు జరిపి, మేధోమధనం చేసి, తెలంగాణ ప్రజల్లో ఉద్యమం పట్ల విశ్వాసం కలిగించే విధాన రూపకల్పన చేసి, ఉద్యమ పంథా పూర్తి స్థాయిలో నిర్ణయించుకుని, చివరకు ఏప్రిల్ 27, 2001, కొండా లక్ష్మణ్ బాపూజీ ‘ఆశ్రయం కలిగించిన ఇంటి ప్రాంగణంలో జండా ఎగురవేసి, అక్కడినుండి ‘జై తెలంగాణ ప్రస్తానం ప్రారంభించడం జరిగిన చరిత్ర. తెలంగాణ సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తుంటే, అనేక రకాల ప్రలోభాలు పెట్టడం, తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీని చీల్చే ప్రయత్నాలు చేయడం, అనేక రకాల హింసకు గురి చేయడం, ఉద్యమాన్ని అవహేళన చేయడం జరిగినప్పటికీ, వెనుదీయకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని ఉద్యమం కొనసాగిస్తే, ఆ ఒత్తిడికి తట్టుకోలేక రాష్ట్రం ఏర్పాటు చేయడం కూడా చరిత్రే. అయితే ఆ క్రమంలో చోటు చేసుకున్న కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

         నాటి టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) 2004 సంవత్సరానికల్లా అద్భుతంగా పురోగమిస్తున్న సమయానికల్లా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా వుండి పదేళ్లు అవుతున్నది. వారిలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకుపోవాలని నిర్ణయించి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సమ్మతిస్తుందని తప్పుగా భావించి, టీఆర్ఎస్ 2004 ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అలాగే ‘కనీస ఉమ్మడి కార్యక్రమం లో, తదనంతరం రాష్ట్రపతి ప్రసంగంలో కూడా రాష్ట్ర ఏర్పాటు అంశం చేర్చడం జరిగింది. జరిగింది శూన్యం. మళ్లీ పాత కథే మొదలైంది.

కాంగ్రెస్ పార్టీ నాయకుల అవహేళనలు చరిత్ర వున్నన్ని రోజులు వుండిపోతాయి. ‘రెండో రాష్ట్రాల పునర్విభజన కమిటీ వేయాలని ఆంధ్రా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతుంటే తెలంగాణ కాంగ్రెస్ వారు దానికి తబలా కొట్టారు. తెలంగాణకు పోవాలంటే ‘వీసా తీసుకోవాలి అని ‘నర్మగర్భంగా నంద్యాలలో మాట్లాడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘తెలంగాణ ఏర్పాటు ప్రశ్నే లేదు అని చెప్పినప్పుడు ఘనత వహించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం దాల్చడం వాస్తవం. కేంద్రమంత్రి రేణుకా చౌదరి, తెలంగాణ ఇవ్వడమంటే ‘ఇన్స్టంట్ కాఫీ లేదా ‘దోశ చేసినంత సులభం కాదని అవమానంగా మాట్లాడినప్పుడు, తాను తెలంగాణ ఏర్పాటుకు ‘అడ్డం కాదు, నిలువు కాదు అని వైఎస్ఆర్ ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులది మౌన ప్రేక్షక పాత్రే!!

ఇక ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విషయంలో చేసిన అవమానాలు అన్నీ, ఇన్నీ కావు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే అంధకారమవుతుందని జోస్యం చెప్పినప్పుడు, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఎవరేం చేసుకుంటారో చేసుకోమని శాసనసభలో మాట్లాడినప్పుడు, సభలో వున్న ఒక్క తెలంగాణ ఎమ్మెల్యే కాని, మంత్రి కాని, అలా ఎందుకు అంటారని ప్రశ్నించే సాహసం చేయలేదు. బెల్లం కొట్టిన రాళ్లలాగా కూర్చున్నారు. అంతకు ముందు ‘ఒక్క వోటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన బీజేపీ, దాని సారధ్యంలోని ఎన్డీయే, వాజపేయి ప్రధానమంత్రి అయిన తరువాత, హైదరాబాద్ వచ్చిన నాటి హోం మినిస్టర్ అద్వానీ ‘హైదరాబాద్ తెలంగాణలో వుండగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అని ఉపన్యాసం ఇచ్చి వెళ్లారు. ఆ మాటలు తెలంగాణను కించపరిచాయి. అలా, అలా తెలంగాణ సర్వస్వం కోల్పోతూనే వచ్చింది.

తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు, విద్యుత్ కోతలు, నగరాలకు వలసలు, ఇలా ఎన్నో రకాల దయనీయ పరిస్థితి కొనసాగుతుంటే, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంటే, రోశయ్య ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, పుండు మీద కారం చల్లినట్లు 14 (F) తీసుకొచ్చారు. తక్షణమే కేసీఆర్ సిద్దిపేటలో 3-4 లక్షల మందితో ఉద్యోగ గర్జన సభ నిర్వహించి, అక్కడినుండే కార్యాచరణ ప్రకటించారాయన. మామూలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేటట్లు కనిపించడం లేదని, మంచో, చెడో తేల్చుకోవాలని, కేసీఆర్ శవయాత్రో, లేదా, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నిర్ణయించి, కేసీఆర్ నిరాహార దీక్షకు దిగారు. దీక్షకు ఉపక్రమించిన కేసీఆర్ ను అరెస్ట్ చేసి, ఖమ్మం జైల్లో నిర్బంధించి, తరువాత హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

కేసీఆర్ దీక్షలో వుండి చనిపోతే అప్రతిష్ట పాలవుతామని, అట్టుడికిన లోక్ సభ, 38 పార్టీలు గోల చేస్తే, ఆ దాడికి తట్టుకోలేక, చిదంబరంతో ప్రకటన చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్తున్నామని ప్రకటన చేయడం, ఆంధ్రా లాబీలు ఒత్తిడి తేగానే వెనక్కు తగ్గడం జరిగింది. దరిమిలా, వందల మంది విద్యార్థులు ఆవేశపడి చనిపోయారు. ఆ బాధలో ఉద్యమం ముందుకు సాగింది. విమాన ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడం, ఆయన కుమారుడు జగనమోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టడం, ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఉపఎన్నికలలో విజయాలు సాధించడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆంధ్రా ప్రాంతంలో 2014 ఎన్నికలలో ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశాలు లేవని భావించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే, ఇక్కడన్నా కనీసం 10 లోక్ సభ స్థానాలు రాకపోతాయా అనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది. అలా ఆ ఒత్తిడి వల్ల రాష్ట్రం ఇచ్చారు తప్ప, తెలంగాణ మీద ప్రేమతో ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల రాలేదు. పోరాట, ఉద్యమ ఫలితంగా వచ్చిందే తెలంగాణ రాష్ట్రం. ఇది చరిత్ర. ఇది వాస్తవం.

ఆ విధంగా జూన్ 2, 2014 న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని అభివృద్ధిని అచిరకాలంలోనే సాధించింది. ‘తెలంగాణ నమూనా దేశానికే ఆదర్శమైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రాల, దేశాల అభివృద్ధిని అంచనావేసే గీటురాళ్లు వుంటాయి. వాటి ప్రకారం, తెలంగాణ తలసరి ఆదాయం రు 3,12,000 వుంటే, ఒకేసారి మనతో పాటే ఏర్పాటైన పొరుగు రాష్ట్రానిది రు 2,19,000 మాత్రమే. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక లాంటి తెలంగాణకన్నా పెద్ద రాష్ట్రాలను తలదన్ని వాటి తలసరి ఆదాయంకంటే ఎక్కువ మొత్తంలో వున్న రాష్ట్రం తెలంగాణ. అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్ర ఆవిర్భావం నాడున్న రు 5 లక్షల నుండి రు 13 లక్షలకు పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు, స్థాపిత విద్యుత్ సామర్ధ్యం 18453 మేగావాట్స్, పీక్ డిమాండ్ 15497 మేగావాట్స్ వున్నాయి. అలాగే వైద్య, విద్యా రంగాల అభివృద్ధిలో, రక్షిత నీటి సరఫరా విషయంలో, మాతా శిశు మరణాల రేటు తగ్గడంలో అనేక ఆవిష్కరణలు, అన్ని రంగాల సామూహిక, సమ్మిళిత అభివృద్ధి జరిగింది. ఉద్యమ నాయకుడే రాష్ట్ర రధ సారధి కావడం కూడా దీనికి కారణం.  

కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి జరిగినప్పుడు 67 ఏళ్ల క్రితమే తెలంగాణ ఏర్పాటు జరిగి వుంటే ఇంకెంత అభివృద్ధి జరిగి ఉండేదో? అలా జరగకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీనే. విమర్శలు చేసేవారు ఇది గమనిస్తే మంచిదేమో! అలాగే జరిగిన అభివృద్ధిని గుర్తిస్తే మంచిదేమో!!

No comments:

Post a Comment