Sunday, January 1, 2012

బొత్స కల 2012 లో ఫలించేనా?: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?-4
సూర్య దినపత్రిక (01-01-2012)
వనం జ్వాలా నరసింహారావు

కేంద్రంలో పరిస్థితి అలా వుంటే, ఇక రాష్ట్రంలో మరో విధంగా వుంది. కేంద్రంలో అధికారంలో వున్నది, విభిన్న విధానాలను పాటించే "పలు భాగస్వామ్య రాజకీయ పక్షాల సంకీర్ణ ప్రభుత్వం" కాగా, రాష్ట్రంలో వున్నది విరుద్ధ భావాల-వ్యక్తిగత ఎజెండాల-ఎత్తులకు పైఎత్తులు వేయగల సామర్థ్యం గల "ఏక పార్టీకి (కాంగ్రెస్) చెందిన సంకీర్ణ ప్రభుత్వం". అక్కడ అధికార బాధ్యతలు వహించేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే ఐనా, అధికారం చెలాయించేది యుపిఎ చైర్ పర్సన్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధి. ఇక్కడ అధికారం పరోక్షంగా నడిపించేది, సోనియా నాయకత్వంలోని అధిష్ఠానం. ఈ నేపధ్యంలో, ఎన్నికల వాగ్దానాలైనా, కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన బడిన అంశమైనా, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనైనా, అమలైనా, పాలనా యంత్రాంగంపై పట్టు సాధించడమైనా, అవినీతిని అరికట్టడమైనా-ప్రోత్సహించడమైనా, పదవుల పందేరమైనా, పార్టీని-పభుత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమైనా, "భావ సారూప్యం-పరస్పర విరోధ భావం" ప్రాతిపదికగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులపైనే ఆధార పడివుంటుంది. అదే జరిగింది 2011 లో. మొదటి దఫా రాజశేఖర రెడ్డి హయాంలో, "పునరంకిత సభలు" జరిగేవి. రెండో మారు ఆయన గెలిచి, ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలలోపే విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆ మరుసటి ఏడాది పునరంకిత సభ జరగనేలేదనాలి. ఇక ఆయన మరణంతోపునరంకిత సభ దేవుడెరుగు! రాజశేఖర రెడ్డి రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కూడా ఆయనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటూన్న వారికి సహితం గుర్తుకు రాలేదు. అంతెందుకు...ఆయన వారసులమని చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కూడా గుర్తులేదు. ప్రభుత్వం పునరంకిత సభలు జరపక పోయినా "రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని" పడగొట్టడం ఇష్ఠంలేని వారన్నా కనీసం మరో విధంగా నన్నా పునరంకితమై తే బాగుండేదేమో!

కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరు నెలల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ నెలలో ప్రకటించారు. ఏనాడైతే వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని, దివంగత ముఖ్య మంత్రి వారసుడుగా గుర్తించడానికి, అధిష్టానం విముఖత వ్యక్త పరిచిందో, అప్పుడే, ఆయన నాయకత్వంలో చేరదల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య నిర్ధారణ అయింది. ఒకానొక సందర్భంలో శాసన సభలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీకి చేరే పరిస్థితి కలిగించింది. ఈ నేపధ్యంలో, జగన్ ఓదార్పు యాత్ర, దానికి కాంగ్రెస్-కాంగ్రేసేతర రాజకీయ పక్షాల వ్యతిరేకత, ప్రజల అఖండ అభిమానం, జగన్ పై కాంగ్రెస్ అధిష్టానం మరింత చిన్న చూపు, చివరకు ఆయన పార్టీకి-లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి సోనియా గాంధీపై ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వంపై అవిశ్వాసం దిశగా మరి కొంత అడుగులు పడ్డాయి. ఇంతలో చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. పోయిందనుకున్న బలం తిరిగొచ్చిందనుకున్నారు కాంగ్రెస్ వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, కడప ఎన్నికలలో గెలుపు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంపై "అవిశ్వాసం" వేగవంతం చేయడానికి బలం చేకూరింది. జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి ఎప్పుడైతో గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమై నారని కాంగ్రెస్ అధిష్టానం భావించిందో, ఆ మరు నిమిషంలోనే, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా, కిరణ్ సర్కారును రక్షించేందుకు చిరంజీవిని అక్కున చేర్చుకుంది. ప్రజారాజ్యం పార్టీ అనే "కుంపటి" ని వీలైనంత తొందరలో నెత్తి మీద నుంచి దించుకోవాలన్న ఆలోచనలో వున్న చిరంజీవికి కాంగ్రెస్ ఆలోచన కలిసొచ్చింది. కొంతలో కొంత జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకో గలిగామన్న భరోసా కలిగింది కిరణ్ సర్కారుకు. ఇంతలో, తొంభై మందికి పైగా శాసన సభ్యుల సంఖ్యా బలం కలిగిన తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిందేనని డిమాండు చేశారు జగన్. ఇంత జరిగినా అవిశ్వాసం అప్పటికి తుస్సుమనక తప్పలేదు.

బాబా రాందేవ్ అన్నంత పనీ చేశాడు. ఆమరణ నిరాహార దీక్షకు దిగనే దిగాడు. విరమించుకోవడం కూడా ఒక ప్రహసనంలా జరిగిపోయింది. మద్దతిచ్చిన వారున్నారొక వైపు. మండి పడ్డ వారూ తక్కువేం కాదు. సామ-దాన-భేద-దండోపాయాలను ప్రయోగించింది ప్రభుత్వం వ్యూహాత్మకంగా. అవినీతికి, నల్లధనానికీ వ్యతిరేకంగా జూన్ నాలుగు నుంచి నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెడతానన్న రాందేవ్ బాబా, తన లక్ష కిలోమీటర్ల "భారత స్వాభిమాన యాత్ర" ను ఉజ్జయినిలో ముగించుకుని, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి అక్కడి విమానాశ్రయం చేరుకోవడానికి ముందే, ఆయన అనుగ్రహం కోసమా అన్న చందాన, ఆయనతో చర్చించే నెపంతో, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్‌ కుమార్ బన్సాల్, పర్యాటక శాఖ మంత్రి సుబోధ్‌ కాంత్ సహాయ్ క్యాబినెట్ సెక్రటరీ కే ఎం చంద్రశేఖర్ వంటి అతిరథ-మహారథులు అక్కడకు వెళ్లడం కంటె విడ్డూరం ఇంకో టి లేదే మో! అంత కంటే మరీ హాస్యాస్పదం, ఆయనతో చర్చలు జరిపిన అనంతరం కపిల్ సిబాల్ ఆయనగారికి ఇచ్చిన "టెస్టిమోనియల్". "రాందేవ్ దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. అవి చాలా ముఖ్యమైన జాతీయ అంశాలు. వాటి పరిధి చాలా విస్తృతం. వాటికి మేం ప్రాథమికంగా స్పందించాం" అన్నది దాని సారాంశం. తనను తాను సాక్షాత్తు దైవాంశ సంభూతుడుగా, ఒక దేవ దూతగా భావిస్తున్న బాబా రాందేవ్ మరో టెస్టిమోనియల్ ను మీడియాకు చూపించారు. నిరాహార దీక్ష విరమించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారని, ఐనా, దేశాన్ని రక్షించడం కోసం నిరశన ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చానని, విదేశాల్లో ఉన్న మొత్తం నల్లధనాన్ని స్వదేశానికి తిరిగి తీసుకు రాగలననే పూర్తి ఆత్మ విశ్వాసం తనకున్న దని దాని సారాంశం. అంతా అందరనుకున్నట్లుగానే "మధ్యంతరం" అయింది. బాబా రామ్‌ దేవ్ జూన్ నాలుగో తేదే శనివారం తెల్లవారు జామున చేపట్టిన ఆమరణ దీక్ష ఒక రోజన్నా గడవక ముందే భగ్నమైంది. ఆయనను అరెస్టు చేశారా? కిడ్నాప్ చేశారా? చేయించింది ప్రభుత్వమా? కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? అన్నవి ప్రశ్నార్థకంగా వుండి పోయాయి. వ్రతం చెడింది...ఫలితం దక్కలేదు. సర్కారు అనుకున్న ది సాధించింది...రాందేవ్ బాబా కూడా అన్న పని చేశాడు. అవినీతి మాత్రం తనను ఎవరూ, ఏమీ చేయలేరని అపహాస్యం చేస్తూ, మందహాసం చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, భారత వైద్య మండలి సంయుక్తంగా ఏర్పాటు చేసిన (జులై నెలలో) రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రధానోపన్యాసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా శిశు మరణాల సంఖ్య ఏడాదికి 74 వేలకు పైగా వున్నాయని పేర్కొనడం జరిగింది. గిరిజనులలో-షెడ్యూల్డ్ కులాల వారిలో ఇతరుల కంటే శిశు మరణాల సంఖ్య చాలా అధికమని, వీటిని తగ్గించాలంటే వైద్య విద్య కళాశాలలు ముఖ్య భూమిక పోషించాలని రమేష్ సూచించారు. మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న డాక్టర్లు, కమ్యూనిటీ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం కుదుర్చుకుని పనిచేస్తే, శిశు మరణాల సంఖ్య తగ్గే అవకాశం వుందని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలోని ఆసుపత్రులన్నీ విధిగా గర్భిణీ స్త్రీల వివరాలను నమోదు చేసే కార్యక్రమం దిశగా "మాతా-శిశు ఆరోగ్య కార్డులు" ప్రవేశ పెట్టినట్లు కూడా ఆయన చెప్పారు. ఇదిలా వుంటే, యావత్ రాష్ట్రానికి, ఒకే ఒక్క "చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి" గా వున్న, హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో, సగటున ప్రతి రోజు, పది-పదిహేను శిశు మరణాలు సంభవిస్తున్నట్లు కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ సందర్భంగా ప్రకటించి, సంచలనం కలిగించారు. గ్రామీణ స్థాయి నుంచి, రాజధాని స్థాయి వరకూ, నిరంతరం మాతా శిశు సంరక్షణకు, ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే జరిగే దారుణం ఇలానే వుంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, చాలాకాలం నిర్వహించబడిన నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల వల్ల, గ్రామీణ ప్రాంతాలలో, సుమారు పదమూడు లక్షల మందికి పైగా గర్బ్జిణీ స్త్రీలు ప్రసవానికి ముందు, ప్రసవం అనంతరం సరైన సమయంలో సరైన వైద్య పరీక్షలు చేయించుకుని, సరైన చికిత్స పొందారు. దాని మూలంగా కొంతలో కొంతైనా శిశు మరణాలు సంభవించకుండా నిరోధించే వీలైంది. ఇలాంటివే, ప్రభుత్వం చేపట్టి కొనసాగించితే బాగుంటుందేమో! తెలంగాణ ప్రాంతానికే తలమానికమైన నిలోఫర్ దవాఖానలో సామూహిక హత్యాకాండను పోలిన శిశుమరణాలకు బాధ్యులెవరని పరిశోధన చేసి, సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టి, వాటిని అరికట్ట లేకపోయినా కనీసం తగ్గించే ప్రయత్నం చేసినట్లయితే బాగుండేదేమో!  

బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం కావడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తన జీవితాశయం రాష్ట్ర ముఖ్య మంత్రి కావడం అని కుండ బద్దలు కొట్టి చెప్పుతున్న బొత్స సత్యనారాయణ, గతంలో ఏ పిసిసి అధ్యక్షుడు చేయడానికి సాహసించని విధంగా, సమాంతరంగా "మంత్రి వర్గ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు" నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను, కాంగ్రెస్ పార్టీ పథకాలుగా ప్రచారం చేయడంలోనే పార్టీకి లాభముంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడుగా తాను బలపడడం, ముఖ్యమంత్రి కావాలన్న ఆయన జీవితాశయం నెరవేర్చుకోవడం కొరకు చేయాల్సినంతా చేయసాగారు. "రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు-చెవులు కాంగ్రెస్ పార్టీనే సుమా!" అని పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరు క్షణంలోనే, బొత్స సత్యనారాయణ, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటిది చేయడం వెనుక, ఎటువంటి ని గూడార్థం ఇమిడుందని రాజకీయ విశ్లేషకులు శోధించారు. బహిరంగంగా మాత్రం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చెట్టా-పట్టాలేసుకుని, కలిసి-మెలిసి పని చేసుకుంటూ, పార్టీని "మరింత బలోపేతం చేస్తాను" అని బొత్సా స్పష్టం చేయడం ముఖ్య మంత్రికి కొంత రిలీఫ్ గానే భావించాలి! బొత్స మార్కు వ్యాఖ్య మరొక టి కూడా ఆశ్చర్యకరంగానే వుందనాలి. తాను ఎవరికీ చీఫ్ కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్య కర్తలకు, ఢిల్లీలో అధిష్టానానికి సంధాన కర్తగా మాత్రమే వ్యవహరిస్తానని శలవిచ్చారాయన. పనిలో పనిగా, తననింతవాడిని చేసిన "దైవం" సోనియా గాంధీకి, "పూజారి" గులాం నబీ ఆజాద్‌ కు, ఈ ఇరువురి మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి తనకు ఆ పదవి కట్టబెట్టడంలో తోడ్పడిన జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులందరి కీ, ధన్యవాదాలు తెలియ చేసుకున్నారు. ఆయన కల 2012 నన్నా ఫలించేనా?
          
ఇలా మననం చేసుకుంటూ పోతుంటే...ఎన్నో...ఎన్నెన్నో..ఇంకా...ఇంకా చెప్పుకోవచ్చు.        

No comments:

Post a Comment