Wednesday, January 11, 2012

సిపిఎం ఆవిర్భావ నేపధ్యం: వనం జ్వాలా నరసింహారావు


జనవరి 11, 12 న హైదరాబాద్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో


సూర్య దినపత్రిక (12-01-2012)


వనం జ్వాలా నరసింహారావు

సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధ, గురువారాల్లో (జనవరి 3, 4 తేదీల్లో) జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పార్టీ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరగనున్న నేపధ్యంలో కీలకమైన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ కూడా వస్తున్నారు. పార్టీ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టనున్న రాజకీయ తీర్మానం ముసాయిదా ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుంది. ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర మహాసభల్లో పార్టీకి నూతన కార్యదర్శిని ఎన్నుకోవచ్చన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ఖమ్మం పట్టణంలో ప్రముఖ ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవితచరిత్ర-"తీపి గుర్తులు-చేదు అనుభవాలు" లో పేర్కొన్న పార్టీ ఉమ్మడి మహాసభలు, పార్టీలో చీలిక, సిపిఎం ఆవిర్భావం లాంటి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను గురించి, ఆ పుస్తకాన్ని గ్రంధస్థం చేసిన రచయితగా పాఠకులతో పంచుకునే ప్రయత్నం ఇది. 

ఏబై మూడు సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్ట్ (ఉమ్మడి) పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ మహాసభ, 1958 డిసెంబర్ 30, జనవరి 1-2 తేదీలలో ఖమ్మం పట్టణం వెంకట లక్ష్మీ టాకీసులో జరిగింది. 212 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత ఉన్నవ లక్ష్మీ నారాయణ, జోవియట్ క్యూరి, చక్రయ్య చెట్టియార్ల మృతికి సంతాపం ప్రకటించి, తెలంగాణ మృత వీరులకు జోహార్లు అర్పించారు. పార్టీ అఖిల భారత కార్యదర్శి అజయ్ కుమార్ ఘోష్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యవాదులందరితో కూడిన విశాల ఐక్య సంఘటన ఏర్పరచాలన్నారు. చండ్ర రాజేశ్వరరావు నివేదిక ప్రవేశ పెట్టారు. సోషలిస్టు నమూనా సమాజం గురించిన ఆశలు నెరవేరడం లేదనీ, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందనీ అన్నారు. 1955 లో జరిగిన ఎన్నికలలో పార్టీ తిన్న దెబ్బ నుండి తిరిగి కోలుకుంటున్నదని చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా తంత్ర శక్తులతో కూడిన ఐక్య సంఘటన నిర్మించాలనీ, కుల-మత తత్వాలను ప్రతిఘటించాలనీ పిలుపునిచ్చారు. 7 గురు కార్యదర్శులతో సహా 21 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావును, కార్యదర్శులుగా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, మోటూరు హనుమంతరావు, బద్దం ఎల్లారెడ్డి, వై.వి. కృష్ణా రావు, తమ్మారెడ్డి సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ప్రదేశ్ కమ్యూనిస్ట్ సమితి కార్యవర్గంలో కె. ఎల్. నర్సింహం, మగ్దుం మొహియుద్దీన్, గుంటూరు బాపనయ్య, చలసాని వాసుదేవరావు, నీలం రాజశేఖరరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సంకు అప్పారావు, వై. విజయకుమార్, కొల్లా వెంకయ్య, కడియాల గోపాలరావు, నెక్కలపూడి రామారావు, గోళ్ల రాధాకృష్ణమూర్తి, జి. యల్లమందారెడ్డి, నల్లమల గిరిప్రసాద్ లను తీసుకున్నారు. అజయ్ ఘోష్ తన ప్రసంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు సాధించిన మహత్తర పురోభివృద్ధిని సమాజ పరం చేయడానికి మార్క్సిజం ఒక్కటే మార్గం అన్నారు. నాలుగవ తేదీ రాత్రి పెద్ద బహిరంగ సభ జరిగింది. మద్దుకూరి అధ్యక్షత వహించారు. సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు మాట్లాడారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం -ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, భారత దేశంలో కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు ఆకర్షించాయి. ఎం.ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్‌కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, డిసెంబర్ 1925లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఫిబ్రవరి 1948లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, రణదివేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది. మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ ప్రతిఘటన, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది. ఆ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం దరిమిలా అజయకుమార్ ఘోష్‌ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించారు.

అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక్‌సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించింది జోషి నాయకత్వంలోని మరో వర్గం. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపీఐ సెక్రెటేరియట్ లోని సభ్యుల్లో రణదివే-జోషిలు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తుల ప్రతినిధి"గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్(అంతకు ముందు లేని పదవి)గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్‌గా నియమించింది.

సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా-భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని "ఇంతకు పూర్వం ఖచ్చితంగా లేని సరిహద్దు విషయంలో ఏర్పడ్డ వివాదంతో ఏర్పడ్డ సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారి తీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్-చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై చీలిక అనివార్యమయింది. సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964లో కలకత్తాలో ఏడవ  కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో. డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సుందరయ్య నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభిమానిగా, ఆచరణీయుడుగా వుండిపోయారు. ఆ నాడు (1964) ఖమ్మం జిల్లాలో గిరి ప్రసాద్ నాయకత్వంలో సిపిఐతో వెళ్లిన వారు చాలా కొద్దిమంది మాత్రమే!

నక్సల్‍బరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి కొంతమంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. ఖమ్మం జిల్లాలో సహితం ఉత్సాహవంతులైన కొందరు యువకులు అటువైపు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో బత్తుల వెంకటేశ్వరరావు లాంటి వారు తొలినాళ్లలోనే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. రాష్ట్రస్థాయిలో నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖులలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి, ముఖ్యులు. రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో

No comments:

Post a Comment