Saturday, January 7, 2012

సమన్వయమా, సమాంతరమా: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (8-01-2012)
వనం జ్వాలా నరసింహారావు

సమన్వయ కమిటీ సమన్వయ సాధన కోసమేనా?; ప్రథమ సమావేశంలో అనూహ్య పరిణామాలు; అసంతృప్తివాదుల సమర శంఖం; పరస్పర ఆరోపణలు, విమర్శలు; విభేదాలపై కథనాలు; సమర్ధ పాలనకు సహకరిస్తారా? (ఎడిటర్)


పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో తడబడుతూ అడుగులు వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అచిర కాలంలోనే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్రమ పద్ధతిలో ఆకళింపు చేసుకుని, అందరినీ కూడదీసుకుని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న నేపధ్యంలో, కారణాలేవైనప్పటికీ, పార్టీకి-ప్రభుత్వానికీ మధ్య అవగాహనుండాలన్న నెపంతో, ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఆ కమిటీలో సమతుల్యం వుండాలన్న భావనతో ముఖ్యమంత్రిని-ఉపముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని-మాజీ పీసీసీ అధ్యక్షుడిని, కావూరిని-చిరంజీవిని-షబ్బీర్ అలీని ఒక ఆలోచన ప్రకారం సభ్యులుగా ప్రకటించింది అధిష్టానం. కిరణ్ తోక కత్తిరించడానికే ఈ కమిటీ ఏర్పాటైందని కొందరు భావిస్తే, కానేకాదు... బొత్స దూకుడు కట్టడి చేయడానికే అని మరికొందరన్నారు. అదేం కాదు, చిరంజీవిని బుజ్జగించడానికే అని అన్నవారు కూడా వున్నారు. మాజీ పీసీసీ ఛీఫ్‌ను, మహమ్మద్ అలీ షబ్బీర్‌ను, కావూరి సాంబశివరావును ఎందుకు నియమించారంటే ఇదమిద్ధంగా సమాధానం లేదెవరిదగ్గరనుంచి కూడా. ఏదేమైనా, ఏదో ఒక పదవిని అప్ప చెప్పడం, అదెంత పెద్దదైనా-చిన్నదైనా, ఆ పదవి లభించినవారెంత పెద్దవారైనా-చిన్నవారైనా, మురిసిముక్కలవడం కాంగ్రెస్ పార్టీలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడూ అదే జరిగింది. సమన్వయ కమిటీలో పేర్లున్న వారిలో కొందరిని ఈ వ్యాస రచయిత అభినందించినప్పుడు, వారి ఆనందానికి హద్దులు లేని విధంగా వారి దగ్గర్నుంచి స్పందన లభించిందంటే, ఆ పదవి ఎంతముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా, సమన్వయ కమిటీ ప్రధమ సమావేశానికి కమిటీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పూనుకుని, హైదరాబాద్ నగరానికి విచ్చేయడం, సమావేశం పూర్వ రంగంలో- సమావేశంలో, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం.




కిరణ్ కుమార్ రెడ్డి నియంతలాగా వ్యవహరిస్తున్నారని సమన్వయ కమిటీ ఛైర్మన్ గులాంనబీ ఆజాద్‌కు పలువురు ఫిర్యాదులు చేశారని, అసంతృప్తి వాదులెందరో ముఖ్యమంత్రిపై సమరశంఖం పూరించారని, అంత భారీ ఎత్తున ఆయనకు వ్యతిరేకత వ్యక్తం కావడం ఆజాద్‌ను విస్తుపోయే ట్లు చేసిందని మీడియాలో కధనాలొచ్చాయి. తనపైనా, తన సహచర మంత్రులపైనా కొందరు ఎమ్మెల్యేలు-మంత్రులు ఫిర్యాదులు చేయడం వెనుక, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రోత్సాహం వుందన్న అనుమానం కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితుల ముందర వ్యక్త పరిచినట్లు కూడా మీడియా కధనాలొచ్చాయి. నిఘా వర్గాలు కూడా ఆ అనుమానాలను ధృవపర్చాయట. నిజానిజాలేవైనప్పటికీ, బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పటినుంచి, ఆయనకూ కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య విభేదాలున్న ట్లు కథనాలొస్తూనే వున్నాయి. వాస్తవానికి ఆ కథనాల నేపధ్యంలోనే, సమన్వయకమిటీ ఏర్పాటైందని కూడా అనుకుంటున్నారు విశ్లేషకులు. ఐతే, సమన్వయ కమిటీ ఏర్పాటుకు కిరణ్ హస్తముందా? బొత్స హస్తముందా? లేదా వారిద్దరినీ ఒకరిపై మరొకరు దాడి చేసుకోకుండా నివారించేందుకు అధిష్టానమే అందుకు పూనుకుందా? అనే దానికి ఎవరి సమాధానం వారే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన బొత్స పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ప్రత్యేక అజెండాతో వెళుతున్నారని, అందులో భాగంగానే కిరణ్‌ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నారని బాహాటంగా బొత్స వర్గీయులే చెప్పడమే కాకుండా, ఆజాద్‌ ఎదుట ఆ తర్వాత జరిగినట్లు భావిస్తున్న పంచాయితీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, చిరంజీవితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా కిరణ్‌‍ను టార్గెట్ చేశారట.

తొలి సమన్వయంలోనే వెల్లువెత్తిన సమర ధ్వనులలో, కిరణ్ కుమార్ రెడ్డిపై చేసిన ఆరోపణలలో ప్రధానమైనవి, ఆయన ఎవరినీ సంప్రదించకుండానే నూతన పథకాలను ప్రకటించడం, సీఎం వి అన్నీ ఒంటెత్తు పోకడలనడం, గాంధీభవన్‌కు అంతవరకూ ఎన్నడూ రానివారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారనడం, ప్రభుత్వ పాలనంతా పూర్తిగా ఏకపక్షం అనడం లాంటివున్నాయి. అలా ఫిర్యాదులు మొదటిరోజు చేసిన వారిలో సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి కూడా వున్నారు. ఆయన లేవనెత్తిన అంశంలో సహచర మంత్రి శంకర్రావుపై సబితా ఇంద్రారెడ్డి మనుషులు చేసినట్లు చెప్పుకుంటున్న దాడి కూడా వుండడం విశేషం. ఇక ఎప్పటినుంచో 104, 108 వాహనాల విషయంలోను, రాజీవ్ ఆరోగ్య శ్రీ విషయంలోను, ఆ మాటకొస్తే మొత్తం ఆరోగ్య-వైద్య శాఖ విషయంలోను ముఖ్యమంత్రి జోక్యాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆ శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, ప్రభుత్వ పథకాల విషయంలో సీఎం సంబంధిత శాఖ మంత్రులను అసలే సంప్రదించడం లేదని, అలానే తామూ ఆయనను సంప్రదించే అవకాశమే లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారట. అలాగే 108 వాహనాలపై రాజీవ్ గాంధి బొమ్మ వివాదం కూడా ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. కొందరు పార్టీ నాయకులు, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే 2014 ఎన్నికల్లో పరాజయం పాలైతుందని అనే దాకా వెళ్లడం గమనించాల్సిన విషయం.

గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకెలా పొక్కాయోకాని, ముఖ్యమంత్రిని "మిస్టర్ చీఫ్ మినిస్టర్" అని ఉపముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ సంబోధించినట్లు కూడా కొన్ని పత్రికలలో వార్తలొచ్చాయి. మరీ విడ్డూరం: కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వ లక్షణాలను కూడా ఆయన ప్రశ్నించారట. కిరణ్ కుమార్ రెడ్డికి అన్నీ అస్పష్టతలే అన్న చందాన సాగిన దామోదర రాజ నరసింహ ధిక్కార ధోరణిలో భాగంగా జగన్ విషయం కూడా ప్రస్తావనకొచ్చిందట. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, యువనేత రాహుల్ గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేకపోవడం, పై పెచ్చు ఆ తిట్ల పురాణమంతా రాస్తున్న ఆయన పత్రికకే కోట్ల రూపాయల ప్రభుత్వ అడ్వర్టైజ్‌మెంట్లు విడుదల చేయడం రాజనర్సింహ తప్పుబట్టారు. ఒకానొక సందర్భంలో ఆయన దాడికి అడ్డుతగిలిన ప్రతివారిపై కూడా ఎదురుదాడికి దిగారట ఆయన. టెలివిజన్ ఛానళ్లలో ప్రతిరోజూ వస్తున్న విశ్లేషణల-చర్చల ప్రస్తావన కూడా తీసుకొచ్చిన దామోదర రాజ నరసింహ, కనీసం వాటిల్లోనైనా కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా వాదనలు విన్పించేవారు లేకపోవడం కూడా ముఖ్యమంత్రి తప్పుగానే వర్ణించారట. ముఖ్యమంత్రికి మీడియా విషయంలోను స్పష్టమైన అవగాహన లేదనే దాకా వెళ్లింది ఆయన ఆరోపణల పర్వం.

ఏదేమైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు స్పష్టంగా పొడచూపాయి. విభేదాలుండడంలో తప్పు లేదు. వాటిని సమన్వయ సమావేశంలో చర్చించుకోవడంలోను తప్పులేదు. ఎటొచ్చీ, ఆ సమావేశ విషయాలు బయటకెందుకు పొక్కాలనే విషయంలోనే పార్టీ వారందరినీ తప్పు పట్టాల్సి వస్తుంది. సమన్వయ సమావేశానికి ముందు ఆజాద్‌కు అందిన ఫిర్యాదులు బయటకు రావడం సహజం. కాకపోతే, సమన్వయ సమావేశంలో జరిగినవి కూడా ఒక్కో పత్రికలో ఒక్కో విధంగా అంతా పూస గుచ్చినట్లు రావడం వెనుక ఎవరి హస్తం వుందనేదే అర్థం కావాల్సిన అంశం.

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చేతనైనంత మేరకు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్తున్న సమయంలోనూ, చేపట్టిన మరుక్షణం నుంచీ ఆయన చుట్టూ సమస్యల తోరణాలు స్వాగతం పలికాయి. ఆయన ధరించింది ఒక ముళ్ల కిరీటం. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. అప్పట్లో ఆయన పాలనా దక్షతకు, సమర్థతకు అవన్నీ అగ్నిపరీక్షల లాంటివే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్యఆందోళనలు-ఉద్యమాలు, ఫ్రీ జోన్ అంశం, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ధిక్కార ధోరణి, నత్తనడకన సాగుతున్న జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత లాంటి సమస్యలెన్నో ఆయనకు ఎదురయ్యాయి.  ఒక్కొక్క సమస్యను అధిగమించే క్రమంలో, ఆయన ఒక్కొక్క అడుగే ముందుకు వేశారు. మంత్రివర్గం ఏర్పాటులో తనదైన శైలిని అనుసరించి మంచి పేరే తెచ్చుకున్నారు. శాసన సభాపతి ఎంపిక, డిప్యూటీ స్పీకర్ ఎంపిక లాంటి వాటిలో తన మాట చెల్లించుకోవడంతో పాటు, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం కూడా చెప్పుకోవాల్సిన సంగతే. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధిష్టానం బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినప్పుడు, ఎదురు చెప్పకపోవడం కూడా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం అనాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయనను విమర్శించినా, సంయమనం కోల్పోకుండా, తగు రీతిలో, ఎవరినీ నొప్పించకుండా-అందరినీ మెప్పించుకుంటూనే, స్పందించారే కాని, తన స్థాయి మరిచిపోయి ఎదురుదాడికి దిగలేదు. వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవలం పదహారు మంది ఎమ్మెల్యేలే మిగలడం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చాకచక్యమే అనాలి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, తన జిల్లాకే చెందిన తన చిరకాల ప్రత్యర్థి, నారా చంద్రబాబునాయుడుని సహితం తన దారిలోకి తెచ్చుకోగలిగి, శాసనసభలో ఆయన పరోక్ష మద్దతు కూడా తనకే సుమా అని ప్రచారం చేయించుకోగలిగిన థీశాలి కిరణ్ కుమార్ రెడ్డి. అవిశ్వాస తీర్మానంలో, నెగ్గుకోరావడం కూడా అభినందించాల్సిన అంశమే.

ఐనా, అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికీ, బొత్స సత్యనారాయణకూ మధ్య ఏదో అగాధం వుందని భావించింది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం వుండాలనీ భావించింది. పర్యవసానంగా సమన్వయ కమిటీ రూపు దిద్దుకుంది. ఆ కమిటీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మరింత పటిష్టంగా పనిచేయడానికి తోడ్పడాలి కాని, అడ్డుకోవడానికి కాకూడదు. గులాంనబీ ఆజాద్ అలా అడ్డుకునేవారికి తన మద్దతు ఇవ్వకూడదు. రాబోయే రోజుల్లో ఆ కమిటీ సమన్వయం కొరకు సంయమనంతో పనిచేస్తుందని, అందులోని సభ్యులంతా సమాంతరంగా పనిచేయరని భావించుదాం.


No comments:

Post a Comment