Monday, December 26, 2016

దూతను చంపవద్దని రావణునికి హితబోధ ..... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 24 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

దూతను చంపవద్దని రావణునికి హితబోధ
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
24 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (26-12-2016)

రావణుడి ప్రేరణతో ఆయన ఆజ్ఞానుసారం ఇంద్రజిత్తు హనుమంతుడి మీదకు యుద్ధానికి పోతాడు. ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు నందీ అవుతాడు. బందీగా వున్న హనుమంతుడిని రాక్షసులు తాళ్లతో కట్టి రావణాసురుడి దగ్గరకు తీసుకుపోతారు. సభలో వున్న రావణాసురుడిని హనుమంతుడు చూస్తాడు. అలానే హనుమంతుడిని చూసిన రావణుడు ఆలోచనలో పడిపోయాడు. ప్రహస్తుడి ప్రశ్నలకు హనుమంతుడు సమాధానంగా తన వృత్తాంతమంతా చెప్తాడు. తాను లంకకు వచ్చిన కారణం తెలియచేసి రావణాసురుడికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి క్షణకాలం మాత్రమే హనుమంతుడు పట్టుబడ్డాడు. తనకు హిత బోధ చేసిన హనుమంతుడిపై రావణుడు మండిపడతాడు. కోపంతో హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. అది విన్న తమ్ముడు విభీషణుడు, తాను పండితుడైన కారణాన, రాజాజ్ఞ నీతికి విరోధమనీ, దోషమనీ అంటాడు. రావణాసురుడి మేలుకోరి హితోక్తులతో-మంచి మాటలతో, రాజుకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. విభీషణుడి హితోక్తులను కవి "పంచచామరము", "సుగంధి" వృత్తాలలో వివరించారు.

పంచచామరము:
          క్షమింపు రాక్షసేంద్ర! ధర్మ సంయుతంబు నా నుడిన్
        శమంబుతోడ నాలకింపు చంపరాదు దూతఁ గా
        ర్యమున్ ఘటించువేళ నంచు నన్ని జాతులందునున్
        సమస్త సీమలందు సూరి సంఘముల్ వచించెడిన్ - 112

సుగంధి:
          శాత్రవుండు వీఁ డు, లేదు సందియంబు, శిక్షకున్
        బాత్రుడున్ మహాపకార వారమున్ ఘటించుటన్
        జైత్రవర్య! దూతపట్ల సజ్జనాళి పల్కెడిన్
        గాత్రపీడనంబు నాది గాఁ గఁ  బెక్కు శిక్షలన్ - 113

సుగంధి:
          ఆరయంగ ధర్మవాద మందుఁ గాని లౌకికా
        చారమందుఁ గాని సర్వ శాస్త్ర బోధనంబునన్
        ధారణన్ భవత్సముండు దానవామరాళులన్
        వీరవర్య! లేఁ డు సుమ్ము నీవె మేటి వన్నిటన్ - 114

తాత్పర్యం:    
రాక్షసరాజా! నీ మాటకు ఎదురు చెప్తున్నానని కోపబడవద్దు. నేను ధర్మం ప్రకారమే చెప్తున్నాను. కోపం మాని విను. దూతను, దూత కార్యం చేస్తున్నప్పుడు చంపకూడదు. ఈ నిబంధన, మర్యాద   అన్ని జాతులలో, అన్ని ప్రదేశాలలో వుందని పండితులు చెప్తారు. నిన్ను జయించగలవాడెవ్వడూ లేడు. వీడేడో అన్నాడని కోపగించుకోవాల్సిన పని లేదు. వీడు పగవాడే. అందులో సందేహం లేదు. వీడు అపకారం చేశాడు కాబట్టి దండించాల్సిందే. నేను వద్దనడం లేదు. క్షమించి విడిచిపెట్టమనీ అనడం లేదు. దూతనెలా దండించాల్నో, ఆ విధంగానే-ఆ ప్రకారంగానే దండించమంటున్నాను. ఆ పద్దతులలో దేహబాధ కలిగించడానికి కొన్ని మార్గాలు చెప్పారు పెద్దలు. అలానే దండించు. ధర్మ బద్ధంగా వాదించడంలో కానీ, లోక వ్యవహారం నడపడంలో కానీ, సకల శాస్త్ర జ్ఞానమందు కానీ, చదివిన విషయం ధారణ చేయడంలో కానీ, దేవదానవులలో నీకు సరైన వాడు లేడు. నీకు నీవే సాటి.

ఛందస్సు:      సుగంధికి "ర, , , , " గణాలు. తొమ్మిదింట యతి. పంచచామరానికి "జర, జర, జగ" గణాలు. తొమ్మిదింట యతి.

సీతాన్వేషణకు లంకకు వెళ్లి వచ్చిన హనుమంతుడు, ఆ వృత్తాంతమంతా, తోటి వానరులకు వివరించిన దానిని, ఒక సుదీర్ఘ "దండకం" రూపంలో రాశారు వాసు దాస కవి. ఆ దండకం ఇలా సాగుతుంది.



దండకం:       ఆద్యంత వృత్తాంత మాలింపఁ గా నింపు పెంపార నా జాంబవంతుండు వాతాత్మజుం జూచి యో యంజనానందనా! ముందుగాఁ బొందుగాఁ దెల్పుమే రీతి నా నాతిని న్నీవు గన్గొంటి? వాల్గంటి దా నొంటి నెట్లున్న? దా యన్నుమిన్నన్ దశాస్యుండు క్రూరుండు దా నే విధిం జూచెడిన్? మీది కార్యంబు ఱేనంచునన్ సంచుగా జెప్ప నౌ చెప్పఁ గా రాని యవ్వాని భాశింపు మన్నన్, హనూమంతుఁ  డత్యంత సంతుష్టుడై హృష్టుడై జానకిన్ లోన ధ్యానించి మూర్ధంబుచే మ్రొక్కి యిక్కై వడింబల్కె; వారాశియా ప్రక్కతీరంబుఁ  జేరంగ లో నెంచి నే నీ నగాగ్రంబునందుండి కుప్పించి దాఁ టంగ మీరెల్లఁ గన్నారఁ గన్నార కాదే? యటేనేగ నంబోధిమధ్యంబునన్ హేమశృంగాంచితంబైన శైలంబు నాత్రోవకడ్డంబు రా వచ్చె రా విఘ్న మం చెంచి రోషించి భేదించి పోవంగ లోనెంచి దానిన్ ఢికీలంచు నే దాఁ కితిన్, దోఁ కతో దాచితిన్, దాచినన్ దాని శృంగంబు వేభంగులన్ భంగ మై రాలెఁ , దఛ్చైలమో మామకీ నాశయం బెంచి హర్షంబుగా నాయనా! నీకు జిన్నప్ప నే, గాడ్పుమిత్రుండ, మైనాకుఁ డన్, వార్ధిలో చుండుదున్, మున్ను పక్షంబు లుండన్ ధరాధ్రంబు లెల్లన్ యధేచ్ఛంబుగాఁ  గ్రుమ్మరన్ లోకభీదానదక్షంబు లౌ వాని వీక్షించి పక్షంబులం ద్రుంచె వజ్రహతిన్ శక్రు, డగ్గోడు తప్పింప నీ తండ్రి నన్దెచ్చి యీ యంబుధిం ద్రోచెఁ జూ, ధర్మభృద్వర్యుఁ డున్ శక్రవీర్యుండు నౌ రాము కార్యంబున న్నాదు సాహాయ్యముం గొమ్ము నా, సమ్మతిన్ నాదు కర్జంబు చందంబు బోధించి కార్యైకసక్తాత్మతన్ శైలరాజాజ్ఞ నేఁ బోయితిన్, గ్రావమున్ మానుషాకారమున్ మాని శైలాకృతింబూని వారాశిమధ్యంబునన్ నిల్చె, నే నెచ్చు వేగంబునన్ బోవ బోవంగ నాగాంబ వేగంబ నాకడ్డమైనిల్చి యోక్రోతిఱేఁ డా! మదాహారముం గమ్ము, వేగమ్మ రారమ్ము, దేవాళి యేర్పాటురా సుమ్ము నా; నమ్మహాదేవికిన్ మ్రొక్కి దిక్కేమియుం దోఁ ప కిట్లంటి నో దేవి! భూదేవి జామాత శ్రీరాముఁ డారణ్య దేశంబునన్ జానకీ లక్షణాన్వీతుడై! క్రుమ్మరం బంక్తికంఠుండు శుంఠుండు తద్దేవినిన్ మ్రుచ్చిలించెన్, దదన్వేశణార్ధంబు రామాజ్ఞచే బోవుచున్నాఁ డ, దద్దేవిదేశంబునం దుంట శ్రీరాము కార్యంబునందోడు కారాదె? కాదేని వైదేహినిన్ రామునిం జూచి వే వచ్చి నే నిచ్చి నీ మెచ్చుగా జొచ్చువాఁ డన్ భవద్వక్త్రమం దన్న న య్యన్ను హా! యేటిమాటల్ బళా దాఁ టి పోనీయ, నాకీ వరం బిచ్చి రా దేవతావల్లభుల్, పొల్లుగాదన్న, మే న్వెంచితిన్ యోజనంబుల్ పది న్నిడ్పు లం దర్ధవిస్తారముం గల్గనాదేవి నాయంత వాక్రంత దావిచ్చె నే నంత హ్రస్వుండనై యొక్క యంగుష్ట మాత్రంబు గాత్రంబుగా జివ్వునన్ దాని వక్త్రంబునం జొచ్చి వెల్వడ్డ నన్ జూచి నైజాకృతిం దాల్చి యా యంబ, యోవానరంబా! సుఖంబార బోపొమ్ము, నీకార్యముల్ చక్కనౌఁ , గూర్పుమీ సీత శ్రీరాముతో, మెచ్చితిన్ నీయెడన్, భద్రమౌ నన్న నన్నంతటన్ భూతముల్ ప్రీతముల్ మేలు మేలంచు శ్లాఘించె, దర్వాత నిర్భీతి బక్షీశురీతిన్ మొగుల్ త్రోవ నేఁ బోవ, నాచాయనేదో గ్రహింపంగ నేచాయ గన్గొన్న నాకేమియుం దోఁ ప దాత్మీయ వేగంబు సంకుంఠితం బైన నే నాత్మలో నే మహా

No comments:

Post a Comment