Thursday, June 1, 2017

సంక్షేమానికి ప్రాధాన్యం..దేశానికే ఆదర్శం : వనం జ్వాలా నరసింహారావు

సంక్షేమానికి ప్రాధాన్యం..దేశానికే ఆదర్శం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (02-06-2017)

కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో పద్నాలుగేళ్ళ సుదీర్ఘ శాంతియుత పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేనాటికి రాష్ట్రంలో  అనేక రంగాలలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అధికారులు అందుబాటులో లేకపోవడం, పొరుగు రాష్ట్రం నుంచి లభించని సహకారం, ప్రభుత్వం ముందున్న అనేకానేక సవాళ్లు లాంటి వాటిని బహుశా, భారత ప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం వచ్చిన నాటి తొలినాళ్ళలో ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి స్థితిగతులతో పోల్చవచ్సునేమో! నవభారత నిర్మాతగా పేరొందిన నెహ్రూ స్వతంత్ర భారత దేశానికి దశా-దిశా నిర్దేశం చేయడానికి తనదైన శైలిలో ఒక సమర్ధవంతమైన కార్యాచరణ పథకాన్ని, ఒక రోడ్ మ్యాప్ ను రూపొందిoచి, దేశాభివృద్ధికి పునాదులు వేసాడో, అలానే అరవై సంవత్సరాల ఆంధ్రా పాలన అవలక్షణాలను అధిగమించి, అచిరకాలంలోనే, మూడేళ్లలోనే,  దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే అగ్రభాగాన నిలవడానికి ప్రణాలికలు రచించి అమలుచేసారు నవ తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. శాంతియుత పోరాటం ద్వారా తెలంగాణ సాధించి, సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు తీస్తున్నది. అనేక వినూత్న కార్యక్రమాలతో యావత్ దేశం దృష్టినీ ఆకర్షిస్తున్నది. చిమ్ముచీకట్ల తెలంగాణాను విద్యుత్ కోతలు లేని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మలచిన ఒక్క ఉదాహరణ చాలు రాష్ట్రాభివృద్ధిని నిర్వచించడానికి.....ఇలాంటివి చెప్పుకోవాలంటే ఎన్నో...ఎన్నెన్నో...

ప్రతీ ఒక్కరికీ కారణముంది తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి...అందరి ఆకాంక్షలు నెరవేర్చింది..సకల జనులకు సంక్షేమం పంచింది....మూడేళ్ల పాలనలో అద్వితీయ ఫలితాలు సాధించింది... మానవీయతతో ప్రజా సంక్షేమం గురించి అహర్నిశలూ ఆలోచించి పథకాలు రూపొందించింది. 38 లక్షల మందికి రూ.4,844 కోట్ల వ్యయంతో ప్రతీ నెలా 1000 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ.75,116 ఆర్థిక సహాయం, ఒక్క రూపాయికి కిలో చొప్పున పేద కుంటుంబంలోని ప్రతీ ఒక్కరికీ నెలకు 6 కిలోల బియ్యం పంపిణీ, గర్భిణీ స్త్రీలకు రూ.12వేల ఆర్థిక సాయం. శిశువులకు కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల భృతి పంపిణీ మానవీయతతో ప్రజా సంక్షేమం లో చేపట్టిన కొన్ని పథకాలు.

ఆజన్మాంతం అశేష తెలంగాణ ప్రజానీకానికి అండదండగా వున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఒక్కరికీ మేలు కలిగేలా ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టింది. రూ.40 వేల కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. చిన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవడానకి వీలుగా పేదలుగా గుర్తించే వారి ఆదాయ పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కూడా తెలంగాణ రాష్ట్రంలో పేదలుగానే గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కెజి టు పిజి నిర్బంధ విద్యావిధానం అమలవుతున్నది. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించింది. విదేశాల్లో విద్యావకాశాలు వచ్చిన వారికి రూ.20 లక్షల వరకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ అందిస్తున్నది. హాస్టళ్లలో, మద్యాహ్న భోజనంలో, అంగన్ వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సన్నబియ్యంతో వండిన భోజనం పెడుతున్నది. వ్యవసాయాధిరిత దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. మొదటి ఏడాది పెట్టుబడిని కూడా ప్రభుత్వమే సమకూరుస్తున్నది.

వ్యవసాయాభివృద్ధిరైతు సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికీ, ముఖ్యమంత్రికీ అత్యధిక ప్రాదాన్యత కలిగిన అంశంగా పరిగనిoచాలి. ఇందులో భాగంగానే ఏడాదికి రెండు పంటలకు ఎకరానికి రూ.8వేల చొప్పున రైతాంగానికి ఆర్థిక సాయం అందించాలని సీ ఎం నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే 35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కూరే విధంగా 17వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ చేశారు. నాలుగు విడతలుగా మొత్తాన్ని రైతులకు చెల్లించడం కూడా జరిగింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రతీ ఏటా రూ.25వేల కోట్ల కేటాయింపు చేసి, శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయిస్తున్నదీ ప్రభుత్వం. 46 వేల చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకం రూపొందించి అమలు పరుస్తున్నది. 21.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో భారీ సంఖ్యలో గోదాముల నిర్మాణం జరిగింది.

కోతల్లేని కరెంటుతో రెప్పపాటు కూడా విరామం లేకుండా 24x7 నిరంతర విద్యుత్ సరఫరా చేయడం రాష్ట్రం ప్రత్యేకత. రాష్ట్రం ఆవిర్భవించిననాడు కేవలం 6,000 మెగావాట్ల విద్యుత్ మాత్రమె అందుబాటులో వుండగా అదిప్పుడు రెట్టింపై 12, 000 మెగావాట్లకు చేరింది. భవిష్యత్ లో రాబోయే మరో రెండేళ్ళలో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కొత్త ప్లాంట్లు నిర్మాణంలో వున్నాయి. ఇదిలా వుంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో వుంది. విద్యుత్ రంగంలో చేపట్టిన పకడ్బందీ పథకాల వాళ్ళ రైతాంగానికి ప్రస్తుతం 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన కార్యాలు చేపట్టింది ప్రభుత్వం.


గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమే లక్ష్యంగా పని చేస్తున్నదీ ప్రభుత్వం. సాగునీరు, విద్యుత్, పెట్టుబడి లాంటి సౌకర్యాలతో రైతాంగానికి చేయూతనిస్తున్నది. గొల్ల, కుర్మలకు 75 శాతం రాయితీపై గొర్రెల పంపిణీ చేపట్టింది. ప్రభుత్వ పెట్టుబడితోనే చేపల పెంపకం ప్రోత్సహించి బెస్త, ముదిరాజ్ కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్నది. చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇస్తూ, నెలకు రూ.15వేల వేతనం, నూలురసాయనాలపై 50 శాతం సబ్సిడీ సమకూరుస్తున్నది. నాయీ బ్రాహ్మణులకు నవీన క్షౌరశాలల ఏర్పాటుకు లక్ష రూపాయల సాయం అందచేస్తున్నది ప్రభుత్వం. రూ.1000 కోట్లతో ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మిషన్ భగీరథతో సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో వున్నా ప్రభుత్వం ప్రతీ ఇంటికి పవిత్ర గోదావరి, కృష్ణా జలాలు సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీని వాళ్ళ 25 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతీ రోజు తాగునీళ్లు సరఫరా జరుగుతుంది. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే లక్ష్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి పూనుకుంది ప్రభుత్వం. పేదల కోసం రెండు బెడ్ రూములు, కిచెన్, హాలు, రెండు బాత్రూములతో కూడిన ఇంటి నిర్మాణంలో భాగంగా పూర్తిగా ప్రభుత్వమే నిర్మించి పేదలకు ఇచ్చే కార్యక్రమం నిబద్ధతతో కొనసాగుతోంది.

ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో ప్రత్యేక ప్రగతి నిధి ప్రభుత్వం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. వారికి కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే మరో ఏడాదికి వాటిని బదలాయించే విధంగా చట్టం రూపొందించి అభివృద్ధి నిధులు పొందడం వర్గాలకు హక్కుగా మార్చింది తెలంగాణ ప్రభుత్వం. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన మైనారిటీలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది ప్రభుత్వం. తెలంగాణలో తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.  తెలంగాణ సాధన కోసం అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ప్రతీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు మూల వేతనంలో 43% శాతం మేర పెంచి (ఫిట్మెంట్) ఇచ్చారు. నగదు ప్రయోజనం తెలంగాణ ఆవిర్భావ దినమైన 2 జూన్ 2014 నుంచి అమలు అయింది. కాంట్రాక్టు లెక్చరర్లు, అంగన్వాడీ టీచర్లు, పారిశుద్ధ్య కార్మికులు, జల మండలి ఉద్యోగులు, ఆశా వర్కర్ల వేతనాలు భారీ ఎత్తున పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో వెట్టి చాకిరీ విముక్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేసే 24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మాతా శిషు సంరక్షణకు కేసీఆర్ కిట్స్ పతాకాన్ని అమలు చేస్తున్నది. ప్రసవ మరణాలు పూర్తిగా తగ్గించేందుకు, మాతా శిషు సంరక్షణకు ఒక్కొక్కరికీ రూ.15 వేలతో కేసీఆర్ కిట్ రూపొందించారు. గర్భిణులకు రూ.12వేల ఆర్థిక సాయం, ఆడపిల్ల పుడితే వెయ్యి రూపాయల ప్రోత్సాహకం, 16 వస్తువులతో పిల్లల కోసం రూ.2వేల విలువైన కేసీఆర్ కిట్స్ 3 జూన్ 2017  నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభంమవుతోంది. న్యాయవాదుల సంక్షేమానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.50 కోట్లు కేటాయించింది. రూ.100 కోట్లతో బ్రాహ్మణుల సంక్షేమానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పేదల మృత దేహాలను స్వస్థలాలకు చెర్చేందుకు పరమపద వాహనాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులకుహోంగార్డులకు, , జర్నలిస్టులకు, గీత కార్మికులకు 5లక్షల రూపాయల ఉచిత ప్రమాద జీవిత బీమాను ప్రభుత్వం కల్పించింది.దేశంలో మరెక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రతీ నెలా రూ.వెయ్యి చొప్పున పెన్షన్ అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోని 4.22 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 50 లక్షల మంది సభ్యులకు  ఉపయోగపడేలా గ్రూపుల రు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ .10 లక్షలకు పెంచింది ప్రభుత్వం.

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో రైతులకు అందే విధంగా కార్యాలు తీసుకుంది ప్రభుత్వం. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముంగిటకే రాయితీపై విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతున్నది. రైతులకు విత్తనాల, ఎరువుల కొరత రాకుండా ముందుగానే స్టాక్ తెప్పించి గోదాముల్లో చేయిస్తున్నది ప్రభుత్వం. రాష్ట్రంలో భూ వివాదాలన్నీ సత్వరం పరిష్కరించి భూ రికార్డులను సవరించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 12 లక్షల సాదా బైనామాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశమున్న మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. తెలంగాణాలోని అన్ని మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ పద్ధతిలో నామినేషన్లు జరిగాయి. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాల్లోపు స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. మొత్తం లక్షా 25 వేల మందికి భూమి పట్టాలు పంపిణీ చేశారు.

వరల్డ్ బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తెలంగాణాలో అమల్లో వుంది. ఐటి రంగంలో రాష్ట్రం అగ్రగామి. పారిశ్రామిక అనుమతులకు టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా 15 రోజుల్లోగానే అన్ని రకాల అనుమతులు లభిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. ఐటి ఎగుమతుల్లో దేశంలోనే అగ్రగామి. ఔత్సాహిక ఐటి పారిశ్రామికుల కోసం టి-హబ్ ఇంక్యుబేటర్ నెలకొల్పింది ప్రభుత్వం. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం లక్ష్యాలుగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో పది జిల్లాలుంటే నేడు 31 జిల్లాలున్నాయి. పచ్చదనం పెంచే అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణకు హరిత హారం. మూడేళ్లలో 230 కోట్ల మొక్కల నాటడం లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతోంది.


నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాభి వృద్ధిలో దేశంలోనే అగ్రస్థానాన నిలవడం ఇక్కడ అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయనడానికి ప్రభల నిదర్శనం. తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి పదే, పదే చెప్తున్న విషయం అక్షర సత్యం. వృద్ధి రేటుతో మరెన్నో పథకాల రూపకల్పనకు, అమలుకు రాష్ట్రం  శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి

No comments:

Post a Comment