Friday, June 23, 2017

"అత్యవసర" పరిస్థితి...ఒక డాక్టర్ అనుభం : వనం జ్వాలా నరసింహారావు

ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి
42 సంవత్సరాలు నిండిన సందర్భంగా
"అత్యవసర" పరిస్థితి...ఒక డాక్టర్ అనుభం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (24-06-2017)

                42 సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అద్యాయానికి తెర లేచింది. ఇందిరాగాంధీ తన స్వప్రయోజనాల కోసం చేసిన సిఫార్సులతో, అప్పటి రాష్త్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటింఛారు.

అప్పట్లో అందరూ భయపడుతున్నట్లుగానే 1975 జూన్‌ 26న (25వ తేదీ అర్ధరాత్రి) ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ప్రకటించింది. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ అంటే దాదాపు 21 నెలలపాటు ఈ చీకటి రాజ్యం సాగింది. దీనికి కారణంలేకపోలేదు. రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రధాని ఇందిరా గాంధీపై వేసిన ఎన్నికల పిటీషన్‍లో, ఆమెకు వ్యతిరేకంగా, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా జూన్ 12, 1975 న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, నియంతృత్వ దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు, సిద్ధార్థ శంకర రే, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి సలహా మేరకు దేశ సమగ్రత-సమైక్యతలు ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, జూన్ 25, 1975 అర్థరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ.

వాస్తవానికి 1971లో పాకిస్తాన్‍తో యుద్ధాన్ని బూచిగా చూపి, విధించిన ఎమర్జెన్సీని రద్దుచేయకుండానే, దేశానికి ఆంతరంగికంగా ముప్పు ఏర్పడిందంటూ 352 ఆర్టికల్‌ కింద తిరిగి ఎమర్జన్సీని ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాల రాసింది. అంతర్గత భధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుతో నియంతగా మారిన ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తూ పలువురు ప్రజాస్వామ్య వాదులు ముందే హెచ్చరించినట్లుగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు, జూన్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీ కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలోను, ముఖ్యమంత్రి వెంగళరావు పాలనలోని అలనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లోను ఎమర్జెన్సీ దురాగతాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. పోలీసు నిఘా విభాగాన్ని తమ గుత్త సంస్థగా మార్చేశారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాష్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాది మంది పేర్లతో జాబితాలు తయారు చేసి విచ్చలవిడిగా అరెస్టులు చేయసాగారు.

పలువురు ముఖ్య నాయకులు అజ్ఞాతంలో ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌ 25న అర్థరాత్రి విధించిన ఎమర్జెన్సీ వార్త ప్రముఖ పత్రికలలో రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఆపుచేసే చర్యలకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. సంబంధిత అధికారులకు అలాంటి ఆదేశాలు అందాయని 'షా' కమీషన్‌ ముందు తరువాత సాక్ష్యాలిచ్చిన వారున్నారు.  క్రమంగా అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. మీసా వంటి చట్టాలను కాంగ్రెస్‌ అధిష్టానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.

భారత రాజ్యాంగం హమీ ఇచ్చిన వ్యక్తి స్వాతంత్య్రాన్ని ఇందిరా కాంగ్రెస్‌ నిలువునా కాలరాచింది. ప్రముఖ నాయకుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికివాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు.


దేశవ్యాప్తంగా అరెస్టయిన వారిలో, కాంగ్రెస్ పార్టీలో ఆమెను బలంగా వ్యతిరేకించిన ఒకరిద్దరితో సహా, సీపీఎం, జనసంఘ్, సంస్థాగత కాంగ్రెస్, ఇతర కాంగ్రేసేతర రాజకీయ నాయకులను చాలామందిని అరెస్ట్ చేయించింది. విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసి, తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.

ఈ నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సరసన ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, సీపీఎం పార్టీ నాయకుడు స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిని చేర్చారు. అలనాటి కేంద్ర హోం మంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి దృష్టిలో, లిస్టులో లేకపోయినా, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రోద్బలంతో డాక్టర్‍గారిని నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఎమర్జెన్సీ విధించిన నాటి అర్థరాత్రి సమయంలో, డాక్టర్‍గారి ఆసుపత్రి కాలింగ్ బెల్ మోగింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి ఇంకా తెలియని డాక్టర్‍గారు, తలుపు తీసి, ఎదురుగా కనిపించిన మఫ్టీలోని పోలీసు అధికారిని, ఏమీ జరగనప్పుడు-ఏమవసరమున్నదని అంత అర్థరాత్రి వచ్చారని ప్రశ్నించారు. తనకు తెలియదని, ఎస్పీ గారు పిలుచుకుని రమ్మంటే వచ్చానని జవాబిచ్చాడా అధికారి. విషయం కొంతవరకు అవగాహన చేసుకున్న రాధాకృష్ణమూర్తి, అదేదో అరెస్ట్ వ్యవహారమేనని నిర్ధారించుకుని వచ్చిన పోలీసు అధికారిని గౌరవంగా సంబోధిస్తూ, కూచోమని కోరి, ఆయనకు కాఫీ ఏర్పాటు చేసి, దుస్తులు సర్దుకునేందుకు లోనికెళ్ళారు. తన జీవితంలో, అరెస్ట్ చేసేందుకొచ్చిన పోలీసు అధికారికి అంత మర్యాద ఇచ్చిన వారిని ఎవరినీ చూడ లేదన్నాడతడు.

నేనాయన జీవిత చరిత్రను గ్రంధస్తం చేస్తున్నప్పుడు, అలనాటి రాత్రి సంగతులను గుర్తు చేసుకున్న డాక్టర్‍గారు, పోలీసు అధికారి తన విధి నిర్వహణలో వచ్చినప్పుడు, గౌరవించడం కనీస బాధ్యతని, తానదే చేసానని చెప్పారు. ఆ సందర్భంగా ఒకటి రెండు జైలు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. జైలులో వాళ్ల కొచ్చిన ఉత్తరాలను ముందుగానే పరిశీలించి-సెన్సార్ చేసినప్పటికీ, పూర్తి పాఠాన్ని చదువుకునే వీలు కలిగించి తిరిగి తీసుకునేవారు జైలు అధికారులు. ఇంటర్వ్యూలో పరిమితంగా కుటుంబ సభ్యులకు మాత్రమే - అదీ ఒకరిద్దరిని, ఒక గంట సేపు మాట్లాడనిచ్చేవారట. భార్యా పిల్లలు వచ్చినా, మాట్లాడేటప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి పక్కనే కూర్చుని తనకు వినబడేట్లు మాత్రమే మాట్లాడాలని నియమం పెట్టేవారట.

డాక్టర్ రాధాకృష్ణమూర్తిని అరెస్ట్ చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు చిర్రావూరి లక్ష్మీనరసయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రాంకిషన్‍రావు లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జైల్లో వీరే కాకుండా నక్సలైట్లు, ఆరెస్సెస్‍కు చెందినవారు, జనసంఘీయులు, ఇతర రాజకీయ పక్షాలకు చెందిన మరికొందరు కూడా వున్నారు. వారం రోజుల పాటు అందరూ ఉమ్మడి కాపురం చేసి, కలిసిమెలిసి భోజనాలు చేసేవారు. ఒకనాడు కరీంనగర్ నుండి జనసంఘం పార్టీకి చెందిన చెన్నుపాటి విద్యాసాగరరావుగారు (వీరు 1998 ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళ నాడు గవర్నర్) వంటినిండా దెబ్బలతో జైలుకు వచ్చారు. , ఆ తర్వాత ఎవరి బారక్స్ వాళ్లకే కేటాయించారు.

డాక్టర్ రాధాకృష్ణమూర్తికి తమ పార్టీ వారికి రాజకీయ పాఠాలు చెప్పినట్లే, అక్కడ ఇతరులకు తమ పార్టీ విధానాలు చెప్పడం, ఇతర పార్టీ వారి నుంచి వినడం ఒక నిత్యకృత్యమై పోయింది. డిటెన్యూలలో వరంగల్ అడ్వకేట్ ఆర్.ఎస్.ఎస్ నాయకులు భండారు సదాశివరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి. భగవద్గీత, షడ్ దర్శనాలకు సంబంధించిన పలు విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రతివాది భయంకర షఠగోపాచారి మరో డిటెన్యూ. ఆయన ఆయుర్వేద వైద్య ప్రముఖులు. వరవర రావును కూడా వీరితో పాటు అదే జైల్లో డిటెన్యూగా వుంచింది ప్రభుత్వం. అలానే పలు ముస్లిం నాయకులనూ నిర్బంధించి అక్కడే పెట్టింది. పద్దెనిమిది నెలల ఆ జైలు జీవితంలో సహచర డిటెన్యూల దగ్గర భగవద్గీత, షడ్ దర్శనాలు, ఆయుర్వేద వైద్యం, ఇస్లాం మతానికి చెందిన విషయాలను నేర్చుకున్నారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి. ఈ జైల్లో కూడా జైలు డాక్టర్ డ్యూటీని ఆయన డిటెన్యూగా వచ్చిన తర్వాత ఆయనకే అప్ప చెప్పారు. తృప్తిగా వృత్తి ధర్మాన్ని అక్కడ కూడా నిర్వహించారు. అత్యవసర పరిస్థితి ఎత్తివేయడానికి నెల రోజుల ముందర అందరు డిటెన్యూలతో పాటు డాక్టర్ రాధాకృష్ణమూర్తిని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఆలా బయటకు పోయి, ఇలా లోనికి వస్తానని అనుకోలేదాయన అప్పటికి.

జైలు నుంచి విడుదలై, ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లిలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్లారు. వారం రోజులపాటు, ఎమర్జెన్సీ ఇంకా అమలులో వుండగానే జరుగుతున్న సభలు, విజయవంతంగా జరగడాన్ని దగ్గరగా గమనించిన పోలీసులు, వాటిని భగ్నం చేసి, నాయకులని భావించిన రాధాకృష్ణమూర్తిని మళ్ళీ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే, 1977 మార్చ్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. ఖమ్మం నుంచి లోక్ సభ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా డాక్టర్ రాధాకృష్ణమూర్తిని పోటీ చేయించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. జైల్లో వున్న ఆయనకు కబురు చేసి విషయం చెప్పారు. ఆయన నామినేషన్ పత్రాలపై జైలులోనే సంతకాలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పోటీలో వున్న అభ్యర్థిగా విడుదల చేశారు.

హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. ప్రజలపై, ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాష్‌నారాయణ 'సంపూర్ణ విప్లవం' అంటూ ఇచ్చిన పిలుపు... దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకు చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగుక్రిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్‍లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసి, ఆ తర్వాత రెండేళ్లు ఆమెచే జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.


అలా ఒక అధ్యాయం ముగిసింది భారత దేశ చరిత్రలో! 

No comments:

Post a Comment