Tuesday, May 29, 2018

ఆదాయ వృద్ధిలో అగ్రరాష్ట్రం....నాలుగేళ్ల నవనవ్య పాలన-3 వనం జ్వాలా నరసింహారావు


ఆదాయ వృద్ధిలో అగ్రరాష్ట్రం....నాలుగేళ్ల నవనవ్య పాలన-3
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (30-05-2018)
2016-17 బడ్జెట్: 2016-17 బడ్జెట్ రూపొందించుకునే సమయానికల్లా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, ఆదాయ-వ్యయాలపై, ప్రభుత్వానికి ఒక సమగ్రమైన-సంపూర్ణమైన అవగాహన వచ్చింది. 31 మార్చ్ 2015 నుండి 31 మార్చ్ 2016 వరకు, ప్రణాళిక, ప్రణాలికేతర పథకాల కింద ఆదాయ-వ్యయ లెక్కలు ఖచ్చితంగా తెలవడంతో, తెలంగాణ బడ్జెట్ రూపకల్పనకు అసలు-సిసలైన ప్రాతిపదిక దొరికి, బడ్జెట్ తయారీకి మార్గం సుగమమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత రూపొందించిన మొదటి బడ్జెట్-అడహాక్ లెక్కల మీద, గతంలో సమర్పించిన బడ్జెట్ల మీద ఆధారపడిందైతే, అంతో-కొంతో కుస్తీపట్టి ఆ తరువాతి సంవత్సరం పూర్తీ స్థాయి బడ్జెట్ తయారు చేయడం జరిగింది. క్రమేపీ, పూర్తీ అవగాహన కలగడమే కాకుండా, ఒక్కో పథకం, ఒక్కో శాఖకు సంబంధించి లోతుగా అధ్యయనం చేయడం, పూర్తి అవగాహనకు రావడం జరిగింది. ఆవిధంగా బడ్జెట్ కు సంబంధించిన సవాలును జయప్రదంగా అధిగమించడం జరిగింది. 2016-17 సంవత్సరం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ మూడో బడ్జెట్ అయినప్పటికీ, వాస్తవంగా ఆలోచిస్తే, ఒక సమగ్ర-సంపూర్ణ అవగాహనతో, పూర్తి స్థాయి సమీక్ష ఆధారంగా, అన్ని రకాల ఆదాయ-వ్యయాల వాస్తవ అంచనాల ప్రాతిపదికగా, వనరులకు సంబంధించి అసలు-సిసలైన లెక్కల ఆధారంగా, తయారుచేసిన మొదటి బడ్జెట్ అనాలి.

రాష్ట్ర ఆవిర్భావం తరువాత అనేకానేక అభివృద్ధి-సంక్షేమ పథకాల కోసం విరివిగా నిధులను వ్యయం చేస్తున్నప్పటికీ, ఆర్థికంగా ఆరోగ్యకరమైన, పటిష్టమైన పరిస్థితిలో కొనసాగగలగడం ఎంతో తృప్తినిచ్చే అంశం అనాలి. ఇలా వుండడానికి ప్రధాన కారణం, పన్నులేవీ అదనంగా విధించకుండానే రెవెన్యూ వసూళ్లను మెరుగుపరుచుకోగలగడమే. 2015-16 సంవత్సరంతొ పోల్చి చూస్తే, 2016-17 లోరాష్ట్ర స్వయం పన్నుల రెవెన్యూలో 21.1% వృద్ధి రేటు సాధించగలిగింది. ఇది దేశంలోని మిగాతా అన్ని రాష్ట్రాలకంటే అధికం.

2017-18 బడ్జెట్: ఈ నేపధ్యంలో, ఈ క్రమంలో, 2017-2018 లో రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఎ విధంగా చూసినా ఒక రకమైన ప్రేరణ కలిగించేదిగా, సందేశాత్మకంగా వుందని చెప్పాలి. ప్రభుత్వ ఆశయానికి, ఆలోచనకు, ఉద్దేశ్యానికి అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాలకు, కులవృత్తుల వారికి, అన్ని మతాల వారినకి, వివిధ రంగాలలో నిమగ్నమై వున్న వారికి, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే అన్ని ప్రభుత్వ శాఖల వారికి, అల్పాదాయ-మధ్య తరగతి వారికి, సమాజంలో వారూ-వీరూ అనే తేడా లేకుండా అందరికీ చేరువయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది.


2018-19 బడ్జెట్: ఇక 2018-19 లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతకు ముందు 45 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి అమలు పరుస్తున్న కార్యక్రమాలను ఏ విధంగా ప్రమాణీకరణం చేయవచ్చు, ఏ విధంగా స్థిరపర్చవచ్చు, ఏ విధంగా పటిష్టం చేసుకోవచ్చు అనే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాష్ట్ర స్థూల ఆర్ధిక పరిస్తి ఎలా మెరుగునపడిందో తెలియచేస్తుందీ బడ్జెట్. జీఎస్టీ అమలు, పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపధ్యంలో కూడా రాష్ట్ర సాధించిన ఆర్ధికాభివృద్ధి స్పష్టం చేయడం జరిగింది. అదనంగా, 2017-2018 ఆర్ధిక సంవత్సరంలో రూపకల్పన చేసిన పథకాలను వర్తమానంలో-భవిష్యత్ లో ఎలా అమలు చేస్తున్నారు-చేయబోతున్నారు అనే విషయాలు కూడా ఈ బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది. ఉదాహరణకు ఎకరాకు రు. 8000 పెట్టుబడి మద్దతు పథకం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, రైతు భీమా, గొర్రెల పంపిణీ పథకం, ఉద్యోగుల సంక్షేమం, అన్ని రంగాలకూ 24 గంటల విద్యుత్ సరఫరా, మరిన్ని సంక్షేమ పథకాలు, షెడ్యూల్డ్ కులాల-తెగల-వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ ప్రగతి నిధి, చేనేత పరిశ్రమ అభివృద్ధి, కేసీఆర్ కిట్స్ పథకం లాంటివి చెప్పుకోవచ్చు. వర్తమాన-భవిష్యత్ అవవసరాల దృష్ట్యా వ్యవసాయం లాంటి ప్రాధాన్యతారంగాలను గుర్తించి, ఫలితాలను ప్రజలకు చేరువ చేయడానికి కావాల్సిన నిధులను కేటాయించి, బడ్జెట్ అంటే ఇదీ-ఇలా వుండాలని, ఒక “రోల్ మోడల్” బడ్జెట్ తయారుచేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను, కోరికలను ప్రతిబింబించే అసలు-సిసలైన బడ్జెట్ ఈ బడ్జెట్. 

అత్యుత్తమ ఎకానమీగా నంబర్ వన్ స్థానం: పాపులర్ ఆంగ్ల వారపత్రిక ఇండియా టుడే దేశవ్యాప్త రాంకింగులలో తెలంగాణా రాష్ట్రానికి నంబర్ వన్ స్థానం రావడం ఆశ్చర్యం కాదు. రాష్ట్ర ఆర్ధిక శక్తికి ఇది నిదర్శనం. 2014 లొ రాష్ట్ర ఆవిర్భావానంతరం తెలంగాణా ఆర్ధిక పరిస్థితిలో, ఆర్ధిక గమనంలో గణనీయమైన పెరుగుదల, అభివృద్ధి స్పష్ఠంగా కనిపిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్ళ కాలంలో (2012-14) రాష్ట్ర జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటు 4.2% మాత్రమే వుండగా, తదనంతరం మూడేళ్ళ కాలంలో (2014-17) అది 9.5% చేరుకోవడం గమనించాల్సిన అంశం. ఇంతే కాకుండా 2015-16 తొ పోల్చి చూస్తే, 2016-17 లో  రాష్ట్ర స్వయం పన్నుల రెవెన్యూలో 21.10% వృద్ధి రేట్ తో, దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకంటే అగ్రస్థానంలో నిలిచింది. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం, రెవెన్యూ వృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన వుంది 17.82% వృద్ధి సాధించింది.

ఉత్పాదకరంగాలకు ప్రాధాన్యత: ఆర్ధిక వ్యవస్థ పట్ల అవసరమైన వివేచన, వివేకం ప్రభుత్వానికి పూర్తిగా వుండి, ఎక్కడ ఎక్కువగా పెట్టుబడులు పెడితే లాభాలు సమృద్ధిగా చేకూరుతాయో అనే విషయంలో పూర్తి స్థాయి అప్రమత్తతతో వుంది. అయితే ఇదిలా వుండగా, అణగారిన, పేద వర్గాల మోలిక-కనీస అవసరాలను తీర్చడానికి నిధులు సమకూర్చడానికి, ఖర్చు చేయడానికి, పూర్తి సంసిద్ధతతో వుంది. ఆ విధంగా ప్రభుత్వ నిధుల్లో గణనీయమైన భాగం, కంటికి కనిపించని లాభాలకోరకు, అంటే, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే రంగాలకు, తద్వారా మరింత ఉత్పాదకత దిశగా అడుగులేసేందుకు వెచ్చిస్తున్నది. ఉదాహరణకు ప్రభుత్వం తీసుకున్న భూ-ప్రక్షాళన తీసుకుంటే.....ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2% వృద్ధి రేటుంటుందని ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా.

సులభతర వ్యాపారం: ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఎదుర్కొన్న సవాళ్లలో ప్రధానమైంది, పారిశ్రామికీకరణ దిశగా ఎలా పయనించాలనీ, పెట్టుబడులను ఎలా పెద్ద స్థాయిలో ఆకర్షించాలనీ. అనతికాలంలోనే ఆ సవాలును అధిగమించిందీ ప్రభుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే, పారిశ్రామికీకరణ వైపుగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి, అనునిత్యం, దేశ-విదేశాలకు చెందిన అనేకమంది పారిశ్రామిక వేత్తలను, పరిశ్రమల పెట్టుబడిదారులను కలిశారు. దరిమిలా టీఎస్-ఐపాస్ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంలో, పరిశ్రమల పెట్టుబడిదారులకు పారిశ్రామిక అనుమతులు పొందడాన్ని ఒక న్యాయపరమైన హక్కుగా పొందుపరిచారు. ఇలాంటి హక్కు కలిగించిన ఏకైక రాష్ట్రం తెలంగాణానే! కవాటాలు (గ్రిల్స్) లేని ఏక గవాక్ష విధానమే టీఎస్-ఐపాస్. “పరిశోధన నుంచి కొత్త ఆలోచనలకు, కొత్త ఆలోచనల నుండి పరిశ్రమకు, పరిశ్రమ నుండి ఐశ్వర్యానికి” ఎలా పయనించాలనేదే తెలంగాణ పారిశ్రామికీకరణ విజన్. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ చేసే నినాదం...”తెలంగాణాలో కొత్త ఆలోచనలకు నాంది పలకండి....తెలంగాణాలో పెట్టుబడులు పెట్టండి......తెలంగాణాలో కలిసిపొండి” అనేదే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇదొక పెద్ద సవాల్. ఈ విధానం కింద వేలాది పరిశ్రమలు వచ్చాయి. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. లక్షలాది మందికి ఉపాధి లభించింది. వీటన్నింటి ఫలితమే సులభతర వ్యాపారంలో అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణాకు దెస మొత్తం మీద మొదటిస్థానం దక్కింది. మోలికంగా తమ ఎదుగుదలలో ఎదుర్కొనే అనేక ఒడిదుడుకులను అధిగమించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారవడానికి షెడ్యూల్డ్ కులాల, తెగల వారికి అదనపు ప్రోత్సాహాలు కలిగించడం నూతన పారిశ్రామిక విధానం ప్రత్యేకత. టీఎస్-ప్రైడ్ అనే కార్యక్రమం ద్వారా ఈ విధమైన ప్రోత్సాహాన్ని పారిశ్రామిక విధానం కలగచేస్తున్నది. దళిత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు టీఎస్-ప్రైడ్ ద్వారా అనేకవిధాలుగా లబ్ది కలుగుతున్నది.

No comments:

Post a Comment