Saturday, May 19, 2018

శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం ...... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-9 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-9
శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (20-05-2018)
శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి.

సత్ ప్రభు లక్షణం తెలుసుకోవాలంటే, రామ-దశరథుల రాజ్య పాలనా విధానంలో దొరుకుతుంది. ఆర్య ప్రభువులు ఏ పని చేసినా ప్రజల అనుమతి లేకుండా చేయలేదు. తాము ప్రభుత్వం నడిపేది ప్రజలకొరకేనని, వారిని సుఖ పెట్టడానికేనని వారు భావించేవారు. ప్రత్యక్షంగానైనా-పరోక్షంగానైనా ప్రజలకు హాని కలిగించే పనేదీ చేయరు. శ్రీరాముడి పట్టాభిషేకం గురించి దశరథుడు చేసిన (అయోధ్య కాండ) ఉపన్యాసం ఇందుకో ఉదాహరణ. ప్రజల దగ్గర పన్నులు తీసుకుంటూ, వారి కష్టాలు తొలగించకపోతే నరకంలోకి పోతామని వారి నమ్మకం (అరణ్య కాండ).

ప్రభువైన వాడు ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, వేగులవారి ద్వారా, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవాలి. ప్రజలు ఇష్టపడని గుణాలు తనలో వుంటే, ఎంత నష్టమైనా-కష్టమైనా అవి మానుకోవాలి. ఆ విషయంలో రాజు అంతఃకరణం చెప్పింది ముఖ్యం కాదు. ఇతరులను సంతోష పెట్టడానికి తనెందుకు దుఃఖపడాలని అనకూడదు. ఈ విషయంలో రాముడే ప్రమాణం.

శ్రీరాముడు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఒక నాడు వేగులవాడైన భద్రుడిని నగరంలో- పల్లెల్లో వార్తలేంటని, తమను గురించి ప్రజలేమనుకుంటున్నారని అడిగాడు. జవాబుగా వాడు, తనను లోకులందరూ ప్రశంసిస్తున్నారని చెప్తే, అంతటితో తృప్తి పడలేదాయన. ఉన్నదున్నట్లు-విన్నది విన్నట్లు అసలు విషయాలన్నీ చెప్పమంటాడు రాముడు. భద్రుడప్పుడు లోకుల పొగడ్తల మాటలు ముందు చెప్పి తర్వాత, "తామసుడగు రాక్షసు గృహసీమను జిరకాల మట్లు చెరబడిన సతిన్, రాముడు రోయక కూడెడి, గాముకులగు వారి కెందు గన్నులు గలవే" అని ప్రజలు వారికి తోచినట్లనుకుంటూన్నారని అంటాడు. అతడు చెప్పిన మాట సత్యమని ఇతరులతో దృఢపర్చుకొని, భరతాదులను పిలిపించి, లక్ష్మణుడితో లంకలో జరిగిన సంగతంతా చెప్పి, ".. అపవాదము దుస్సహమై, తపియింపగ జేసె నన్ను.... .... విడిచెద మిమ్మెల్లర, నే విడిచెద నా ప్రాణమేని, విమల యశము కై...." అంటూ, సీతను వాల్మీకాశ్రమానికి పంపాడు రాముడు. ఒకడిపైన ఇంతకంటే అసత్యమైన అపవాదం పడుతుందా? అలాంటి అపవాదాన్ని పోగొట్టుకోవడానికి ఇంతకంటే స్వార్థ పరిత్యాగం చేసిన వాడుంటాడా? కాబట్టి, ప్రతి మనిషి, తనను చూసి ఇతరులు తప్పు తోవలో ప్రవర్తించకుండేట్లు, లోకోపకారమైన మార్గాన్నే అనుసరించాలి.

సత్ ప్రభువు ప్రజల సుఖ దుఃఖాలను అనుదినం విచారించాలి. సీతా వియోగానంతరం, లక్ష్మణుడు తిరిగొచ్చేంతవరకు, నాలుగు రోజులు, కొలువు దీర్చలేదు రాముడు. దానికి "మర్మనికృంతన మైన బాధ" పడుతూ లక్ష్మణుడితో వెంటనే కొలువు తీర్చమని చెప్పి పరితపించాడు.

అలాంటి అనురాగం గల ప్రభువు విషయంలో, ప్రజలు కూడా అలానే వుండేవారు. అతడితో అడవులకు పోవడానికి, ప్రాణాలైనా పరిత్యజించడానికి అంగీకరించారు. ప్రభువు తానెంత గొప్పవాడైనా, తక్కువ వారితో కూడా కలిసి-మెలిసి వుండాలి. దీన్నే సౌశీల్యం అంటారు. గుహుడికి రాముడిని చూడగానే తటాలున కౌగలించు కోవడానికి వాళ్లిద్దరి మధ్య ఎంత స్నేహం వుండాలో కదా? అలానే రాజు ఎంత తెలిసినవాడైనా, మంత్రుల ఆలోచనలను-సలహాలను తిరస్కరించకూడదు. వారు చెప్పింది విని, వారితో తాను చేయదల్చుకుంది, సరైందని నమ్మే విధంగా సమాధానం ఇవ్వాలి. విభీషణుడు శరణు చొచ్చినప్పుడు జరిగిన సంగతి ఇందుకొక ఉదాహరణ. ఇంతెందుకు? రాముడి గుణగణాలను చక్కగ అర్థం చేసుకుంటే, రాజుకుండవలసిన సద్గుణాలే కాకుండా, సాధారణంగా ప్రతి పురుషుడికి వుండాల్సిన, సత్యం-దయ-ఇంద్రియ నిగ్రహం-పితృభక్తి-ఏక పత్నీనియమం-సౌభ్రాత్రం-దైవ భక్తి-దేవతారాధనం-నిత్య కర్మానుష్ఠానం విపులంగా  ఆయనలో వున్నాయని తెలుసుకోవచ్చు.


ఇక ఉత్తమ స్త్రీల లక్షణాలన్నీ కలిగున్నవారిగా సీత, కౌసల్య, సుమిత్రల గుణాలను బట్టి, నీచ స్త్రీల లక్షణాలున్న వారిగా కైకేయి, శూర్పణఖల గుణాలను బట్టి తెలుసుకోవచ్చు. రావణాసురుడు చెడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తాయి రామాయణంలో. ఇంద్రియాలను జయించ లేకపోవడం, అసత్యాలు పలకడం, వేగుల వారు లేకపోవడం-వున్న వారికి సరైన జీతాలు ఇవ్వక పోవడం, తన పరిసరాలో జరుగుతున్న వృత్తాంతాలను తెలుసుకోలేక పోవడం, విన్న ప్రతి విషయాన్నీ నమ్మడం-నిజా, నిజాలు మంత్రులపైన పడవేయడం, తన మేలుకోరి చెప్పగలవారికి-జ్ఞాన హీనతతో చెప్పేవారికి మధ్య తేడా తెలుసుకోలేక పోవడం, ఎవరినీ నమ్మక పోవడం, మూర్ఖత్వం లాంటి పలు దుర్గుణాలు వున్న రావణుడు సమూలంగా నాశనమయ్యాడు. పైన పేర్కొన్న విషయాలన్నీ, శూర్పణక, మారీచుడు, విభీషణుడు చెప్పిన మాటల్లో బయట పడుతుంది. రాముడితో యుద్ధమెందుకు చేయవలసి వచ్చిందో-యుద్ధ కారణమేంటో తన భటులకే తెలియనీయక వంచన చేసి, వారి ప్రాణాలను తీసిన (రావణాసురుడి లాంటి) ప్రభువు ఎలాంటి వాడో రామాయణం చదువుతే అర్థమవుతుంది.

ఇలాగే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చర్యల వలన భాతృ ధర్మం, సుగ్రీవుడి చర్యల వలన మిత్ర ధర్మం, హనుమంతుడి చర్యల వలన భృత్యు ధర్మం తెలియ చేయబడ్డాయి రామాయణంలో. అరణ్య వాసానికి పోయేటప్పుడు శ్రీరాముడు తల్లి కౌసల్యతో (అయోధ్య కాండ) అన్న మాటల్లో సతీ ధర్మం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆ విషయం "... ... వారిజనేత్రకు భర్తృసేవ సద్గతి సమకూర్చు దల్లి........, ....... భర్తృహిత కారిణివై చరియింపు మంగనా..." అన్న ఆంధ్ర వాల్మీకి పద్యాల్లో స్పష్టంగా తెలుస్తుంది. అలానే అనసూయ సీతకు హితోపదేశం చేసిన ఘట్టం చదివితే సతీ ధర్మం గురించి తెలుసుకోవచ్చు.

పితృ భక్తిని తెలుసుకోవాలంటే, అయోధ్య కాండలోని "....... పుత్ర లబ్దికై పనిగొని తల్లి తండ్రి పడు పాటులకుం బ్రతి సేయ నౌనె? యింపున దల జూచి నీళ్లు కడుపుంగని యన్నము పోసిపెట్టి యెండను జడి గాలి బ్రోతురు దినంబును వారల తుల్యులే యొరుల్" అన్న రాముడి వాక్యాలను చదవాలి.

మిత్ర ధర్మాన్ని గురించి "సులభము మిత్రుల జేర్చుట, కలసిన మరి మైత్రి చెడక కాపాడుటయే బలితపు గష్టము మది చం, చల మగుటను బ్రీతి చెడును స్వల్పంబున కేన్" అన్న సుగ్రీవుడి మాటల్లో తెలియచేయబడింది. న్యాయవాది ధర్మాన్ని హనుమంతుడి వాక్యాలలోను, కన్యాజనకత్వాన్ని" జననీ వంశమువారిని, జనకు కులమువారి స్వపతి సంతతి వారిన్ దనయా ! కన్యక సంశయ, మున ద్రోయు సదా యకీర్తి ముంచునొ యనుచున్" అన్న ఉత్తర కాండ పద్యాలలోను తెలుసుకోవచ్చు. సుందర కాండలోని "కోపి తునుము గురువులనేన్, గోపి కడుం గరకులాడు గుణవంతులనేన్, గోపి యొనర్పగజాలని, పాపం బేదైన గలదే భావింపగన్" అన్న పద్యంలో కోపి లక్షణం ఏంటో తెలుసుకోవచ్చు.

రామాయణంలో సకల ధర్మాలున్నాయి. ఇందులో వున్న ధర్మాలే మిగిలిన అన్ని గ్రంథాలలోనూ కనబడతాయి. ఇందులో లేని ధర్మాలు మరింకేదాంట్లోను కనిపించవు. రామాయణంలో సూత్రప్రాయంగా చెప్పిన ఎన్నో విషయాలను వ్యాసమహర్షి తన గ్రంథాలలో పేర్కొన్నాడు. ఉదాహరణకు "నాళీక జంఘుని" కథ. ఇలానే రామాయణంలో సూక్ష్మంగా చెప్పబడిన ధర్మాలను, కథలు-కథలుగా కల్పించి వ్యాస భగవానుడు ఇంతకు నాలుగింతలు గ్రంథాన్ని తయారు చేశాడు.  భగవద్గీతంతా కూడా రామాయణ సారమేనని గ్రహించాలి.

No comments:

Post a Comment