Saturday, May 4, 2019

రావణుడిని దూషించిన జటాయువు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-59 : వనం జ్వాలా నరసింహారావు


రావణుడిని దూషించిన జటాయువు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-59
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (05-05-2019)
         “ధర్మం అంటే ప్రీతికల రాజులు శాస్త్రం నిందించిన ధర్మ, అర్థ, కామాలకు ఆశపడరు. పులస్త్యుడంత గొప్పవాడికి మనుమడవై ధర్మ జ్ఞానం తెలియకపోతే ఎలా? ధర్మార్థకామాలు చక్కగా తెలుసుకుని ధర్మాన్ననుసరించి మంచిపనులు చేసే రాజు పెద్ద నిధిలాంటివాడు. ధర్మం కానీ, పుణ్యం కానీ, పాపం కానీ రాజులు ఎలా చేస్తారో, ప్రజలు అలానే చేస్తారు. నువ్వు దొంగతనం చేస్తే నీ రాజ్యంలోని ప్రజలు కూడా అలానే చేస్తారు. అప్పుడు రాజ్యానికి, ధర్మానికి ఏ గతి పట్తుందో ఆలోచించు. కాబట్టి ధర్మార్థకామాలకు రాజు మూలం. కనుక నువ్వు స్వచ్చందవ్యాపారం వదిలి శాస్త్ర ప్రకారం నడుచుకో. పాపపు స్వభావం కలవాడా! ఇంద్రియ చపలత కలవాడా! సాధువులకు బాధ కలిగించే వాడా! నీకెలా గొప్ప సంపద లభించిందిరా? నువ్వు ఆ ఐశ్వర్యం పోయి త్వరలోనే భ్రష్టుడివి అవుతావు”.

         “నీకు పుట్టుకతో వచ్చిన పాపగుణం నీ శవాన్ని కాల్చినపుడు కాని పోదు. నేను చెప్తున్న బుద్ధులు పాపాత్ముడివైన నీ మనసుకు పట్తాయా? ఒకవేళ ఇప్పుడు పట్టినా స్థిరంగా వుంటాయా? విరోధానికి కూడా కారణముండాలి. అపకారం విరోధి లక్షణం. నీ లంకా నగరంలో కాని, నీ దేశంలో కాని, మరెక్కడైనా కానీ శ్రీరామచంద్రమూర్తి నీకేమన్నా కీడు చేశాడా? ఎందుకిలా నిష్కారణంగా కలహానికి కాలు దువ్వుతున్నావు? ఎందుకు పాపం తెలియని శ్రీరాముడి విషయంలో తప్పు చేస్తున్నావు? దీనివల్ల నీకు అపాయమేకాని మేలుజరగదు. ఓరీ రాక్షసుడా! నీ తమ్ముడైన ఖరుడిని చంపడం నీకు అపకారం చేసినట్లే అని అంటావేమో? శూర్ఫనఖ చెప్పుడుమాటలు విని శ్రీరాముడిమీదకు యుద్ధానికిపోయి ఖరుడు చచ్చాడు. యుద్ధంలో తన ప్రాణరక్షణ తాను చేసుకోవడం తప్పా? అలాగే నీకు మగతనం వుంటే శ్రీరాముడి మీదికి యుద్ధానికి వెళ్లు. ఏ పాపం ఎరుగని సీతను దొంగిలించి ఆమెను బాధపెట్టడానికి శ్రీరాముడు చేసిన తప్పేంటి?

         “రాక్షసరాజా! నువ్వు సీతను బలాత్కారంగా తీసుకుపోవద్దు. అది చాలా పాపపు పని. నువ్విలా చేసినట్లు రాముడికి తెలిస్తే చూపులతోనే నిన్ను ఆయన చంపుతాడు. రాబోయే కీడు తెలుసుకోలేక యమపాశాన్ని మెడలో వేసుకున్నావు. మోయలేని బరువు తలకెత్తుకున్నావు. జీర్ణంకాకుందా రోగంతో చచ్చినట్లు, సీతను అపహరిస్తే నీకు అపాయం తప్పదు. ఓరీ! నేను ముసలివాడినని అలక్ష్యం చేయవద్దు. నాకు ఇప్పుడు అరవై వేల సంవత్సరాల వయస్సు. ఇన్నాళ్లూ ఏలోపం రాకుండా తండ్రి రాజ్యాన్ని పాలించాను. నువ్వు ధృడమైన వయసులో వున్నావు. విల్లు, రథం, కవచం, బాణాలు వున్నా శూరుడివి. నేను ముసలివాడిని. అయినా సీతను నా కళ్లెదుట తీసుకుని నువ్వు సుఖంగా పోలేవు. చెప్పినమాట విను. సీతను హరించి రాముడినుండి విడదీయలేవు. రాక్షసుడా పరుగెత్తకుండా మగవాడివైతే కాసేపు యుద్ధం చేయి. యుద్ధం చేస్తే ఖరుడు చచ్చినట్లు నువ్వూ చస్తావు. ఎన్నోసార్లు రామచంద్రమూర్తి రాక్షసులను చంపినట్లు నిన్నూ చంపుతాడు. ఎందుకు ప్రాణభయంతో పరుగెత్తుతావు? నువ్వు కాసేపుంటే రామలక్ష్మణులను తెస్తాను. నేను వారికై పొతే నువ్వు లంకకు పారిపోతావు”.


         “నా దేహంలో ప్రాణం వున్నంతవరకు సీతాదేని తీసుకుని నిన్ను పోనీయను. నా ప్రాణానికి ప్రమాదం కలిగినా సంతోషమే. నేనేం చేస్తానో చెప్తా విను. పోవద్దు...పోవద్దు...నిలబడు. రావణా..నేనేం చేస్తానో చెప్తా. నువ్వు పోవాలనుకున్నా నా కంటబడి ఎక్కడికీ పోలేవు. ఎదిరించి నా శక్తికొద్దీ నీకు ఉత్సాహంగా యుద్ధ బిక్ష పెట్తాను. దానిని స్వీకరించు. నిన్ను రథం మీదనుండి నేలపడగొడ్తాను”.

జటాయువు మాటలు విన్న రావణాసురుడు వీడిని ఎలాగైనా హతమార్చాలన్న పట్టుదలతో, కోపం తెచ్చుకుని, తన ఇరవై కళ్ళనుండి నిప్పులురాలుస్తూ, జటాయువును తాకాడు. అలా వాళ్లిద్దరూ ఒకళ్లనొకరు ఎదిరించుకున్నప్పుడు పెద్దగాలితో చిమ్మబడిన రెండు మేఘాలు ఒకదానినొకటి తగిలినట్లు, రెక్కలున్న రెండు మాల్యవంతాలు గుద్దుకున్నట్లు వుంది. ఇద్దరూ అలా సమాన బలవేగాలతో ఎదుర్కున్నారు ఒకరినొకరు. ఆ ఇద్దరూ ఆశ్చర్యకరంగా యుద్ధం చేస్తుంటే, రావణుడు జటాయువు మీద కుప్పలు-కుప్పలుగా, వర్షంలాగా, పదునైన భయంకర బాణాలను ప్రయోగించాడు. జటాయువు వాటన్నిటినీ తన ముక్కుతో, గోళ్లతో నేలబడగొట్టాడు. రావణుడి శరీరమంతా పుండులాగా అయ్యేట్లు జటాయువు తన గోళ్లతో చీల్చి చాలా బాధ కలిగించాడు. దీంతో కోపం తెచ్చుకున్న రావణుడు “చచ్చావురా జటాయూ!” అంటూ, పదునైన బాణాలను గురిచూసి కొట్టాడు. ఆ బాణాలను సంధించిన విల్లును సాహసంతో, రావణుడి మీదకు దూకి, రెండు తునకలుగా జటాయువు విరిచాడు.

No comments:

Post a Comment