Tuesday, May 7, 2019

ఎన్నాళ్లీ ఎన్నికల నియమావళి? : వనం జ్వాలా నరసింహారావు


ఎన్నాళ్లీ ఎన్నికల నియమావళి?
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (08-05-2019)
          తూర్పు-పశ్చిమ జర్మనీలు కలిసి వుండకుండా విడివిడిగా వున్న రోజుల్లో ఒకరోజు, తూర్పు జర్మనీకి చెందిన ఒక పౌరుడు తన దేశంలో స్వాతంత్ర్యం లేదని భావించి దొంగతనంగా సరిహద్దు దాటి పశ్చిమ జర్మనీలోకి ప్రవేశించాడు. తనకు అంతులేని స్వాతంత్ర్యం లభించిందని పొంగిపోయిన ఆ పెద్ద మనిషి తన చేతి కర్రను విలాసంగా వూపుకుంటూ పశ్చిమ జర్మనీ వీధుల్లో తిరగడం ప్రారంభించాడు. ఆ కర్ర కాస్తా ఒకడి ముక్కుకు తగిలి వాడికి కోపం వచ్చింది. వాడు వెళ్లి ఇతగాడి మీద పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. కేసు న్యాయస్థానానికి పోయింది. ఎందుకు ఇలా చేశావని న్యాయమూర్తి కర్ర తిప్పిన ఆసామీని ప్రశ్నించాడు. పశ్చిమ జర్మనీకి రాగానే తనకు స్వాతంత్ర్యం  వచ్చిందని భావించాననీ, అందుకే కర్రను ఇష్టం వచ్చినట్లు తిప్పాననీ జవాబిచ్చాడు. అతడి స్వాతంత్ర్యం పక్కవాడి ముక్కు చివర మొదలవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించాడు. అలా వుంది మన ఎన్నిక ప్రవర్తనా నియమావళి. ఎక్కడ మొదలవ్వాలో, ఎక్కడ పూర్తి కావాలో అర్థం లేని-కాని ప్రవర్తనా నియమావళి మనది. భారత దేశ సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో నెలల తరబడి ప్రవర్తనా నియమావళి అమల్లో వుంటే ప్రభుత్వాలు పని చేసేదెలా అనేది సమాధానం లేని ప్రశ్న.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో చాలామంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కొన్ని అభ్యంతరాలు లేవదీశారు ఇటీవలి కాలంలో. వాస్తవానికి ప్రవర్తనా నియమావళి పేరుతో ఎన్నికల సంఘం తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నదని చాలామంది పిర్యాదులు చేయడం కూడా జరుగుతోంది. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల ప్రక్రియ మొదలై, ముగిసేంతవరకు పోటీలో వున్న రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ వ్యవహరించాల్సిన తీరుతెన్నులే అయి వుండాలి. అంతకు మించి వుండడం భావ్యం కాదేమో! భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికల తతంగమంతా ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఎన్నికలు ముగిసిన చాలాకాలం వరకూ ఫలితాలు ప్రకటించరు. ఎన్నికలై పోయిన తరువాత కూడా ‘ఇది చేయవద్దు...అది చేయవద్దు అంటే అది సమంజసం కాదేమో! అదే విధంగా ఎన్నికల సభల్లో చేసిన ప్రసంగాలను సాకుగా చూపి, వున్నదానికీ, లేనిదానికీ అభ్యంతరాలు లేవదీసి నోటీసులు ఇవ్వడం భావ్యమేనా? హిందూ మతం మీద ఎదో వ్యాఖ్యలు చేశాడని తెలంగాణ సీఎం కు సంజాయిషీ నోటీసు ఇవ్వడం, ఆయన దానికి ఇచ్చిన జవాబుకు బదులుగా ఆయన ప్రసంగంలో తప్పులెంచడంలో ఔచిత్యం వుందా? 

అధికారంలో వున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రులను, అధికారిక సమీక్షలు నిర్వహించవద్దని ఆంక్షలు విధించడం కూడా సమంజసం కాదేమో! ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి ఎన్నికలు ముగిసిన రాష్ట్రాలలో ఇంకా ప్రవర్తనా నియమావళి కఠినతరంగా అమలు చేయడం అసలే సమంజసం కాదు. ఉదాహరణకు ఫోని తుపాను సహాయ చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన అవసరం వుందా? అత్యవసర సమయాల్లో సంప్రదాయ బద్ధంగా వ్యవహరించాలని కోడ్ వుంది కాబట్టి సమీక్షలు జరపరాదని అనడం సబబు కాదేమో! ఫోని తుపాన్ సందర్భంగా చేపట్టాల్సిన అత్యవసర సహాయక చర్యల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించడంలో తప్పేమీ లేదు. నిర్వహించక పోతేనే తప్పు. వాస్తవానికి రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగిసినందున ఓటర్లను ప్రభావితం చేయడం అన్న సమస్య తలెత్తదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి సాకుతో బాధ్యతారాహిత్యంగా సమీక్షలు నిర్వహించకపోతే ఎన్నికైన ప్రభుత్వానికి అర్థమే లేదు. అధికార-అనధికార బృందం ప్రజలకు జవాబుదారీగా వుండాలి కాని ఎన్నికల సంఘానికి కాదు. ఇదే పరిస్థితి ఒరిస్సా రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది.    
 
ఈ నేపధ్యంలో ఉత్పన్నమయ్యే మౌలికమైన ప్రశ్న.....ఎన్నికల తతంగం ముగిసేంతవరకూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు? అనేదే. సాధారణ ఎన్నికల తతంగం పూర్తిగా అయ్యేదాకా, తరువాత ఈ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చేదాకా, పరిపూర్ణ అధికారంతో పాలన సాగించడానికి, ఏ విధమైన ఆంక్షలు లేకుండా విధులు నిర్వహించడానికి అవకాశం వుండాలి. అంతర్లీనంగా కానీ, బహిర్గతంగా కానీ, రాజ్యాంగంలోనైనా, మరెక్కడైనా, ఫలానా ప్రధాన విధాన నిర్ణయమైనా, ఫలానా ఆర్థికపరమైన నిర్ణయమైనా, తీసుకోరాదని చెప్పడం జరగలేదు.

ప్రజాస్వామ్యంలో నిరంతర పాలన కొనసాగడానికీ, అట్టడుగు-దళిత-అణగారిన వర్గాల లబ్దికి అభివృద్ధి-సంక్షేమ పథకాలు నిరాటంకంగా అమలుకావడానికీ, ఆర్థికభారంతో నిమిత్తం లేకుండా, నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఆంక్షలు వుండకూడదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, మనందరికీ అనుభంలో ఉన్నట్లుగా, ప్రజల అవసరార్థం, వారి లాభంకొరకు, ప్రభుత్వం సమీక్షలు నిర్వహించవచ్చు.


         ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆవిర్భావం, పరిణామక్రమం, ఆటుపోట్లు గురించి తెల్సుకోవడం ఆసక్తికరమైన విషయమే. మొట్టమొదటి సారిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కేరళలో 1960 సంవత్సరంలో, ఫిబ్రవరి నెలలో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా అమల్లోకి తేవడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు సంయుక్తంగా, ఏకగ్రీవంగా ఒక ముసాయిదా ఎన్నికల నియమావళిని రూపొందించింది. ఇది స్వయం క్రమశిక్షణ. దాంట్లో ఎన్నికల ప్రచారానికి, ఉపన్యాసాలకు, నినాదాలకు సంబంధించిన ఆంక్షలు పొందుపరచడం జరిగింది. దరిమిలా 1962 లో జరిగిన రాష్ట్రాల శాసనసభ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సక్రమ నిర్వహణకు గాను ఇదే ముసాయిదాను అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది. ఆ తరువాత 1968, 1969 లో వివిధ రాష్ట్రాలలో జరిగిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఈ ముసాయిదా ఆధారంగా ఎన్నికల సంఘం ఒక డాక్యుమెంట్ ను తయారుచేసింది. అందులో రాజకీయ పార్టీల బాధ్యతలను వివరించడం జరిగింది.  దరిమిలా అదే అంచెలంచలుగా మార్పులు-చేర్పులు చోటు చేసుకుంటూ ప్రస్తుతం అమల్లో వున్న ప్రవర్తనా నియమావలిగా రూపుదిద్దుకుంది.  
      
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపధ్యంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తత్సంబంధిత  సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్యణ్యంకు నోట్‌ పంపించినట్లు వార్తలొచ్చాయి. దీనిని రొటీన్ గా, బహుశా, సీఎస్ సాధారణ పరిపాలన (పొలిటికల్‌) శాఖ కార్యదర్శికి పంపించాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడం సహేతుకమా? కాదా? అనే అంశాలు ప్రస్తుతం ఐఏఎస్‌ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం తీసుకున్న నిర్ణయం సమంజసమైనది కాదని కొందరు, సరైనదే అని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

సాధారణ పరిస్థితుల్లో కేబినెట్‌ సమావేశాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం పెట్టుకోవచ్చు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్‌ సమావేశం పెట్టాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ముందస్తు అనుమతి తప్పనిసరి అని కొందరి వాదన. కాకపోతే, ప్రస్తుతం కోడ్‌ ఉన్న సమయంలో అత్యవసరమై కేబినెట్‌ సమావేశం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే దాన్ని ఎన్నికల కమిషన్‌ ఆమోదించాలి కాని తిరస్కరించడం సబబేనా? ఇదిలా వుంటే ఈ అంశం ముఖ్యమంత్రికీ, సివిల్ సర్వెంటయిన ప్రధాన కార్యదర్శికి మధ్య విభేదాలకు దారితీయవచ్చా? అసలు పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో మంత్రులకూ, సివిల్ సర్వెంట్లకూ మధ్య ఎలాంటి సంబంధాలుండాలి అనేవి కూడా చర్చనీయాంశమే!

ముఖ్యమంత్రి వివిధ స్థాయిలలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణమైన విషయం. ఎన్నికల్ కోడ్ వున్నా, లేకపోయినా సమీక్షా సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదే. అందునా సివిల్ సర్వెంట్లుగా పిలిచే ఐఏఎస్ అధికారులదే. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి, ముఖ్యమంత్రికి రాజ్యాంగ పరంగా ఎంత బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యతే ఉంటుంది. అధికారికీ, మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి.

మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకు మధ్య ఉండాల్సిన సంబంధాలను, సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలను, బ్రిటన్ లో రూపొందించిన "ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" లో వివరించారు. వాటిని పరిగణనలోకి తీసుకొని, సంబంధిత పరిణామాలను సమీక్షించడం సబబు. సివిల్ సర్వెంట్లు (అధికారులు) మంత్రులకు జవాబుదారీగా ఉండాలి.  మంత్రులకు అంటే, ప్రజాతీర్పు ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని అర్ధం చేసుకోవాలి. రాజకీయాలతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా ప్రభుత్వానికి సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.  (ముఖ్య) మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం వారి ప్రధమ కర్తవ్యం.  అధికారంలో ఉన్న ప్రభుత్వానికి-అంటే సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి వారు అవసరమైన సూచనలు ఇస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో సహకరిస్తూండాలి. తమ ఇష్టాయిష్టాలకు అతీతంగా నిర్ణయాల అమల్లో తోడ్పడుతూ వుండాలి. తనకు తెలిసిన సమస్త సమాచారంతోపాటు తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలి.  (ముఖ్య) మంత్రి ఆలోచన సరళికి భిన్నమైన దైనా, ఇవ్వవలసిన శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాలి.

సివిల్ సర్వెంట్లు మంత్రికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోయినా, తాను అత్యంత శ్రేష్టమని నమ్మిన సలహాకు బదులు వేరే సలహా ఇచ్చినా, మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసే ప్రయత్నం చేసినా, అది పూర్తి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది.  ఇదంతా జరిగిన తరువాత మంత్రి తీసుకునే నిర్ణయం ఏదైనా, దానిపై తనకెన్ని సందేహాలున్నా, అభిప్రాయభేదాలున్నా, అమలు విషయం వచ్చేసరికి ఎటువంటి అరమరికలు లేకుండా చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో పనిచేయాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండంలో స్పష్టం చేశారు.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మాతృకైన బ్రిటన్లో అమలవుతున్న సత్ సంప్రదాయాలను ఇక్కడా ఆచరణలో పెట్టి పనిచేయడం మంత్రులకూ, అధికారులకూ మంచిది.

ఈ నేపధ్యంలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిణామాలను విశ్లేషించి చూస్తే ఒక్క విషయం స్పష్టంగా అవగాహన చేసుకోవచ్చు. అక్కడ ముఖ్యమంత్రికీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ అభిప్రాయ భేదాలున్నాయని చెప్పకనే చెప్తున్నాయి జరుగుతున్న సంఘటనలు. మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సాధారణంగా పంపే నోట్ కు బదులు సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ముఖా ముఖిగా కానీ, ఫోన్లో కానీ మాట్లాడితే బాగుండేదేమో! ఏం చేస్తే ఎన్నిక ప్రవర్తనా నియమావళి అతిక్రమించకుందా మంత్రిమండలి సమావేశం జరుపుకోవచ్చని ఆయన్ను సంప్రదిస్తే బాగుండేదేమో! అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పట్టుదలకు పోకుండా ముఖ్యమంత్రిని కలిసి సాధ్యాసాధ్యాలను గురించి చర్చిస్తే బాగుంటుందేమో!   

2 comments:

  1. "హిందూ మతం మీద ఎదో వ్యాఖ్యలు చేశాడని తెలంగాణ సీఎం కు సంజాయిషీ నోటీసు ఇవ్వడం, ఆయన దానికి ఇచ్చిన జవాబుకు బదులుగా ఆయన ప్రసంగంలో తప్పులెంచడంలో ఔచిత్యం వుందా?"

    లేదండీ కేసీఆర్ గారిని తప్పెంచే వాళ్ళు తెలంగాణా ద్రోహులు. రాష్ట్రపతితో సహా ఎవరికీ ఇందులో ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపు ఇవ్వబడదు.

    ఆంధ్రప్రదేశ విషయం ఎత్తి "ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పట్టుదలకు పోకుండా ముఖ్యమంత్రిని కలిసి సాధ్యాసాధ్యాలను గురించి చర్చిస్తే బాగుంటుందేమో!"

    అసలు ఈ ప్రభుత్వ కార్యదర్శిని ఈసీ నమోగారి ఆదేశం మేరకు నియమించిందే సీయంను అన్నివిధాలా ఆడ్డుకోమని. తెలియనట్లు మాట్లాడతారేం?
    l

    ReplyDelete
  2. ఈ దిక్కుమాలిన ఫాల్తు ఎన్నికలు రెండు నెలలు ఏడు విడతలా? ఇదివరకు ఒకేరోజులో ముగిసిపోయేది ఈ తంతు. రెండు దశలు చాలు. ఫలితాలు వచ్చేలోపలే ఏదొ పనికిమాలిన కారణంతో రాజీనామాలు. మళ్ళీ ఎన్నికలు. థూ మీ బతుకులు చెడ. ఎందుకురా ప్రజలను సంపకతింటారు.

    ReplyDelete