Friday, May 3, 2013

నాలుగు శతాబ్దాల హైదరాబాద్-3: ఆసఫ్ జాహీ వంశీయులు: వనం జ్వాలా నరసింహారావు


నాలుగు శతాబ్దాల హైదరాబాద్-3
ఆసఫ్ జాహీ వంశీయులు
వనం జ్వాలా నరసింహారావు
ప్రశ్నలు: జవాబులు
1.    ఎవరి ఏలుబడిలో, ఏ సంవత్సరంలో, నిజాం-ఉల్-ముల్క్ దక్కన్ గవర్నర్‍గా నియమించబడ్డాడు? (ఫారూక్ సియార్, 1773)

2.   హైదరాబాద్ ప్రధమ నిజాం అసలు పేరు, పూర్తి పేరు ఏమిటి? (మీర్ క్వుమార్ ఉద్దీన్ ఖాన్; నిజాం-ఉల్-ముల్క్ ఫోరోజ్ జంగ్ ఆసఫ్ జా)

3.   మొదటి నిజాం తాతగారి పేరేంటి? (క్వాలిచ్ ఖాన్ లేదా ఖాజా ఆబిద్)

4.   మొదటి నిజాం తండ్రి గారు ఏం ఉద్యోగం చేస్తుండేవారు? (షాజహాన్ ప్రధాన మంత్రిగా)

5.   నిజాం-ఉల్-ముల్క్ పుట్టిన తేదీ ఏమిటి? ఆయన పుట్టినప్పుడు పెట్టిన పేరేంటి? పేరు పెట్టిందెవరు? ఆయన చనిపోయింది ఎప్పుడు? (ఆగస్ట్ 11, 1671-14 రబీ-ఉస్-సానీ-1082 హిజ్రీ; మీర్ క్వుమార్ ఉద్దీన్; ఔరంగజేబ్; మే 22, 1748)

6.   మొదటి ఆసఫ్ జా నిజాం-ఉల్-ముల్క్ మరణానంతరం ఆయన ఇద్దరు కుమారులు, కూతురు కొడుకు, దక్కన్ సుబేదారులుగా ఒకరి తదుపరి మరొకరు సుమారు 14 సంవత్సరాల పాటు నియమించబడ్డారు. ఆయితే వారెవరు ఆసఫ్ జా అని కాని, నిజాం అని కాని బిరుదు పొందలేదు. వారెవరు? (నసీర్ జంగ్, సల్బత్ జంగ్, ముజఫర్ జంగ్-నిజాం కూతురు ఖైరున్నిస్సా బేగం కుమారుడు)

7.   రెండవ ఆసఫ్ జా నిజాం అలీఖాన్ పుట్టినదెప్పుడు? ఆయన దక్కన్ సుబేదారుగా పదవీ బాధ్యతలు చేపట్టినదెప్పుడు? చనిపోయింది ఎప్పుడు? (ఫిబ్రవరి 24, 1734; జులై 8, 1762; ఆగస్ట్ 6, 1803)

8.   మూడవ ఆసఫ్ జా ఎవరు? పుట్టిన దెప్పుడు? దక్కన్ సుబేదారుగా ఎప్పుడు నియమితులయ్యారు? ఆ నియామకాన్ని ధృవీకరించినదెవ్వరు? (సికందర్ జా; నవంబర్ 11, 1768: ఆగస్ట్ 11, 1803; షా ఆలం చక్రవర్తి)

9.   నాలుగవ ఆసఫ్ జా ఎవరు? పుట్టినదెప్పుడు? సింహాసనం అధిష్టించినదెప్పుడు? చనిపోయిందెప్పుడు? (సికందర్ జా పెద్ద కొడుకైన మీర్ ఫర్ కుందా ఆలీఖాన్ నజీర్-ఉద్-దౌలా; ఏప్రిల్ 25, 1794; మే 23, 1829; మే 16, 1857)

10. 1829 వ సంవత్సరంలో సింహాసనం అధిష్టించిన వెనువెంటనే నాలుగవ ఆసఫ్ జా తీసుకున్న మొట్టమొదటి ప్రాముఖ్యత సంతరించుకున్న చర్య ఏంటి? (యూరోపియన్ అధికారులను సివిల్ సర్వీస్ ఉద్యోగాల నుంచి ఉపసంహరించుకోవాల్సిందిగా గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్‌కు విజ్ఞప్తి చేయడం-దానికి ఆయన అంగీకారం తెలపడం)

11.  నసీర్ ఉద్-దౌలా పాలనా కాలంలో ఆయన వద్ద మంత్రిగా పని చేస్తున్న నవాబ్-సిరాజ్-ఉల్-ముల్క్ సలహా మేరకు నిజాం ప్రవేశ పెట్టిన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సాంఘిక సంస్కరణ ఏంటి? (సతీ సహగమన నిషేధ చట్టం)

12. 1857  కాలం నాటి ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం లేక సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు అధికారంలో వున్న ఆసఫ్ జా ఎవరు? (ఐదవ ఆసఫ్ జా అఫ్జల్-ఉద్-దౌలా)

13. ఐదవ ఆసఫ్ జా అఫ్జల్-ఉద్-దౌలా పుట్టిన దెప్పుడు? గద్దె ఎక్కింది ఎప్పుడు? చనిపోయిందెప్పుడు? (అక్టోబర్ 11, 1827; మే 18, 1857; 26, ఫిబ్రవరి 1869)

14. మొగలు సుబేదారుగా నిజాం వ్యవహరించడం ఆగిపోయిందెప్పుడు? (1857)

15. "ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా" అన్న బిరుదును బ్రిటీష్ ప్రభుత్వం, నవాబ్ అఫ్జల్-ఉద్-దౌలాకు ప్రధానం చేసిందెప్పుడు? (ఆగస్ట్ 31, 1861)

16. నగర సరిహద్దుల లోపున ఏ తరహాకు చెందిన దుకాణాలుండ కూడదని ఆదేశించి, వున్నవాటిని తొలగించమని అఫ్జల్-ఉద్-దౌలా ఉత్తర్వులు జారీచేయడం జరిగింది? (మద్యం దుకాణాలు)

17. అఫ్జల్-ఉద్-దౌలా చొరవ తీసుకుని, ఆయన పర్యవేక్షణ-బాధ్యత కింద హైదరాబాద్‌లో నిర్మించబడిన మూడు ప్రధాన కట్టడాలు ఏమిటి? (అఫ్జల్ గంజ్ మస్జీద్, అఫ్జల్ గంజ్ వంతెన, అఫ్జల్ గంజ్ బజారు)


18. ఆసఫ్ జా రాజ వంశపు సింహాసనాన్ని నవాబ్ అఫ్జల్-ఉద్-దౌలా ఏకైక కుమారుడు మీర్ మహబూబ్ అలీఖాన్ అధిష్టించిన సమయంలో అతడి వయసెంత? ఆయన పుట్టినదెప్పుడు? మరణించినదెప్పుడు? ( కేవలం రెండు సంవత్సరాల ఏడు నెలల వయస్సులో ఫిబ్రవరి 29, 1869; ఆగస్ట్ 17, 1866; ఆగస్ట్ 29, 1911)

19. వైస్రాయ్ లార్డ్ రిప్పన్, మీర్ మహబూబ్ అలీఖాన్‌కు సంపూర్ణ పరిపాలనా బాధ్యతలు అప్పగించినదెప్పుడు? (ఫిబ్రవరి 5, 1885)

20.                1893 లో మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రవేశపెట్టిన ముఖ్యమైన సంస్కరణ ఏమిటి? (శాసనాధికార వ్యవహారాల కాబినెట్ కౌన్సిల్, చట్టాలు రూపొందించే విధాన మండలి ఏర్పాటుకు వీలు కలిగించే "క్వానుంచే ముబారిక్" అనే ప్రభుత్వ అధికారిక ప్రకటన)

21. హిందూ-ముస్లిం అనాథ-నిరుపేద పిల్లలకు ఆశ్రయం కలిగించే లక్ష్యంతో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, హైదరాబాద్‌లో నెలకొల్పిన సంస్థ పేరేమిటి? ఎప్పుడు నెలకొల్పారు? (సరూర్ నగర్ లో అసంపూర్తి గా నిర్మించిన తన భవనాన్ని విక్టోరియా మహారాణి జ్ఞాపకార్థం ఇచ్చి, అందులో "విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్" నెలకొల్పారు. మే 5, 1905)

22.                "గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా" అన్న బిరుదును మీర్ మహబూబ్ అలీఖాన్‌కు ఎప్పుడు ప్రదానం చేశారు? (ఫిబ్రవరి 5, 1885)

23.                మీర్ మహబూబ్ అలీఖాన్ కున్న ప్రజాదరణతో ఆయనను పిలిచే పేరేమిటి? (మహబూబ్ అలీ పాషా)

24.                మహబూబ్ అలీ ఖాన్ ఎలా, ఎక్కడ, ఎప్పుడు మరణించారు? (పక్షవాతంతో ఆగస్ట్ 29, 1911 న ఫలక్ నుమా పాలెస్ లో చనిపోయారు)

25.                ఏడవ ఆసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పుట్టిన దెప్పుడు? నిజాంగా ప్రకటించబడిందెప్పుడు? ఎప్పుడు మరణించారు? (ఏప్రిల్ 5, 1886; ఆగస్ట్ 29, 1911; ఫిబ్రవరి 24, 1967)

26.                ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వివాహమాడారు? (ఏప్రిల్ 14, 1906; తన 21 వ ఏట; ఈడెన్ బాగ్ లో నవాబ్ జహంగీర్ జంగ్ కుమార్తె దుల్హన్ షా బేగంను)

27.                ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  పట్టాభిషేకం ఎక్కడ, ఎప్పుడు జరిగింది? (సెప్టెంబర్ 12, 1911 న చౌ మహల్లా పాలెస్ లో)

28.                నిజాం డొమినియన్ ఏలికగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సాధించిన అత్యంత ప్రాముఖ్యమైన విషయమేంటి? (నవంబర్ 17, 1919 న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ నూతన రాజ్యాంగ రూపకల్పన)

29.                నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ప్రిన్స్ ఆజం జా బహదూర్, మరో కొడుకు ప్రిన్స్ మౌజం జా బహదూర్ పెళ్లి చేసుకున్నదెవరిని? ఎప్పుడు? (రాజకుమారి దుర్రు షెహవార్, రాజకుమారి నిలోఫర్; నవంబర్ 12, 1931)

30.                నవంబర్ 29, 1947 న భారత డొమినియన్‍తో నిజాం కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? ఎవరి సలహా మేరకు ఆయన దానిపై సంతకం చేసారు? (ఒక సంవత్సర కాలం పాటు అమలులో వుండేలా అంగీకరించబడిన "స్టాండ్ స్టిల్" ఒడంబడిక. లార్డ్ మౌంట్ బాటన్, సర్ వాల్టర్ మెన్క్ టాన్ ల సలహా మేరకు)

31. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను రద్దు చేసిందెప్పుడు? (నవంబర్ 28, 1947 న)

32.                హైదరాబాద్ పైన పోలీస్ చర్య పర్యవసానంగా, దానిని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడంతో, భారత ప్రభుత్వం, నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఏ పదవినిచ్చింది? ఆయన ఆ పదవిలో ఎంత కాలం వున్నారు? (రాజ ప్రముఖ్, జనవరి 26, 1950 నుండి అక్టోబర్ 31, 1956 వరకు-ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలకు పైగా)

33.                మొగల్ చక్రవర్తి పంపే ఫర్మానాలను స్వీకరించేందుకు నిజాం-ఉల్-ముల్క్ వెళ్తుండే రాజ ప్రాసాదం పేరేమిటి? ఫర్మానాలను అందుకునే సమయంలో చక్రవర్తి పట్ల తనకున్న గౌరవ మర్యాదలను నిజాం ఏ విధంగా వ్యక్తం చేసేవారు? (ఫర్మాన్ బాడి భవనం. సకల లాంఛనాలతో ముందుగా ఫర్మానాలను అందుకున్న దివాన్, వాటిని వెంటనే నిజాం-ఉల్-ముల్క్ కు ఇచ్చేవారు. నిజాం తన నెత్తిపై వరకు గౌరవ సూచకంగా వాటిని ఎత్తి చూపేవారు)

34.                మొదటి నిజాం మరణానంతరం జరిగిన అధికార కుమ్ములాటలో ఫ్రెంచ్ వారు ఎవరిని, ఆంగ్లేయులు ఎవరిని సమర్థించారు? (ఖైరున్నిసా బేగం కొడుకు, నిజాం మనుమడు ముజఫర్ జంగ్‍కు ఫ్రెంచ్ వారి మద్దతు లభించగా, ఆయన రెండవ కుమారుడు నసీర్ జంగ్‍కు బ్రిటీష్ వారు అండగా నిలిచారు)

35.                హైదరాబాద్ ప్రజలు తరతరాలుగా గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రధానమైన పనిని రెండవ ఆసఫ్ జా నిజాం అలీఖాన్ చేశారంటారు. అదేంటి? (76 సంవత్సరాల విరామం తరువాత రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలించి, దానికి గత వైభవాన్ని పునరుద్ధరించడం)

36.                గుంటూరు సర్కారు ప్రాంతాల విషయానికి సంబంధించిన ఒప్పందాన్ని వివరంగా తెలియచేసేందుకు, హైదరాబాద్ లోని నిజాం కోర్టుకు, మద్రాస్ ప్రభుత్వం ఏప్రిల్ 1779 లో పంపిన వ్యవహార దక్షుడెవరు? (జాన్ హాలెండ్)

37.                ఏప్రిల్ 1779 లో మద్రాస్ ప్రభుత్వం దౌత్య బృందం ప్రతిపాదించిన ఒప్పంద వివరాలను నిజాం తిరస్కరించడంతో, తిరిగి జులై 1780 లో ఎవరిని పంపటం జరిగింది? (జేమ్స్ గ్రాంట్)

38.                "నిజాం పోతే అంతా పోయినట్లే" అని వ్యాఖ్యానించిందెవరు? ఏ సందర్భంలో అలా వ్యాఖ్యానించారు? (1857 నాటి సిపాయిల తిరుగుబాటు సందర్భంలో హైదరాబాద్ లోని బ్రిటీష్ రెసిడెంట్‌కు పంపిన టెలిగ్రాంలో బొంబాయి గవర్నర్ ఆ విధంగా వ్యాఖ్యానించారు)

39.                నిజాం రాజులు అధికారికంగా స్వతంత్రులెప్పుడు అయ్యారు? (1857 నాటి సిపాయిల తిరుగుబాటు తదుపరి కాలంలో మొగలాయి చక్రవర్తుల అధికారం అంత్య దశకు చేరువవుతున్నప్పుడు)

40.                మీర్ మహబూబ్ అలీఖాన్, ఆరవ నిజాం హోదాలో ప్రప్రధమంగా ప్రజలకు దర్శనమిచ్చినప్పుడు ఆయన వయసెంత? ఎప్పుడు కనిపించారు? ఏ సందర్భంలో కనిపించారు? (11 సంవత్సరాల బాలుడుగా వున్నప్పుడు. జనవరి 1877 లో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రిటీష్ మహారాణి నిజాంకు అధికారాలు అప్ప చెప్పినప్పుడు)

41. 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకోవడంతో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఫిబ్రవరి 5, 1885, ప్రభుత్వ నిర్వహణకు పాలనాపరమైన సమస్త బాధ్యతలను స్వీకరించారు. అప్పటి పదవీ  ప్రమాణ స్వీకార ఉత్సవానికి హైదరాబాద్ విచ్చేసిన వైస్రాయ్-భారత గవర్నర్ జనరల్ ఎవరు? (లార్డ్ రిప్పన్)

42.                1893 వ సంవత్సరంలో, పాలనాపరంగా, హైదరాబాద్ ఒక ప్రాముఖ్యమైన రాజ్యాంగ మెట్టును అధిగమించింది. అదేంటి? ("క్వానుంచే-ఇ-ముబారిక్" అనే ప్రభుత్వ ప్రకటన ద్వారా రాజ్యాంగంలో పలు సంస్కరణాత్మక మార్పులకు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యమైంది కాబినెట్ కౌన్సిల్, విధాన మండలి ఏర్పాటు)

43.                పిన్న వయస్సులో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆటలు, గుర్రపు స్వారీ, షూటింగ్, క్రికెట్ ఎవరి పర్యవేక్షణలో నేర్చుకున్నారు? (నిజాం ఆర్మీ కమాండర్-ఇన్-ఛీఫ్ కల్నల్ సర్ అఫ్ సర్-ఉల్-ముల్క్ పర్యవేక్షణలో)

44.                మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఆంగ్ల భాష నేర్పిందెవరు? (సర్ బ్రియర్ ఈగర్టన్)

45.                నవంబర్ 17, 1919 న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రంలో, అభ్యుదయం-అభివృద్ధి దిశగా ఒక నూతనాధ్యాయానికి నాంది పలికారు. అది ఆయన ఏ విధంగా చేసారని చెప్పవచ్చు? (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వుండే నూతన రాజ్యాంగాన్ని అమలులోకి తేవడం)

46.                నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు సదర్-ఇ-ఆజం (అధ్యక్షుడు) ఎవరు? (సర్ అలీ ఇమాం)

47.                బ్రిటీష్ ఇండియా పౌరుల ఆందోళనా ఫలితంగా వారి డిమాండ్ మేరకు, మొట్టమొదట హైదరాబాద్‌లో ప్రవేశపెట్టిన ఒక సంస్కరణకు బాధ్యుడు నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు. ఆ సంస్కరణ ఏంటి? (న్యాయ వ్యవస్థను శాసనాధికారం నుంచి వేరు చేయడం)

48.                1914 నాటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగే అధికారిక ఉత్తర్వు ద్వారా చేసిన ఒక అభ్యర్థనను పురస్కరించుకుని, ఆ నాటి ప్రజాదరణ పొందిన ఉద్యమానికి వ్యతిరేకంగా తగు చర్యలు తీసుకున్నారు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఏమిటా ఉద్యమం? (భారత దేశంలో చెలరేగిన నాటి ఖిలాఫత్ ఉద్యమం)

49.                సెప్టెంబర్ 28, 1803 న మూడవ ఆసఫ్ జా సికందర్ జా ఆసఫ్ నిజాం జండాను ఎగురవేసిందెక్కడ? (హైదరాబాద్ నగరం, గోలకొండల మధ్య ఆసిఫ్ నగర్ సమీపాన వున్న గోవర్ధన్ దాస్ గార్డెన్‌లో)

50.                అక్టోబర్ 30, 1807 న ఆ ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని, నాటి నిజాం సికందర్ జా నిర్వహించిన దర్బారుకు హాజరైన ప్రముఖ వ్యక్తి ఎవరు? (మీర్ ఆలం బహదూర్)

51. మొదటి, చివరి నిజాంల సమాధులు మిగిలిన ఐదుగురి సమాధులున్న మక్కా మస్జీద్‍లో లేవు. అవి ఎక్కడ వున్నాయి? (నిజాం-ఉల్-ముల్క్ సమాధి ఖుల్దాబాద్ లోను, ఏడవ నిజాం సమాధి కింగ్ కోఠి సమీపం లోని జుడీ మస్జీద్ వద్దనూ వున్నాయి)

52.                ఎవరి ప్రేరణతో, నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, లక్ష రూపాయల విరాళాన్ని బనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి ఇచ్చాడు? (బికనీర్ మహరాజా పంపిన ఉత్తరం ప్రేరణతో)

53.                మూడవ ఆసఫ్ జా, సికందర్ జా, హైదరాబాద్ పాలకుడిగా ఎప్పుడు నియుక్తులయ్యారు? (1803 లో)

54.                "వాలాషన్ సోదరులు" గా ఎవరిని సంబోధిస్తారు? (మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమారులైన ప్రిన్స్ ఆజం జా బహదూర్, ప్రిన్స్ మౌజం జా బహదూర్ లను అలా పిలుస్తారు)

55.                బ్రిటీష్ రెసిడెంట్లు, వారి అనుచరులు, నిజాం దర్బారులో ప్రవేశించిన తరువాత, నెత్తి మీద టోపీ లేకుండా, కాళ్లకు పాద రక్షలు లేకుండా, ఒక తివాచిపై నిజాంకు కుడి భాగాన కూర్చునే ఆచారం వుండేది. బాసిపట్లు వేసుకుని, కింద కూర్చోవడం ఇబ్బందిగా వున్నందున కుర్చీలు ఉపయోగించుకునేందుకు అనుమతి కోరాడు ఒక రెసిడెంట్. నాటి నిజాం అఫ్జల్-ఉద్-దౌలా ఆ అభ్యర్థనకు ఎలా స్పందించారు? (రెసిడెంట్ తన కాళ్లు పెట్టుకునేందుకు ఒక గుంట తవ్వితే మంచిదని అన్నారు)

56.                తరతరాలుగా వాడుకలో లేని ఓ సనాతన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి దోహదపడిన ప్రక్రియ న్యాయ వ్యవస్థను శాసనాధికారం నుంచి విడదీయడం. ఇది హైదరాబాద్ రాష్ట్రంలో 1921 లో ప్రవేశ పెట్టిందెవరు? (సర్ అలీ ఇమాం అనే బీహార్ కు చెందిన ప్రముఖ బారిస్టర్)

57.                సంస్థానాధీశులు ఆంగ్లేయ భాషను విధిగా నేర్చుకోవాలన్న బ్రిటీష్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు పర్చేందుకు ఒక నిజాంకు ఇంగ్లీష్ ట్యూటర్‍ను 1869 లో నియమించారు. ఎవరా నిజాం? ఆ ట్యూటర్ పేరేమిటి? (నిజాం మీర్ మహబూబ్ అలీ పాషా. శ్రీమతి క్లాడ్ క్లర్క్ నీ సెర్ యాంటోనియా) 

1 comment:

  1. very good and useful information to all especially to Telangana people.

    ReplyDelete