Friday, May 24, 2013

అంతర్‌రాష్ట్ర జల వివాదాలు, రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు


అంతర్‌రాష్ట్ర జల వివాదాలు, రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (25-05-2013)

బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై కోర్టు తీర్పుమీద వివరణ, సమీక్ష కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు ముందు మూడంచెల వ్యూహం అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. ఇందులో భాగంగా ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీ పరిధి, అధికారాలపై స్పష్టత కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి లేఖ రాసే ఆలోచనలో వున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అదే లేఖలో , గోదావరి జలాల్లో మహారాష్ట్ర వినియోగించే 60 టీఎంసీలపై లెక్కల ఖరారు సంగతి కూడా తెలపాలని కోరవచ్చు. ఆ తరువాత నీటిపారుదల శాఖ మంత్రి నేతృత్వాన అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. ఈ విధంగా చేయడం వలన, బాబ్లీపై సుప్రీంకోర్టు తీర్పుమీద రాష్ట్ర ప్రభుత్వానికి వున్న సందేహాలను కేంద్రం ముందు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కేంద్రంనుంచి అనుకున్న స్పష్టత రాకపోతే, సుప్రీం కోర్టుకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలా? లేక క్లారిఫికేషన్ పిటిషన్ వేయాలా? అనే దానిపై న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి మార్చి 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రతిపక్షాలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించాయి.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు నలభై సంవత్సరాల వరకు, అటు కేంద్రంలోను, ఇటు పలు రాష్ట్రాలలోను కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో వున్నాయి. సరిహద్దు నున్న పొరుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తి, పార్టీ పరంగా చాలావరకు సమసి పోయినా, అన్ని విషయాల్లో-అన్ని సందర్భాల్లో అంగీకారానికి వచ్చాయని అనలేం. కాకపోతే ఆరంభంలో, రాష్ట్రానికి ఒకటో-రెండో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటివి మాత్రమే వుండడంతో, పెద్దగా పేచీలుండకపోయేయి. క్రమేపీ, ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులే కాకుండా, రక-రకాల పంపకాలలో విభేదాలు తలెత్తడం మొదలైంది. అవీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్యనే, కాంగ్రెస్ ఇంకా కేంద్రంలో అధికారం కోల్పోక ముందే తలెత్తాయి. కాంగ్రేసేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో, విభేదాలు చిలికి-చిలికి గాలివానలయ్యాయి. పొరుగు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను రాజకీయ కోణం నుంచి, రాజకీయ లబ్దిని దృష్టిలో వుంచుకుని చూడడం సహజమైంది. ఇంతలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ-తమ ప్రాంత ప్రజలకు లాభం చేకూరాలన్న కోణంలో ఆలోచన చేయడం, ఆ ఆలోచనలో రాజకీయం వుండడం, అంతటితో ఆగకుండా కొందరు నాయకులు పొరుగు రాష్ట్రాల వారికి నష్టం జరిగినా తమకు లబ్ది జరగాలని ముందుకు సాగడం నిరంతర సమస్యలకు నాంది పలింది. తమ రాష్ట్రం నుండి పారుతున్న నీటిపై తమకే హక్కు అని కొందరు వాదిస్తే, మిగులు జలాలపై హక్కు తమదనే అని మరికొందరు వాదించ సాగారు. సహజంగా ప్రవహించే నీటిపై హక్కు ఎవరికి-ఎంత మోతాదులో వుండాల్నోనని తేల్చాల్సిన కేంద్ర జల వనరుల సంఘం, ప్రాజెక్టులు ఆరంభించినప్పటినుంచి, పూర్తయ్యేవరకు నిమ్మకు నీరెత్తినట్లు వుండి, ఆ తర్వాత తమకే హక్కుందని వాదించే పొరుగునున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తమదైన శైలిలో వంతుల వారీగా మద్దతిచ్చి సమస్యను మరింత జటిలం చేయడం ఆనవాయితీ అయిపోయింది. అలాంటి తాజా వివాదమే బాబ్లీ ప్రాజెక్టు.


బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది, తప్పా-ఒప్పా అని నిర్ణయించే అధికారమున్న "కేంద్ర జల వనరుల సంఘం" తీర్పు చెప్పే లోపునే నిర్మాణం పూర్తైంది. తెలుగు దేశం హయాంలోనే పనులు మొదలయ్యాయని కాంగ్రెస్ వారు, కాదని తెలుగుదేశం నాయకులు వాదించు కోవడంతో మొదలైన జగడం, అప్పట్లో సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనే వరకు పోయింది. అఖిల పక్ష కమిటీ ప్రధానిని కలిసే లోపునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధుల బృందం, బాబ్లీ ప్రాజెక్టును సందర్శించి, స్వయంగా అధ్యయనం చేసి, ప్రధానికి అన్ని విషయాలు తెలియచేయాలన్న ఆలోచనతో ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకుంది. వారిని మహారాష్ట్రలోకి రానీకుండా అడ్డుకున్న మరాఠా పోలీసులు, అంతటితో ఆగకుండా, ప్రాజెక్టుకు తీసుకుపోతామని మభ్యపెట్టి పోలీసు వాహనం ఎక్కించి, అతి జుగుప్సాకరమైన పద్ధతిలో వారందరినీ "అరెస్టు" చేసినట్లు ప్రకటించి, మర్నాడు న్యాయమూర్తి ముందర హాజరు పరిచారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, మిగతా వారందరు చట్ట సభలకు ఎన్నికైన వారని కూడా చూడకుండా, అందులోనూ మహిళలున్నారని కూడా ఆలోచించకుండా, మరాఠీ పోలీసులు ప్రవర్తించారు అప్పట్లో.

ఒకానొక రోజుల్లో రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు, పొరుగు రాష్ట్రాలతో పోరాడవలసి వచ్చినప్పుడు, పార్టీలకతీతంగా కలిసి-మెలిసి పని చేసేవారు. ఇప్పుడా స్ఫూర్తి పోయింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన పని విమర్శించవచ్చునేమో కాని, ఆయన అరెస్టును, ఆ తర్వాత ఆయన పట్ల-ఆయన సహచరుల పట్ల మరాఠా పోలీసులు వ్యవహరించిన తీరును, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాని-ప్రభుత్వం కాని ఖండించక పోవడం శోచనీయం. అసలింతకీ బాబ్లీ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల రైతుల సమస్య. మహారాష్ట్ర రైతే బాగుపడాలని కాని, ఆంధ్రా రైతే బాగు పడాలని కాని కోరడం సమంజసం కాదు. భారత దేశంలోని రైతు ఎక్కడున్నా రైతే. జల వివాదాలు పరిష్కరించుకొని, అంతర్ రాష్ట్రాల గుండా పారుతున్న జలాలను, ప్రాజెక్టులు ఎక్కడ కట్టినా, పొరుగు నున్న రాష్ట్రాల రైతులకు కూడా లాభం కలిగేటట్లు ఉపయోగించుకోవాలి. రెండు-లేక-మూడు ఇరుగు-పొరుగు రాష్ట్రాల మధ్య జల వివాదం వుంటే, రాజకీయాలను ఆస్కారం లేకుండా, ఇతర రాష్ట్రాల ఇంజనీరింగు నిపుణుల సంఘం పరిష్కరించే విధానం రూపొందించాలి. వారి నిర్ణయాన్ని ధిక్కరించకుండా సంబంధిత రాష్ట్రాలు అమలు పరిచే చట్టం రూపొందించాలి. అంతవరకు రాజకీయాలకు అతీతంగా భారత దేశ రైతు లాభ పడే ఆస్కారం భవిష్యత్ లో లేదు.

చారిత్రాత్మకంగా-భౌగోళికంగా రూపు దిద్దుకొని, సుస్థిర జన సమూహంతో-సామాజిక వర్గంతో కూడి, ఉమ్మడి భాష-పరిసరాలు-ఆర్థిక జీవన శైలి-మానసిక స్థితిగతులు కలిగిన సార్వజనీన సమాజ లక్షణాలుంటే దానినొక "జాతి" గా-"దేశం" గా పరిగణించాలని, అదే జాతికి సరైన నిర్వచనమని, మార్క్సిస్ట్ సిద్ధాంతం చెపుతుంది. ఈ నిర్వచనం అన్ని కోణాల్లోంచి పరికించి చూస్తే సరిపోతోందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎల్లలతో కూడిన సరిహద్దులున్నప్పుడే దాన్ని ఒక ప్రత్యేక జాతిగా, లేదా, దేశంగా పిలవాలని మరి కొందరి అభిప్రాయం. గత కొన్నాళ్లపాటు వార్తల్లోకెక్కిన బాబ్లీ ప్రాజెక్ట్ వివాదం గమనిస్తుంటే, ఒక దేశం విషయంలో ఇది నిజం కావచ్చునేమో కాని, ఒకే దేశంలో-ఒకే జాతిలో (భారత జాతి-ఉదాహరణకు) భాగమైన వివిధ రాష్ట్రాల విషయంలో హద్దులు-సరిహద్దులు-ఎల్లలు-హక్కులు-ప్రత్యేకతలు-వేర్పాటు ధోరణులు అనే భావన కలగడం సరైందేనా? అని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైందనాలి.

భారతదేశం వివిధ రాష్ట్రాల సమాఖ్య (ఫెడరల్ తరహా వ్యవస్థ). కాకపోతే, పాక్షికంగా ఏక కేంద్రక ప్రభుత్వ విధానాన్ని పాటించే రాజ్యాంగ వ్యవస్థ అని కూడా అంటాం. ఒక వైపు సకలాధికారాలున్న కేంద్ర ప్రభుత్వం, మరో వైపు తమ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అదే మోతాదులో సర్వాధికారాలున్న రాష్ట్ర ప్రభుత్వాలు, సాధ్యమైనంత వరకు తమ-తమ హద్దుల్లో, రాజ్యాంగం నిర్దేశించిన పరిధుల్లో, అధికారాన్ని చలాయిస్తుంటాయి. రాష్ట్రాధికారాలని, కేంద్రం అధికారాలని, ఉమ్మడి అధికారాలని, వేర్వేరు రకాల అధికారాలను, అటు ఫెడరల్ విధానానికి-ఇటు యూనిటరీ విధానానికి భంగం కలగని రీతిలో రాజ్యాంగం నిర్దేశించింది. అంత వరకూ బాగానే వుంది కాని, ఒకే దేశంలో-ఒకే జాతిలో, భిన్న భాషలు మాట్లాడే, విభిన్న సంస్కృతులు అనుసరించే, రక-రకాల మనస్తత్వాలున్న సామాజిక వర్గంతో నిండిన వివిధ రాష్ట్రాల మధ్య అధికారాల-హక్కుల విషయంలో తేడాలొస్తే, పరిష్కరించుకునే విధానం అస్పష్టంగా వుండడంతో, బాబ్లీ లాంటి సమస్యలు ఉత్పన్నమవడం మొదలైంది.

అసలింతకీ మనముంటున్నది ఒకే దేశంలోని, ఒకే జాతి వారమా? లేక ఒకే దేశంలో నివసిస్తున్న విదేశీయుల మా? పొరుగునున్న ప్రాజెక్టును చూస్తామనడంలో తప్పేం టో అర్థం కావడం లేదు. ఇలాంటి సంఘటనలిలానే కొన సాగిస్తే, భిన్నత్వంలో ఏకత్వానికి-ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీకని మనం చెప్పుకుంటున్న భారతావని ప్రకటనలకే పరిమితం అనాల్సి వస్తుందేమో!

1 comment:

  1. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్యనేకాదు, ఒకే రాష్ట్రంలో - ఒకే భాష మాట్లాడే వారి మధ్య కూదా జాతీయతా భావం కొరవడటం - అందుకు స్వార్థ పర రాజకీయ నాయకులే కారణం అవుతుండటం నేడు దాపురించిన దౌర్భాగ్యం ! జాతి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడే నిస్వార్థ రాజకీయ వాతావరణం కల్పించటానికి మేధావుల ఉద్యమ స్ఫూర్తితో కూడిన కృషి నేటి అవసరం.

    ReplyDelete