Wednesday, May 15, 2013

ఐదు దశాబ్దాల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం-స్వీయ అనుభవాల నేపధ్యంలో అప్పుడు, ఇప్పుడు: వనం జ్వాలా నరసింహారావు


ఐదు దశాబ్దాల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం

స్వీయ అనుభవాల నేపధ్యంలో అప్పుడు, ఇప్పుడు

వనం జ్వాలా నరసింహారావు

మళ్లీ ఒక సారి తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చాం. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఆ భగవంతుడి దయవల్ల తిరుమలలో అన్నీ సౌకర్యాలు లభించాయి. తిరుమల-తిరుపతి దేవస్థానాల కార్య నిర్వహణ అధికారి శ్రీ ఎల్. వి. సుబ్రహ్మణ్యం గారికి నేను చేసుకున్న విజ్ఞప్తి ఫలించింది. నా కోరిక మేరకు మా దంపతులకు ఒక సుప్రభాత దర్శనం, రెండు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు ఇప్పించారాయన. మా వెంట ఒక టిటిడి అటెండర్‌ను కూడా పంపించారు. స్వామివారి దర్శనం మూడు పర్యాయాలు కూడా అతి దగ్గర నుంచి చేసుకునే భాగ్యం లభించింది. ఎల్. వి. గారు బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన దయవల్ల మాకు ఇలా జరగడం రెండో సారి. గత ఏడాది జూన్ నెలలో, మా రెండో కూతురు కిన్నెర కుమారుడు యష్విన్ ఉపనయనం తదుపరి, మా యావత్ కుటుంబం-సుమారు పది మంది వరకు తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చాం. అందరికీ అతి చేరువ నుంచి దర్శనం చేసుకునే భాగ్యం కలిగించారాయన. అప్పుడు కూడా సుప్రభాత దర్శనం, బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. ఒక నాడు బ్రేక్ దర్శనానికి వెళ్లినప్పుడు, అదృష్టవశాత్తు పాలక మండలి చైర్మన్ బాపిరాజు దేవాలయంలో కనిపించారు. మా కుటుంబాన్ని మొత్తం స్వామివారి ముందర ఐదు నిమిషాలకు పైగా నిలబెట్టి వుంచారు. తనివి తీరా దేవుడిని చూసే భాగ్యం అలా కలిగిందప్పుడు. కొన్ని కారణాల వల్ల మాతో ప్రయాణం చేయలోక పోయిన మా అబ్బాయి-కోడలు-మనుమరాలు మేం వెళ్లొచ్చిన మూడు రోజులకు వెళ్లాల్సి వచ్చింది. వాళ్లకు కూడా ఎల్. వి. గారు దర్శనాలు చక్కగా ఏర్పాటు చేశారు.  ఎల్.వి. గారికి సదా మా కృతజ్ఞతలు.

ఈ నెల 12 వ తేదీ ఆదివారం మా ఆఖరు చెల్లెలు కృష్ణవేణి కుమారుడు డాక్టర్ భరద్వాజ్ ఉపనయనానికి హాజరయ్యేందుకు మూడు రోజులపాటు (11, 12, 13) సతీ సమేతంగా తిరుమల వెళ్లొచ్చాను. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడానికి ఎప్పుడు వెళ్లాలనుకున్నా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాక్షాత్తు ఆ భగవంతుడే మాకు అన్నీ సమకూరుస్తుంటాడు. మా నాన్నగారు స్వర్గీయ వనం శ్రీనివాసరావుగారి అడుగుజాడల్లోనే, ఆయన చేసినట్లు గానే, మా నెలసరి ఆదాయంలో ఒక శాతం పైకాన్ని తిరుమల దర్శనార్థం విడిగా తీసి పెట్తుంటాం. మా ఆవిడా సలహా మేరకు, దానికి అదనంగా, ఉద్యోగంలో పదోన్నతి కలిగినప్పుడు, ఇంక్రిమెంటు వచ్చినప్పుడు, మొదటి నెల జీతం ఎంత పెరిగితే అంత మొత్తం కూడా ఆ తిరుమలేశుడి దర్శనార్థం ప్రత్యేకంగా దాచిపెడతాం. అలా కూడగట్టిన పైకంతో దైవ దర్శనం, తిరుమల వెళ్లడానికి ఖర్చులు, అక్కడ వుండడానికి అయ్యే ఖర్చు సమకూర్చుకుంటాం. ఇక తిరుగు ప్రయాణం కొరకు మాత్రం అవి ఉపయోగించం. ఖర్చు పెట్టగా మిగిలిన పైకం దేవుడి హుండీలో వేస్తాం. నాకు ఆదాయం రావడం మొదలైన గత 42 సంవత్సరాల నుంచీ ఇలా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు, అప్పటి ఆదాయానికి అనుగుణంగానే ఖర్చవుతున్నాయి కాని ఏనాడూ తిరుమల ప్రయాణం భారం మాత్రం కాలేదు. నాన్నగారి హయాంలో ఆయన ఖర్చుతో ఆయన వెంట వెళ్లిన నేను, ఆ తరువాత కాలంలో ఇలా చేస్తూ వస్తున్నాం. ఐతే, నాకు ఊహ తెలియక ముందు, తెలిసీ-తెలియని రోజుల్లో, తెలిసినప్పటి నుంచీ తిరుమల వెళ్లి రావడంలో చాలా మార్పులు స్వయంగా చూస్తూ వస్తున్నాను. అవి ఒక్క సారి నెమరేసుకునే ప్రయత్నమే ఇది.

          "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి" అన్నది జగమెరిగిన సత్యం. నిత్య కళ్యాణ చక్రవర్తైన శ్రీ వేంకటేశ్వరుడికి సరిసమానమైన దైవం, వేంకటాద్రికి సరితూగగల పుణ్యక్షేత్రం ముల్లోకాలలో, భూతకాలంలో లేదు-భవిష్యత్‍లో వుండబోదు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవ దర్శనం ఒక్క క్షణ కాలంపాటు కలిగినా చాలని, వందల-వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, లక్షలాది మంది భక్తులు, పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల కొండకు నిత్యం వెళుతుంటారు. స్వామిని దర్శించుకున్న సామాన్యులు కాని, అసామాన్యులు కాని, గంటల తరబడి క్యూలో నిలుచున్న వారు కాని, సరాసరి వైకుంఠ ద్వారం గుండా లోనికి వెళ్లగలిగిన వారు కాని, ఒక్క టంటే ఒక్క దర్శనం చాలనుకునేవారు కాని, వీలై నన్ని దర్శనాలు కావాలనుకున్నవారు కాని, ఒక్క రూపాయి హుండీలో వేయలేని వారు కాని, కోట్లాది రూపాయలు సమర్పించుకోగలిగే వారు కాని.....ఎవరైనా...కారణమేదైనా....ఎలా వెళ్లినా, వచ్చినా....తృప్తి తీరా, తనివితీరా దేవుడిని చూశామంటారే కాని, అసంతృప్తితో ఎవరూ వెనుదిరిగిపోరు. వెళ్తూ....వెళ్తూ, దర్శనంలో పడ్డ ఇబ్బందులేమన్నా వుంటే పూర్తిగా మరచి పోతూ, ఏ భక్తుడైనా, ఏం కోరినా-కోరకున్నా, తప్పకుండా కోరేది మాత్రం ఒకటుంటుంది.....అదే, "స్వామీ, పునర్దర్శన ప్రాప్తి కలిగించు" అని. అలా తన భక్తులను తన వద్దకు రప్పించుకుంటాడా కలియుగ దైవం!


          ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఏకైక క్షేత్రం తిరుమల కొండ. బహుశా ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని కూడా, అనునిత్యం, తిరుమలను దర్శించుకున్న విధంగా, వేలాది-లక్షలాది మంది సందర్శించరేమో! దర్శనానికి వచ్చిన యాత్రీకులందరికీ, వారివారి స్థోమతకనుగుణంగా, వుండడానికి వసతితో పాటు, కావలసిన వారికి ఉచిత భోజన సౌకర్యం కూడా తిరుమలలో కలిగించిన విధంగా ప్రపంచంలో ఎక్కడా, అదీ అనునిత్యం కలిగిస్తున్న దాఖలాలు లేవనాలి. ఏమిటీ కొండ మహాత్మ్యం? ఏముందీ దైవంలో? ఎందుకిన్ని ఆర్జిత సేవలు? ఒక్కో సేవకున్న ప్రత్యేకత ఏమిటి? పొరపాటునన్నా, లేదా, ఏమరుపాటునన్నా ఏనాడైనా ఏదైనా సేవ ఆగిందా? ఏ సేవ, ఎప్పుడు, ఎంతసేపు జరపాలన్న విషయంలో ఏవన్నా నియమ నిబంధనలున్నాయా? గతంలోను, ఇప్పుడు సేవల వేళల్లో కాని, పట్టే సమయాల్లోకాని, మార్పులు చేర్పులు జరిగాయా? జరగడానికి శాస్త్రీయ కారణాలే మన్నా వున్నాయా? ఆర్జిత సేవలకు అనుమతిచ్చే భక్తుల సంఖ్యలో పెంచడం-తగ్గించడం జరిగిందా? ఉదాహరణకు: తిరుమల కొండలో "నిత్య కళ్యాణం-పచ్చతోరణం" అన్న నానుడి ప్రకారం, అన్ని ఆర్జిత సేవలలోను "కళ్యాణోత్సవం" కు ఒక ప్రత్యేకత వుంది. శ్రీ వేంకటేశ్వరుడికి, శ్రీదేవి-భూదేవిలకు, అనునిత్యం తిరుమలలో, భారతీయ హిందూ సాంప్రదాయ రీతిలో, వేద మంత్రోచ్ఛారణల మధ్య, ఇరు వంశాల వంశ క్రమాన్ని-ప్రవరను పఠనం చేస్తూ, అర్చకులు మంగళ సూత్ర ధారణ చేస్తారు. ఒకప్పుడు మధ్యాహ్నం రెండు-నాలుగు గంటల మధ్య కాలంలో జరిగే ఈ సేవకు రు. 1000 దేవస్థానం వారికి ముందస్తుగా చెల్లించాల్సి వచ్చేది. కళ్యాణోత్సవానికి అలా చెల్లించినవారి కుటుంబానికి చెందిన 10 మంది భక్తులను అనుమతించి, ఆ తర్వాత నేరుగా మూల విరాట్ దర్శనం చేయించే ఆనవాయితీ వుండేది ఒకప్పుడు. కాలం మారింది. కాలానుగుణంగా కళ్యాణోత్సవం చేయించేవారి సంఖ్య పదుల నుండి వందలకు-వేలకు చేరుకుంది. ఉత్సవం జరిపించే స్థలం కూడా తదనుగుణంగా మార్చవలసి వచ్చింది. కొంతకాలం రెండు రకాల కళ్యాణం టికెట్లు అమ్మే ఆనవాయితీ వుండేది. ఒకటి రు. 2500 కాగా మరొకటి రు. 750 లు. మళ్లీ మార్చారు. ఇద్దరే హాజరయ్యే విధంగా టికెట్ ధర రు. 1000 కి మార్చారు. ఇప్పుడు దాన్ని ఒకరికి రు. 500 చేశారు. ఒకనాడు సరాసరి మూల విరాట్ దర్శనం చేయించే ఆచారం మారింది. సర్వదర్శనం క్యూలో కలిపి, ఆ తోపులాటలోనే వీరికీ దర్శనం-అదీ లఘు దర్శనం చేయిస్తున్నారిప్పుడు. ఐనా, కళ్యాణోత్సవం చేయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందేకాని తగ్గడం లేదు. ఈ మార్పులకు కారణాలుండే వుండాలి. ఇవన్నీ భక్తులు తెలుసుకోవాలనుకున్నా, ఏ కొద్దిమందికో తప్ప అందరికీ వీలుండదేమో!

          తిరుమల పుణ్య క్షేత్రమంటే, సాక్షాత్తు, శ్రీ మహావిష్ణువు నివాసమైన శ్రీ వైకుంఠమే! మహావిష్ణువిక్కడ "ఆనంద నిలయం" అనే తన "బంగారు మేడ" లో, ఏడుకొండల వాడని, తిరుమలేశుడని, శ్రీనివాసుడని, శ్రీ వేంకటేశ్వరుడని, గోవిందుడని, బాలాజీ అని.... ..... ..... ఒక్కో భక్తుడికి, ఒక్కో పేరుతో దర్శనమిస్తున్నాడు. ఆ బంగారు మేడలో ఆయనను దర్శించుకోవాలంటే, ఆలయ ప్రవేశం చేయాలంటే ప్రధాన ప్రవేశ ద్వారమైన "మహా ద్వారం" గుండా వెళ్లాలి భక్తులు. కాకపోతే, ఆ ద్వారం గుండా సరాసరి ప్రవేశానికి అతి కొద్దిమంది మాత్రమే అర్హులు. మిగిలిన వారంతా తప్పనిసరిగా క్యూ లైన్లలో రావాల్సిందే! మహా ద్వారాన్ని "పడి కావలి" అని, "ముఖద్వారం" అని, "సింహద్వారం" అని, "పెరియ తిరువాశల్" అని కూడా అంటారు. ఈ మహా ద్వారానికి ఇరు ప్రక్కల ద్వారపాలకులుంటారు. మహా ద్వారానికి ఆనుకుని ఒక మండపం వుంటుంది. ఆ పక్కనే "అద్దాల మండపం" వుంటుంది. అక్కడా కొన్ని వుత్సవాలు జరుగుతాయి. దానికి ఎదురుగా వున్న మరో మండపంలోనే ఒకప్పుడు కళ్యాణోత్సవం జరిగేది. అక్కడ ఇప్పుడు వీ వీఐపీలను కూర్చోబెడతారు. ఆ మడపం పక్కనే "తిరుమలరాయ మండపం" వుంటుంది. దానికీ ప్రాధాన్యత వుంది. ఆలయ ప్రాంగణంలోనే "ధ్వజస్తంభం", "బలిపీఠం", "క్షేత్రపాలక శిల" వుంటాయి. అదృష్టవంతులైన భక్తులకు ధ్వజస్తంభం పక్కనుంచి లోనికి పోయే వీలు కలుగుతుంది. ఇక అక్కడ అన్నీ విశేషాలే! అలాంటి వాటిలో, "నాలుగు కాళ్ల మండపం", "విరజానది", శ్రీ వేంకటేశ్వరుడికి అనుదినం అలంకరించే పూల దండలు, బంగారు వాకిలి ఉభయ పార్శ్వాలలో నిలచి వున్న పంచలోహ మూర్తులు, "కులశేఖర పడి".....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో...ఎన్నెన్నో....!

          ఇవన్నీ కాక శ్రీ వేంకటేశ్వరుడికి అను నిత్యం జరిపించే ఒక్కో సేవకు ఒక్కో ప్రాధాన్యం వుంది-విశేషముంది. ప్రతి సేవలో అనుసరించే ఒక్కో విధానానికి విశేష ప్రాముఖ్యత వుంది. ఉదాహరణకు "సన్నిధి గొల్ల" అని పిలువబడే ఒక యాదవ వ్యక్తి బంగారు వాకిళ్ల తాళాలు తీయడం. ప్రతి నిత్యం తొలి దర్శనం అతడికే కలుగుతుంది. సుప్రభాత సేవ సమయాన పొర్లు దండాలు మరో విశేషం. ప్రతి నిత్యం స్వామివారికి ఇలా అనేకం జరగడం ఆనవాయితీ ఐనా, వాటి గురించి గత ఏబై సంవత్సరాలకు పైగా తిరుమలను దర్శించుకుంటున్న నాకు తెలిసింది చాలా తక్కువ. ఐనా, ఊహ తెలిసినప్పటి నుంచీ, ఆ మాటకొస్తే, తెలియనప్పటి నుంచి కూడా తిరుమలను అనేక మార్లు దర్శించుకున్న నాకు అప్పటికీ-ఇప్పటికీ తేడా కనిపించడం మాత్రం వాస్తవం.

          మా ఇంట్లో అనాదిగా వస్తున్న ఆచారం ఒకటుంది. మా "వనం" వారి ఇంట్లో పుట్టిన ప్రతి వారి "పుట్టు వెంట్రుకలు" విధిగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కత్తిరించాల్సిందే. ఆ పని కోసమని మొదటి సారి నాకు ఊహ తెలియని రోజుల్లో నేను తిరుమల వెళ్లానట, మా నాన్న గారు ఆ తరువాత చెప్పినదాన్ని బట్టి, అప్పట్లో వారి వెంట నేను కూడా కాలినడకన తిరుపతి నుంచి తిరుమల వెళ్లానట. నా కప్పుడు బహుశా నాలుగైదేళ్ల వయసుండవచ్చు. ఆ తరువాత కూడా రెండు-మూడు సార్లు వెళ్లొచ్చినప్పటికీ, నాకు గుర్తుండి వెళ్లింది మాత్రం నా ఉపనయనానికి. పుట్టు వెంట్రుకల మొక్కు లాగానే, మా ఇంట్లో ఎవరికి ఉపనయనం చేయాలన్నా తిరుమలలో చేయాలని తరతరాలుగా వస్తున్న ఆచారం. నాకు, నా తమ్ముళ్లకు, మా అబ్బాయికి, మా తమ్ముళ్ల పిల్లలకు, మా చెల్లెలి కుమారుడికి...అందరికీ అక్కడే ఉపనయనాలు జరిగాయి.

          నా ఉపనయనానికి వెళ్లినప్పుడు, చాలా అట్టహాసంగా సుమారు పాతిక మందికి పైగా ఒక జట్టుగా కలిసి వెళ్లాం. నాలుగైదు కచ్చడం (ఎద్దులు లాగే) బళ్లు, మరో నాలుగైదు (ఎద్దులు లాగే) పెద్ద బళ్లు కట్టుకుని మా గ్రామం వనం వారి కృష్ణా పురం నుంచి (సుమారు ఏబై మూడు సంవత్సరాల క్రితం 1960 లో) ఒక సాయంత్రం బయల్దేరాం. సమీపంలో (మా గ్రామానికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో) వున్న చింతకాని రైల్వే స్టేషన్ కు చేరుకుని, అక్కడ నుంచి పాసింజర్ రైల్లో విజయవాడ వెళ్లాం మొదట. చింతకాని వెళ్లే మార్గమధ్యంలో మునేరు వస్తుంది. అందులో అప్పట్లో ఎప్పుడూ నీళ్లు ప్రవహిస్తుండేవి. అక్కడ ఆగి వెంట తెచ్చుకున్న పలహారాలు తిని ఆ ఏరు నీళ్లు తాగే వాళ్లం. ఇప్పటి వలె కాకుండా అప్పట్లో ఏటి నీరు తేట తెల్లగా శుభ్రంగా వుండేవి. తాగడానికి ఏ మాత్రం సంకోచించేవాళ్లం కాదు. మా వెంట వచ్చిన వారిలో మా కుటుంబ సభ్యులతో పాటు, మా పెద్ద పాలేరు, ఒక వంటవాడు, బట్టలుతికేవాడు, ఉపనయనం చేయించే పురోహితుడు, ఒకరిద్దరు పని మనుషులు కూడా వున్నారు. మా పెదనాన్న గారి కుమారులతో సహా కొందరు బంధువులు కూడా వున్నారు.

          అందరం విజయవాడ చేరుకుని, అక్కడ ఒక సత్రంలో బస చేశాం. ఆ మర్నాడు కూడా అక్కడే వుండి ఆ సాయంత్రం తిరుమలకు ప్రయాణం కట్టాం. ఇప్పటి లాగా హోటెల్ భోజనం కాదు. వంట చేసుకుని తిన్నాం. మినరల్ వాటర్ బాటిల్స్ వుండేవి కాదు. ఏ నీరు లభ్యమవుతే అదే తాగే వాళ్లం. శుభ్రంగానే వుండేవి అప్పట్లో. బయల్దేరిన మూడో రోజు ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగాం. అప్పట్లో సరాసరి తిరుమలకు పోయే ఆనవాయితీ లేదు. ఒక పూట సత్రంలో బస చేసి, వంటా-వార్పూ కానిచ్చి, స్థానికంగా వున్న దేవాలయాలను దర్శించుకుని, మర్నాడు తిరుమలకు బస్సులో ప్రయాణమయ్యాం. ఆ రోజుల్లో తిరుమల-తిరుపతి దేవస్థానం వారే బస్సులు నడిపేవారు. రూపాయో-రెండో టికెట్ ధర వుండేది. తిరుమల వెళ్లడానికి-రావడానికి ఒకే ఘాట్ రోడ్డుండేది. కొండ ఎక్కేటప్పుడు, వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి పోవడం ఆచారం. బస్సు మొత్తం ప్రయాణం  పూర్తయ్యేంతవరకు, గోవింద నామ స్మరణతో మారు మోగేది. అప్పట్లో సెక్యూరిటీ చెకింగులు అసలే లేవు. తిరుమలలో ఇప్పటి లాగా టిటిడి వారి వసతి గృహాలు ఎక్కువగా వుండేవి కావు. ఎన్నో ప్రయివేట్ సత్రాలుండేవి. వాటిలో "పెండ్యాల వారి సత్రం" చాలా పేరున్న సత్రం. మా నాన్నగారికి ఆ సత్రం నిర్వాహకులతో బాగా పరిచయం. తిరుపతి నుంచి తిరుమల చేరుకోగానే, అక్కడే బస చేశాం. వంటా-వార్పూ అన్నీ అక్కడే. అక్కడే నా ఉపనయనం జరిగింది. దాదాపు మూడు రోజులు అక్కడే వున్నాం. దర్శనానికి ఎన్ని సార్లు వీలుంటే అన్ని సార్లు, ఏ దర్శనం కావాలనుకుంటే ఆ దర్శనానికి, ఎవరి సహకారం లేకుండానే వెళ్లొచ్చాం. నాకు గుర్తున్నంతవరకు ప్రధాన ద్వారం గుండా సరాసరి వెళ్లొచ్చాం. కళ్యాణోత్సవం చేయించాం. మా నాన్నగారికి అక్కడి అర్చకులతో కూడా బాగా పరిచయం వుండేది. ఆయనను చూడగానే వాళ్లే పిలిచి మరీ గుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేయించే వారు. గుళ్లో తిరగని ప్రదేశం లేదు. ఏ రకమైన కట్టుబాట్లు లేవు. ఇక లడ్డులకు కొదవే లేదు. కళ్యాణోత్సవం చేయించిన వారు బస చేసే చోటికి, ఆలయ నిర్వాహకులు, ఒక పెద్ద గంప నిండా పులిహోర, దద్ధోజనం, పొంగలి, పెద్ద లడ్డులు, వడలు, చిన్న లడ్డులు వచ్చేవి. మా హయాంలో కూడా ఒక సారి కళ్యాణం చేయించినప్పుడు మా వసతి గృహానికి అలానే వచ్చినట్లు గుర్తు. వాస్తవానికి వాటిని అప్పట్లో రైల్లో తీసుకుపోవడం కష్టమయ్యేది కూడా. కళ్యాణం చేయించినవారికి ప్రత్యేక దర్శనం వుండేది. బహుశా మా నాన్న గారి రోజుల్లో మేం చేసుకోని దర్శనం లేదనాలి. ఏ నియమ నిబంధనలుండేవి కావు. కాకపోతే, శ్రీవారి దర్శనానికి ముందు వరాహ స్వామి దర్శనం చేసుకున్నాం. పక్కనే వున్న స్వామిపుష్కరణి-కోనేరులో  స్నానం చేసే వాళ్లం. అప్పట్లో అందులో నీరు శుభ్రంగా-కొబ్బరి నీళ్లలా వుండేది. తిరుమల సమీపంలోని పాప నాశనానికి తప్పనిసరిగా వెళ్లే ఆచారం వుండేది అప్పట్లో. అక్కడ నిరంతరం ధారగా నీరు పడుతుండేది. నీరు పడడానికి ఒక చైన్ గుంజాలి. అది గుంజినప్పుడు నీరు పడకపోతే పాపాలు తొలగనట్లు భావించేవారు. మేమందరం పాప నాశనానికి వెళ్లొచ్చాం.

          మూడు రోజుల తరువాత, తిరుగు ప్రయాణం అయ్యాం. మళ్లీ తిరుపతి సత్రంలో బస. యధా విధిగా వంటావార్పూ వుండేది. ఆ తతంగం కంటే ముందు అలి మేలు మంగాపురం పోయొచ్చాం. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అంతకంటే ముందు అక్కడి కోనేట్లో స్నానం చేశాం. స్థానికంగా వున్న గోవింద రాజ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. తిరుపతి నుంచి ఒక పూట శ్రీ కాళహస్తి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాం. ఆ మర్నాడు విజయవాడకు బయల్దేరాం. విజయవాడలో కూడా మళ్లీ సత్రంలో బస చేశాం. వంటావార్పూ సరేసరి. ఆ రోజుల్లో ఒక పద్దతి ప్రకారం దైవ దర్శనం చేసుకునే ఆచారం వుండేది. వరాహ స్వామి దర్శనం, వేంకటేశ్వర స్వామి దర్శనం, అలి మేల్ మంగ దర్శనం, గోవింద రాజ స్వామి దర్శనం, శ్రీ కాళహస్తి దర్శనం తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఆగి కనకదుర్గ దర్శనం చేసుకునే వాళ్లం. ఈ సారీ అలానే కానిచ్చాం. ఆ సాయంత్రం బయల్దేరి మళ్లీ పాసింజర్ రైల్లో విజయవాడ నుంచి చింతకాని చేరుకుని, అక్కడినుంచి మా గ్రామానికి వెళ్లాం. సుమారు వారం-పది రోజుల యాత్ర అలా సాగేది అప్పట్లో. బహుశా అలానే మా నాన్నగారి వెంట నాకు ఉద్యోగం వచ్చేంతవరకు-1971 వరకు వెళ్లొస్తుండేవాళ్లం. కాకపోతే మా వివాహం అయిన తరువాత మరో రకమైన అనుభవం కలిగింది. మధ్యలో మా తమ్ముళ్ల ఉపనయనాలు అక్కడే జరిగాయి. వాళ్ల పుట్టు వెంట్రుకల తతంగం అక్కడే జరిగాయి. అన్నింటికీ అలానే వెళ్లొచ్చాం. అలానే సత్రాలలో వుండేవాళ్లం. హాయిగా దర్శనాలు చేసుకునే వాళ్లం.

స్వర్గీయ అయితరాజు రాం రావు గారి కుమార్తె విజయలక్ష్మితో నాకు ఏప్రిల్ 30, 1969 న వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత పెళ్లి బట్టలతో స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా మా ఇంటి ఆచారం. అయితే మాకు అలా పోవడం వెంటనే వీలుపడలేదు. మా మొదటి సంతానం-ప్రేమ మాలిని కలిగిన పది నెలలకు దాదాపు 1972 మే నెలలో వెళ్ల గలిగాం. అప్పట్లో మా ఖమ్మం జిల్లాకు చెందిన దూరపు బంధువు స్వర్గీయ కొలిపాక కిషన్ రావు గారు టిటిడి పాలక మండలి సభ్యుడుగా వుండేవారు. మా అమ్మాయి బుంటి (అని పిలుస్తుంటాం) పుట్టు వెంట్రుకలు తీయించడానికి, మేం పెళ్లి బట్టలలో వెళ్లడానికి, మా ముగ్గురితో పాటు బావమరిది వెంకన్న తో సహా తిరుపతికి ప్రయాణం అయ్యాం. అదే రోజున, అదే రైల్లో, కొలిపాక కిషన్ రావు గారు ఆయన కుటుంబ సభ్యులతో సహా ప్రయాణమయ్యారు. వాళ్లు ఏసి కోచ్‍లో, మేం స్లీపర్ కోచ్‍లో ప్రయాణం చేశాం. ఆయన పాలక మండలి సభ్యుడైనందున, ఆయనను తీసుకెళ్లేందుకు రేణిగుంటకు టిటిడి వాహనాలొచ్చాయి. మమ్మల్ని కూడా అక్కడే దిగమన్నారు. అంతా కొత్తగా అనిపించింది. మాకు కూడా ఒక వాహనం ఇచ్చారు. తిరుమల వెళ్లాం. వాళ్లకు పద్మావతి అతిధి గృహంలో బస. మాకు వేరే చోట. అప్పట్లో పద్మావతి అతిధి గృహమే అన్నింటి కన్నా పెద్దది. ఇక మా దర్శనాలు, ఇతర సౌకర్యాలు అన్నీ టిటిడి అధికారులే స్వయంగా చూసుకున్నారు. ఏ ఇబ్బందీ కలగలేదు. ఆ యాత్రలో ప్రధాన ద్వారం ముందరే పాలక మండలి సభ్యుడితో సహా మేం కూడా కారులో దిగాం. సరాసరి మొదలు సుప్రభాత దర్శనం, తరువాత మిగతా దర్శనాలు చేసుకున్నాం. అప్పుడప్పుడే యాత్రీకుల రద్దీ పెరగడం మొదలైంది. మా తిరుమల ప్రయాణాలలో ఇదొక మరపురాని అనుభవం.

ఆ తరువాత పది-పదిహేను సంవత్సరాల పాటు దాదాపు ఏడాదికో-రెండేళ్లకో ఒక సారి తిరుమల వెళ్లొస్తున్నాం. రెండో అమ్మాయి కిన్నెర, కుమారుడు ఆదిత్య పుట్టు వెంట్రుకలు తీయించడానికి (రెండు కార్యాలు ఒక్క సారే చేసాం), వాడి ఉపనయనం చేయించడానికి .... ఇలా చాలా పర్యాయాలు వెళ్లొస్తున్నాం. ఎప్పుడూ ఏ ఇబ్బందీ కలగలేదు. కాకపోతే క్రమేపీ యాత్రీకుల రద్దీ పెరగడం మొదలైంది. పిల్లల పుట్టు వెంట్రుకలు తీయించడానికి 1976 లో వెళ్లాం. అప్పుడు, మా వెంట మా నాన్న గారు రావడంతో ఎప్పటిలాగే ఏ ఇబ్బందీ కలగలేదు. కాకపోతే తిరుపతి వెళ్లేటప్పుడు చిన్న అసౌకర్యం కలిగింది. శ్రీకాళహస్తికి దగ్గరలో మేం ప్రయాణం చేస్తున్న రైలు స్వల్పంగా పట్టాలు తప్పింది. రైలు దిగి సామాను మోసుకుంటూ (మా వెంట పని కుర్రవాడు వున్నాడు) ముగ్గురు పిల్లలతో, నడుచుకుంటూ కాళహస్తి చేరుకున్నాం. మార్గ మధ్యలో మా చేతులో వున్న నీటి కూజా కూడా సరిగ్గా మంచినీరు తాగుదామనుకున్నప్పుడే పగిలిపోయింది. మొత్తం మీద ఆ భగవంతుడి దయవల్ల కాళహస్తి నుంచి తిరుపతి, అక్కడ నుంచి తిరుమల చేరుకున్నాం. అప్పుడు కూడా నాన్న గారి సలహా మేరకు సత్రంలోనే బస చేశాం. అదే రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం రు. 25 లతో ప్రారంభమైనట్లు జ్ఞాపకం. కాకపోతే అడిగిన ప్రతి వారికీ దొరికేది. ఆ తరువాత నాలుగైదు పర్యాయాలు వెళ్లొచ్చాం. ఒక సారి స్నేహితులు గీత, వనం రంగారావు లతో కలిసి పోయాం. అప్పుడు అక్కడ పోలీసు ఉన్నతాధికారిగా పని చేస్తున్న రావులపాటి సీతారాం రావు మాకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. 1987 లో జరిగిన మా అబ్బాయి ఉపనయనానికి మా అమ్మా-నాన్న, మామగారు-అత్తగారు, ఇతర బంధువులతో సహా వెళ్లొచ్చాం. అప్పుడు అక్కడే స్టేట్ బాంక్ ఉన్నతాధికారిగా పని చేస్తున్న భండారు రామచంద్ర రావు గారు సహాయం చేశారు. నేను అప్పుడు రాజ్ భవన్ లో గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర పని చేస్తుండే వాడిని. గవర్నర్ కార్యదర్శి చంద్ర మౌళి గారి దగ్గర నుంచి ఉత్తరం తీసుకెళ్లాను. అప్పుడప్పుడే ఉత్తరాల సాంప్రదాయం మొదలైంది. ఆర్జిత సేవలకు కోటా కూడా మొదలైంది. అయినప్పటికీ అంతగా ఇబ్బంది కలగలేదనాలి. కళ్యాణం చేయించడంతో సహా అన్ని దర్శనాలు తేలికగానే చేసుకోగలిగాం. ఇక అప్పటి నుంచి వెళ్లిన ప్రతి సారి టిటిడి ఈఓ కు గాని, జెఈఓ కు గాని సిఫార్సు వుత్తరాలు తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది.

అప్పట్లో మేం వెళ్లొచ్చినప్పుడల్లా సర్వ సాధారణంగా చేసుకునే దర్శనం అర్చనానంతర దర్శనం. కళ్యాణం తప్పక చేయించే వాళ్లం. ఎప్పుడైతే కళ్యాణం చేయించిన వారికి మామూలు దర్శనాలు మొదలయ్యాయో ఇక అక్కడి నుంచి అవి చేయించడం మానుకున్నాం. చేయించక పోవడానికి మరో కారణం, అక్కడ కింద కూర్చోవడం ఇబ్బందికరంగా మారడం. అప్పటికీ కొంతకాలం పైన అరుగు మీద కూర్చోవడం మేనేజ్ చేశాం. తరువాతి కాలంలో అర్చనానంతర దర్శనాలు రద్దయ్యాయి. ఒకప్పుడు రు. 25 వుండే బ్రేక్ దర్శనం అంచలంచలుగా పెరిగి ఇప్పుడు రు. 500 కు చేరుకుంది. రాజ్ భవన్‌లో పని చేసినంత కాలం గవర్నర్ కార్యదర్శి చంద్రమౌళి గారి సిఫార్సు వుత్తరాలు తీసుకుని వెళ్తే అవి బ్రహ్మాండంగా పని చేసేవి. మొత్తం మీద తరచూ-దాదాపు ఏడాదికి ఒక సారి తిరుమల వెళ్లి దర్శనాలు చేసుకుని వస్తుండే వాళ్లం. ఆ తరువాత కొంతకాలం ముఖ్యమంత్రి (స్వర్గీయ) చెన్నారెడ్డి గారి వద్ద పౌర సంబంధాల అధికారిగా పని చేశాను. అప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా వెళ్లి రాగలిగాం. ఒక సారి తిరుమలలో తమిళ నాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రుల సమావేశం జరిగింది (1990 ఏప్రిల్ లో). ఆ సమావేశానికి ముఖ్యమంత్రి సిబ్బందిలో వున్న నేను కూడా హాజరయ్యాను. అప్పుడు ముఖ్యమంత్రితో సహా దేవాలయంలోకి ప్రధాన ద్వారం గుండా వెళ్లిన వారిలో నేను కూడా వున్నాను. ముఖ్యమంత్రి దగ్గర ఉద్యోగం తరువాత హస్తకళల అభివృద్ధి సంస్థలో చేరాను. తిరుమలలో మా లేపాక్షి ఎంపోరియం వుండడం వల్ల, అక్కడ పనిచేసే మేనేజర్‌కు టిటిడి అధికారులతో సత్సంబంధాలు వుండడం వల్ల, మరో మూడు-నాలుగు సంవత్సరాల పాటు నిరాటంకంగా శ్రీవారి దర్శనం చేసుకునే వాళ్లం. వసతి కూడా వాళ్లే ఏర్పాటు చేశారు. ఒక సారి అప్పటి మా చైర్మన్ మిరియాల వెంకట రావుతో వెళ్లినప్పుడు రాచ మర్యాదలతో దర్శనాలు జరిగాయి. అలానే ఒక సారి నేను, మా శ్రీమతి, మా అబ్బాయి ఆదిత్య తిరుమల వెళ్లాం. అప్పట్లో అటవీ శాఖాధికారి ఒకరు సహాయం చేశారు. ఇద్దరు మా వెంట వుండగా, కావలసినన్ని దర్శనాలు చేసుకున్నాం. నేను అదే పర్యటనలో, కాలి నడకన చంద్రగిరి మార్గంలో కిందకు దిగి కొండ పైకి ఎక్కాను. అదే సందర్భంలో ఒక సారి దర్శనానికి వెళ్లినప్పుడు గుంటూరు లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు గారు గుళ్లో కనిపించారు. ఉదయం అర్చనానంతర దర్శనం చేసుకుని మేం ముగ్గురం కూర్చుని వున్నప్పుడు ఆయన కనిపించి హారతి కొరకు మమ్మల్ని మళ్లీ లోనికి తీసుకెళ్లారు. సుమారు అర గంటకు పైగా స్వామివారి ముందర వుండగలిగాం ఆ రోజున.

హస్తకళల అభివృద్ధి సంస్థ నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు డిప్యుటేషన్‌పై వెళ్లిన తరువాత కూడా తిరుమల దర్శనాలు ఇబ్బంది లేకుండానే జరిగాయి. అన్నట్లు, కొంతకాలం ఎం. వి ఎస్. ప్రసాద్ గారు టిటిడి కార్య నిర్వహణ అధికారిగా వుండేవారు. ఆ రోజుల్లో ఒకటి-రెండు సార్లు తిరుమల వెళ్లొచ్చాం. ప్రసాద్ గారే అన్ని ఏర్పాట్లు చేసేవారు. నేను రాజ్ భవన్‌లో పని చేస్తున్న రోజుల్లో నాకు పరిచయమైన వినాయక్ గారు కొంతకాలం పాటు టిటిడి ఈవోగా పని చేశారు. ఆయన వున్న రోజుల్లో, ఫలానా సమయంలో తిరుమల వస్తున్నామని ఉత్తరం రాస్తే, రైల్వే స్టేషన్‌కు టిటిడి కారు (దాని కయ్యే ఖర్చు మేం భరించే వాళ్లం) పంపడంతో సహా, ప్రతి శాఖకు నా పేరు మీద ఉత్తర్వులు ఇచ్చేవారు. కోరుకున్నన్ని దర్శనాలు సాఫీగా అయ్యేవి. ఐ. వి. సుబ్బారావు గారు టిటిడి ఈవోగా పని చేసే రోజుల్లో ఆయన సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసుకునే వాడిని. అలానే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పని చేసిన తొలినాళ్లలో, మా సంస్థ పక్షాన టిటిడి ఉద్యోగులకు శిక్షణ ఇచ్చాం. ఆ విధంగా అక్కడి ఈఓ పి. కృష్ణయ్య గారు, జెఈఓ లు పరిచయమయ్యారు. వారున్నంతకాలం దర్శనాలకు ఇబ్బంది లేకుండా పోయింది. అప్పట్లో చాలా కాలం పాటు జీఈఓ గా బాలసుబ్రహ్మణ్యం పని చేసేవారు. ఆయన సహాయం ఎప్పుడూ వుంటుండేది. కృష్ణయ్య గారి రోజుల్లోనే అర్చన చేయించగలిగాం. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు మాజీ ఈఓ టిటిడి పి.వి.ఆర్.కే. ప్రసాద్ గారు డైరెక్టర్ జనరల్‌గా వచ్చిన తరువాత ఇక ఎప్పుడు తిరుపతి పోయినా ఆయన సిఫార్సు ఉత్తరాలే! ఆయన ఉత్తరానికి తిరుగులేదు. ఏ దర్శనం అంటే ఆ దర్శనమే! ఏ ఆర్జిత సేవ కావాలంటే అదే దొరికేది. అలానే కొన్నాళ్లు బలరామయ్య గారు జెఈఓ గా పని చేశారు. ఆయనున్నప్పుడు ఆయన ద్వారా దర్శనాలు దొరికేవి.

ఎన్నాళ్ల బట్టో మాకు స్వామివారికి అభిషేకం చేయించాలన్న కోరిక వుండేది. ఆ కోరికా తీరింది ఒకటి రెండు సార్లు. టిటిడి బోర్డ్ చైర్మన్‌గా టి. సుబ్బిరామిరెడ్డి వున్నప్పుడు. స్నేహితుడు-దూరదర్శన్ ఉద్యోగి మూర్తి సిఫార్సుతో మా దంపతులం, భండారు రామచంద్రరావు గారి దంపతులు అభిషేకం చేయించాం మొదటి సారి. మరో సారి కూడా ఆ అవకాశం లభించింది. అర్చన, సుప్రభాతం, అభిషేకం, కళ్యాణం లాంటివి చేయించిన మాకు "వస్త్రం" సేవ చేయించాలనే కోరిక కలిగింది. ఐ. వి. సుబ్బారావు గారు ఎండోమెంట్ శాఖ కార్యదర్శిగా-టిటిడి బోర్డ్ సభ్యుడుగా వున్నప్పుడు ఆయన సిఫార్సుతో రు. 50, 000 టికెట్ కొని ఆ ముచ్చటా తీర్చుకున్నాం. నిజంగా అదొక అద్భుత అవకాశం. స్వామివారి ముందర గంటకు పైగా కూర్చుని చూసే అరుదైన అవకాశం అలా మొదటి సారిగా లభించింది. రమణాచారిగారు టిటిడి ఈఓ కాగానే అలాంటి అవకాశం మరో మారు కూడా లభించింది. అంతే కాదు...ఆయన వున్నప్పుడు తిరుమల వెళ్ళిన ప్రతిసారీ, ఆయన కాంప్ కార్యాలయంలోనే బస చేసే అవకాశం కూడా దక్కేది. ఇక దర్శనాలు సరేసరి. ఒక సారి ఉగాది పర్వదినాన సుప్రభాత దర్శనం కూడా లభించింది. రమణాచారి గారి తరువాత వచ్చిన ఐ. వై. కృష్ణారావుగారి హయాంలో కూడా ఇబ్బందులు లేకుండా రెండు-మూడు పర్యాయాలు దర్శనం చేసుకున్నాం. ఇక ఎల్. వి. గారు వచ్చినప్పటి నుంచీ ఏం జరుగుతుందో మొదలే రాసుకున్నాను.

ఇదంతా నా అనుభవం మాత్రమే. నాకింత మంచిగా జరుగుతున్నది కాబట్టి అక్కడ యాత్రీకులకు ఏ ఇబ్బందీ కలగడం లేదని అనడం లేదు. కాకపోతే ఎవరి అదృష్టం వారిదే! చివరి క్షణం వరకూ దర్శనం టికెట్లు దొరుకుతాయో, లేదో అన్న అనుమానం నాకు కలిగిన సందర్భాలు లేకపోలేదు. అప్పుడొకాయన అన్నారు.... దర్శనం స్వామి ఇవ్వాల్సిందే కాని మనం తెచ్చుకోవడం కాదని! ఇప్పటికీ, దర్శనం చేసుకుంటున్నప్పుడు, క్యూలో అసహనానికి గురైన సందర్భాలు అనేకం. క్యూలో వంటి మీద చేయి వేసి తోస్తున్నప్పుడు కోపగించుకున్న సందర్భాలు అనేకం. అలానే వివిఐపి గా స్వామివారి ముందు నన్ను-నా కుటుంబ సభ్యులను నిలబెట్టిన సందర్భాలూ అనేకం. ఎప్పటికెయ్యది ప్రాప్తమో అదే జరుగుతుందని అనుకునే వాడిని. కోపమొచ్చినా అణచుకునేవాడిని. ఏదేమైనా కాలం మారింది. ఏబై ఏళ్ల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవు. సరాసరి దైవ దర్శనానికి పోయేందుకు ఇప్పుడు వీలు లేదు. ఇప్పటి నియమనిబంధనలు పాటించక తప్పదు. భక్తులను ఇలా నియంత్రిస్తేనే అందరికీ దర్శనం దొరికే అవకాశం వుంటుంది. ఒకనాడు విఐపి లకు వున్న ప్రాముఖ్యత ఇప్పుడు లేదే! ఆ రోజుల్లో లాగా అన్నీ-అందరికీ ఇప్పుడు జరగడం లేదే!

రాబోయే రోజుల్లో ఏం జరగ బోతోందో ఎవరూ ఊహించలేరేమో!

4 comments:

  1. 'నా కోరిక మేరకు మా దంపతులకు ఒక సుప్రభాత దర్శనం, రెండు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు ఇప్పించారాయన. స్వామివారి దర్శనం మూడు పర్యాయాలు కూడా అతి దగ్గర నుంచి చేసుకునే భాగ్యం లభించింది. ఎల్. వి. గారు బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన దయవల్ల మాకు ఇలా జరగడం రెండో సారి'

    ***

    'భక్తులను ఇలా నియంత్రిస్తేనే అందరికీ దర్శనం దొరికే అవకాశం వుంటుంది '

    ReplyDelete
  2. అయ్యా, మీ‌ సుదీర్ఘమైన అనుభవసారం అవశ్యపఠనీయం. కొంత చదివాను. వీలు వెంబడి మిగిలినదీ తొందరలో తప్పక చదువుతాను. సిఫార్సులతో స్వామిదర్శనం అన్న కోణంలో‌ అలోచించటం కూడా నా ప్రస్తుత మనస్తత్వానికి సరిపడదు కాబట్టి కొంచెం అసంతృప్తికి లోనయిన మాట వాస్తవం. మీరు తిరుమలలో‌ సామాన్యభక్తుల అనుభవాలు తప్పక చూసి తెలుసుకునే ఉంటారని అర్థమౌతున్నది. కాని మీరు దయచేసి స్వయంగా ఒక సామాన్యభక్తకుటుంబంగా స్వామి దర్శనానికి వెళ్ళినట్లయితేనే సామాన్యభక్తశిఖామణుల వ్యధ అవగతం అవుతుంది. అలా చేయగలరా? స్వానుభవాన్ని మించినది లేదు కదా. ఇలా వ్రాసినందుకు కోపగించుకోవద్దు. నేను మీకు మీ కుటూంబానికీ స్వామివారి యెడల గల భక్తిప్రపత్తులకు చాలా సంతోషపడిన మాటా వాస్తవమే. కాని యీ ఒక్క విషయంలో మాత్రం నా అభిప్రాయం వ్రాయకుండా ఉండలేక పోయాను. స్వామివారి కృప మీపైన మీ‌ కుటుంబం పైన యెల్ల వేళలా ఉందాలని ఆశిస్తున్నాను. స్వస్తిరస్తు.

    ReplyDelete
  3. Turlapati Sambasivarao: It takes tremendous discipline to control the influence, the power you have over other people's lives.
    Clint Eastwood

    ReplyDelete
  4. Prasad Pvrk: dear Jwala..very interesting narration. Jwala like. others will feel jealous..these are all possible only with the blessing of the Lord. God bless you reGards prasad.. ps. have you gone through my Tirumala Charitamrutam..serialsed in Swathi for 108 weeks and concluded a couple of weeks back....

    ReplyDelete