Tuesday, May 28, 2013

మంత్రివర్గ సమిష్టి బాధ్యత: వనం జ్వాలా నరసింహారావు

మంత్రివర్గ సమిష్టి బాధ్యత

ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వివాదాస్పద జీవోల జారీ విషయంలో తమ తప్పేమీ లేదని, తాము కోర్టులో నిర్దోషులుగా బయటపడ్తామని అన్నారు. తాము అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సభ్యులుగా, కేవలం, మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలను అమలుపర్చామే తప్ప, తాము లబ్ది పొందే విధంగా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు, ప్రస్తుతానికి వారికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన జరిగింది. ఇక భవిష్యత్‍లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.

      ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ విషయంలో సీబీఐ అభ్యర్థనను కొన్నాళ్ల క్రితం తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం, దానికి కారణం చూపుతూ, ఆ కేసుకు సంబంధించిన నిర్ణయం అలనాడు రాజశేఖర రెడ్డి కాబినెట్ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెప్పింది. ప్రాసిక్యూషన్ తిరస్కరించిన నిర్ణయాన్ని కూడా మంత్రి మండలి సమిష్టి నిర్ణయంగా చెప్పింది. మంత్రి మండలి నిర్ణయానికి మంత్రులందరూ కట్టుబడి వుండాల్సిందే. ధర్మాన ప్రసాద్ రావు విషయంలో జరిగిన ఈ వివాదాస్పద అంశం చర్చనీయాంశమే!

రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముగిసిన వెంటనే, శాసనసభలో మెజారిటీ స్థానాలను పొందిన రాజకీయ పార్టీ-లేదా-సంకీర్ణ కూటమికి చెందిన నాయకుడిని (నాయకురాలిని) ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించడం ఆనవాయితీ. ఆ నాయకుడినే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. అలా ముఖ్యమంత్రిగా నియమించబడిన వ్యక్తి సూచనమేరకు, గవర్నర్ ఇతర మంత్రులను, మంత్రి మండలి సభ్యులుగా నియమించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే, ముఖ్యమంత్రి తనతో "సమాన హోదా కలిగిన ఇతర మంత్రులలో ప్రథముడు" మాత్రమే (First among the equals). ఇక అప్పటినుంచి, విధాన పరమైన ప్రభుత్వ పాలన యావత్తు "మంత్రి మండలి సమిష్టి బాధ్యత" అన్న రాజ్యాంగ ప్రాధమిక సూత్రం ఆధారంగానే జరుగుతుంది-జరిగి తీరాలి.

ఈ నిబంధనకు ఎవరూ అతీతులు కాదు. అలా కావడం అంటే రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా నడచుకున్నట్లే! ఇక మంత్రిగా కాబినెట్‌లో చేరిన వ్యక్తికి రెండు రకాల బాధ్యతలుంటాయి. అందులో మొదటిది ఆయనకు అప్పజెప్పిన శాఖాపరమైన దైనందిన బాధ్యత. దానికి పూర్తి బాధ్యుడు స్వయంగా ఆ మంత్రి మాత్రమే. రెండోది విధానపరమైన నిర్ణయాలలో యావత్ మంత్రి మండలి సభ్యులతో పాటుగా సమిష్టి బాధ్యత. అంటే, ఒకటి వ్యక్తిగతమైంది మరొకటి సమిష్టిది. రొటీన్‌గా వెలువడే ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో బాధ్యత మొత్తం తనది, సంబంధిత అధికారి(రులది)ది అవుతుంది. కాబినెట్ నిర్ణయం తీసుకునే ఉత్తర్వుల విషయంలో తనకు, తనతో పాటుగా ఇతర మంత్రులకు బాధ్యత వుంటుంది. ఆ నిర్ణయం కాబినెట్ నిర్ణయం అవుతే, ఆయనతో పాటు ఇతర మంత్రులకు కూడా బాధ్యత వుండి తీరుతుంది.

          వివరాలలోకి పోతే, వివాదాస్పద ప్రభుత్వ జీవోలు ఒక విధంగా సంబంధిత శాఖా మంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తే, మరో రకంగా అదే మంత్రిని ఇతర సహచర మంత్రులతో పాటు సమిష్టి గా బాధ్యుడిని చేస్తాయి. "ముఖ్యమంత్రి సంతకం పెట్టమంటే పెట్టాను కాని తనదేం తప్పు లేద" ని వాదించడం సబబు కాదు. ముఖ్యమంత్రితో పాటు, తనది-తనతో పాటు ఇతర మంత్రులది సమిష్టి బాధ్యత కింద తప్పే!

          పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకగా చెప్పుకునే బ్రిటన్‌లో మంత్రివర్గ సమిష్టి బాధ్యత అనేది ఒక సత్ సాంప్రదాయం. అనాదిగా వస్తున్న సదాచారం. దీనికి చట్టబద్ధత ఎంత మేరకున్నదని ప్రశ్నించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇంతకూ, మంత్రివర్గ సమిష్టి బాధ్యత ఎవరికి? మంత్రివర్గం ప్రభుత్వ విది-విధానాల మీద తీసుకున్న నిర్ణయానికి సమిష్టిగా చట్ట సభలకు బాధ్యత వహిస్తారని దానర్థం. సాధారణ పరిభాషలో మాట్లాడుకోవాలంటే, సమిష్టి బాధ్యత అనే సూత్రం కింద, మంత్రివర్గంలోని సభ్యులందరూ, ప్రభుత్వ విధి-విధానాల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఎవరు-ఎక్కడ-ఏ సందర్భంలో మాట్లాడినా, ఒకే విధంగా మాట్లాడాలన్న భావన వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడి ప్రజలను తికమక పెట్ట కూడదు. ప్రజల ముందుకు ప్రభుత్వ విధానాన్ని తీసుకెళ్లేటప్పుడు అందరి అభిప్రాయం ఒక్కటి గానే వుండాలి. ప్రభుత్వం ఇమేజ్ దెబ్బ తినకూడదు. మంత్రివర్గ సభ్యులంతా, అధికార పక్షంలో ఒక ఐక్య సంఘటనలాగా వుండాలి. ఒక వేళ ఎవరికైనా భేదాభిప్రాయం వుంటే, దానిని బయట పెట్టే ముందర మంత్రివర్గ సభ్యుడిగా రాజీనామా చేయడం కనీస ధర్మం. అలా జరిగినప్పుడు, రాజీనామా చేసిన మంత్రి అభిప్రాయం సరైందన్న వాదన బలపడితే, మిగిలిన మంత్రివర్గం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకోవచ్చు. మరో విధంగా చెప్పుకోవాలంటే, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించ లేకపోతే, బహిరంగంగా విమర్శించడం తప్పనిసరిగా మానుకోవాలి.

         రాజ్యాంగ పరంగా అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయం ద్వారా, మంత్రి మండలిలోని ప్రతి ఒక్క సభ్యుడు, కాబినెట్‌లో తీసుకున్న ప్రతి నిర్ణయానికీ, వ్యక్తిగతంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకమైనప్పటికీ, బహిరంగంగా, దానిని సమర్థించాల్సి వుంటుంది. అందులో భాగంగానే, ఆ నిర్ణయం విషయంలో ఒకవేళ చట్ట సభలలో ఓటింగు జరుగుతే దానికి అనుకూలంగా ఓటేయాల్సి వుంటుంది. వాస్తవానికి ఇలాంటి సాంప్రదాయమే కమ్యూనిస్టు దేశాలలో కూడా మరో విధంగా అమలులో వుంది. పార్టీ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదనే ఆ సాంప్రదాయానికి "ప్రజాస్వామ్య కేంద్రీకరణ" అని పేరు పెట్టుకున్నారు వాళ్లు. కాబినెట్ సమిష్టి నిర్ణయం అన్నా, బాధ్యత అన్నా ఒకటే. ఒక వేళ మంత్రివర్గంలోని ఏ ఒక్క సభ్యుడి పైనైనా చట్ట సబలలో అవిశ్వాస తీర్మానం పెడితే, అది యావత్తు మంత్రివర్గం మీద పెట్టినట్లే. అది సభ ఆమోదం పొందితే మంత్రులందరి మీద అవిశ్వాసమే కాని, కేవలం ఆ ఒక్క మంత్రిమీద మాత్రమే కాదు. అలాంటప్పుడు మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాల్సిందే! ఆ తరువాత కొత్త మంత్రివర్గం అన్నా ఏర్పడవచ్చు, లేదా, చట్ట సభలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలను జరపాల్సిన అవసరమైనా కలుగుతుంది. సమిష్టి బాధ్యతకు, వ్యక్తిగత బాధ్యతకు కొంచెం తేడా వుంది. వ్యక్తిగత బాధ్యత అంటే, మంత్రులు తమ శాఖకు సంబంధించిన దైనందిన కార్యకలాపాలలో  రోజువారీగా తీసుకునే నిర్ణయాలు అని అర్థం. వారికి కేటాయించిన శాఖల నిర్వహణ బాధ్యత వ్యక్తిగతమైనటువంటిది. అలా శాఖాపరంగా తీసుకునే నిర్ణయాలకు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్న వారు మాత్రమే బాధ్యులవుతారు.

          బ్రిటన్‌లో, సమిష్టి బాధ్యత అనే సూత్రం, కేవలం మంత్రులకు మాత్రమే కాకుండా, మంత్రివర్గంలో పరోక్ష సభ్యులైన పార్లమెంటరీ ప్రయివేట్ సెక్రటరీలకు కూడా వర్తిస్తుంది. సమిష్టి నిర్ణయాల అమలు ఎలా వుండాలనే విధానాన్ని "మినిస్టీరియల్ కోడ్" లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాకపోతే, ఒకటి-రెండు పర్యాయాలు ఈ సూత్రాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. 1930 లో బ్రిటన్‌లో జాతీయ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు, మంత్రి మండలిలో భాగస్వాములుగా వున్న లిబరల్ పార్టీ సభ్యులకు "రక్షిత పన్నుల విధానం" విషయంలో కొంత వెసులుబాటు కలిగించడం జరిగింది. అదే విధంగా, 1975 లో, హెరాల్డ్ విల్సన్ ప్రధానిగా వున్నప్పుడు, యునైటెడ్ కింగ్ డం యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో కొనసాగాలా? వద్దా? అనే విషయంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగులో, తమకిష్టమైన విధంగా మంత్రివర్గ సభ్యులు ప్రచారం చేసుకోవచ్చని వెసులుబాటు కలిగించడం జరిగింది. కాబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా, ఇరాక్ యుద్ధానికి వ్యతిరేకత వ్యక్త పరిచిన క్లేర్ షార్ట్ ను మంత్రి మండలిలో కొనసాగడానికి, 2003 లో నాటి ప్రధాని టొనీ బ్లెయిర్ అంగీకరించడం మరో వెసులుబాటు. కాకపోతే, బహిరంగంగా కాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన షార్ట్ రాజీనామా చేయక తప్పలేదు. డేవిడ్ కామెరూన్ ప్రధానిగా వున్నప్పుడు, కన్సర్వేటివ్-లిబరల్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో వుండేది. కన్సర్వేటివ్ పార్టీ మంత్రుల నిర్ణయాన్ని బహిరంగంగానే లిబరల్ పార్టీకి చెందిన మంత్రులు విమర్శించే ఆనవాయితీ తలెత్తినప్పుడు. చేసేదేమీలేక, ప్రధాని మంత్రివర్గ సమిష్టి నిర్ణయం అనే సూత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. "వెస్ట్ లాండ్" విషయంలో 1986 లో, మార్గరెట్ థాచర్ మంత్రి మండలి సభ్యుడిగా వున్న, హాజెల్టైన్ రాజీనామా చేశాడు. వెస్ట్ లాండ్ వ్యవహారం థాచర్ ప్రభుత్వ హయాంలో తలెత్తిన ఒక పెద్ద రాజకీయ అపవాదు-కళంకం. అలనాటి యునైటెడ్ కింగ్ డం భవిష్యత్ హెలికాప్టర్ పరిశ్రమే ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన వ్యవహారం అది. రక్షణ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న మైఖేల్ హాజెల్టైన్ సూచనను మంత్రి మండలి తిరస్కరించింది. అమెరికన్ కంపెనీ చేతులలో వెస్ట్ లాండ్ ను విలీనం చేయాలన్న థాచర్ నిర్ణయంతో విభేదించిన హాజెల్టైన్  కాబినెట్ నుంచి వైదొలగాడు. ఆ తరువాత 1990 లో జరిగిన పార్లమెంట్ నాయకత్వ పోటీలో థాచర్ కు వ్యతిరేకంగా నిలుచుని ఓడిపోయాడు. అదే విధంగా 1990 లో యూరోప్ విధానం మీద కాబినెట్ తో ఏకీభవించని జాఫ్రీ రాజీనామా చేశాడు. విభేదించిన మంత్రులు వైదొలగారు కాని మంత్రి మండలిలో కొనసాగలేదు. ఇవన్నీ అతి కొద్ది ఉదాహరణలు మాత్రమే. ఏదేమైనా, బ్రిటన్ రాజ్యాంగంలో కాబినెట్ సమిష్టి బాధ్యత అనేది ఒక విడదీయలేని అనుబంధంలాంటి సాంప్రదాయం.

          అలాంటప్పుడు మంత్రి మండలిలో సభ్యుడైనంత మాత్రాన, వ్యక్తిగతంగా ఒక శాఖను నిర్వహిస్తున్న మంత్రికి వ్యక్తిగత బాధ్యత లేదని అనుకోరాదు. తమ వ్యక్తిగత నడవడితో సహా, చట్ట సభలలో, గౌరవ సభ్యుల సందేహాలకు తమదైన శైలిలో నివృత్తి చేసే బాధ్యత మంత్రులందరి మీదా వుంటుంది. తమ శాఖలకు సంబంధించిన బిల్లులను చట్టసభలలో ప్రవేశ పెట్టే బాధ్యత కూడా వ్యక్తిగతంగా మంత్రులదే. వారు ప్రవేశ పెట్టిన బిల్లులతో సహా, వారి శాఖలు చెందిన పలు అంశాలపై చట్ట సభలకు వారే జవాబుదారీ అవుతారు. సభ్యుల ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా-మౌఖికంగా సమాధానాలివ్వడం, వారు పలు నిబంధనల కింద లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వడం, చట్ట సభల కమిటీల ముందు హాజరై వివరణలు ఇవ్వడం, చట్ట సభల ఉప సంఘాలలో సభ్యుడిగా తమ బాధ్యతలు నిర్వర్తించడం లాంటివి వ్యక్తిగత బాధ్యతలే. ఇవన్నీ వారి వ్యక్తిగత హోదాలో, కార్య నిర్వహణ బాధ్యతలలో భాగంగా చట్ట సభలకు జవాబుదారీగా వుండే ప్రక్రియ మాత్రమే. మరో విధంగా చెప్పుకోవాలంటే, చట్ట సభల ద్వారా, ఓటర్లకు-ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించడమే! వ్యక్తిగత బాధ్యత అనే సాంప్రదాయం-చట్టం కింద, తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహారాల విషయంలో విధాన పరమైన-పాలనా పరమైన సీరియస్ తప్పులు దొర్లినా, వ్యక్తిగతంగా తప్పుడు విధానాలు అవలంబించినా, తప్పుడు పనులకు ప్రేరేపించినా, తన శాఖకు సంబంధించి రాబోయే పరిణామాలను ఊహించలేకపోయినా బాధ్యతల నుంచి తప్పుకోవడానికి రాజీనామానే పరిష్కారం. అలాంటి ఉదాహరణలూ కోకొల్లలు. 1982 లో, ఫాల్క్ లాండ్స్ పై అర్జెంటీనా దాడి చేయబోతోందన్న విషయాన్ని ముందుగానే పసిగట్ట లేక పోయిన నాటి బ్రిటన్ విదేశాంగ మంత్రి లార్డ్ కారింగ్ టన్ తన సహాయకులైన ఇద్దరు జూనియర్ మంత్రులతో సహా రాజీనామా చేయాల్సి వచ్చింది. అలానే వైవాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చిన కన్సర్వేటివ్ మంత్రి సిసీల్ పార్కిన్ సన్ 1980 నాటి రాజీనామా. ఇటీవలి కాలంలో బ్రిటీష్ మంత్రిగా రాజీనామా చేసిన పీటర్ మాండిల్ సన్ వ్యవహారం కూడా వ్యక్తిగతంగా తప్పుడు నడవడి కలిగి వుండడమే! చట్ట సభలను తప్పు దోవ పట్టించిన మంత్రులు రాజీనామా చేసిన సందర్భాలూ లేకపోలేదు.

          ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే మంత్రి మండలి సక్రమంగా వ్యవహరించాలి. మంత్రి మండలిలోని ప్రతి సభ్యుడూ బాధ్యతాయుతంగా నడచుకోవాలి. ఎవరి దారి వారిదే అనుకోరాదు. తమ సహచరులు తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించి, ఆ నిర్ణయాన్ని అన్ని వేళలా సమర్థించడం సమంజసం. అలా చేయలేక పోతే రాజీనామా చేసి మంత్రి మండలి నుంచి వైదొలగడం మంచిది.

ఈ నేపధ్యంలో మంత్రి మండలికి ధర్మాన ప్రసాద రావు చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి ఆనాడే ఆమోదించినట్లయితే బాగుండేది. అలా కాకపోయినా కనీసం ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యక్తిగత ఖాతాలోకి పంపి వుండాల్సింది. ఈ రెండింటికి విరుద్ధంగా వాటిని కాబినెట్ సమిష్టి నిర్ణయంగా చూపడానికి ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా, ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్ కు అనుమతి నిరాకరిస్తూ దానిని మంత్రివర్గ నిర్ణయంగా చూపాడు. ఇక ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కూడా రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను ఆమోదించడం మినహా ముఖ్యమంత్రికి మరో మార్గం లేదు.

          జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కింది నుంచి పైదాకా చాలామందిది, ఆ మాటకొస్తే, మంత్రులందరిది తప్పే. జగన్ తో పాటు వీరందరిని విచారించాల్సిందే. మోపిదేవి, ధర్మాన, సబితాలతో పాటు మిగతా ముగ్గురు మంత్రులను కూడా, అదే బాట పట్టించాలి. వారందరినీ, సిబిఐ దర్యాప్తుకు పిలిచే లోపుగానే మంత్రి మండలి నుంచి తొలగించాలి. సిబిఐ పిలవడం, విచారణ మొదలవడం, అరెస్ట్ పర్వం ఆరంభమవడం, అప్పుడు రాజీనామా కోరడం కన్నా ఇదే సరైన మార్గం. అంతే కాదు... సమిష్టి బాధ్యత కింద, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ఇతర మంత్రులందరిని కూడా తొలగించి, మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించాలి. అప్పుడే దీనికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. లేకపోతే, ఒకరిద్దరు మంత్రులను మాత్రమే బలి పశువులను చేసినట్లవుతుంది.


          ఇదిలా వుంటే, వైఎస్సార్సీపి లోకి వలసల భయం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజీనామా చేసిన మంత్రులు కాని చేయబోయే మంత్రులు కాని కాంగ్రెస్ పార్టీని వీడిపోతే ప్రభుత్వం మనుగడ ఎలా అన్న మీమాంసలో పడిపోయింది పార్టీ అధిష్టానం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు తమకు నష్టమేనని ఇరు పార్టీల నాయకత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విశ్లేషించు కొంటున్నాయి. ఏం జరిగినా ఆశ్చర్య పోనక్కరలేదు. End

No comments:

Post a Comment