Saturday, November 19, 2016

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం-6 : వనం జ్వాలా నరసింహారావు

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం-6
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (20-11-2016)

వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, " చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది.

వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి.

సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక.


ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.

కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు.


భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది

No comments:

Post a Comment