Friday, November 11, 2016

ట్రంప్ కు సవాళ్లు : వనం జ్వాలా నరసింహారావు

 ట్రంప్ కు  సవాళ్లు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (12-11-2016)

70 ఏళ్ల వయసున్న డొనాల్డ్ జాన్ ట్రంప్, అమెరికా 45 అధ్యక్షుడిగా 60 కి పైగా ఎలెక్టొరల్ ఓట్లతో హిల్లరీ క్లింటన్ ను ఓడించి "శ్వేతసౌధం"లో అడుగుడబోతున్నారు. ఏ మాత్రం పాలనానుభవం లేని ఒక "రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం" ట్రంప్‍కు ఇది అఖండ విజయం. కాకలుతీరిన రాజకీయ నాయకురాలు హిల్లరీ ఓటమి ఆమెకు బదులు ప్రస్తుత దేశాధ్యక్షుడు ఒబామాకు తీవ్ర పరాభవంగా పరిగణించాలి. గత రెండు దశాబ్దాల్లో అమెరికాలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం అమెరికాకు, ఇప్పటి అమెరికాకు ఎన్నో తేడాలు స్పష్టంగా కనిస్పిస్తున్నాయి.  సుమారు ఇరవై ఏళ్ల క్రితం అమెరికా ఓ "భూతల స్వర్గం-భోగ భూమి". భారతదేశమంటే ప్రవాస భారతీయులతో సహా అందరి దృష్టిలో  కేవలం "కర్మ భూమి" మాత్రమే! రాజకీయాలనుంచి, సామాజిక జీవనం వరకు, దైనందిన జీవన శైలితో సహా, ప్రతి విషయంలోను ఇప్పుడు అక్కడ వైరుధ్యం స్పష్టంగా గోచరిస్తున్నది. ప్రతివారిలోనూ ఏదో అభద్రతా భావం, ఏదో కోల్పోతున్నా మన్న తపన, ఎలా అంతో-ఇంతో వెనకేసుకోవాలన్న ఆలోచన కనిపిస్తుందిప్పుడు. ఈ విషయంలో అమెరికన్లకు, వలస వచ్చి స్థిరపడిన ఇతర దేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద తేడా ఏ మాత్రం లేదనాలి. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కు ఎదురయ్యే సమస్యలు బహుశా అన్నీ-ఇన్నీ కావేమో!

అమెరికా చరిత్ర ఆధునికమైందే అయినా, గట్టి పునాదుల మీద లిఖించబడింది. సుమారు రెండు శతాబ్దాల క్రితం జార్జ్ వాషింగ్టన్ బ్రిటీష్ సైన్యాన్ని పారదోలి, ఏకగ్రీవంగా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఆటుపోట్లను అడపాదడపా ఎదుర్కున్నా, తిరుగులేని ప్రపంచాధిక్య దేశంగా తన స్థానాన్ని పదిలపరచుకుంటూనే వుందనాలి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, అంతర్జాతీయంగా, అగ్ర రాజ్యంగా అమెరికా ఎదుగుదలను వర్తమాన చరిత్రకారులు గుర్తించారు-గుర్తిస్తూనే వున్నారింకా. అమెరికా 1929లో హూవర్ అధ్యక్షుడుగా వుండగా మొట్ట మొదటిసారి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ రోజుల్లోనే కోటి మందికి పైగా అమెరికన్లు ఉపాధి కోల్పోయారు. ఎన్నో బాంకులు దివాలా తీశాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. అలా కొనసాగిన సంక్షోభం రూజ్వెల్ట్ "న్యూ డీల్" తో కుదుటపడి ఒక కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ నిధులతో నిరుద్యోగులకు ఉపాధి కలిగించేందుకు ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. బాంకులను, పరిశ్రమలను ఆదుకుంది ప్రభుత్వం. సంక్షోభం నుండి గట్టెక్కింది అమెరికా అప్పట్లో. రెండో ప్రపంచ యుద్ధంలో రూజ్వెల్ట్ సారధ్యంలో అమెరికా విజయం సాధించిన తర్వాత ట్రూమన్ డాక్ట్రిన్ పుణ్యమా అని, కమ్యూనిజం వ్యాప్తి చెందకుండా వుండేందుకు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చుచేసింది అమెరికా. ఆ డాక్ట్రిన్ ప్రభావం, ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు, 1950 కొరియన్ యుద్ధంలో అమెరికా తన సైన్యాన్ని పంపడంతో దరిమిలా చోటూ చేసుకున్న పరిణామాలు, బహుశా "అంతర్జాతీయ తీవ్రవాదం"- "సీమాంతర ఉగ్రవాదం" ఆవిర్భావానికి పరోక్షంగా దోహదపడ్డాయి.

జాన్ కెన్నెడి హత్యానంతరం అధ్యక్షుడయిన లిండన్ జాన్సన్ హయాంలోనే మొట్ట మొదటిసారిగా "ఫుడ్ స్టాంప్స్ ప్రోగ్రాం" కు అంకురార్పణ జరిగింది. ఒబామా హయాంలో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. అయినా వియత్నాంలో యుద్దానికి ఐదు లక్షల మంది అమెరికన్ సైనికులను పంపిన జాన్సన్ అప్రదిష్టపాలైనాడు. ఆయన వారసుడు నిక్సన్ ఆ తప్పును సరిదిద్ది సేనలను ఉపసంహరించాడు. గత శతాబ్దం డబ్భై దశకంలో జిమ్మీ కార్టర్ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి, నిరుద్యోగ సమస్య మరో మారు అమెరికాను కుదిపేసింది. ఉగ్రవాదం ఉదృత రూపం దాల్చడం మొదలై, ఇరాన్ లోని అమెరికన్ దౌత్య కార్యాలయంలో, అమెరికన్లను బందీలుగా చేసే స్థాయికి చేరుకుంది. కార్టర్ వారి విడుదలకొరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఎన్నికల్లో ఓటమిని చవిచూశాడాయన. రీగన్ హయాం ఆరంభమై "కోల్డ్ వార్" రోజులకు నాంది పలికింది. సోవియట్ యూనియన్ లో కమ్యూనిజంకు చివరిరోజులప్పుడే మొదలయ్యాయి కూడా. "రీగనా మిక్స్" మంచి చేసిందా్, చెడు చేసిందా తెలియదు కాని, ఆయన తర్వాత వచ్చిన సీనియర్ బుష్ హయాంలో ఆర్థిక మాంద్యం ఆరంభమై సామాజిక సమస్యలనేకం తలెత్తాయి. ఆయన కాలంలోనే జరిగిన గల్ఫ్ యుద్ధం సీమాంతర ఉగ్రవాదానికి మరింత బలం చేకూర్చింది. బిల్ క్లింటన్ రోజుల్లో అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఉపాధి అవకాశాలు మెండుగా పెరిగాయి.


ఒబామా కంటె ముందు అధ్యక్ష పదవిలో ఎనిమిదేళ్లున్న జూనియర్ బుష్ కు మొదటి విడత అధికారపు మొదటి సంవత్సరమే చేదు అనుభవం ఎదురయింది. అగ్ర రాజ్యంగా-తమనెవరూ ఏమీ చేయలేరని విర్రవీగిన అమెరికాను క్షణాలలో మట్టికరిపించి, ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన న్యూయార్క్ నగరంలోని "వరల్డ్ ట్రేడ్ సెంటర్" టవర్స్ ను "అల్ ఖైదా" ఉగ్రవాదులు క్షణంలో నేలమట్టం చేశారు సెప్టెంబర్ 11, 2001. పర్యవసానంగా "ఉగ్రవాదం" మీద, "ఉగ్రవాదుల" మీద యుద్ధం ప్రకటించాడు బుష్. అఫ్గానిస్థాన్‌మీద యుద్ధం చేసి అల్ ఖైదా నాయకత్వాన్ని అక్కడ నుండి పారదోలగలిగినా ఇంకా అజ్ఞాతంలో నాయకత్వం తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే వుంది. తర్వాత కువైట్ స్థావరంగా ఇరాక్ మీద 2003లో యుద్ధం చేసి, సద్దాం హుస్సేన్ ను బంధించి, ఆ తర్వాత వురితీసింది అమెరికన్ ప్రభుత్వం. అయినా అమెరికా పెంచి పోషించిన ఉగ్రవాదం అంతం కాలేదు-కాదే మో కూడా.

అమెరికా 44వ అధ్యక్షుడుగా, ఆఫ్రికన్-అమెరికన్ నల్ల జాతీయుడైన బారక్ హుస్సేన్ ఒబామా జనవరి 20, 2009న అధికారం చేపట్టాడు. ఒక వైపు అంతర్జాతీయ ఉగ్రవాదం, మరో వైపు తీవ్ర ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపేస్తున్న క్లిష్ట తరుణంలో అధ్యక్షుడయ్యాడు ఒబామా. ఆయన పదవీకాలమంతా లోటు బడ్జెట్ తోనే గడపాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు అప్పట్లో అంచనా వేశారు. ఆయన దాన్ని ఎలాగో అధిగమించాడు కొంత మేరకు. ఇరాక్, అఫ్గానిస్థాన్‌సమస్యలతో సహా ఆర్థిక పరమైన విషయాలన్నిటికి సంబంధించి మొదటి సంవత్సరం తాను చేయాలనుకుంటున్న కార్యాచరణ ప్రణాళికను అధికారం చేపట్టడానికంటే ముందే సిద్ధం చేసుకున్నాడు ఒబామా. అధికారం చేపట్టిన ఆరంభపు వారాల్లోనే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చట్టసభలతో విస్తృతంగా చర్చించి, 787 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయక ప్యాకేజ్ ను ప్రకటించాడు. అదో మైలురాయిగా అభివర్ణించారు ఆర్థిక నిపుణులు. వాయిదా పద్దతుల మీద ఇళ్లు కొనుక్కొని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, ఉద్యోగాలు కోల్పోయి, బాంక్ ఋణాలు చెల్లించలేక, నానా అవస్థలు పడుతున్న వారికి వెసులుబాటు కలిగించే మరో ప్యాకేజ్ ను ప్రకటించాడు. ఆ తర్వాత సమగ్ర జాతీయ ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించి, ఎగువ దిగువసభల ఆమోదం అతి కష్టం మీద పొందగలిగాడు. ఇవన్నీ చక్కదిద్దే చర్యలే.

తాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న ఇరాక్ యుద్ధాన్ని కొనసాగించే విషయంలో వ్యూహం మార్చుకున్నాడు. ఆగస్ట్ 2010నాటికి అక్కడున్న బలగాలన్నీ ఉపసంహరించుకుంటానని ప్రకటించాడు. అణ్వాయుధాల తయారీ-పెద్దఎత్తున నిల్వ చేయకపోవడం విషయంలో రష్యా, అమెరికా దేశాలు ఒక అంగీకారానికి వచ్చేలా ఒబామా చొరవ తీసుకున్నాడు. ఎనిమిదేళ్లగా నడుస్తున్న అఫ్గానిస్తాన్ వ్యవహారానికి "చరమగీతం" పాడతానని ప్రకటించి 30వేలమంది అదనపు బలగాలను పంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అంటే బలగాల సంఖ్య లక్షకు చేరనున్నదన్నమాట. అల్ ఖైదా ఉగ్రవాదులందరినీ తుదముట్టిస్తానంటున్నాడు. ఆ విషయంలో తమకు తోడ్పడాల్సిందేనని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ఒబామా అఫ్గానిస్తాన్ నిర్ణయం స్వపక్షం నుంచి, విపక్షం నుంచి విమర్శలకు గురైంది. దేశం ఎదుర్కుంటున్న పలు సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కుంటూ, తమకు నేరుగా సంబంధించిన అంతర్జాతీయ సమస్యలకే ప్రాధాన్యమిస్తూ, ఇతర సమస్యల జోలికి ఒబామా పోకుండా వుంటే మంచిదని పలువురు అమెరికన్లు భావించారు కూడా. చివరకు అల్ కైదా నాయకుడు, భయంకర ఉగ్రవాది, ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్తడమే కాకుండా, ఆయన మరన వార్తను స్వయంగా జాతికి వెల్లడించాడు ఒబామా. అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన హెల్త్ కేర్ సంస్కరణల బిల్లుకు, స్వపక్షంనుండి-ప్రతిపక్షం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం పొందేందుకు  అధ్యక్షుడు బారక్ ఒబామా చేయని ప్రయత్నం లేదు. చివరికి విజయం సాధించాడు.


అక్టోబర్ 9, 2009, ఒబామాకు నోబెల్ శాంతి బహుమానం ప్రకటించడం-దాన్ని ఆయన ఆస్లో నగరంలో నిరసన ధ్వనుల మధ్య అందుకోవడం జరిగింది. సరిగ్గా ఈ నేపధ్యంలో, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ గెలిచిన ట్రంప్ జనవరి 2017 లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతర్జాతీయ సమస్యలు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ సమస్య తీవ్రత, జాతి వివక్షత, అమెరికాపై పెరిగిపోతున్న ఉగ్రవాద ప్రభావం, లాంటి అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న అమెరికాను భవిష్యత్ లో ఎలా బాగుచేస్తాడో వేచి చూడాల్సిందే. ఆయన ఎన్నికల్లో చేసిన అనేక వాగ్దానాలను, ముఖ్యంగా ఆ దేశానికి పెద్ద ఎత్తున వలస వస్తున్న వారి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా అమలు చేస్తాడో కూడా చూడాల్సిందే. విదేశీ వ్యవహారాల విశయంలో ఆయన నిర్ణయాలు ఎలా వుండబోతున్నాయో అనేది అమెరికన్లకూ, విదేశీయులకూ ఆసక్తి కలిగించే విషయమే. అమెరికాకు మళ్లీ పూర్వ వైభవం తెస్తానని ఎన్నికల సభల్లో అన్న ట్రంప్ ఆ దిశగా ఏం చేయబోతున్నాడో కూడా చూడాలి. ఏదేమైనా ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇక మహిళలు అధ్యక్షులు కావడం కష్టమేమో అనిపిస్తోంది! End

No comments:

Post a Comment