Tuesday, July 11, 2017

గుడ్ షెఫర్డ్ కేసీఆర్ : వనం జ్వాలా నరసింహారావు

గుడ్ షెఫర్డ్ కేసీఆర్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-07-2017)

గొల్లకుర్మల వస్త్రదారణకు ప్రతీకగా గొంగడి ధరించి, తలకు చెంగావి రంగు పాగా చుట్టి, సాక్షాత్తు సంప్రదాయ గొర్రెల కాపరిలా అవతారమెత్తిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్రంలో గొర్రెల అభివృద్ధి-పంపిణీ పథకానికి గజ్వేల్ లో జూన్ 20, 2017న లాంఛనంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా, వినూత్నంగా, భారీస్థాయిలో గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ చేపట్టి, రాబోయే మూడేళ్ల కాలంలో రు. 25 వేల కోట్ల సంపద ఆర్జింజడంతో పాటు, తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో అగ్రగామిగా నిలిచేందుకు, యాదవులు తమ కుల వృత్తి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో అందరికంటే ముందు వుండేట్లు ఈ పథకాన్ని అమలు చేయాలని సేఎo సంకల్పించారు.

           రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది గొల్లకురుమలు జనాభా ఉన్నప్పటికీ దేశంలో రాజస్తాన్ మొదలుకొని చుట్టు పక్కల రాష్ట్రాల నుండి రోజుకు దాదాపుగా 650 లారీల నిండా గొర్రెలను దిగుమతి చేసుకునే దుర్గతి మనకు వుండేది. ఈ పరిస్థితి సిగ్గుచేటని, దీనికి చరమగీతం పాడి రాబోయే మూడేళ్లకాలంలో గొర్రెల పెంపకం భారీ స్థాయిలో చేపట్టి, ఆర్ధికాభివృద్ధి సాధించి, రు. 25 వేల కోట్లు నగదురూపేణా ఆర్జించాల్సిన తరుణం ఆసన్నమయ్యిందని సిఎo అన్నారు. ఇందుకు ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన ప్రతిపాదనలను, సూచనలను ప్రతి యాదవ సోదరుడు తుచతప్పక పాటించాల్సిన అవసరం కూడా ఎంతయినా వుంది.

           ఈ వినూత్న ప్రక్రియలో భాగంగా యూనిట్ ఒక్కింటికి 20 గొర్రెలను, ఒక పోతును రాష్ట్రంలోని ప్రతీ గొల్ల కురుమ కుటుంబానికి అందించడం జరుగుతున్నది. ఈ పథకం ద్వారా 150 లక్షల  గొర్రెలను రెండేళ్లలో రు. 10 వేల కోట్ల ఖర్చుతో గొల్లకురుమలకు  చేరువ చెయ్యాలని సంకల్పించారు. ఐతే ఇందుకుగాను, కావలసినన్ని గొర్రెలను అన్ని చుట్టుపక్కల రాష్ట్రాలనుండి సమీకరించటంతో పాటుగా, 46 లక్షల ఎకరాల భూమిలో గొర్రెల మేత కోసం అవసరమైన గడ్డిని పండించడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో పాటుగా 100 సంచార పశువైద్య ‘క్లినిక్’ లను అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాటి ద్వారా ఉచితంగా అత్యవసర సేవలు అందించే విధంగా ‘1962’ నెంబరు ద్వారా అట్టి వెసులుబాటును కల్పిస్తూ వీటన్నింటినీ ఒకే వేదిక నుంచి లాంఛనప్రాయంగా ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా 825 లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమానికి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గమైన కొండపాక గ్రామం నుండి శ్రీకారం చుట్టారు సీఎo.

           గొర్రెల పంపిణీ కార్యక్రమం తొలుత 100 శాసనసభ నియోజకవర్గాల నుండి ఒకే రోజున చేపట్టటం జరుగింది. వాస్తవానికి ప్రభుత్వం ఒక్క రోజులో 4 లక్షల కుటుంబాలకు మాత్రమె గొర్రెల పంపిణీకి పూనుకున్నప్పటికీ, 7.61 లక్షల మంది నుండి దరఖాస్తులు రావడంతో, పరిశీలనా అనంతరం, 7.18 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయం జరిగింది. ఈ క్రమంలో తొలుత లక్షా యాభైవేల గొర్రెల పంపిణీ జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం ఒక కోటి గొర్రెలు అందుబాటులో ఉండగా 1.5 కోట్ల గొర్రెలను రాబోయే రెండేళ్లలో పంపిణీ చేయటం జరుగుతుందని అంచనా. ఆవిధంగా మొత్తం గొర్రెల సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంటుంది. రెండేళ్ల వ్యవధిలో ప్రతి గొర్రె మూడు గొర్రెపిల్లలు అందించగలిగితే ఆ సంఖ్య 7.5 కోట్లకు చేరుతుంది. వాటిలోంచి 2.5 కోట్ల గొర్రెలను సంతానోత్పత్తికి గాను వదిలి పెట్టినట్లయితే మిగిలిన 5 కోట్ల గొర్రెలను తలకు ఒక్కింటికి రూ.5000 లకు అమ్ముకున్న పక్షాన రూ.25 వేల కోట్లు నిధి కురుమయాదవులకు సమకూరుతుంది. ఇది మానవ వనరులను వినూత్న పద్ధతిలో సద్వినియోగపరచుకునే ప్రక్రియగా అభివర్ణించవచ్చని సేఎo అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గరి నుండి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పఠిష్టపరచడమే లక్ష్యం గా పెట్టుకుని, ఆ క్రమంలో అహరహం పరిశ్రమిస్తూ, దిశానిర్దేశాలు జారీ చేస్తూ, బడుగుల ఆశాజ్యోతిగా నిలుస్తూ, చరిత్రలో మరెవ్వరూ తీసుకురాని నూతన విధానాలను అవలంబిస్తూ మెరుగైన పాలన అందించటంలో తనకు తానె సాటి అనిపించుకున్నారు కెసిఆర్.


ఈ దిశగా ముందుకు పోతూ వంశపారంపర్యంగా వస్తున్న కుల వృత్తులను విస్మరించకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఆర్ధికాభివృద్ధి సాధించే దిశగా తీర్చిదిద్దేందుకు తగు ప్రణాళికలు తయారుచేస్తూ వచ్చారు. వారు తమకాళ్లపై తాము నిలదొక్కుకునే విధంగా ఎన్నో ఆలోచనలు చేసి వాటిని ఆచరణలోకి తీసుకువచ్చారు. మాంసానికి (ముడిసరుకుగా) ఉన్న గిరాకీని గుర్తించి అది నిత్యంపెరిగేదే కానీ తరిగేదికాదనే సత్యాన్ని గుర్తెరిగి, యాదవులు, కురుమలలో ఉన్న సామర్ధ్యాలను అంచనా వేసి వంశపారంపర్యంగా వారు నిపుణతతో సాగిస్తున్న గొర్రెల పెంపకాన్ని అందునా వారు పాటించే మెళుకువలను దృష్టిలో పెట్టుకుని వారికి చేయూతను అందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం సాగించాలని నిర్ణయించారు కెసిఆర్.

ఈ వినూత్న ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ వల్ల మాంసం మన స్థానిక అవసరాలకు సరిపడే విధంగా అందుబాటులోకి రావటంతో పాటు ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు, మనం ఎగుమతి చేసే పరిస్థితికి చేరుకోగలుగుతాం.

ఇందుకు గాను మనం పారదర్శకతతో కూడుకున్న సమగ్ర సూచనలను, ప్రమాణాలను పాటిస్తూ, మార్గదర్శకాలను తుచ తప్పక పాటించాల్సిన తరుణం ఆసన్నమైంది. యాదవ కురుమ కుటుంబాలలో 18 సంవత్సరాలు దాటిన ప్రతీ వ్యక్తిని సంఘంలో సభ్యునిగా నియమించడం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మించి సభ్యులు ఉన్నా వారిని సంఘంలో చేర్చుకుంటారు. అవసరాన్ని బట్టి సంఘాల సంఖ్యనూ పెంచుకోవడం జరుగుతుంది. సంఘంలోని ప్రతీ సభ్యునికి 20 గొర్రెలు, ఒక్క గొర్రెపోతు చొప్పున అందచేస్టారు. ఈ పాటికే గొర్రెల మంద పోషిస్తున్న కుటుంబాలకు కూడా అదనంగా 21 గొర్రెలను పోతుతో సహా అందజేయడం జరుగుతుంది. ఎవరైనా లబ్ధిదారుల్లో ఉద్యోగులు ఉన్నట్లయితే వారి బదులు ఆకుటుంబంలోని తండ్రినో, అతని తమ్ముడినో సభ్యునిగా చేసి వారికి ఈ మందను అందజేస్టారు.


ఒక్కో మందలో 20 గొర్రెలు, ఒక పోతు ఉండడం వల్ల మందకు రూ. లక్షా 25 వేలు ఖర్చు అవుతుంది. ఈ మొత్తంలో ప్రతీ లబ్దిదారుడు 25 శాతం అంటే రూ.31,250 వరకు ఖర్చు భరించాల్సి ఉంటుంది. మిగిలిన 75 శాతం అంటే, రూ.93,750 ను ప్రభుత్వం తమ వంతు సబ్సిడీగా అందిస్తుంది. దీనిని బ్యాంకుల ప్రమేయం లేకుండా అందుబాటులోకి తీసుకవస్తారు. గొర్రెలపెంపకం నిమిత్తం ఆర్ధిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిధులకు లోటు లేకుండా సిద్దంగా ఉంది. రూ.4000 కోట్లను ఎన్సీడీఎస్ కింద సమీకరించడానికి ప్రభుత్వ నిర్ణయించింది.

మొదటి సంవత్సరంలో సగం మందికి గొర్రెల మందలను అందిస్తారు. మిగిలిన సగం మందికి ఆపై సంవత్సరం అందజేస్తారు. గొర్రెల పంపకం ఏరాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా, మరే ఇతర వక్రమార్గాలకు పాల్పడనీయకుండా నిస్పక్షపాతంగా వారికి సహాయపడేందుకు లాటరీ పద్దతిలో పంపకాలు జరుగుతున్నాయి. ఒక గ్రామంలో 60 సంఘసభ్యులు నమోదయితే దాదాపు 30 మంది సభ్యుల సమక్షంలో లాటరీ విధానం ద్వారా (తొలివిడతలో) లబ్దిదారులను ఎంపికచేస్తారు.

రాష్ట్ర స్థాయిలో అయితే సంబంధిత కోళ్ల, మాంసాహార అభివృద్ధి సంస్థ నేతృత్వంలో పథకాన్ని అమలు చేస్తారు. జిల్లాలలో అయితే పశుసంవర్దక అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో పథకాన్ని చేపడతారు. మండల రెవెన్యూ అధికారులు, ఎంపిడిఓలు ప్రభుత్వ పశువైద్యులను ఏకంచేసి వారి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసి సమగ్రంగా పథకాన్ని అమలు జరిపించేలా చూస్తారు. వారం రోజుల పాటు సంఘాలలో సభ్యులను నమోదుచేసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్న గొర్రెలను నిర్ధారించుకుని సభ్యుల నమోదు కార్యక్రమం చేపడతారు.

తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి మాత్రమే గొర్రెల మందలను కొని సమీకరించటం జరుగుతుంది. దీనికి గాను ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ద తీసుకుంటున్నది. సంబంధిత అధికారులు పొరుగురాష్ట్రాలకు వెళ్ళి కావలసిన గొర్రెలను, పోతులను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కొనుగోలుకు, వాటి రవాణాకు, భీమా తదితర ఖర్చులు అన్నింటికీ అయ్యే వ్యయాన్ని భరిస్తుంది. ప్రతీ గొర్రెకు భీమా వర్తింపచేస్తారు. భీమా పథకాన్ని కొత్తగా కొనుగోలు చేసిన వాటికే కాకుండా ఆయా యాదవ, కురుమ లబ్దిదారుల సంఘాల కింద ఇప్పటికే ఉన్న వాటికీ వర్తింపచేస్తారు.

గొర్రెల మేత నిమిత్తం అటవీ ప్రాంతాలను ఆశ్రయించే పద్దతికి గతంలో ఉన్న నిబంధనలను తొలగించి అనుమతులు ఇస్తారు. సంబంధిత అటవీశాఖ అధికారులకు ఈ మేరకు రాష్ట్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తద్వార గొర్రెల, పోతుల గ్రాసం కోసం అటవీ ప్రాంతాలను ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 67.50 లక్షల ఎకరాల భూమి అటవీ ప్రాంతంగా వుంది. దాదాపు 15 లక్షల ఎకరాల భూమి కొండ ప్రాంతాలుగా ఉన్నాయి. వీటిలో వ్యవసాయం సాధ్యం కాదు. అలాగే యాదవుల కింద 15 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఎకాఎకిన రాష్ట్రం మొత్తంగా కోటి ఎకరాల భూమి గొర్రెల గ్రాసానికి గాను అందుబాటులో ఉంది. ‘స్టైలో గ్రాస్’ రకం గడ్డిని ఈ భూముల్లో పెంచి అది ఆరోగ్యకరమైన గ్రాసం కావటం వల్ల దానిని గొర్రెల వృద్ధికి వినియోగిస్తారు. పూలు, మామిడి పండ్లు పండించే ప్రాంతాల్లో గ్రాసం నిమిత్తం గొర్రెల మందలు తిరుగాడినట్లయితే వాటివల్ల అక్కడి రైతులకు మంచి ఎరువు ఈ గొర్రెల ద్వారా లభించడమే కాకుండా వాటికి గ్రాసం కూడా అందుబాటులో ఉంటుంది.

గొర్రెలను కొనుగోలు చేసే సమయంలోనే వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వాటికి కావలసిన టీకాలను సమయానుసారంగా అందిస్తారు. ఆయా యూనిట్లకు వైద్య బృందాలు నేరుగా లబ్దిదారుల ముంగిటకి వెల్లి కావలసిన సేవలు అందిస్తారు. ప్రతీ మండల స్థాయిలో ఒక్కో పటిష్టమైన పశువైద్య బృందాన్ని ప్రభుత్వ పక్షాన ఏర్పాటు కావిస్తారు. అన్ని గ్రామాల శాసన సభ నియోజకవర్గాల్లో సంచార పశువైద్య బృందాలను అందుబాటులోకి తెస్తారు. మండల స్థాయిలో పశువైద్య వ్యవస్థను పరిపుష్టం చేస్తారు. ఇప్పటికే 309 మంది పశువైద్యులను నియమించటం జరిగింది. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో గొర్రెలు, పోతులు వచ్చి చేరుతున్న సందర్భంలో రానున్న రెండు సంవత్సరాలలో మరింత మెరుగైన పశువైద్య బృందాలను అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది. గొర్రెల క్రయవిక్రయాలకు సంతలను స్థానికంగా ఏర్పాటు చేసి ప్రతీ రెండు మూడు మండలాల్లో నిర్వహిస్తారు.

క్రైస్తవ సోదరులు విశ్వసించే ఏసుప్రభువును “గుడ్ షెఫర్డ్” గా ఆరాధిస్తుంటారు. అదే విదంగా రానున్న రోజుల్లో ఇన్ని వెసులుబాట్ల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను యాదవులు, కురుమలు సమిష్టిగా తమ పాలిట “గుడ్ షెఫర్డ్” గా కీర్తిస్తారు అనటంలో అతిశయోక్తిలేదు. ఇది సత్యం. ఇదో నూతన అధ్యాయం. 

No comments:

Post a Comment