Sunday, July 16, 2017

లంకను గెలవడం ఎలా అని ఆలోచించిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

లంకను గెలవడం ఎలా అని ఆలోచించిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (16-07-2017)

          లంకను గెలవడానికి దేవతాసమూహాలకైనా సాధ్యం కాదనిపిస్తుంది హనుమంతుడికి. వానరుల సంగతలా వుంచి, అసమానబలుడైన శ్రీరామచంద్రమూర్తి లంకకు వచ్చినప్పటికీ, రావణ రక్షణలో ప్రవేశించనలవికాని లంకానగరాన్ని ఏంచేయగలడన్న అనుమానమేస్తుంది ఆయనకు. పోనీ, మనకు విరోధమెందుకు? సీతను అప్పగించమని మంచితనంగా మాట్లాడేందుకు వీలులేదు. మంచిమాటలు రాక్షసుల చెవికెక్కవు. బలంతో మదించి, మత్తెక్కిన వారికి మంచిమాటలు రుచించవనుకుంటాడు (సామోపాయం కుదరదన్న భావన). ధన కాంక్ష లేని వీరికి లంచమిచ్చి వశపర్చుకోవడం కుదరదు. వీరికే ఐశ్వర్యం పుష్కలంగా వుంది. ఒకరి డబ్బుతో వీరికేంపని? ఒకవేళ ఇద్దామన్నా శ్రీరాముడి దగ్గర అంత ధనంలేదే!(దానోపాయం కూడా కుదరదని అర్ధం). పోనీ వారిలో వారికి కలహం పెట్టడం కూడా అసాధ్యమే. ఆపని చేయాలంటే వారిలో కొందరితోనైనా పరిచయం చేసుకోవాలి. తనను చూడగానే వారందరూ కలిసి కలహానికి వస్తారేకాని, స్నేహం చేయరుకదా!(భేదోపాయం కూడా వ్యర్ధమే). యుధ్ధంలో గెలుద్దామంటే అంతు చిక్కటం లేదు (దండోపాయం కుదరదేమోనన్న భావన). ఇలా పలు ఆలోచనలతో అభిప్రాయం వెంట, వెంట మార్చుకుంటాడు హనుమంతుడు.

          ఏ ఉపాయం చేయటానికైనా లంకకు రాగల వారెంతమందన్న లెక్కలు కూడా వేస్తాడు. నీలుడు, అంగదుడు, తను, సుగ్రీవుడు, నలుగురు మాత్రం సముద్రాన్ని దాటగలరనీ, అయితే, ఈనలుగురితో ఏం సాధించగలమనీ ప్రశ్నించుకుంటాడు. ఇంతకూ అసలిక్కడ సీత వుందో? లేదో? ఆ విషయం తేల్తే అప్పుడు లంకకు వచ్చే ఉపాయం గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు తాను చేయవలసిన పని సీతను వెతకడం, దానికి లంకలో ఎలా ప్రవేశించాలని యోచించడమనుకుంటాడు. తన మొదటి ఆలోచన, ఉపాయం, ఇదేనని నిశ్చయించుకుంటాడు హనుమంతుడు.

ఎలాంటి ఆలోచనచేస్తే రామకార్యం నెరవేర్తుందో అట్లాంటి ఆలోచనే చేయాలనీ, ఆవిధంగానే నడవాలనీ, అనుకుంటాడు హనుమంతుడు. శిఖరాగ్రాన కూర్చుండి, కొంచెంసేపు ఆలోచిస్తాడు. లంకలోకి పోకతప్పదు...పోయేమార్గమేంటని ఆలోచిస్తాడు. తన భయంకర రూపం చూస్తే, క్రూర రాక్షసులు, రాక్షస సేనలు, వారు రక్షిస్తున్న లంకలోకి ప్రవేశించడం సాధ్యపడనీయరు. లోనికి రానీయరు. జయించి పోవాలంటే వారంతా మహాబలపరాక్రమ సంపన్నులు. కాబట్టి, బహిరంగంగా లోపలికి వెళ్లడం మంచిదికాదు. తెలవకుండా వంచించి, లోపలికి పోయి, కనపడవలసిన చోట కనపడుతూ, కనపడరాని చోట కానరాక వుండే రీతిలో వేషాలు మార్చాలనుకుంటాడు ఆంజనేయుడు. మొత్తం మీద చీకటి మాటున కార్యం చక్కబర్చుకోవాలని కూడా నిర్ణయించుకున్టాడు. (వాలివధ విషయంలో శ్రీరాముడిని అధిక్షేపించిన మహానుభావులు, హనుమంతుడి విషయంలో, ఎందుకో ఆక్షేపించలేదు. లేకపోతే, హనుమంతుడు పిరికి, మోసగాడు, కుట్రాలోచనచేసాడు, పౌరుషంతో బహిరంగంగా ఉన్నరూపంలోనే లంకలోనికి ప్రవేశించలేడా అని ప్రశ్నించేవారే!)

          ఈ ప్రకారం ఆలోచిస్తూ, దుర్భేద్యమై, ప్రవేశించనలవికాని, లంకానగరాన్ని కొంతసేపు రెప్ప వాల్చకుండా చూస్తాడు. చూసి, ప్రవేశిండం కష్టకార్యమని భావిస్తాడు. నిట్టూర్పులు విడుస్తాడు. రావణాసురుడి కళ్లల్లో కారం ఎట్లా కొట్టాలి, ఎట్లా మోసగించాలి అని ఆలోచిస్తాడు. సీతనెట్లు చూడగలననీ, ఎట్లు ఈకార్యం సాధించగలననీ, మధనపడ్తాడు హనుమంతుడు(సముద్రాన్ని దాటినప్పుడు నిట్టూర్పులు విడవనివాడు ఇప్పుడు చేస్తున్నాడంటే, దానికంటే ఇది కష్టతరమైన కార్యమని హనుమంతుడికి తోచుండాలి).


దేశకాల జ్ఞానం లేక, ఏకాలంలో, ఏదేశంలో, ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచనలేక, పనిచేసే దూత, అతడి జ్ఞానహీనతవల్ల, సక్రమ ప్రయత్నంతో సాధ్యమని తోచినపని కూడా చేయలేడు. ఈకార్యం ఈప్రకారం చేస్తే తప్పక ఫలితమిస్తుందని బుధ్ధిమంతులు నిశ్చయించినా, పండితమానియగు వాడు, కార్యం చేయ సమర్ధత లేనివాడై, కార్యాన్ని, ప్రాజ్ఞుల ఆలోచనను కూడా విఫలం చేస్తాడు. నేనెలా ఈకార్యాన్ని సాధించగలను? చేయలేదన్న నింద నాకెలా రాకుండా వుండాలి? అని హనుమంతుడు మరీ-మరీ, ఆలోచిస్తాడు. ఐహిక-ఆముష్మిక శాస్త్రాలన్నింటినీ ఎరిగినవాడు, ఇతరుల మనస్సెరిగి మాట్లాడే స్వభావంకల నేర్పరి, ఇతరుల ఆకారం, చేష్టలు, సంజ్ఞలు ఎరిగినవాడు, అర్ధ-దాన-స్త్రీల విషయాలలో పరిశుధ్ధుడు, నేర్పరి, సద్వంశంలో పుట్టినవాడు మాత్రమే దూతగా పనిచేయడానికి అర్హుడు. అందరిమీద అనురాగమున్నవాడు, ధన-స్త్రీ విషయంలో శుచికలవాడు, జ్ఞప్తికలవాడు, దేశకాల స్థితినెరిగినవాడు, చక్కని దేహం కలవాడు, భయంలేనివాడు, మాటలందు నేర్పరితనం కలవాడు దూతగా వుండటానికి అర్హుడు. ఇన్నిగుణాలు హనుమంతుడిలో కలవనే విషయం పలుసందర్భాలలో బోధపడ్తుంది.

          "ఏవిధంగా చేస్తే నా ప్రయత్నం సఫలమౌతుంది? పగటి వేళ ప్రవేశించాలా? రాత్రి వేళా? ఈ రూపంలోనా? రూపం మార్చాలా? వివేకం చెడకుండా ఎట్లా ఈకార్యాన్ని నెరవేర్చగలను? ఎట్లా ప్రవర్తిస్తే సముద్రం దాటివచ్చిన శ్రమ వ్యర్ధంకాదు? ఇంత శ్రమ పడ్డవాడిని ఇక్కడ ఏంచేయకుండా వుండేదెట్లా? ఈక్షణమే ఈ రూపమ్తోనే పోవాల్నా? అలాపోతే, రాక్షసుల కంటబడితే, రామకార్యం, సీతాదేవిని వెతకడం చెడిపోతుందికదా? రాక్షస రూపంలో పోవాలా? లంకలోని వారందరూ ఒకరికొకరు తెల్సినవారేకదా? కొత్తవాడినైన నన్ను గుర్తించరా? ఇంకో రూపంలో పోయినా వారు తెలుసుకోవచ్చుకదా? ఈ రాక్షసులకు తెలియకుండా గాలికూడా లంకలో సంచరించలేదుకదా!" అని హనుమంతుడు పరి-పరి విధాలుగా ఆలోచిస్తాడు.


          "పోనీ ఇప్పుడు లంకలోకిపోవద్దు.... ఇక్కడే వుందామా? అప్పుడుకూడా  ఎవరో ఒకరు నన్ను కనిపెట్టరన్న నమ్మకమేంటి? తనకు వారు కనిపిస్తుంటే, తనెందుకు వారికి కనిపించడు? వారిక్కడికి రావడం నిజం, రామకార్యం చెడటం కూడా నిజం. కాబట్టి ఇదీ సరైన మార్గం కాదు" అనుకుంటాడు హనుమంతుడు. "అంటే ఇప్పుడీరూపంలో లంకలోకి పోవడం తప్పే..... వుండడమూ తప్పే. కాబట్టి చీకటి పడేవరకు ఇక్కడే దాక్కొని, ఆతర్వాత చిన్న కోతిగా మారి, రావణుడి పట్టణంలో చొరబడి, సీతాదేవిని రాక్షసుల ఇళ్లలో వెతకాలి. అట్లైతే రామకార్యం చేసినవాడినన్న గౌరవంతో అతిశయించగలను" అని ఆలోచించాడు హనుమంతుడు. చీకటి పడేవరకు ఇక్కడే దాక్కొని, ఆతర్వాత చిన్న కోతిగా మారి, రావణుడి పట్టణంలో చొరబడి, సీతాదేవిని రాక్షసుల ఇళ్లలో వెతకాలి అనే ఆలోచనకొచ్చాడో, దాన్ని కార్యరూపం చేయాలని సంకల్పించాడు. ఎప్పుడు సూర్యుడస్తమిస్తాడా, ఎప్పుడు సీతను చూడగల్గుతానా అని ఎదురుచూస్తుండగా, సూర్యుడు పడమటి కొండ పై అస్తమించాడు. సూర్యుడు పద్మినీ బాంధవుడైనందున, పద్మినైన సీత కార్యం తానుంటే నెరవేరదన్న భావంతో అస్తమించాడనుకోవాలి.  END

No comments:

Post a Comment