Saturday, October 26, 2019

“వాచం హృదయ హారిణీమ్” .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...కిష్కింధాకాండ-1 : వనం జ్వాలా నరసింహారావు


“వాచం హృదయ హారిణీమ్”
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...కిష్కింధాకాండ-1
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (27-10-2019)
చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారి ఉపోద్ఘాతం: శ్రీరామ జయరామ కోదండరామ! కళ్యాణగుణధామ! సీతారామ! సురవైరిగణభీమ! పట్టాభిరామ! శ్రీరామ జయరామ జయజయరామ!!

ఇది మన శ్రీ జ్వాలా నరసింహరాయల వారి మందరమకరంద ‘మందర’ రామాయణానికి అనువచనం. ఇప్పటికే బాల, అయోధ్య, అరణ్య, సుందరకాండలను రుచి చూపించే ‘వాచవి’ గా, ‘అనువక్త’ గా ‘వాసుదాస’ స్వామివారి ‘మందరా’న్ని అందంగా చక్కని చిక్కని సంభాషణాశైలిలో, సంక్షిప్తసుందరంగా తెలుగువారికి అందించిన మాధుర్యవచో విలసన్మణి ఆయన. ఇప్పుడు కిష్కింధాకాండను మనకు విన్పిస్తున్న ‘కల్యాణమిత్రుడు’. భారతీయులకు శ్రీరామాయణం–భాగవతం పవిత్రపారాయణ గ్రంథాలు. భారతం ఇతిహాసం, కాలక్షేప గ్రంథం. పురాణ పరిమళం. ఇవి సనాతన ధార్మిక త్రివేణి స్థావరాలు. వాల్మీక, వ్యాసాదులు అనుగ్రహించిన వరాలు. దారి దీపాలు. భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దివ్య జ్యోతులు. ఇందులో వాల్మీకి రామాయణాన్ని’ఆదికావ్యం’ అంటారు. మహర్షి వాల్మీకిని ‘ఆదికవి’ అంటారు. వారి అనుగ్రహప్రసాదమే ఈ వేళ కోట్లాది భారతీయులకు శ్రీ రామాయణం ఆజీవనపారాయణమైంది. భారత జాతి సమైక్యతకు మూలకందమైంది. సామాజిక జీవన సౌందర్యానికి ‘కౌముది’ అయింది. అక్షర సంపద గలవారికి ‘శ్రీ రామాయణం’ కల్పవృక్షమైంది. జ్ఞానపీఠమైంది.

     మహర్షి వాల్మీకి విశ్వ వాజ్ఞయానికి అందించిన సంస్కృత రామాయణం ‘ఆంధ్ర వాల్మీకి రామాయణం’గా, ఆంధ్ర తాత్పర్య విశేషాలతో ‘అపర వాల్మీకి’ గా, ‘ఆంధ్ర వాల్మీకి’ గా పండిత పామరులచే సంభావించబడిన శ్రీ వైకుంఠవాసులైన వావిలికొలను సుబ్బారావు గారి చేత ‘మందరం’ గా మలచబడి, అశేష ఆంధ్రలోకం చే సమాదరించబడి, నిత్యపారాయణ గ్రంథంగా ఆరాధించబడుతోంది. ఆ మహా మహానుభావులు సప్తకాండ సంశోభితమైన వాల్మీకంలోని 24 వేల శ్లోకాలకు 24 వేల పద్యాలతో తెలుగు అనువాదం యధాతధంగా చేశారు. శ్రీరామానుగ్రహప్రేరణతో తాము వ్రాసిన 24 వేల పద్యాలకు ‘మందరం అనే పేరుతో విశిష్ట విశేష విపుల వ్యాఖ్యానాన్ని అందించారు. మందరం 9 సంపుటాలలో ఆవిష్కరించబడింది. (వారి అవతార సమయం 23-01-1863 నుండి 01-07-1936). తమ 68 వ ఏట, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే మందరాన్ని ప్రారంభించారు. ‘ఆంధ్రవాల్మీకి’ రామాయణం 1904 లో ప్రారంభించి 1908 నాటికి పూర్తి చేశారు. రోజుకు 24 గంటలు శ్రమించారు. శ్రీవారి ‘మందరా’ నికి సంక్షిప్త రూపమే మన వనం జ్వాలా నరసింహారావు గారి ‘మందర మకరందం!

         జ్వాలా నరసింహారావు గారే మొదట వారి ‘మాట గా చెప్పారు ఇందులో ఈ గ్రంథ నేపధ్యం గురించి. విశేషమేమంటే ‘మందరం’ జ్ఞానపిపాసికి విజ్ఞానసర్వస్వం. వాసుదాసస్వామి వారు ప్రయోగించిన ఛందోవృత్తాలు సాహితీ పిపాసికి ‘వసంతకుసుమాకారాలు’, ‘పూర్ణచంద్రోదయాలు. జ్వాలాగారు ఈ వృత్తాలను సైతం అవలోడనం చేసి, వేరొక ఆవిష్కరణ చేశారు. భక్తకవి పోతన్నగారు వాసుదాసస్వామి వారికి స్ఫూర్తిమూర్తి. అందువల్లే వాసుదాసస్వామి వారు వాల్మీకాన్ని 108 సార్లు పారాయణం చేయడం ఒక విశేషమైతే, శ్రీరామాయణంలో శ్రీ సీతారాములకు ఏ విధంగా మహా సామ్రాజ్య పట్టాభిషేకం చేయబడినదో, అదే విధంగా, యథాతథంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో 500 నదీజలాలను తెప్పించి పట్టాభిషేకం చేయడం అపూర్వమైన విశేషం.

ఆ విధంగా ఈ వేళ ఒంటిమిట్టలో-అంటే ఏకశిలానగరం- శిలాఫలకం మనకు సాక్షాత్కరిస్తోంది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆంధ్రశాఖాధ్యక్షులుగా, ఆచార్యులుగా ఉద్యోగించి (1904-20), ఆ సమయంలో భార్యావియోగం పొంది, పదవీ విరమణానంతరం ఎన్నో మహా గ్రంథాలను రచించారు. శ్రీ కుమారాభ్యుదయం, కౌసల్యా పరిణయం, సుభద్రా విజయం, పోతరాజు విజయం, ఆంధ్ర విజయం ప్రభంధాలు కాగా, వివిధ హితచర్యలు, ఆర్య కథానిధులు, పోతన్న నికేతన చర్చ, సులభ వ్యాకరణం వంటి ఇతర గ్రంథాలెన్నో ప్రచురించబడినాయి. వారు ప్రారంభించిన ‘భక్తిసంజీవని’ ‘భక్తి, జ్ఞాన, కర్మ యోగములు తెలుపు మాస పత్రిక-యథాతథంగా 81 సంవత్సరాలుగా అవిచ్చిన్నంగా గుంటూరు జిల్లా, తెనాలి దగ్గర అంగలకుదురు “శ్రీ కోదండరామసేవక ధర్మసమాజం పేరిట చక్కగా ప్రచురించబడుతోంది. ఆ పత్రిక చివరి కవరు పేజీ తప్పక చూచి, చదివితీరవలసినదే! వివేకముగల ఆర్తులు! ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే-మన వాసుదాసస్వామి వారి వైభవాన్ని గురించిగానీ, వారి ‘మందారాన్ని గురించిగానీ, మా జ్వాలా నరసింహారావు గారికంటే పరిచయం చేయగలవారు మరొకరు కన్పించడంలేదు శ్రీవారి శిష్యులు తప్ప! అంత పరిశోధన చేసిన వ్యక్తి ‘జ్వాలా గారు. నిష్కర్షగా చెప్పాలంటే-శ్రీ వాసుదాసస్వామి వారు ‘జ్ఞానపీఠా’నికి, మరొక జాతీయ స్థాయి పురస్కారానికో-‘పద్మ పురస్కారానికో పూర్తిగా అర్హులు మరణానంతరమైనా!

పరిశోధన చేయగలవారికి ‘మందరం’ మహా జ్ఞాన పుష్కరిణి. శ్రీ వాసుదాస స్వామి వారు ‘పరిశోధనా లక్ష్యం’ గా ఎంతైనా పరిశోధన చేయవచ్చు. జ్వాలా గారు చేసిన, చేస్తోన్న కృషికి సైతం ‘డాక్టరేట్’ చక్కగా ఇవ్వదగునని నేను భావిస్తున్నాను.

     ఇక ప్రస్తుత గ్రంథం విషయానికి వస్తే–ఇది కిష్కింధాకాండ. శ్రీ రామాయణంలో  ఏమున్నదో, ఎందుకు చదవాలో వాసుదాస స్వామి వారి పీఠికతో బాటు తనదైన నిరుపమాన శైలిలో జ్వాలాగారు చక్కగా వివరించారు. శాబ్దిక విశేషాలనూ, శ్రీరామావతార వైభవాన్నీ, వైలక్ష్యాన్ని తెలియజేశారు. కావ్య ‘అంతర ధ్వని’ ని విగ్గడించారు. ‘అవతారిక’ లో అరణ్యకాండను కిష్కింధాకాండతో సందర్భాన్ని సూచిస్తూ అనుసంధించారు. కిష్కింధకాండ ప్రధానంగా ద్వయమంత్రమందలి ‘చరణౌ’ పదానికి వివరణమని పెద్దల నిష్కర్య. ఇది జ్ఞానకాండ. అరణ్యకాండ దీన సంరక్షణమనే ధర్మాన్ని శ్రీ రామచంద్రమూర్తి ఏ విధంగా అనుష్ఠించారో వివరిస్తుంది. మిత్రరక్షణమనే ధర్మాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీ రామచంద్రమూర్తి అసంఖ్యేయ కల్యాణ గుణాలను చక్కగా వివరిస్తుంది.

సరిగ్గా కాండ ప్రారంభంలోనే మహాద్భుతమైన, తాత్త్వికశబ్ద, అర్ధ్రసంభరితమైన ‘పంపా’ వర్ణనతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. బుద్ధిమతాంవరిష్ఠుడైన ఆంజనేయస్వామి పరివ్రాజక రూపురేఖా విలాసాలతో దర్శనమిస్తాడు. కొందరు మహానుభావులు కిష్కింధాకాండను ‘హనుమ’ కాండ అనవచ్చునంటారు. ఈ కాండలో వర్ణనలు విశేశంగా కన్పిస్తాయి. వర్షఋతు వర్ణనము (28 సర్గ), నాలుగు దిక్కులలో ఉన్న భౌగోళిక ప్రదేశ వర్ణనలు (40–44 సర్గలు), భాషా ప్రియులకు, ఆలోచనామృతాన్ని అందిస్తాయి. శ్రీ రామ-సుగ్రీవ మైత్రి, వాలివధ విషయమై ‘ధర్మ’ చర్చ, సుగ్రీవునికి మొదటి యుద్ధములో వాలి వల్ల పరాభవం, తార ధర్మ, లౌకిక ధర్మ వివరణం, లక్ష్మణ స్వామి భ్రాతృ భక్తి–ఇలాంటివెన్నో ధర్మ సముచ్ఛయాలు కిష్కింధాకాండలో గ్రహిస్తాము.


వదినె గారి పట్ల మరిది ఎలా ప్రవర్తించాలో లక్ష్మణస్వామి పలికిన మాటలు మనస్సును ఆర్థ్రం చేస్తాయి. సీతమ్మ గిరిపై పడవేసిన నగల మూటను చూచి, ఇవి మీ వదినెవేమో చూడమన్న రాములవారితో లక్ష్మణ స్వామి అన్న మాటలు.

శ్లో ׀׀ నా హం జానామి కేయూరే నా హం జానామి కుండలే ׀
    నూపురేత్వభి జానామి నిత్యం పాదాభివందనాత్ ׀׀

సనాతన ధర్మ ప్రతిపాదితమైన భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు ఇది మణిద్వీపం.
‘అన్నా! ఈ కేయూరాలను, కుండలాలను నేను ఎరుగను. కానీ నిత్యమూ మా వదినెమ్మకు పాదాభివాదనం చేస్తాను గనుక, ఈ కాలి అందెలు వదినెమ్మవే అని చెప్పగలను.

     ఈ వేళ జాతీయ స్థాయి పరిపాలక శిక్షణ సంస్థలలో సైతం శ్రీ రామాయణాన్ని సోదాహరణంగా వివిధ సందర్భాలను, సన్నివేశాలను శిక్షణాంశాలుగా స్వీకరిస్తున్నారు. అందులో ప్రధానంగా సున్నితమైన నైపుణ్యాలను (soft skills) శ్రీ రామాయణం నుంచే సేకరించి, శిక్షణాంశాలుగా బోధిస్తున్నారు. శ్రీ ఆంజనేయస్వామి వారిని ‘సంభాషణా కౌశలాలు’ అనే శిక్షణాంశానికీ (communication skills), శ్రీ రామచంద్రస్వామిని ‘జట్టుకట్టడం’ (Team building) అనే అంశానికీ, ‘ఇరువర్గాల మధ్య సయోధ్య’ (Negotiation Technique) కూ, జాంబవంతుని ‘ప్రేరణ’ (motivation) కూ, ‘ధర్మమీమాంస-మానవీయ విలువలు’ (Ethics & Human values) కూ–ఇలా ఎన్నో శిక్షణాంశాలకు కిష్కింధా, సుందరకాండలు అద్భుతమైన శిక్షణ సామాగ్రిని అందిస్తున్నాయి. జ్వాలా నరసింహారావు గారు మొదట శిక్షణవేత్తగా (Trainer) రాణించిన వ్యక్తి కావడం వల్ల కిష్కింధాకాండలో ఆయా సందర్భాలలో ఈ శిక్షణాంశాలను చక్కగా వివరించడం జరిగింది.

కిష్కింధాకాండలో ప్రస్తావించబడిన ధర్మ సూక్ష్మాలు ఈనాటి సమాజానికి ఎంతో ప్రయోజనకరం. వావి వరుసలు, సభ్యతా, సంస్కారాలు క్షీణించిపోతున్న కాలంలో చక్కని శైలిలో పామరులకు సైతం హాయిగా చదువుకునేందుకు దీనిని మలిచారు జ్వాలా గారు. ఉదాహరణకు వాలిని ఎందుకు చెట్టు చాటున నుండి వధించాల్సి వచ్చిందో శ్రీరామచంద్రస్వామి వాలికి వివరిస్తాడు.

శ్లోII ఔరసీం భగినీం చాపి భార్యాం వాస్యమ జస్యయః !
      ప్రచరేత నరః కామాత్ తస్య  దండో వధః స్మృతః !!

(ఎవడు కూతురు, చెల్లెలు, తమ్ముని భార్య మొదలైన వారిపట్ల కాముకుడై ప్రవర్తిస్తాడో వానిని వధించడమే సరైన దండన అని ధర్మశాస్త్ర వచనం). వాలి అంగీకరిస్తాడు. క్షమించమంటాడు. అలాగే వాలి తన చరమదశలో తన ప్రియపుత్రుడైన అంగదుడితో ఇలా అంటాడు.

శ్లోII నచాతి ప్రణయః కార్యః కర్తవ్యో  ప్రణయశ్చతే !
     ఉభయం హి మహాన్ దోషః తస్మాదంతర దృర్చవ II

(నాయనా ఎవ్వరినీ ఎక్కువగా ప్రేమించకు. ఎవ్వరిపైనా ద్వేషం పెంచుకోకు. ప్రేమద్వేషం రెండూ పెద్ద దోషాలే ! కాబట్టి అంతర్ముఖుడవై జాగ్రత్తగా ప్రవర్తించు)

తప్పు చేసినవారు చివరకు ఎలా అధోగతిపాలై అప మృత్యువాత పడిపోయారే, మిగిలిన అలాంటి వారు జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈ విషయమై సుగ్రీవుడితో అన్నమాటగా లక్ష్మణస్వామి చేసిన హెచ్చరిక.

శ్లోII నచ సంకుచితః పంధాః  యేన వాలీ హతో గతః I
     సమయే తిష్ఠ సుగ్రీవ I మా వాలి వధ మన్వగాః I

(సుగ్రీవా ! మీ అన్న వాలి వెళ్లిన ద్వారం ఇంకా మూతపడలేదు. అన్నమాట నిలుపుకో !  మీ అన్న వాలి పోయిన త్రోవనే ప్రయాణం చెయ్యకు!) సీతాన్వేషణ కర్తవ్యాన్ని మరచి భోగలాలసుడవై వుండదలిస్తే నీకూ చావు తప్పదని అంతర ధ్వని !)

అనేకానేక ధర్మ మర్మాలను, లౌకిక వ్యవహారాలను, మహా విషయాలను, మహామంత్ర అంతరార్థాలను నింపుకున్న కిష్కింధాకాండ జ్వాలా పాలిట ‘కలకండ’ గా మారి మనకు అందిస్తోంది. చాలా కష్టమైన పదాలతో నడిచే కాండ ఇది. వాసుదాస స్వామివారు ‘గోవింద రాజీయ’ వ్యాఖ్యానాన్ని అనుసరించి, దానిని మరింత పరిమళభరితంగా తెలుగుభాషలో మనకు తెలియపరిచారు. తొమ్మిది సంపుటాలలో విస్తరించిన విశేష వ్యాఖ్యానాన్ని క్లుప్త సుందరంగా మనకు రుచికరంగా వివరించారు జ్వాలా నరసింహరావు గారు. వారన్నట్లు వారి పితృపాదులు, పరమపదవాసులు శ్రీనివాసరావుగారు తనవలెనే కుమారుడు కూడా శ్రీరామాయణ పారాయణ పూర్వక ప్రవచన రచనను చేసినందున ‘పితేవ పరితుష్యతి’ అస్తు! 

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (హైదరాబాదు) వారు అదనపు సంచాలకులుగా, నేను ప్రొఫెసర్ గా సహవ్రతులం, ఇరుగు పొరుగులం, సహ పాఠకులం, సహోద్యోగులం కావడం అనే భాగ్య విశేషం వల్ల, ‘శ్రీరామాయణం మాకు నిత్య సంభాషణం’ కావడం వల్ల నాలుగు వాక్యాలు విన్నవించే సౌభాగ్యం నాకు కల్పించినందుకు, నా అయోగ్యతను విస్మరించి, నన్ను ఈ విధంగా సంభావించినందుకు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను.

శ్లోII కృతం హి ప్రియమస్మాకం రాఘవేణ మహాత్మనా I
      తస్య చేత్ ప్రతికారోస్తి జీవితం సఫలం భవేత్ II (కిష్కింధా)

No comments:

Post a Comment