Monday, December 28, 2009

ముదిగొండ మండలం-ఖమ్మం కమ్యూనిస్ట్ ఉద్యమం

("ఎర్రకోట ఎలాకూలింది" అన్న పేరుతో సూర్య దినపత్రికలో జూన్-జులై 2009 లో రెండు విడతలుగా ప్రచురించబడింది.. వనం జ్వాలా నరసింహారావు)

పాండవులు అరణ్యవాసం ముగించుకుని, అజ్ఞాతవాసం చేసేటప్పుడు, వారి ఉనికి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పుడే మారుపేర్లతో అన్నదమ్ములందరు విరటుడి కొలువులో వుండేవారు. ఆయన దగ్గర చేరడానికి ముందు, తమ ఆయుధాలు ఎవరికీ కనిపించకుండా ఒక జమ్మి వృక్షం మీద శవాకారంలో భద్రపరిచారు. వారలా తమ "బాణాలను" వుంచిన జమ్మిచెట్టు ఆ సమీపంలోనే వున్న బాణాపురం గ్రామంలో వుంది. పాండవులు అజ్ఞాతవాసం చేసే ముందు, ఎవరికీ కనిపించకుండా తమ ఆయుధాలనుంచిన జమ్మిచెట్టున్నదని భావిస్తున్న బాణాపురంతో సహా చుట్టుపక్కల గ్రామాల్లో కమ్యూనిస్టుల ఆధిక్యతను దెబ్బతీసేందుకు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య చాలాకాలం హింసా కాండ జరిగింది. ఇరు వర్గాల్లో ఎంతోమంది చనిపోయారు. పక్క గ్రామమైన వల్లభిలోనూ, మండల కార్యాలయమున్న ముదిగొండ-చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రాజకీయ హత్యలెన్నో జరిగాయి. వీటన్నిటి పరాకాష్టే 2008 జులై నెలలో ముదిగొండలో జరిగిన పోలీసు కాల్పులు.

ఖమ్మం జిల్లాకు "మార్క్సిస్టు-కమ్యూనిస్టుల కంచుకోట" అన్నపేరు నా చిన్నతనంనుండి వింటూనేవున్నాను. కాకపోతే, ఒకప్పుడు మాప్రాంతంలో బలమైన ఉద్యమ నేపధ్యంలో నిర్మించబడిన కమ్యూనిస్ట్ పార్టీ, క్రమేపీ అంతర్గత కుమ్ములాటలతో, సొంతకంటిలో వేలుపొడుచుకున్న విధంగా బలహీనపడిపోయి, భవిష్యత్‌లో అలా పిలిపించుకునే అవకాశాలు ఉండవనే రీతిలో రూపాంతరంచెందిందనాలి. రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఖమ్మం జిల్లాకొక ప్రత్యేక స్థానం ఉంది. వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణశాఖ ఏర్పడడం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రామకిషన్‌రావు, రావెళ్ళ సత్యనారాయణ వంటి యోధులు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పా ర్టీ చీలిపోవడంతో సీపీఎం (కమ్యూనిస్ట్ పార్టీ-మార్క్సిస్ట్) బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తంలో సీపీఎంకు పట్టున్న జిల్లాగా పేరుతెచ్చుకుంది. రాష్ట్ర చరిత్రలో-ఆ మాటకొస్తే దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమాలకు నాంది పలికింది డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్‌ రాధా కృష్ణ నాయకత్వంలో ఖమ్మం జిల్లాలోనే అనాలి. ఆ విషయాలు మరో సందర్భంలో తెలుసుకుందాం.

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలోనూ, ప్రత్యేకించి జిల్లా రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు, కొంతకాలం రాష్ట్ర రాజకీయాలను శాసించి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా ఉన్న జలగం వెంగళరావుల చుట్టూ ఖమ్మం జిల్లా రాజకీయాలు తిరుగుతుండేవి. ఏభై సంవత్సరాల క్రితం ముదిగొండ-ఆ పరిసర రామాలలో కూడా వారి ప్రభావమే ఉండేది. శీలం సిద్ధారెడ్డి రాజకీయంగా ఎదగి, మంత్రివర్గంలో స్థానం సంపాదించి, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలగడంతో, జిల్లా కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో, జలగం- శీలం వర్గాలుగా ఖమ్మం కాంగ్రెసు రాజకీయాలు సాగాయి. కమ్యూనిస్టులు జిల్లాలోనూ, ప్రత్యేకించి ముదిగొండ ప్రాంతంలోనూ, పరిస్థితులను బట్టి శీలం వర్గానికి మద్దతివ్వడమో, తీసుకోవడమో జరిగేది.

జలగం-శీలం వర్గాల ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఖమ్మం తాలూకా పాలేరు- తిరుమలాయపాలెం పరిధిలోని గ్రామాల్లో శిద్ధారెడ్డి వర్గానికి క మ్యూనిస్టుల మద్దతు లభిస్తే, ఖమ్మం సమితి పరిధిలోని గ్రామాలలో కమ్యూనిస్ట్ అభ్యర్థులకు శిద్ధారెడ్డి వర్గం మద్దతు లభించేది. ఆ విధంగా చెరొక సమితి దక్కించుకుని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించేవారు. అయితే కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత సీపీఐ జలగం పక్షాన, సీపీఎం శిద్ధారెడ్డి వర్గంతోనూ కలసి పనిచేశాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కొంత మారింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి, ఇంకోసారి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చేవారు-వారి మద్దతుతో వీలైనన్ని ఎక్కువ స్థానాలు ఆయా ఎన్నికల్లో సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు. కమ్యూనిస్ట్ పార్టీలు స్వయంకృషితో ఎదగడం ఒకవిధంగా, రోజులుగడుస్తున్నకొద్దీ, ఆగిపోయిందనే అనాలి.

ఇలాంటి రాజకీయ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా, గతశతాబ్దం అరవయ్యో దశకంలో, మిగతా జిల్లాల్లో మాదిరిగానే ఖమ్మంలో కూడా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగడం, ఎన్నికైన సర్పంచులు సమితి అధ్యక్షుడినీ- వీరంతా కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకోబోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిందని రాజకీయ విశ్లేషకులందరూ భావించే "సీల్డ్ కవర్‌" రాజకీయాలకు ‘అపర చాణక్యుడు’గా పేరుబడ్డ బొమ్మకంటి సత్యనారాయణరావు (మా సమీప బంధువు) ఆ రోజుల్లోనే శ్రీ కారం చుట్టి, తన సమీపబంధువైన రావులపాటి సత్యనారాయణ రావుని, ‘పాలేరు’ సమితి అధ్యక్షుడిని చేశారు. అప్పట్లో రావులపాటిని తప్ప వేరెవరిని ప్రతిపాదించినా సమితి అధ్యక్షపదవికి తాము కూడా పోటీలో ఉంటామని కమ్యూనిస్టు నాయకులు ప్రకటించడంతో, సర్పంచ్‌ కూడా కాని ఆయనను కో-ఆప్షన్‌ సభ్యునిగా ఎంపిక చేయించి అధ్యక్షుడిగా చేశారన్న విషయం ఆ ప్రాంతవాసులందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి బొమ్మకంటి నిర్ణయంవల్ల రాజకీయంగా ఎక్కువ నష్ఠపడింది ఆయన మరో బంధువు అయితరాజు రాంరావు. అప్పటికే రాజకీయంగా బొమ్మకంటి తో సమాన స్థాయికి ఎదిగిన ఆయన ఎదుగుదలను ఆపుచేసేందుకే బొమ్మకంటి తన చాణక్య నీతిని ప్రదర్శించాడంటారు. వల్లభి గ్రామవాస్తవ్యుడైన రాంరావు గారి మూడో కూతురే నా శ్రీమతి.

ఈ నిర్ణయంతో బొమ్మకంటి నుండి కొందరు అయినవారు దూరం కావడం, జలగం వర్గం వారికి కోపం కలగడం దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు. ఆ నేపథ్యంలో, ముదిగొండ- పరిసర గ్రామాల రాజకీయాలు క్రమేపీ వేడెక్కాయి. కక్షలకు దారి తీసాయి. అప్పటి వరకూ కలసిమెలసి ఉంటున్న వారిమధ్య చిచ్చు రేగింది. బొమ్మకంటికి అత్యంత సన్నిహితుడి గా అప్పటివరకూ ఉంటూ వస్తున్న సమీప గ్రా మానికి చెందిన ఓ భూస్వామికీ, అదే బొమ్మకంటి ఎంపిక చేసిన సమితి అధ్యక్షుడికీ ‘భూమి’ తగాదాతో ప్రారంభమైన పేచీ చిలికి చిలికి తుఫానుగా మారింది. సమితి అధ్యక్షుడికి అండగా దళితులు, పేదలతో సహా, సాక్షాత్తూ ఆయన్ను వ్యతిరేకించిన భూస్వామి కొడుకు పక్షాన పరోక్షంగా స్థానిక కమ్యూనిస్టులు నిల్చారు. దీర్ఘకాలం సాగిన ఆ పోరాటంలో సమితి అధ్యక్షుడి పక్షానున్న భూస్వామి కొడుకును ఆయన తండ్రి నాయకత్వంలోని వైరి వర్గాల వారు హత్యచేయించారని చెప్పుకునేవారు ఆ రోజుల్లో.

దీని ప్రభావం అదే మండలంలోని అనేక గ్రామాల్లో- ముందుగా ‘వల్లభి’ గ్రామంలో పడింది. ముదిగొండలో ఇరుపక్షాల కాంగ్రెస్‌ వారి మధ్య పోరు సాగినంత కాలం శీలం వర్గం రావుల పాటికి అండగానూ, జలగం వర్గం ఆయనకు వ్యతిరేకంగానూ నిల్చింది. అయితే దళితులు, పేదలు రావులపాటికి మద్దతు ఇస్తుండడంతో, వారికి మద్దతుగా కమ్యూనిస్టులు నిల్చారు. ఆ ప్రాంత-జిల్లా, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన రాయల వెంకటేశ్వర్లు, రావిళ్ళ సత్యం పార్టీ పరంగా ముందున్నారు. రాయల వెంకటేశ్వర్లు ముదిగొండ పంచాయితీలో ఒకప్పుడు భాగమైన వెంకటాపురం గ్రామానికి, రావిళ్ళ సమీప గ్రామమైన గోకినేపల్లికి చెందినవారు.

తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా జలగం వర్గీయుడు, ముదిగొండ సమీపంలోని మేడేపల్లి గ్రామానికి చెందిన నాటి కాంగ్రెస్‌ యువనేత సాఘినేని ఉపేంద్రయ్య గెలుపొందారు. సమితి స్థాయిలో తిరుగులేని నాయకుడిగా, జలగం వర్గంలో ముఖ్యుడిగా, అనతి కాలంలో ఎదిగాడు. అప్పటికే జలగం, శీలం వర్గాలుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఆధిపత్యం పోరులో కూరుకుపోయింది. ఆ ప్రభావం ముదిగొండ పరిసర గ్రామాల్లో పడింది. జలగం గ్రూప్‌ పక్షాన పలుకుబడిగలిగిన ఒక అగ్రవర్ణం వారు చేరగా, శీలం వైపున మరో అగ్రవర్ణం వారే చేరారు. దళితుల్లో మెజార్టీ శీలం వర్గానికి చెందిన అగ్రవర్ణాల పక్షాన నిల్చారు.

సమితి అధ్యక్షుడిని తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన రావడం, అదీ, కాంగ్రెస్‌ నుంచే రావడంతో ఆ ప్రాంత రాజకీయాలు మరో మారు వేడెక్కాయి. సీపీఎం సర్పంచ్‌లు ఉపేం ద్రయ్యను పూర్తిగా వ్యతిరేకించగా, సీపీఐకి చెందిన కొందరితో సహా పార్టీ మద్దతుతో గెల్చిన మరికొందరి మద్దతు ఆయనకు లభించింది. కాకపోతే అలా మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు సర్పంచులు చివరకు పార్టీని వీడి, ఉపేంద్రయ్య అండతో, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులపై పోరాటం చేసారు. ఇరుపక్షాలకు చెందిన కొందరు నాయకులు హత్యకు కూడా గురయ్యారు. రాజకీయంగా పలుకుబడి కోల్పోతున్న సమయాన ఉపేం ద్రయ్య కూడా హత్యా రాజకీయాలకు బలైపోయారు.

అవిశ్వాస తీర్మానంలో ఉపేంద్రయ్యకు అండగా నిలవని సర్పంచులపై కక్ష బూనిన జలగం వర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర వర్ణాలవారికి, అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళితులకు ముదిగొండ మండలంలోని ‘వల్లభి’ గ్రామం మరో ‘భూ పోరాటానికి’ వేదికైంది. దళితుల భూమిని ఆక్రమించకునే ప్రయత్నం చేసిన ఆ గ్రామ అగ్ర వర్ణాల వారికి, దళితులకు తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. చనిపోయిన వ్యక్తి అగ్రవర్ణానికి చెందిన వాడైనందున దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులకు అండగా నిలచిన ఆ గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, స్వర్గీయ అయితరాజు రాంరావు గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సమస్యకు పరిష్కారం ‘గాంధేయ మార్గం’ తప్ప మరోటి కాదని గ్రహించిన అయితరాజు రాంరావు, స్నేహితుల సహాయంతో గాంధి- వినోబా బావేల శిష్యుడైన ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు. పోరాటం కన్నా శాంతే మేలని భావించాడు.వల్లభికి భన్సాలీ వచ్చిన మరుక్షణమే, దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్ళగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. అంతవరకూ నిరాహార దీక్షలో ఉంటానని శపథం చేసాడు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కదిలిక వచ్చింది. నాటి గవర్నర్‌ ఖందూభాయి దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి అంగీకరించాల్సిందెవరో కాదు- కాంగ్రెస్‌లోని ఇరువర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖనాయకులు-జలగం వెంగలరావు, శీలం సిద్దారెడ్డి. జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌-ముఖ్యమంత్రి భన్సాలి దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో- బహుశా దేశంలోనే దళితుడు పూజారిగా ఉన్న మొదటి రామాలయం వల్లభి గ్రామంలో ఉంది. అప్పటి జాతీయ, అంతర్జాతీయ వార్తా పత్రికల్లో ఈ విశేషాలన్నీ ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. వల్లభి గ్రామ భూపోరాటంలో అక్కడి కమ్యూనిస్టులు దళితుల పక్షాన పోరు సల్పిన కాంగ్రెస్‌ వర్గానికి మద్దతిచ్చారు.

ఆ ప్రాంత రాజకీయాలు హత్యా రాజకీయాలుగా, భౌతికంగా ఒక పార్టీవారిని మరో పార్టీ వారు అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకోసాగాయి. మళ్ళీ సమితి ఎన్నికలొచ్చే సరికి, ఆ ప్రాంతంలోని ప్రతిగ్రామ సర్పంచ్‌ ఓటు అత్యంత ప్రాముఖ్యంగా మారడం విశేషం. చివరకు శీలంవర్గం కాంగ్రెస్‌ సర్పంచుల సహకారంతో సిపిఎం సమితి పీఠాన్ని దక్కించుకుంది. అయితే అంతకుముందు, ఆ తర్వాత, చోటు చేసుకున్న పరిణామాల్లో, ఎంతోమంది కమ్యూనిస్టు- కాంగ్రెస్‌ నేతలు హత్యకు గురయ్యారు. బాణాపురం గ్రామానికి చెందిన మార్క్సిస్ట్ నాయకుడు ముక్క చిన నర్సింహతో ఆరంభమైన హత్యాకాండ ఎంతో మందిని బలితీసుకుంది. కాంగ్రెస్‌- కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోరులో సిపిఎం నాయకులు గంధసిరి గ్రామ వాసి గండ్ర వీరభద్రారెడ్డి, బాణాపురం గ్రామవాసి గండ్లూరు కిషన్‌ రావు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ కమ్యూనిస్టు కోయ వెంకటరావుతో సహా చాలా మంది చనిపోయారు. పోలీసు క్యాంపులు ఆ ప్రాంతాల్లో అలవాటుగా మారిపోయాయి కొంత కాలం.

పాలేరు నియోజక వర్గానికి చెందిన ప్రముఖ సీపీఎం నాయకుడు గండ్లూరి కిషన్‌రావు హత్యతో, ఆయన స్థానంలో జిల్లా కమి టీ సభ్యుడిగా ఎన్నికైన తమ్మినేని వీరభద్రం, మరో నాయకుడు రావెళ్ళ సత్యనారాయణ మరణంతో ఖమ్మం డివిజన్‌ పార్టీ కార్యదర్శి స్థాయి కెదగడంతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు కూడా అయ్యారు. 1989లో జిల్లా కార్యదర్శి బోడేపూడి అస్వస్థతకు గురవడంతో తాత్కాలికంగా జిల్లా కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. నిర్మాణదక్షత కలిగిన నాయకుడిగా, వక్తగా, ప్రజలను సమీకరిం చడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న తమ్మినేని తన ఎదుగుదలలో భాగంగా పూర్తిస్థాయి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఇక అప్పటి నుండి ఆయనకూ- ఇతర సీ.పీ.ఎం నాయకులకూ క్రమేపే స్పర్ధలు మొ దలయ్యాయి. జిల్లాలో తన ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు పార్టీలోని ప్రత్యర్థులపై వేటు వేస్తున్నారన్న ఆరోపణలు ఆయన మీదొచ్చాయి.
చిర్రావూరి లాంటి వారిని కూడా జిల్లా కార్యదర్శి వర్గం, కమిటీ నుండి ఓ పథకం ప్రకారం బయటకు పంపారని పార్టీ సీనియర్‌ నాయకులు బహిరంగంగా తమ్మినేనిని విమర్శించసాగారు. ఈ సంఘటనల నేపధ్యంలో, ఉభయ కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2007లో ‘భూ పంపిణీ’ ఉద్యమాన్ని చేపట్టారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఖమ్మం జిల్లాకుకూడా ఆ ఉద్యమాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేసాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొనేందుకు అసలు సిసలైన మార్క్సిస్టు వాదులు ముందుకు రాలేదు. వచ్చినవారిలో అనేకులు హింసాయుత ఆందోళనను వ్యతిరేకించారు. ముదిగొండ కాల్పుల సంఘటనకు దారితీసిన పరిస్థితులను వ్యతిరేకించిన మార్క్సిస్ట్ నాయకులందరినీ జిల్లా నాయకత్వం పార్టీ నుంచి తొలగించింది. ఇతరులు పార్టీని వీడిపోయారు.

ఇళ్ళస్థలాలకోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరాహార దీక్షలు సిపిఎం నాయకుడు రాఘవులు అరెస్టుతో 2007 జులై 27న దాదాపు ముగిశాయి. జులై 28 మధ్యాహ్నానికి పరిసర ప్రాంతాలైన కొండపల్లి, కూసుమంచిలతో సహా ఇతర పరిసర ప్రాంతాల్లో కూడా నిరాహారదీక్షలు పూర్తిగా ఆగిపోయాయి. అయినా ముదిగొండలో మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రాఘవులు అరెస్టుకు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. కొందరు కార్యకర్తలు పోలీసులతో వివాదానికి దిగడంతో కాల్పులకు దారితీసింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇళ్ళస్థలాల కోసం ఉద్యమానికి నాయకత్వం వహించిన నాటి స్థానిక సీనియర్‌ మార్క్సిస్టు నాయకులు ఉద్యమం ‘ప్రభుత్వవ్యతిరేక ఉద్యమం’ లాగానే ఉండాలి కాని ‘పోలీసువ్యతిరేక ఉద్యమం’ అనిపించుకుంటే కార్యకర్తలను తప్పుదోవ పట్టించినట్టవుతుందని నచ్చచెప్పేందుకు ప్రయత్నించి, విరమిస్తారన్న నమ్మకంతో అక్కడినుంచి వెళ్ళిపోయారు. మరుక్షణం ఏం జరిగిందో కొందరు ఆందోళనాకారులు పోలీసులపైకి రాళ్ళు రువ్వడమో, లేక మరో కారణం ఏదైనా ఉందోగాని ఊహించని రీతిలో పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ సంఘటనను అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని వ్యతిరేకించారన్న అభియోగంతో నాయకత్వం కొందరిపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

ముదిగొండ పోలీసు కాల్పుల సంఘటనల నేపథ్యంలో ఖమ్మం సీపీఎంలో చీలిక అనివార్యమని తేలిపోయింది. ఆ కాల్పుల సంఘటనను, తమ్మినేని తన స్వప్రయోజనాలకు ఉపయోగించుకొని, తనకు వ్యతిరేకంగా అంతర్గత పోరాటం జరుపుతున్న, ఆ ప్రాంతానికి చెందిన సీనియర్‌ సీపీఎం నాయకుడు- తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి కమ్యూనిస్టు నేత రాయల వెంకటేశ్వర్లుపై కక్ష తీర్చుకునే ధోరణిలో వ్యవరించారని, రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు తమ్మినేనికే మద్దతిచ్చారనీ వార్తలు వచ్చాయి. దరిమిలా రాయల వెంకటేశ్వర్లును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. 2009 శాసనసభ ఎన్నికలో ఆయన కుమారుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున పాలేరు నియోజకవర్గంనుంచి పోటీచేసి తమ్మినేని ఓటమికి, కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి దోహదపడ్డాడు. రాయల వెంకటేశ్వర్లుకు మద్దతుగా ఆ ప్రాంత నాయకులైన వనం నరసింగరావు ఆయన సహచరులు పార్టీపై తిరుగుబాటుచేసారు.

పార్టీలో ఇమడలేకపోయినా కమ్యూనిస్టులుగానే చివరి శ్వాస వరకు కొనసాగే అసలు-సిసలైన పోరాటపటిమ కలిగిన కమ్యూనిస్టు యోధులు వీళ్లు. పార్టీనుంచి బహిష్కరించబడిన వనం నరసింగరావు నాకు బంధువే కాకుండా, కమ్యూనిజంలో ఓనమాలు దిద్దించినవాడు.

2 comments:

  1. Suspend oorike chesara? edanna reason chooinchaara? entaa reason?

    Gudimalla dopidila gurinchi, SC vallani upayoginchi chesina mafia gurinchi, Granite factories gurinchi, tinadaniki tindi leni vadi nunchi eeroju ila ayyevaraku.. ilantivaniti gurinchi rayala gurinchi rayandi.. meeku matram emi telidu ani mimmalni meere mosam chesukokandi!

    ReplyDelete
    Replies
    1. whatever I heard and gathered I had put in my article. Please add few more lines and i shall keep them as it is in this blog. I am not taking any body's side. Please give more details.
      Regards,
      Jwala

      Delete