Sunday, January 17, 2021

రాముడికిచ్చిన మాట తప్పాడా సుగ్రీవుడు? : వనం జ్వాలా నరసింహారావు

 రాముడికిచ్చిన మాట తప్పాడా సుగ్రీవుడు?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (17-01-2021) ప్రసారం  

సుగ్రీవ, అంగద పట్టాభిషేక వార్త విన్న రామచంద్రుడు, లక్ష్మణుడితో కలిసి ప్రస్రవణ పర్వతం మీద నివసించాడు. భార్యలేని దుఃఖంతో ఆయనకు సంతోషం లేదు. శ్రీరామచంద్రమూర్తిని చూసి లక్ష్మణుడు ఆయన దుఃఖం పోయేట్లు సమాధాన పరిచేవాడు. అన్నతో “రామచంద్రా! సర్వం అనుకూలంగా వస్తుంది. తగిన సమయం రాగానే సుగ్రీవుడు ప్రయత్నపూర్వకంగా సహాయం చేస్తాడు కాని మాట తప్పడు. కాబట్టి వానలు ఆగేదాకా సహించి ఇక్కడే వుందాం. ఆ తరువాత శత్రువులను ధ్వంసం చేద్దాం” అన్నాడు.

ఇదిలా వుండగా, హనుమంతుడు సుగ్రీవుడి ద్వారా రామచంద్రమూర్తి కార్యం నెరవేర్చడానికి పూనుకున్నాడు. కార్యం నెరవేర్చాల్సిన కాలం సమీపించిందని హనుమంతుడు భావించాడు. ఆ విషయాన్ని సుగ్రీవుడు ఆలోచించక పోవడం కూడా గమనించాడు హనుమంతుడు. స్వామి కార్యం మరచిన సుగ్రీవుడిని గుర్తించాడు. సుగ్రీవుడిని హెచ్చరించాలనుకున్న హనుమంతుడు, వినయంగా ఆయనతో ఇలా అన్నాడు.

“వానర రాజా! స్నేహితుల కార్యం ఇంకా నేరవేరాల్సి వుంది. కాబట్టే నేను నిన్ను హెచ్చరించగలుగుతున్నాను. శీఘ్రంగా నువ్వు నీకు మేలుచేసిన వారి పని చేయడానికి ప్రయత్నాలు చేయి. సీతను వెతకడానికి వానరులను పంపు. ఇప్పటికే సమయం మించి పోయింది. రామచంద్రుడు, సీతాన్వేషణకొరకు తొందరున్నప్పటికీ, సమయం, కాలం తెలిసన వాడైనండున నిన్ను హెచ్చరించకుండా నీ నడవడి పూర్తిగా తెలిసేవరకు తొందర పడకూడదని వేచి వున్నాడు. నువ్వు చేయాల్సిన సహాయం వూరికే ధర్మానికి చేస్తున్నది కాదు. నీకాయన ముందుగా సహాయం చేశాడు. కాబట్టి నువ్వతడికి మారుమేలు చేయాలికదా? అది నీకర్తవ్యం కదా? చేయకపోతే తప్పుకాదా? కాబట్టి సీతను వెతికించడానికి వానరులందరినీ ఇక్కడికి పిలిపించాలని కోరుతున్నాను. వారు హెచ్చరించక ముందే చేస్తే దోషం లేదు”.

         అదే సమయంలో రాముడు అక్కడ లక్ష్మణుడితో ఇలా అన్నాడు: “లక్ష్మణా! సుగ్రీవుడేమో ఇంకా  ఇక్కడికి రాలేదు. ఏదైనా ప్రయత్నం చేశాడా అంటే అదీ లేదు. సీతను వెతికే పని ఆలోచించడం లేదు. తగిన కాలంలో తన బాధ్యతను మరచాడు. లక్ష్మణా! నువ్వు కిష్కింధకు వెళ్లు. మూర్ఖుడై భోగాల మరిగిన కుటిల మనస్సుకల ఆ సుగ్రీవుడిని చూడు. చూసి నేను చెప్పానని వాడితో ఇలా అను. ‘అంతకు పూర్వమే తనకు ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చేస్తానని ప్రమాణం చేసి కూడా అది నెరవేర్చక పోవడం చేసినవాడిని పురుషాధముడు అంటారని ప్రాజ్ఞులు చెప్తారు. ముందు మాట చెప్పి ఆ ఆమాట నెరవేర్చడానికి పాపమైనా, పుణ్యమైనా ఆడినమాట తప్పక సత్యం మీద వుండే కార్యనిర్వాహకుడే పురుషోత్తముడని పేరు పొందుతాడు. తన కార్యం నెరవేర్చి మేలు చేసిన స్నేహితుడిని మరిచిన కృతఘ్నుడు చస్తే వాడి పీనుగను కుక్కలు, గద్దలు, నక్కలు తినకపోగా అటువైపు కూడా చూడవు’. అని ఈ విధంగా చెప్పు”.

“నా కోపానికి తగిన విధంగా నువ్విలా చెప్పు. ‘వానరరాజా! వాలి పోయిన మార్గంలో నీకిష్టముంటే నువ్వు కూడా పోవచ్చు. అయినా వాలి పోయిన దారిలో నువ్వు పోవద్దు. వానరుడా! నువ్వేం ప్రమాణం చేశావో ఇప్పటికైనా జ్ఞాపకం తెచ్చుకో. వాలిచేసిన దోషానికి వాడిని మాత్రమే దండించాను. ద్రోహబుద్ధివై సత్యవాక్యం గమనించని నిన్ను, మూడుఢవైన నిన్ను, బంధువులతో సహా చంపుతాను. వానరరాజా! నువ్వు చెప్పిన ప్రమాణ వాక్యాలను జవదాటవద్దు. శాశ్వతమైన ధర్మ మార్గాన్ని వ్యర్థపరచవద్దు. నా వాడి బాణాలతో చనిపోయిన నీ అన్నను చూడడానికి పోవద్దు’. అని నా మాటలుగా నేను చెప్పానని సమయోచితంగా ఇంకేదైనా చెప్పాలనుకుంటే కలిపి చెప్పు” అన్నాడు. అన్న ఆజ్ఞానుసారం లక్ష్మణుడు చాలా వేగంగా కిష్కింధ వైపు వెళ్లాడు.

         కిష్కింధ ప్రవేశించిన లక్ష్మణుడిని వూరి బయట చూసిన కోతులు, సుగ్రీవుడి ఇంటికి పోయి లక్ష్మణుడు కోపంతో వచ్చాడని చెప్పారు. అంతఃపురంలో వున్న ఆయనకు వారి మాటలు చెవికెక్కలేదు. తన దగ్గరికి వచ్చిన అంగదుడితో ఇలా అన్నాడు లక్ష్మణుడు. “నాయనా! నువ్వు పోయి నీ పినతండ్రికి చెప్పు. లక్ష్మణుడు నీతో మాట్లాడడానికి వాకిట్లో నిలిచి వున్నాడు. ఆయన మాటలు వినడానికి నీకిష్టమైతే, వానరుడా! ఎలా ప్రవర్తించాలో అలా చేయి. నువ్విక్కడికి వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? నేను రాను, నువ్వు రావద్దు. నీ తోవన నువ్వు పొమ్మంటావా? నువ్వీమాట చెప్పి ప్రత్యుత్తరం ఏమిస్తాడో తెలుసుకుని త్వరగా రా”. వెంటనే అంగదుడు పోయి తారకు, రుమకు వృత్తాంతమంతా స్పష్టమైన మాటలతో చెప్పాడు.

         లక్ష్మణుడు తన వాకిట్లో కోపంగా వచ్చి నిలబడ్డాడని చెప్పిన అంగదుడి మాటలు వినగానే, సుగ్రీవుడు, కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఆసనం మీద వణక సాగాడు. “నేను లక్ష్మణుడికి, రాముడికి భయపడను. కాని ప్రియస్నేహితుడు కారణం లేకుండా కోపానికి వచ్చాడు కదా అని బాధపడుతున్నాను” అన్నాడు. అప్పుడు సుగ్రీవుడికి మరోమారు హనుమంతుడు హితబోధ చేశాడు.

“సుగ్రీవా! నువ్వు వారి విషయంలో దోషం చేశావు. ఆ దోషానికి ప్రాయశ్చిత్తం నువ్వు లక్ష్మణుడికి రెండు చేతులు జోడించి మొక్కడమే. ఇంతకు మించి ఉపాయం లేదు. నీ మేలుకోరి, భయపడకుండా నీకు హితమైన దానినే చెప్పాను. ఆ ప్రకారం చేస్తే బాగుపడతావు. రామచంద్రమూర్తి అంటే నువ్వేమనుకుంటున్నావు? తన పని తాను చేసుకోలేక అసమర్థుడై నిన్ను ఆశ్రయించడానికి వచ్చాడనుకుంటున్నావా? ఆయనకు కోపమే వచ్చి విల్లు చేతపట్టుకుంటే, దేవతలతో, రాక్షసులతో వెలిగే ఈ ప్రపంచమంతా తనకు లోబడేట్లు చేసుకోగలడు. పూర్వం రామచంద్రమూర్తి చేసిన ఉపకారం తలచి తిరిగి మేలుచేయడానికి ప్రయత్నించు. రాముడి దగ్గరకి పోయి రెండు చేతులు జోడించి నమస్కరించి ఆయనకు వశమై పో” అంటాడు.

         అంతఃపురంలో ఈ విధంగా సమాలోచనలు జరుగుతుంటే, వాకిట్లోనే వున్న లక్ష్మణుడిని, అంగదుడు లోపలికి రమ్మని పిలిచాడు. లక్ష్మణుడు లోనికి పోయాడు. అక్కడ పరిస్థితి చూసి లక్ష్మణుడికి కోపం వచ్చింది. ఇంతలో అంగదుడు వచ్చి సుగ్రీవుడితో లక్ష్మణుడు వచ్చాడని చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు తారను చూసి, లక్ష్మణుడు ఇంత కోపంలో ఎందుకు ఉన్నాడో కనుక్కొమ్మని, కారణం లేకుండా లక్ష్మణుడికి కోపం రాదని, అలా కోప్పడడానికి మనలో ఏదో నేరముండాలని అన్నాడు. అలానే అని పోయిన తార లక్ష్మణుడి దగ్గరికి పోయి ఆయన కోపానికి కారణం అడిగింది. వెంటనే లక్ష్మణుడు, సుగ్రీవుడు సమయాతిక్రమణం చేసాడని చెప్పాడు. “నాలుగు నెలలకు వస్తానని మాట ఇచ్చి, సారా తాగుతూ, స్త్రీలతో ఆటలాడుతూ, కాలం తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. ధర్మం చెడినప్పుడు అర్థం, కామం, వాటంత అవే చెడిపోతాయి. కాబట్టి వీటిని నీ మగడు వదిలాడు. ఇక వాడెలా బాగుపడతాడని అనుకుంటున్నావు? వానరరాజు ఈ విధంగా ప్రవర్తించాడు కాబట్టి మేం చేయాల్సిన పనేంటో ఆలోచించి నువ్వే చెప్పు” అని అన్నాడు.  ఆ మాటలు విన్న తార లక్ష్మణుడిని సమాధాన పరచింది.

తన మాటలకు లక్ష్మణుడు సమాధాన పడినట్లు గ్రహించి మళ్లీ ఇలా అన్నది. “రాజకుమారా! సుగ్రీవుడు మన్మథవశుడైనా నువ్వు రాకముందే మీ కార్యం నెరవేర్చడానికి కావాల్సిన ప్రయత్నం చేశాడు. ఏమి ప్రయత్నం చేసాడంటావా? అతడి పిలుపు మేరకు బలవంతులైన, కోరిన రూపం ధరించగల అనేకులు, కోటానుకోట్ల వానరులు, వచ్చి వున్నారు. తార  పిలవడంతో అంతఃపురంలోకి పోయాడు లక్ష్మణుడు. అక్కడ సుగ్రీవుడిని చూశాడు లక్ష్మణుడు. అలాగే కోపంతో వున్న లక్ష్మణుడిని సుగ్రీవుడు చూశాడు. వానరరాజు సుగ్రీవుడిని చూసి లక్ష్మణుడు క్రూరమైన కోపంతో ఇలా అన్నాడు.

         “నువ్వు రాజుగా వుండడానికి తగినవాడివి కాదు. తనకు మేలు చేసినవాడికి తిరిగి మేలు చేస్తానని ప్రమాణం చేసి, మాట తప్పి, ధర్మాన్ని ఉపేక్షించిన వాడికంటే మూర్ఖుడు, నీచుడు ఎవరో చెప్పు. నువ్విలానే చేశావు కదా! ముందు రామచంద్రుడితో నీ పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని కారణాన నువ్వు కృతఘ్నుడివి. నువ్వు మానహీనుడివి. నువ్వు వంచకుడివి. నువ్వు నీచుడివి. నువ్వు అసత్యవాదివి. రామచంద్రమూర్తి వల్ల నీ ప్రయోజనం నెరవేర్చుకుని, ప్రత్యుపకారం చేయాలని నీ మనస్సులో వుంటే, సీతాదేవిని వెతకడానికి శీఘ్రంగా నువ్వెందుకు ప్రయత్నం చేయలేదు? నిన్ను వాలి పోయిన చోటుకే ఆయన పంపుతాడు. పాపాత్ముడా! వాలి పోయిన దారి ఇంకా మూతపడలేదు. తెరిచే వుంది. ఆ తోవలో పోవడానికి నువ్వు ఆలోచించవద్దు. నువ్వు చేసిన శపథం గుర్తుచేసుకో. నువ్వు రామకార్యాన్ని ఆలోచించడం లేదు. ఇది నిజం”.

         ఈ విధంగా చాలా కోపంగా మాట్లాడుతున్న లక్ష్మణుడిని తార సమాధాన పరిచే ప్రయత్నం చేస్తూ ఇలా అన్నది. “నువ్వు వాస్తవం తెలుసుకోకుండా మూఢుడిలాగా కోపం తెచ్చుకోకూడదు. వాస్తవం ఏమిటి అంటావా? చెప్తా విను. సుగ్రీవుడు రామచంద్రుడి కార్యార్థమై దేన్నైనా వదలి పెట్టుతాడని నా అభిప్రాయం. ఆ కార్యం అంటే అంత ఆసక్తి కలవాడు”. లక్ష్మణా! సుగ్రీవుడు తాను చేసిన ప్రమాణం ప్రకారం యుద్ధంలో రావణుడిని చంపి రామచంద్రుడితో సీతను కలపగలడు. నీకెందుకు సందేహం కలిగింది? సుగ్రీవుడు ఒంటరిగా వచ్చి మీ ఎదురుగా కూర్చుంటే కలిగే ఫలితం ఏమిటి? లంకలో లక్ష కోట్లపైన, పదికోట్ల మూడులక్షల అరవై వేల రాక్షసులు ఉన్నారనీ, వారందరినీ చంపేదాకా రావణుడిని చంపడం సాధ్యం కాదనీ, సహాయం లేకుండా సుగ్రీవుడు ఒక్కడే రావణాసురుడిని ఎలా చంపగలడనీ, వాస్తవం తెలసిన వాలి నాతో చెప్పాడు. వాలి సుగ్రీవుడితో యుద్ధానికి పోయే ముందర నాతో ఈ విషయం చెప్పాడు. యుద్ధంలో మీకు సహాయం చేయడానికి వానర సమూహాలను ఇక్కడికి రమ్మని ఇంతకు ముందే సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ఆ గడువు నేటితో ముగుస్తున్నది. కాబట్టి సుగ్రీవుడి మీద మునుపటి ప్రేమ కలిగి వుండు. ప్రీతిగా అతడి భయం పోగొట్టు”.

         ఇలా తార చెప్పగా, లక్ష్మణుడు ఆమె చెప్పిన ధర్మంతో కూడిన మాటలకు తన తీవ్రమైన కోపాన్ని వదిలాడు. అది చూసిన సుగ్రీవుడు లక్ష్మణుడంటే భయాన్ని వదిలాడు. అణకువతో ఇలా అన్నాడు. “లక్ష్మణా! పూర్వం పోయిన వానరరాజ్యం, సంపద, కీర్తి, ఇవన్నీ రామచంద్రమూర్తి దయవల్ల మళ్లీ నాకు లభించాయి. ఇది సత్యం. అంతటి పరాక్రమ సంపదకలవాడికి, స్వకార్యంతో దిక్కులంతటా వ్యాపించిన కీర్తికల అంతటి వాడికి ఎవడు అపకారం చేయగలడు? రామచంద్రమూర్తి సీతను మళ్లీ పొందగలడు. దానికోసం దుష్టుడైన రావణుడిని చంపగలడు. సందేహం లేదు. అయినప్పటికీ నేను నిమిత్తమాత్రంగా సహాయం చేస్తాను. నా సహాయం లేకపోతే ఆయన తన కార్యం చేసుకోలేడని నా అభిప్రాయం కాదు”. లక్ష్మణుడు ఆ మాటలకు సంతృప్తి పడ్డాడు.

లక్ష్మణుడు ఇలా చెప్పగా విన్న సుగ్రీవుడు హనుమంతుడితో భూమ్మీద ఎక్కడెక్కడో వున్న వానరులందరినీ, పిలిపించమన్నాడు. ఆయన అలాగే చేస్తానన్నాడు. సుగ్రీవాజ్ఞ ప్రకారం వానర ముఖ్యులు దిక్కులు కనబడనట్లు యుద్ధకాంక్షతో వచ్చారు. అంజనా పర్వతం నుండి కాటుకలాంటి నల్లటి దేహం కల వానరులు మూడు కోట్లమంది, పడమటి కొండ నుండి బంగారువన్నె దేహం కల పది కోట్ల వానరులు, కైలాసం నుండి సింహం మెడమీది వెంట్రుకల లాంటి కాంతి కల వేయికోట్ల మంది వానరులు, హిమవత్పర్వతం దగ్గర పండ్లు, వేళ్ళు తినే కోతులు వేయివేల కోట్ల మంది, వింధ్య పర్వతం నుండి నిప్పులాంటి ఆకారం కల కోటి వేలమంది కపులు, పాలసముద్రం తీరం నుండి టెంకాయలు తినే వానరులు లెక్కలేనంత మంది వచ్చారు. వీరంతా రాముడి కార్యం సాధించడానికి వచ్చారు. వీరంతా సుగ్రీవుడు పెట్టిన గడువుకు సరిగ్గా వచ్చారు. వానరులను పిలవడానికి పోయి వచ్చినవారు తెచ్చిన పళ్ళు, పూలు, కానుకలను సుగ్రీవుడి ముందుంచి, “వానర రాజా! మీ ఆజ్ఞ కోతులందరికీ తెలియచేయగా వారంతా కిష్కింధకు వచ్చారు” అని చెప్పారు. సుగ్రీవుడు చాలా సంతోషించి వారి కానుకలను స్వీకరించి, వారందరినీ ఇండ్లకు పొమ్మని ఆజ్ఞాపించాడు. అక్కడి నుండి అంతా కలిసి బయల్దేరి శ్రీరాముడి దగ్గరకు పోయారు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)

No comments:

Post a Comment