Monday, January 4, 2021

ఉద్యోగాల కల్పవల్లి కేసీఆర్ సర్కార్ : వనం జ్వాలా నరసింహారావు

 ఉద్యోగాల కల్పవల్లి కేసీఆర్ సర్కార్

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (05-01-2021)

తెలంగాణ ఉద్యమంలో నియామకాల విషయంలో ఉద్యమనేతగా నినదించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రిగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్న సంగతి జగద్విదితం. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వశాఖల్లో నియమించే ఉద్యోగాలే అన్న అపోహ చాలాందికి ఉంటుంది. కానీ, తెలంగాణ సర్వీసు కమీషన్ ద్వారా జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలేకాక, ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణితో పాటు, విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలు, విశ్వవిద్యాలయాలు, వివిధ కార్పొరేషన్లు, సొసైటీల్లో జరిగే నియామకాలు కూడా ఉద్యోగాల కిందకే వస్తాయని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా కేవలం ప్రభుత్వశాఖలలోనే కాకుండా నిరుద్యోగులకు పరిశ్రమల్లో, ఐటీ తదితర ప్రభుత్వేతర రంగాల్లో ప్రత్యక్ష లేదా పరోక్ష రీతిలో ఏవిధమైన ఉపాధి కల్పించినా అవికూడా ఉద్యోగ నియామకాల కిందకే వస్తాయనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇలా దాదాపు 22 లక్షల మందికి ఉపాధి కలిపించడం జరిగింది. 

నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ, ప్రభుత్వేతర, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు, ఐటీ రంగంలో, పరిశ్రమల్లో విరివిగా ఉపాధి అవకాశాలు కలిపించినప్పటికీ ఉద్యోగాల భర్తీ విషయంలో వాస్తవాలకంటే, వక్రీకరణలే ప్రచారంలోకి వస్తున్నందున నిజాలను తెలియచేయాల్సిన అవసరం, రాష్ట్రంలో ఉద్యోగపరంగా ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించాల్సిన అవసరం ఏర్పడిందనాలి.

నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం, మున్నెన్నడూ కనీ-వినీ ఎరుగని రీతిలో, కేవలం ఆరున్నర సంవత్సరాల్లోనే ప్రభుత్వ, ప్రభుత్వేతర, ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు లక్షా ఏబైవేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. (ఇందులో 31,072 ఉద్యోగాలు టీఎస్ పీఎస్సీ ద్వారా, 9,289 ఉద్యోగాలు విద్యుత్ శాఖలో, 13,625 ఉద్యోగాలు సింగరేణి సంస్థలో, 28,277 పోలీసుశాఖలో, 9,355 పంచాయతీ కార్యదర్శులు, 3,463 ఉద్యోగాలు  గురుకుల పాఠశాలల్లో, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో 9600, వైద్య ఆరోగ్యశాఖలో 1,500 ఉద్యోగ నియామకాలతో సహా మరికొన్ని కూడా వున్నాయి).

         అదనంగా ఐటీ రంగంలో, తెలంగాణ ప్రభుత్వ చొరవ,  సానుకూల విధానాల వల్ల 5 లక్షల 82 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ పాలసీ రూపొందించి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కల్పించడంతో రాష్ట్రంలో  దాదాపు 14 వేలకు పైగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 14 లక్షల 59 వేల మందికిపైగా ఉపాధి లభిస్తున్నది. ఇలా మొత్తంగా కలిపి చూస్తే 21 లక్షల 47 వేల మందికి పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన తెలంగాణ దేశంలోనే సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది.

ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాజాగా మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కూడా అధికార యంత్రాంగం ఉపక్రమించింది. బహుశా భారత దేశంలోని ఏ రాష్ట్రంలోకూడా, ఇంత తక్కువకాలంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయంలోగానీ, ఉద్యోగ భద్రతా విషయంలోగానీ, ఈపాటికే విధుల్లో వున్న ప్రభుత్వ-ప్రభుత్వరంగ ఉద్యోగుల విషయంలోగానీ, ఈ ప్రభుత్వం చేపట్టిన తరహాలో మరే రాష్ట్ర  ప్రభుత్వం కూడా లబ్ధి చేకూర్చే చర్యలు చేపట్టలేదంటే అతిశయోక్తి కాదు.

వాస్తవంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకోసం తెలంగాణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. అకడెమిక్, పాలనారంగ నిష్ణాతుడైన ఆచార్య ఘంటా చక్రపాణిని ఈ కమిషన్ కు తొలి ఛైర్మన్ గానూ, తదుపరి డి కృష్ణారెడ్డిని తాత్కాలిక చైర్మన్ గానూ నియమించింది ప్రభుత్వం. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2020 చివరినాటికి 36,665 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా 31,072 ఉద్యోగాలను ఇప్పటికే  భర్తీ చేయడం జరిగింది. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ  వివిధ దశల్లో ఉంది.

         అలాగే, రాష్ట్రంలో 3,463 గురుకుల విద్యాలయాల పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది.  రాష్ట్రంలోని 391 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్ల జీతాలను రూ.21,000 నుండి రూ.25,000 లకు, సీఆర్టీల వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పెంచింది. 840 మంది బోధనా, 588 మంది బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలను కలుపుకొని మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 377 ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.  వీటిలో 174 మంది బోధన, 203 మంది బోధనేతర సిబ్బందిని నియమిస్తున్నారు.

సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల ఆధారిత కుటుంబ సభ్యులకు 10,477 డిపెండెంట్ ఉద్యోగాలు, ఎక్స్టర్నల్ రిక్రూటీలు 3,148 వెరసి 13,625 ఉద్యోగాలు కల్పించారు. ఇవేగాక బోనస్ లు, వార్షిక ఇంక్రిమెంట్లు ప్రకటిస్తూనే ఉన్నారు. ఉద్యోగ భద్రతలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. గురుకుల పాఠశాలల్లో తొమ్మిదేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 758 మంది టీచర్లు, అడ్‌హాక్ పద్ధతిలో పని చేస్తున్న 18 మంది టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, 2488 మంది భాషా పండిట్లను, 1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖలో ప్రత్యక్ష నియామకాల ద్వారా 11,869 (జెన్కో, ట్రాన్స్కో కలిపి) ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించగా 9,289 (జెన్కో, ట్రాన్స్కో కలిపి) పోస్టులను భర్తీ చేసి, 2,552 (ట్రాన్స్కో) ఉద్యోగాలను పరిగణలో ఉంచారు.


 ఉద్యోగభద్రత విషయానికొస్తే, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావం నాటికి మున్సిపల్ కార్మికుల వేతనం రూ.8,500గా ఉండేది. వారి వేతనాన్ని రూ.14,000 లకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా 24 వేల మందికి జీతాలు పెరిగాయి. ప్రభుత్వం రెండు పర్యాయాలు అంగన్‌వాడీల జీతాలను పెంచింది. హెల్పర్ల ప్రతినిధులతో జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంగన్ వాడీల జీతాలు రూ.4,200 నుంచి రూ.10,500 (150 శాతం) వరకు పెరిగాయి. 3,989 మినీ అంగన్ వాడి టీచర్ల జీతాలు రూ.4,500 నుండి రూ.6000లకు పెరిగాయి. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు పెంచాలనే నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 35,700 కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది సిబ్బందికి ప్రయోజనం కలిగింది. తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవబడుతున్న 27,045 మంది ఆశ వర్కర్ల పారితోషికాన్ని నెలకు రూ.6 వేలకు పెంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సిని ప్రకటించింది. మూల వేతనంలో 43% శాతం మేర పెంచి (ఫిట్‌మెంట్‌) ఇవ్వడం జరిగింది. సకల జనుల సమ్మెలాంటి అధ్బుత పోరాటాలు చేసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేసింది. మరో విడత పిఆర్సీ ప్రకటించడానికి కూడా కసరత్తు జరుగుతున్నది. 

ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం వేతనాలను పెంచింది. సెర్ఫ్‌ తో పాటు జాతీయ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు పెరిగాయి. సెర్ప్‌ లో 4,174 మంది ఉద్యోగులుండగా, వారిలో 767 మందికి రూ. 6,260 నుంచి రూ. 12,000 మేర వేతనాలను పెంచారు. మిగతా వారికి 30 శాతం అధికం చేశారు. అలాగే ఉపాధి చట్టంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.6,290 వేతనంగా ఉండగా, దాన్ని రూ.10,000 చేసింది ప్రభుత్వం. మిగతా వారికి 30 శాతం వర్తింపజేసారు. దీంతో మొత్తం 11,415 మందికి జీతాలు పెరిగాయి. ఇందులో 7,402 ఫీల్డ్ అసిస్టెంట్లు కాగా, 4,013 మంది(30 శాతం) ఎఫ్.టి.ఇ.లు వున్నారు.

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 1,703 మంది ‘108’ అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం రూ.4వేలు పెంచింది. వారసత్వంగా విలేజ్ రెవెన్యూ అసెస్టెంట్లుగా పనిచేస్తున్న వారి వేతనాలు 64.61 శాతం పెంచింది. దీంతో వీఆర్ఏలు రూ.6,500 వేతనం పొందుతున్నారు. ఆ తర్వాత ఈ వేతనాన్ని రూ.10,500కు పెంచింది ప్రభుత్వం. దీంతో పాటు రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ కూడా ప్రకటించింది. దీంతో ఒక్కో విఆర్ఎకు రూ.4,200 వేతనం పెరిగినట్లయింది. వీటితోపాటు అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వి.ఆర్.ఏ.లకు 30 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయనున్నట్లు ప్రకటించింది. పబ్లిక్ సర్వీస్ పరీక్ష రాసి వి.ఆర్.ఎ. లుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటికీ తక్కువ వేతనంతో పనిచేస్తున్న రాష్ట్రంలోని 2,900 మంది డెరెక్ట్ రిక్రూట్ వి.ఆర్.ఎ.లకు మేలు కలుగుతుంది. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వి.ఓ.ఎ.) వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18,863 మంది వి.ఓ.ఎ.లు రూ.500 నుంచి రూ.1500 వరకు వేతనం మాత్రమే పొందేవారు. దరిమిలా వారి వేతనాలను రూ.5వేల జీతం పెంచడం జరిగింది. 

రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2010 పిఆర్‌సి సిఫారసుల మేరకు ఎస్జీటిలకు రూ.10,900, స్కూల్ అసిస్టెంట్లకు రూ. 14,800 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1892 మంది సిఆర్‌టిలకు మేలు కలుగుతుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన జీతాలను జనవరి 2016 నుండే అమలు చేశారు. రూ.6,700  జీతం వస్తున్న వాళ్ల వేతనాన్ని రూ.12 వేలకు, 8,400 వస్తున్న వారికి 15 వేలకు, 10,900 వస్తున్న వారి జీతాలను రూ.17 వేలకు పెంచారు.

కాంట్రాక్టు లెక్చరర్ల కనీస వేతనం రూ.37,000 పెంచడం వల్ల రాష్ట్రంలో 3,687 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రయోజనం పొందారు. అలాగే కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్ల మూల వేతనం రూ.40,270, డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.43,670 పెంచారు. ఈ నిర్ణయంతో కాంట్రాక్టు అధ్యాపకులు కూడా రెగ్యులర్ టీచర్ల మాదిరిగా వేతనాలు పొందుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందికి 44శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించి, అమలు చేసింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల 58,770 మంది కార్మికులకు ప్రయోజనం కలిగింది.

         విద్యుత్ శాఖలోని ట్రాన్స్‌ కో, జెన్‌కో, డిస్కమ్‌లలో పనిచేస్తున్న దాదాపు 23,667 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరి సర్వీసులను దశలవారీగా క్రమబద్దీకరణ చేయడం జరిగింది. వీరికి ఉద్యోగ భద్రతతోపాటు మెరుగైన జీతభత్యాలు లభిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికి 27.5 శాతం ఫిట్‌మెంట్‌ అలవెన్స్‌ మంజూరు చేసింది ప్రభుత్వం. విద్యుత్‌శాఖలోని జెన్‌కో, ట్రాన్స్‌ కో, డిస్కం ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం 2 డిసెంబర్, 2014న నిర్ణయించింది.

ఉమ్మడి రాష్ట్రంలో 16 వేల మంది హోంగార్డులకు రూ.9 వేలు మాత్రమే ఉండేది. వీరి  డిమాండ్లు విన్న సీఎం కేసీఆర్ తొలి విడతలో వీరి వేతనం 9 వేల నుండి 12 వేలకు పెంచడం జరిగింది. మలివిడతో డిసెంబర్ 2017 నుండి రూ.20 వేలకు పెంచారు. ప్రతి ఏటా వీరి వేతనాన్ని వెయ్యి రూపాయలు పెంచేలా చర్యలు తీసుకుంది. అంతేగాకుండా రాష్ట్రంలోని 30 విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 100 శాతానికి పెంచింది.

ఇక ఐటీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ పాలసీ మూలంగా గడిచిన ఆరున్నర సంవత్సరాల్లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులను సాధించింది. రాష్ట్రంలోని ఐటీ సంస్థలలో 5,82,126 మంది ఉద్యోగాలు పొందారు.

          వీటిన్నింటికీ అదనంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అమలవుతున్న టీఎస్ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక విధానం ద్వారా లైసెన్సులు పొందిన 14,338 పరిశ్రమల్లో  దాదాపు 14,59,639  మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ పరిశ్రమల ద్వారా రూ.2,07,595 కోట్ల విలువ చేసే పెట్టుబడులు వచ్చాయి. వీటితో ప్రత్యక్షంగానే కాక, పరోక్షంగా కూడా లక్షలాదిమందికి ఉపాధి దొరికింది. ఇవన్నీ కూడా ఉద్యోగ, ఉపాధి కల్పన కిందకే వస్తాయి కదా! అన్నిరంగాల్లో కలిపి వీటన్నింటినీ లెక్కించి చూస్తే  మొత్తంగా 21 లక్షల 47 వేల 946  మంది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఆరున్నర సంవత్సరాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లయింది. వాస్తవాలు ఇలా ఉంటే.. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఇప్పటికీ కొందరు వక్రీకరించడాన్ని వారి విజ్ఞతకే వదిలేయాల్సి ఉంటుంది.          

ఇదిలా వుండగా, నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.

No comments:

Post a Comment