Tuesday, February 23, 2010

వివాహబంధం-II: కామాన్ని ధర్మ బద్ధం చేయగల ఏకైక మార్గం వివాహం - వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-II

శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"
"పరిణయం"-"పరిణయనం"-"పరి-నయనం"
వనం జ్వాలానరసింహారావు

సీతా కల్యాణ ఘట్టం ముందర, కల్యాణ సమయంలో, ఆ తర్వాత జరిగిన తంతు చదువుతుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. శివ ధనుస్సును విరిచిన శ్రీరాముడికి తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడన్నప్పటికీ, తనకు తండ్రి ఆజ్ఞ ముఖ్యమంటాడు రాముడు. అంటే పెద్దల ఆజ్ఞ లేకుండా, వారికి తెలియకుండా వివాహం చేసుకోకూడదనేది తెలుస్తోంది. జనకుడు వెంటనే దశరథుడి సమ్మతి పొందడానికి దూతలను పంపాడు. దశరథుడు కూడా ఆ విషయాన్ని తన సన్నిహితులందరికీ తెలియచేసి, వారి సమ్మతితోనే మిథిలకు బయల్దేరాడు. అంటే వివాహానికి బంధు-మిత్రుల ఆమోదం కూడా ముఖ్యమేనని అర్థం. విదేహనగరం చేరుకున్న దశరథుడికి, ఆయన వెంట వచ్చిన పెద్దలకు జనకుడు స్వాగతం పలికిన విధానం కూడా సందేశాత్మకమైందే.

ఇక దశరథుడి పక్షాన వశిష్టుడు, జనకుడి పక్షాన స్వయంగా ఆయనే, వారి-వారి వంశ క్రమాన్ని వివరించారు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. నేపధ్యం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు-తీసుకొననూ కూడదు. వివాహంలో వధూవరుల నేపధ్యం అవశ్యంగా తెలియాలి. తొలుత తల్లి నేపధ్యం-తర్వాత తండ్రి నేపధ్యం పరీక్షించాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో పది రకాల వంశం వారిని గురించి తెలుసుకోవాలని శాస్త్రం చెపుతున్నదన్న సంగతి విదితమవుతుందిక్కడ. వివాహ మంటపం దగ్గర కొచ్చిన దశరథుడిని జనకుడు ఆహ్వానించిన రీతినీ గమనించాలి. అలానే వశిష్టుడొక్కడే వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించకుండా, జనకుడి పురోహితుడైన శతానందుడు సహాయం తీసుకుంటాడు. మంటపాన్ని ఎలా అలంకరించాలి, ఏమేమి వస్తువులెక్కడ వుంచాలనే విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే కల్యాణ ఘట్టమంతా నిశితంగా పరిశీలిస్తే పాణి గ్రహణం చేసుకొనేటప్పుడు జరగాల్సిన విధి విధానాలన్నీ అర్థమవుతాయి. కల్యాణమంతా అయింతర్వాత మగపెళ్ళివారిని సాగనంపే విధానం కూడా అర్థం చేసుకోవచ్చు.

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయ బద్ధమైన విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. ఉదాహరణకు, హిందూ సంప్రదాయంలో, బారసాల నుండి వివాహం వరకు ఏ కార్యక్రమం జరిపించాలన్నా, వివాహం కానివారు, వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ పురుషులు అనర్హులు. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధినిర్వహణకు అర్హులౌతారు కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞ-యాగాదులు లాంటివి నిర్వహించటానికి గృహస్థుడు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్ది తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి.

వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం (పరి+నయనం) అని చెప్పుకోవచ్చు. పెళ్లి పీటల పైకి వచ్చేంతవరకు, వధూవరులకు పరిచయం లేకపోయినా, ఒకరి గురించి మరొకరికి ఏ మాత్రం తెలియకపోయినా, కనీసం ఒకరినొకరు చూడకపోయినా, "వివాహబంధం" వారిద్దరి మధ్యా విడదీయరాని బంధాన్ని ఏర్పడేటట్లు చేస్తుంది. ఈ అసాధారణ చర్యకు ఎన్ని అర్థాలు చెప్పుకున్నా తక్కువేనేమో !

వివాహం కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే కలపదు. రెండు కుటుంబాలను-ఇరు కుటుంబాల సంబంధీకులను, రెండు వంశాలను-ఇరు వంశాల సంబంధీకులను, గతంలో లేని సంబంధంతో నిమిత్తం లేకుండా బంధించి వేస్తుంది. ఇక ఆ బంధం విడదీయరాని అనుబంధమే. క్రమేపీ పిల్లలు పుట్టడం, వంశాభి వృద్ధి చెందడం, ఇరు వంశాలకు చెందిన వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడం, వీరికి-వారికి చెందిన వ్యక్తుల మధ్య మరిన్ని వివాహ సంబంధాలు కుదరడం, ఇలా ఒక నిరంతర ప్రక్రియలాగా సాగుతూ, ఆ బంధం మరింత దృఢ పడుతుంది. ఆ బంధం తెంచుకోవడమంటే సంప్రదాయాలను ధిక్కరించడమే.

పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం ఎంతో తీవ్రంగా భారతీయుల మీద-హిందూ వివాహ వ్యవస్థ మీద పడుతున్నప్పటికీ, తప్పనిసరి తంతుగానో-కుటుంబ నేపధ్య ఒత్తిడుల వల్లనో-ఇరు పక్షాలలో కనీసం ఒకరైనా సంప్రదాయం పాటించాల్సిందేనని పట్టుదలతో వుండడం వల్లనో-స్వయంగా వధూవరులిద్దరూ కోరుకుంటున్నందువల్లనో, ఇంకా హిందూ వివాహ సంప్రదాయం కొనసాగుతూనే వుంది. అయితే సంప్రదాయాన్ని పాటించి, వివాహం చేసుకున్నవారిలో, కనీసం నూటికి-కోటికి ఒక్కరైనా, ఆ ప్రక్రియను ఆసాంతం అర్థంచేసుకొనే ప్రయత్నం చేసి, దాని వెనుకనున్న అంతరార్థాన్ని గ్రహించి - ఇతరులకు తెలియ చేయగలిగితే, ఈ సాంప్రదాయిక వేడుక అజరామరంగా సూర్య-చంద్రులున్నంత వరకూ కొనసాగు తుందనడంలో అతిశయోక్తి లేదు.

సాధారణంగా వధువు తనకు కాబోయే భర్త అందంగా వుండాలని కోరుకుంటే, ఆమె తల్లి ధనవంతుడై వుండాలనుచుంటుంది. తండ్రికేమో కాబోయే అల్లుడు, ఉత్తమ గుణాలుండి, చదువు-సంస్కారం కలిగి, సత్ సంప్రదాయాలున్న కుటుంబానికి చెందిన వాడై వుండాలనుకుంటాడు. ఇక చుట్ట-పక్కాలు, బంధు మిత్రులు పెళ్లికొడుకు కలుపుగోలుగా వుండాలనుకుంటారు. ఇంతమంది కోరిక తీరడానికి, హిందూ వివాహ వ్యవస్థలో, అంచలంచల ఏర్పాట్లు చేసారు పూర్వీకులు. పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.(Part-III Next)

No comments:

Post a Comment