Wednesday, February 24, 2010

వివాహబంధం-IV: పెళ్లి చూపులు-ఇరు కుటుంబాల నేపధ్యం: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం- IV
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం-వాగ్దానాలు
వనం జ్వాలానరసింహారావు

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం మేమందరం, మా బంధు-మిత్ర-సపరివార సమేతంగా కాబోయే మా మామ గారింటికి వెళ్ళి, అమ్మాయిని చూడాలి. అదే చేశాం మేమందరం. వల్లభి, వారి స్వగ్రామ మైనా, వారికి ఖమ్మంలో కూడా ఇల్లున్నందువల్ల, మాకూ అక్కడ ఇల్లున్నందువల్ల పెళ్లి చూపుల ఏర్పాటు ఖమ్మంలో చేశారు. మా రెండు కుటుంబాల వాళ్ళ ఇళ్లు "మామిళ్లగూడెం" వీధిలో వున్నాయి. ఆ వీధిలో అప్పట్లో నూటికి తొంబై మంది బ్రాహ్మణ కుటుంబాలవారే వుంటుండేవారు. ఇప్పటికీ, మూడొంతుల మంది బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారే. అక్కడి మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ కూడా సాధారణంగా బ్రాహ్మణ కులానికి చెందిన వారే అయ్యుంటారు. ప్రస్తుతం మా ఆవిడ అక్క కొడుకు జూపూడి షమంత్ అక్కడినుంచి కౌన్సిలర్గాం ఎన్నికయ్యాడు. పెళ్ళి చూపులకు మా వైపునుంచి, వారి వైపునుంచి వచ్చిన వారిలో చాలామంది ఇరువురికీ కావాల్సినవారే-ఇరుకుటుంభాలకూ పరిచయస్తులే. పింగళి తిరుమలరావు గారు, వనం శ్రీరాంరావు గారు, కవుటూరి కృష్ణమూర్తి గారు, జూపూడి నరసింహారావు గారు, జూపూడి ప్రసాద్, వనం నరసింగరావు-వారి కుటుంబానికి చెందిన వారు పెళ్ళి చూపులకు వచ్చినవారిలో ప్రముఖులు. మా అమ్మ, నాన్న, మా అన్నదమ్ములందరూ, అక్కచెళ్లెల్లందరు, బావగారు చలపతిరావు గారు వచ్చారు.

నా వయస్సు అప్పటికి 20 సంవత్సరాలు. కాబోయే శ్రీమతి వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే. అయినా, వధూ-వరులు పరస్పరం నచ్చారన్న నిర్ణయానికి ఇరు పక్షాల బంధువులు వచ్చారు. అది నిజంకూడా. అయితే ఎలా నిజం? అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అందుకే, సమాధానం రాబట్టుకొనేందుకు, సీతా కల్యాణ ఘట్టం చదవాలి. ఇక ఆ తర్వాత జరగాల్సింది ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవడం. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకోవడం. వరకట్న నిషేధం అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకోవాలి. పెళ్ళి చూపుల కార్యక్రమం అయింతర్వాత, మిగిలిన విషయాలను మాట్లాడుకోవడానికి మర్నాడు మా ఇంటికి రమ్మని మా నాన్నగారు వాళ్లను ఆహ్వానించారు. వారూ సమ్మతించారు. అంచెలంచల ఘట్టంలో మరో అడుగు పడింది.

మా ఆహ్వానం మేరకు మర్నాడు ఆడ పెళ్లి వారి పెద్దలందరూ మా ఇంటికి భోజనానికి వచ్చారు. మాటా-మంతీ జరిగింది. ఒకే ఒక్క రోజులో పెళ్ళి సంబంధం కుదిరినందుకు మా మామగారి తరఫు బంధువులంతా సంతోషించారు. మార్చ్ నెల 30న లగ్నాలు పెట్టుకుందామని అనుకున్నారు. లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న రాంరావు గారి పెద్ద కొడుకు డాక్టర్ రంగారావు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వుత్తరాలు రాసేవాడని మా ఆవిడ తర్వాత చెప్పింది. అటువైపు-ఇటు వైపునుంచి మా ఇంటికి వచ్చిన పెద్దలు మా ఇరు వంశాల వారి గురించీ-వారి గొప్పదనాన్ని గురించీ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇది సహజంగా ప్రతి పెళ్ళిముందరా జరిగేదే. సీతా కల్యాణ ఘట్టంలో వశిష్టుడు మాదిరిగా ఇరుపక్షాలకు చెందిన పురోహితులో, ఎవరైనా పెళ్లి పెద్దలో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో వంశ క్రమం ప్రస్తావన తెస్తారు. ఎవరెంత గొప్పవారైందీ-ఎంత మందీమార్బలం వున్నవారైందీ చెప్పుకుంటారు. అదే జరిగింది మా ఇంట్లో కూడా.

మా విషయానికొస్తే, మాది పరాశర గోత్రమైనందున మా వంశానికి ఆది పురుషుడు వశిష్ట మహర్షి, ఆయన కొడుకు శక్తి, ఆయన కొడుకు పరాశరుడి వంశీయులం మేము. వనం కృష్ణ రాయలు గారనే మా పూర్వీకుడు నిర్మించిన గ్రామమే మా వూరైన వనం వారి కృష్ణా పురం. మా తాత గారి పేరు వెంకట రంగారావు, బామ్మ గారి పేరు కనకమ్మ. వెంకట రంగారావు గారి తండ్రి పేరు నరహరి రావు. వెంకట రంగారావు గారి అన్న చలపతిరావు గారు, తమ్ముడు వెంకటప్పారావు గారు. అన్నదమ్ముల్లో ఒక్క వెంకటరంగారావు గారికి తప్ప ఎవరికీ సంతానం కలగలేదు. ఆయన ఏకైక కుమారుడే మా నాన్న వనం శ్రీనివాసరావు గారు. ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల కొడుకు. చలపతిరావు (మా నాన్నకు "బాప్ప") గారి భార్య పెద వెంకట రామ నర్సమ్మ గారు, వెంకటప్పారావు (మా నాన్నకు "కక్కయ్య") గారి భార్య చిన వెంకట రామ నర్సమ్మ గారు మా పెళ్లినాటికి ఆరోగ్యంగానే వుండేవారు. పిల్లల్లేని వాళ్లిద్దరిలో చలపతిరావు గారికి మా నాన్నగారే కొడుకు వలె అన్ని కార్యాలూ చేశాడు. వెంకటప్పారావు గారి భార్య చిన వెంకట రామ నర్సమ్మ గారు కోరినందున మా తమ్ముడుని ( నా తర్వాత పుట్టిన వాడు) ఆమెకు దత్తత ఇచ్చాం. మా నాన్న మేనమామల వూరు మా వూరికి ఆమడ దూరంలోని చెరువుమాధారం.

మా అమ్మ సుశీల పుట్టింది బలపాలలోనైనా, పెరిగింది దత్తతొచ్చిన నాచేపల్లి గ్రామంలో. మా వరకు మాకు అమ్మమ్మ గారంటే నాచేపల్లిలోని సుభద్రమ్మ గారు, తాతయ్యంటే ముదిగొండ వెంకట్రామనర్సయ్య గారే. వారికి సంతానం కలుగనందున మా అమ్మను చిన్నతనంలోనే తెచ్చుకొని పెంచుకున్నారు. మా అసలు అమ్మమ్మకు పురుడు సమయంలో కొంచెం మతిస్థిమితం తప్పేదని అంటారు. అందుకే పసిగుడ్డుగా వున్నప్పుడే అమ్మను నాచేపల్లికి తెచ్చుకున్నారు. బలపాల అమ్మమ్మ-తాతయ్యల(లక్ష్మీ నర్సమ్మ-వెంకటేశ్వర రావు గార్లు) కు నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలు కలిగారు. ఆమ్మ లలితమ్మ గారు అందరి లోకి పెద్ద. ఆమెను గోకినేపల్లి గ్రామానికి చెందిన రావులపాటి సీతారాంరావు గారికిచ్చారు. తర్వాత రమణారావు గారు (భార్య మా గ్రామంలో పుట్టిన మధురమ్మ గారు). మూడో ఆమె రుక్మిణమ్మ గారు. నాలుగో ఆమే మా అమ్మ. నాచేపల్లికి దత్తతగా వచ్చింది. ఐదో సంతానం వెంకట కిషన్ రావు-భార్య మా గ్రామంలో పుట్టిన లక్ష్మిబాయి గారు-మధురమ్మ గారి చెల్లెలు. (వారి రెండో కూతురునే మా దత్తత పోయిన తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు). కిషన్ రావు గారి తర్వాత రాజేశ్వర రావు గారు-భార్య లక్ష్మీ నర్సమ్మ. వీరి పెద్దమ్మాయిని మా రెండో తమ్ముడు వివాహం చేసుకున్నాడు. ఆయనా దత్తత పోయి జగన్నాథరావుగా పేరు మార్చబడి నేలకొండపల్లిలో వుండేవారు. తర్వాత మా చిన్న మామయ్య సత్యనారాయణ రావు గారు. ఆఖరున భారతమ్మ గారు పుట్టారు. ఆమెను భైర్నపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రావు గారు వివాహమాడారు. మామయ్య సత్యనారాయణరావు గారు హైదరాబాద్‍లో వుంటున్నాడు. నేను ఆయన ఇంట్లోనే వుండి డిగ్రీ చదువుకున్నాను. అత్తయ్య విమలమ్మ పెట్టిన భోజనం ఎప్పటికీ మరువలేను. సత్యనారాయణరావు మామయ్య డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ రావడమే కాకుండా, మా కుటుంబానికి చెందినవారిలో మొదటి గ్రాడ్యుయేట్. మా అమ్మ అసలు (జన్మస్థానంలో) పుట్టింటి వారి పేరు "కంకిపాటి" కాగా, దత్తత పోయినవారి పుట్టింటి పేరు "ముదిగొండ".

కంకిపాటి వారి గోత్రం "కణ్వస"-ఋషులు అంగీరస, అజామీళ, కణ్వస. మా బలపాల అమ్మమ్మ గారి పుట్టిల్లు, మా నాచేపల్లి అమ్మమ్మగారి పుట్టిల్లు మా పక్కనున్న కమలాపురం గ్రామానికి చెందిన "వనం" వారి కుటుంబం. నాచేపల్లి అమ్మమ్మకు స్వయానా మేనకోడలు బలపాల అమ్మమ్మ. ఆమె స్వయానా తమ్ముడి కొడుకే, నాకు అత్యంత ఆప్తుడు, కమ్యూనిస్ట్ పాఠాలు నేర్పిన బాబాయి వనం నరసింగరావు. ఆయన అక్క గారే, మా నేలకొండపల్లి మామయ్య రాజేశ్వర రావు గారి భార్య.

నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు, నలుగురు తమ్ముళ్లు (చెల్లెళ్లకు, ముగ్గురు తమ్ముళ్లకు అప్పటికింకా పెళ్లిళ్లు కాలేదు). అక్కకు పెళ్లైంది. పేరు రాధ (భర్త చలపతి రావు గారు అలియాస్ సహదేవ రావు గారు). దత్తత పోయిన తమ్ముడుకి కూడా పెళ్లైంది. ఒక చెల్లెలు ఇందిర (భర్త కందిబండ నరసింహారావు గారు), ఇంకో చెల్లెలు కృష్ణవేణి (భర్త శ్రీనివాస రావు గారు). తమ్ముళ్ల పేర్లు: వెంకట ప్రసాదరావు (భార్య ఇందిర), నరహరి రావు (భార్య ఇందిర), శ్రీనాథ్ (భార్య జ్యోతి), శ్రీరామచంద్ర మూర్తి (భార్య రుద్రాణి). అక్క-బావ వ్యవసాయం వృత్తిగానూ, చెల్లెలు ఇందిర భర్త కేంద్ర ప్రభుత్వోద్యోగి గానూ, మరో చెల్లెలు కృష్ణవేణి లాయర్ గానూ-భర్త రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గానూ, పెద్ద తమ్ముడు రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గానూ, రెండో తమ్ముడు వ్యవసాయం-వ్యాపారం వృత్తిలోనూ, మూడో తమ్ముడు రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గానూ, నాలుగో తమ్ముడు వ్యవసాయం వృత్తిగానూ వున్నారు-వుండేవారు.

ఇక మా కాబోయే శ్రీమతి పుట్టింటి వారి విషయానికొస్తే, వారిది భారద్వాజ గోత్రం. ఋషులు, అంగీరస, బార్హస్వత్య, భరద్వాజలు. తండ్రి అయితరాజు రాంరావు గారు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని భారత ప్రభుత్వం వారిచ్చిన "తామ్ర పత్ర గ్రహీత". స్వగ్రామం వల్లభి. దేశంలోనే ప్రప్రధమంగా, ఒక దళితుడు పూజారిగా వున్న రామాలయం వల్లభిలో కట్టించింది ఆయనే. ఆయన తండ్రి మంగపతి రావు గారు, తల్లి సీతారామమ్మ గారు. అయితే పాలివారైన వెంకట కిష్టయ్య గారికి దత్తత పోయారు రాంరావు గారు. దత్తత ఇంట్లో రాంరావు గారి తాత పేరు రంగారావు గారు. రాంరావు గారి అక్క రాజ్యలక్ష్మి గారు, చెల్లెలు రుక్మిణమ్మ గారు. సోదరులలో పెద్దవాడు నరసింహారావు గారు కాగా, చిన్నవాళ్లు వెంకట కిషన్ రావు, రాధా కిషన్ రావు, సీతారాంరావు, సత్యనారాయణ గార్లు. మా కాబోయే అత్తగారి పేరు రాధ-కృష్ణా జిల్లా ఖమ్మం పాడు లో జన్మించారు. రాధ గారి తల్లి వెంకట్రామమ్మ గారు, ఇటీవలే మరణించారు.

మా అత్తగారికి ఆరుగురు చెల్లెళ్లు, నలుగురు తమ్ముళ్లు. చెల్లెళ్ల పేర్లు: శారద (భర్త కొలిపాక రామచంద్ర రావు గారు), సరస్వతి (భర్త తుర్లపాటి హనుమంత రావు గారు), సావిత్రి (భర్త కవుటూరు కృష్ణమూర్తి గారు), అన్నపూర్ణ (భర్త కొమరగిరి అప్పారావు గారు), ప్రేమ (భర్త పింగళి మధుసూధన రావు గారు), భారతి (భర్త తుర్లపాటి రంగారావు గారు) గార్లు. తమ్ముళ్ల పేర్లు: పర్వతాల రావు గారు (భార్య సరోజిని గారు), రామచంద్ర రావు గారు (భార్య విమల గారు), వెంకటేశ్వర రావు గారు (భార్య అరుణ గారు), శ్రీనివాస రావు గారు (భార్య నిర్మలాదేవి గారు). మా కాబోయే అత్త గారి పుట్టింటి పేరు "భండారు"-గోత్రం "పరాశర". అక్కచెల్లెళ్లు, అన్న తమ్ములు అందరూ, వారి వారి వృత్తుల్లో-ప్రవృత్తుల్లో సమాజం గుర్తింపు పొందారు. మా కాబోయే ఆవిడకు ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కయ్యలు, ఒక చెల్లెలు. అప్పటికి (మా పెళ్లినాటికి) అక్కలిద్దరికి, పెద్దన్నయ్యకు మాత్రమే వివాహమైంది. అక్కల పేర్లు: హైమ (భర్త కొండపల్లి లక్ష్మీ నరసింహారావు గారు), జ్యోతి (భర్త జూపూడి హనుమంత ప్రసాద్). చెల్లెళ్లు పేరు వాణి (భర్త విజయ శంకర్). పెద్దన్నయ్య పేరు డాక్టర్. పాండు రంగారావు గారు (భార్య కరుణ), రెండో అన్నయ్య పేరు డాక్టర్ వేణు మనోహర రావు (భార్య ఉష). తమ్ముడి పేరు వెంకట గనేష్ కుమార్ (భార్య నిర్మల). అన్నయ్యలిద్దరూ పేరొందిన డాక్టర్లు కాగా తమ్ముడు లాయర్. అక్క చెల్లెళ్లందరి కీ మంచి సంబంధాలు కుదిర్చి పెళ్లిళ్లు జరిపించారు. (Part V Next Follows)

No comments:

Post a Comment