Friday, February 26, 2010

వివాహబంధం-VII: పెళ్లికి తరలి పోవడం-ఎదురుకోలు: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-VIII
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

పెళ్లికి తరలి పోవడం-ఎదురుకోలు
మగ పెళ్ళివారికి విడిది మర్యాదలు

వనం జ్వాలానరసింహారావు

ఏప్రియల్ 29, 1969 న, మా స్వగ్రామం వనం వారి కృష్ణా పురంలో స్నాతకం చేసుకున్న రోజునే "తరలి" పోయేందుకు ఖమ్మం బయల్దేరాం. మాకు, మా వూళ్లో-చుట్టుపక్కల గ్రామాల్లో వున్న పరిచయాల వల్ల, మా వెంట పెళ్ళి బృందంలో చాలామంది బయల్దేరారు. పల్లెటూళ్లల్లో ఎవరింటిలో పెళ్ళి జరిగినా అదోరకమైన ఉత్సాహం అందరి ఇళ్లల్లోనూ వుంటుందనాలి. అప్పటికే మా వూళ్లో- గ్రామ రాజకీయాల్లో నేను తలదూర్చినప్పటికీ, పార్టీలకతీతంగా చాలామంది నా పెళ్ళికి మా వెంట రావడానికి ప్రయాణం కట్టారు. సుమారు నలభైకి పైగా ఎడ్ల బండ్లలో తరలిపోవడానికి ప్రయాణమయ్యాం. ఒక్కొక్క బండిలో ఒకరే వుండొచ్చు-ఒకరికంటే ఎక్కువా వుండొచ్చు. మనం ఎన్ని బండ్లలో తరలిపోయామనేదే పల్లెటూళ్లలో ముఖ్యం. అదే జరిగింది మా పెళ్లిలోనూ. పైగా ఆ బండ్లను-బండికి కట్టిన ఎద్దులను, అలంకరించు కోవడంలోనూ పోటీ వుంటుంది. అదో సరదా. బండ్లతో పాటు ఒక మేనా, ఒక పల్లకి కూడా ఖమ్మం వరకు వచ్చింది.

మా వూరినుంచి సుమారు పది మైళ్ల దూరంలో వున్న ఖమ్మం చేరేసరికల్లా చీకటి పడింది. ఇంటిని సమీపిస్తుంటే, అంతకు సరిగ్గా పది రోజుల క్రితం (ఏప్రియల్ 19, 1969 న), నేను ఖమ్మంలోని మా ఇంటి ముందర మంచం మీద సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో కూచుని వున్నప్పుడు సంభవించిన భారీ భూకంపం గుర్తుకొచ్చింది. వాస్తవానికి మా పెళ్లైన పద్దెనిమిది రోజులకు మే నెల 18, 1969 న ఖమ్మం జిల్లాతో సహా ఆంధ్ర ప్రదేశ్ మొత్తాన్ని తుపాను-వరదలు భీభత్సం చేశాయి. ఇలా మా పెళ్ళికి పది రోజుల ముందు భూకంపం, పెళ్లైన పద్దెనిమిది రోజులకు వరదలు వచ్చిన సంగతి ఇప్పటికీ జ్ఞాపకం వున్నాయి. సాధారణంగా ఆడ పెళ్లి వారు, మగ పెళ్లి వారికి "విడిది" వసతి కొరకు ఏర్పాటు చేస్తారు. అయితే మాకు ఖమ్మంలో స్వంత ఇల్లుండడం వల్ల మా ఇంటినే విడిదిగా ఉపయోగించుకున్నాం. ఖమ్మం చేరుకున్న తర్వాత, మగ పెళ్లి వారందరినీ, ఆడ పెళ్లివారింటికి భోజనాలకు తీసుకెళ్లారు-నన్నొక్కడిని తప్ప. కాబోయే అల్లుడు పెళ్లైన తర్వాతే వాళ్లింట్లో భోజనం చేయాలనేది ఒక ఆచారం. మర్నాడుదయమే పెళ్లి ముహూర్తమైనందున వచ్చిన వారందరూ విశ్రాంతి తీసుకొని ఉదయానికల్లా పెళ్ళి వారింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మా మామగారింట్లోనే పెళ్ళి పందిరి ఏర్పాటు చేశారు. ఉదయం ఏడెనిమిది గంటల మధ్య మామిళ్లగూడెంలో-మా ఇంటికి అతి సమీపంలో వున్న పెళ్ళి వారింటికి బయల్దేరాం. ఆ కాస్త దూరం పోవడానికి మర్యాద కోసం-వేడుక కోసం, కారు, జీపు సౌకర్యం కొందరికి ఏర్పాటు చేశారు.

మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో (మా ఇంటిలో) ఏర్పాట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు, బకెట్లు, తుండు గుడ్డలు, వేడి నీళ్లు లాంటివి) ముందు (హాలులో) భాగంలో పెద్ద తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తునారు మా కోసం ఆడ పెళ్ళి వారు. మేళ-తాళాలతో మమ్మల్ని ఆహ్వానించిన వారిలో కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు చాలా మంది వున్నారు. ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిచ్చారు. నాకేమో ఆ పనిని బావమరిది వెంకన్నతో చేయించారు. ఈ కాళ్లు కడగడమనేది రెండు-మూడు పర్యాయాలు జరిపే వ్యవహారం. ఒక సారి మనోహర రావు కూడా చేసిన గుర్తు. ఆ తర్వాత అందరికీ కాఫీ-పలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామన్నారు ఆడ పెళ్ళివాళ్లు. అలానే చేశారు.(Part VIII Next Follows)

No comments:

Post a Comment