Wednesday, December 30, 2015

బాలకాండ మందరమకరందం సర్గ-6 : దశరథ మహారాజు గుణ వర్ణన : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-6
దశరథ మహారాజు గుణ వర్ణన
వనం జ్వాలా నరసింహారావు

మహారథుల సమూహం తనను ఎల్ల వేళలా సేవిస్తుంటే, వైకుంఠాన్ని శ్రీమహావిష్ణువు పరిపాలించిన విధంగానే, అయోధ్యా నగరాన్ని దశరథ మహారాజు కీర్తివంతంగా పరిపాలించేవాడు. వేద వేదాంతాలైన ఉపనిషత్తుల అర్థం తెలిసినవాడు దశరథుడు. స్వయంగా అర్థాన్ని గ్రహించగల పాండిత్యముంది ఆయనలో. పండితులను-వీరులను, ధనం-గౌరవం ఇచ్చి, తనకనుగుణంగా మలచుకోగలిగిన గుణవంతుడు. భవిష్యత్ లో జరగనున్న సంగతులను, మున్ముందుగానే పసిగట్టగల శక్తిమంతుడు దశరథుడు. పట్టణ-పల్లె వాసులకు ఏం చేస్తే మేలుకలుగుతుందో, దాన్నే ఆలోచించి సమకూర్చగల సమర్థుడు. ఇక్ష్వాకుల వంశంలోని రాజులందరిలోనూ అతిరథుడు-అగ్రగణ్యుడు. యజ్ఞ యాగాలు చేయడంలో ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తుంటాడు. మనుష్యులకు, పశుపక్ష్యాదులకు ఉపయోగపడాలని భావించి, బావులు-గుంటలు-తోటలు తవ్వించాడు. సమస్త ప్రజలను తనకనుకూలంగా మలచుకోగల నేర్పరి. మహర్షులతో సరిసమానమైన వాడు. రాజర్షులలో శ్రేష్టుడు. యావత్ ప్రపంచం కొనియాడదగిన శ్రీమంతుడు-కీర్తిమంతుడు. అతిశయించిన దేహబలం-కండబలం వున్నవాడు. శత్రువులను అవలీలగా జయించినవాడు-జయించగలవాడు. మిత్రులు-విశ్వాసపాత్రులతో కలిమిడిగా వుంటాడు. ఇంద్రియాలను జయించిన వాళ్లలో మొదటగా చెప్పుకోవాల్సినవాడు. పర్వతరాజైన హిమవంతుడి ధైర్యంతో-ఆదిశేషుడి విద్యలతో పోల్చదగిన దశరథ మహారాజుకు సరితూగేవారు రాజ కులంలో ఇంకెవ్వరు లేరంటే అతిశయోక్తికాదేమో.

అసలు-సిసలైన బంగారు రత్నాభరణాలను, విలువైన వస్త్రాలను ధరించి, ఇంద్ర కుబేరులతో సరితూగుతూ, ఆజ్ఞా రూపంలో సర్వత్రా వ్యాపించి, వైవస్వత మనువువలె పరాక్రమవంతుడై, జగజ్జనులను పాలిస్తూ, సత్యవంతుడై, ధర్మ-అర్థ-కామాలను రక్షించే విధానం తెలిసున్నవాడిలా, అయోధ్యా పురాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు. (దశరథుడు రాజ్యం చేస్తున్న రోజుల్లో కొందరు జ్యోతిష్కులు ఆయన్ను కలిసి, శనైశ్చరుడు రోహిణీ శకటాన్ని భేదించే ప్రయత్నంలో వున్నాడని-ఆయనట్లా చేస్తే పన్నెండు సంవత్సరాలు దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని చెప్పాడు. అది విన్న దశరథుడు, నక్షత్ర మండలానికి తన రథంపై పోయి, శనైశ్చరుడిని ఎదిరించి-తాను జీవించి వున్నంతవరకు ఆయన రోహిణీ శకటాన్ని భేదించడం కుదరదని స్పష్ఠం చేశాడు. అవసరమైతే యుద్ధం చేసి-ఆయన్ను గెలిచి-ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుంటానని హెచ్చరించాడు. దశరథుడి కోరిక మేరకు, ఆనాటినుండి శనైశ్వరుడు రోహిణీ నక్షత్రాన్ని ఆనుకుని పోవడమే కాని భేదించే ప్రయత్నం చేయలేదు. అదీ దశరథుడి ప్రజాహిత కాంక్ష.

అయోధ్యా పురజనుల వర్ణన

అయోధ్యా పురంలోని బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను-అంతరేంద్రియాలను, జయించినవారు. పరులను వంచించాలనే దురాచారానికి దూరంగా వుంటారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ, భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుంటారు. వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేస్తుంటారు. అక్కడి వారెవరికీ, ఇతరులను యాచించాల్సిన పనేలేదు. ఆరంగాల (శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై మెలగుతుండేవారు.

(వాసుదాసుగారు ఈ వర్ణనను చేస్తూ రాసిన పద్యంలో: బ్రాహ్మణులను ద్విజాతులని-వేదషడంగ పారగోత్తములని–అహితాగ్నులని–సహస్రదులని–మహామతులని–సత్యవచస్కులని-హిమకరమిత్ర తేజులని- ఋషులని పోలుస్తారు. మరో పద్యంలో హృష్ఠ మానసులని - శాస్త్ర చింతన పరాయణులని – స్వస్వతుష్టులని – త్యాగశీలురని - భూరి సంచయులని వర్ణిస్తారు).

అయోధ్యా వాసులందరూ సంతుష్టిగల మనసున్నవారే – ధర్మాన్నెరిగినవారే - శాస్త్ర సంబంధమైన ఆలోచనలు చెసే వారే. దేవుడిచ్చిన దాంతోనే సంతృప్తి చెందేవారు. త్యాగ బుద్ధిగలవారు. నిజాన్ని మాత్రమే చెప్పే గుణంగలవారు. తమకెంత అవసరమో అంత సంపాదన మాత్రమే చెసేవారు. అవసరాని సరిపోయే ఆవులను, గుర్రాలను, సిరి సంపదలను కలిగినవారు. కుటుంబం అంటే శాస్త్రాల్లో ఎటువంటి నిర్వచనం చెప్పబడిందో, దానికనుగుణంగానే, పదిమంది (తను-తన తల్లి, తండ్రి, భార్య-ఇద్దరు కొడుకులు-ఇద్దరు కోడళ్లు-ఒక కూతురు-ఒక అతిథి) కంటే తక్కువున్న ఇల్లు ఆనగరంలో లేదు. కొడుకులకు, భార్యకు కడుపునిండా భోజనం పెట్టకుండా బాధించేవారు కానీ, దాన ధర్మాలు అనుదినం చేయనివారు కానీ, ఆ నగరంలో కనిపించరు. అందమైన ఆ నగరంలో చెడ్డవారు కనిపించరు. పర స్త్రీలను ఆశించే వారు కానీ, భార్యతో కూడా నిషిద్ధ దినాలలో కామ క్రీడలు ఆడేవాడు కానీ, వేశ్యా లోలురు కానీ, చదువురాదననివారు కానీ, నాస్తికులు కానీ అయోధ్యలో లేనే లేరు.

(పూర్వ కాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం దీనివల్ల స్పష్టమవుతున్నది. ఒకానొకప్పుడు శూద్రులని పిలువబడే వారికి విద్యార్హతలుండవని వాదనుండేది. అయితే అది తప్పుడు వాదనేననాలి. నాస్తికులు అసలు లేనే లేరన్నప్పుడు "జాబాలి" అన్న వ్యక్తి నాస్తిక వాదన ఎలా చేశాడన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. జాబాలి చేసింది నాస్తికవాదమైనంత మాత్రాన, ఆయన నాస్తికుడు కావాలన్న నియమం లేదు. నాస్తిక వాదన ఆయనతో పుట్టలేదు-అంతకు పూర్వమే వుంది. దాన్నే "బృహస్పతి గీత" అంటారు. అయోధ్యలో నాస్తికులు లేరంటే, ఆ వాదనను అంగీకరించిన వారు లేరని మాత్రమే అర్థం).

అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే-ప్రేమ స్వరూపులే-ఇంద్రియ నిగ్రహం కలవారే-మంచి స్వభావం వున్న వారే-దోషరహితమైన నడవడిక గల వారే-ఋషితుల్యులే-నిష్కళంకమైన మనసున్నవారే-ముత్యాల హారాలు ధరించి, చెవులకు కుండలాలను అలంకరించుకున్నవారే-అందచందాలున్న వారే-కురూపులు కాని వారే-మకుటాలు ధరించి, చందనం పూసుకుని, కొరత లేకుండా భోగ భాగ్యాలను అనుభవించే వారే-ఇష్టమైన ఆహారాన్ని తీసుకునే వారే-అన్న దాతలే-అవయవాలన్నిటినీ అలంకరించుకునే వారే. ఇంద్రియ నిగ్రహంతో పాటు, ఇంద్రియాలను జయించిన వారక్కడి జనులు. అందరూ సోమ యాగం చేసినవారే-అగ్నిహోత్రాలు కలవారే-వారి, వారి ఆచారం ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారే-బ్రహ్మాన్ని ధ్యానిస్తూ, జప తపాలు చేసేవారే-దయాళులై, చక్కని నడవడి కలవారే. దశరథ మహారాజు పరిపాలన చేసే రోజుల్లో, అగ్నిహోత్రం లేనివాడు కానీ-సోమయాగం చేయని వాడు కానీ-అల్ప విద్య, అల్ప ధనం కలవాడు కానీ-వర్ణ సంకరులు కానీ-దొంగలు కానీ లేనే లేరు అయోధ్యా పురిలో.

తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో-అధ్యయనంలో ఉత్తములై , వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు. దశరథుడు పరిపాలన చేసే సమయంలో, చపలచిత్తులు, ఐహికాముష్మిక కార్య సాధనకు అవసరమైన దేహ బలం-మనో బలం లేనివారు, ఆరంగాలెరుగనివారు, అసత్యం పలికేవారు, ఈర్ష్య గలవారు, పాండిత్యం లేనివారు, చక్కదనం లేనివారు, పదివేలు తక్కువగా దానం చేసేవారు, దుఃఖించే వారు, రాజభక్తిలేని వారు, ఇతరులను పరవశులను చేయగల చక్కదనం లేని స్త్రీ-పురుషులు, స్త్రీలను స్త్రీలు-పురుషులను పురుషులు కూడా పరవశులు చేయగల చక్కదనం లేనివారు అయోధ్యా నగరంలో లేరు. అక్కడ నివసించే అన్ని వర్ణాలవారు దైవ పూజ చేయకుండా-అతిథిని ఆదరించకుండా, భోజనం చేయని దీక్షాపరులు. (పర గృహంలో ఒక్క రాత్రి మాత్రమే నివసించే వారిని అతిథుదులంటారు. ఒక్క రోజుకూడా-ఒక్క చోట కూడా నిలకడగా వుండలేడు కనుకనే "అతిథి" అంటారు). అయోధ్యా పురవాసులు శౌర్య పరాక్రమాలున్నవారు-సత్యమే ధనంగా కలవారు. ధనంలాగా సత్యాన్ని కాపాడుకునే శూద్రులు తాంత్రిక మంత్ర్రాలతో దేవ పూజ-హిరణ్య దానంతో అతిథి పూజ చేస్తారు. బ్రాహ్మణులు విద్యా శూరులు-వాద పరాక్రములు.

బ్రాహ్మణులుపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. వంచన-దొంగతనం అనే వాటిని దరికి రానీయకుండా, బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులకు సేవ చేస్తూ, శూద్రులందరు బ్రతుకు పాటుకై కుల విద్యలు నేర్చుకుని, కులవృత్తులలో నిమగ్నమై వుండేవారు. యుద్ధ భటులు కార్చిచ్చులాంటి దేహాలతో-తేజంతో, మందరం లాంటి ధైర్యంతో, ఇబ్బందులెన్ని ఎదురైనా, అప్పగించిన పనిని నెరవేరుస్తూ దేహ-మనో బలంతో ఉత్సాహంగా వుండేవారు.


దశరథ మహారాజు సైన్యంలోని గుర్రాలను కాంభోజ, బాహ్లిక, అరేబియా దేశాలనుండి కొనుక్కొచ్చేవారు. సూర్యుడి గుర్రాలకంటే-ఇంద్రుడి గుర్రం కంటే వేగంగా వెళ్లేవా గుర్రాలు. గుణం లేనివాడు కొడుకు కానట్లే-తపస్సు చేయని వాడు తెలివైన పండితుడు కానట్లే-భార్యను వశం చేసుకోలేనివాడు మగవాడు కానట్లే-ఏనుగులు లేనివాడు రాజు కాడన్న సూక్తిని అనుసరించి, మూడు జాతుల ఏనుగులు దశరథుడి సైన్యంలో వుండేవి. భద్రం, మంద్రం, మృగం అనే మూడురకాల శుద్ధ జాతి ఏనుగులు - వీటి సంకీర్ణ జాతి ఏనుగులు (భద్ర మంద్రాలు, మృగ మంద్రాలు, భద్ర మృగాలు, భద్ర మంద్ర మృగాలు) దశరథ మహారాజు సైన్యంలో వుండి, ఎనిమిది రకాలైన మదపు నీటిని స్రవింప చేసేవి. చెక్కిళ్ల నుండి (దానం అని) , కళ్ల నుండి (సీధువు అని), చెవుల నుండి (సాగరం అని), తొండం కొన నుండి (శీకరం అని), స్తనాల కొనల నుండి (సిక్యం అని), శిశ్నం నుండి  (మదం అని), హృదయం నుండి (ఘర్మం అని), పాదాల నుండి  (మేఘం అని) మదపు నీరు స్రవించేవి. ఇలాంటి సైన్యం తోడుండగా, ఎటు దిక్కుగా చూసినా రెండామడల దూరం నిడివి కలిగిన అయోధ్యా నగరాన్ని శత్రువులు జయించలేనిదిగా-ఇంద్రుడి అమరావతి నగరం లాగా, దశరథుడు, చుక్కల్లో చంద్రుడివలె పరిపాలించేవాడు.

దశరథ మహారాజు మంత్రులు బుద్ధిమంతులు-ప్రసిద్ధికెక్కిన వారు-ఇతరుల అభిప్రాయాన్ని వారిని చూస్తుండగానే తెలుసుకొనే శక్తిగలవారు-సదాచార సంపత్తిగలవారు-ధర్మమంటే ఆసక్తిగలవారు-లోకానికి మేలుచేసే ఆలోచనలున్న వారు-న్యాయాన్ని నమ్మేవారు-అపరాధాలు చేయనివారు-ఆలోచనలు చేయడంలో, చేసిన ఆలోచనలను కార్యరూపంలో పెట్టగల సామర్థ్యమున్న వారు-ప్రజల దగ్గరనుండి లంచాలు పుచ్చుకోవాలని గాని, రాజ ద్రవ్యం అపహరించాలని గాని అనుకునేవారు కాదు. మిక్కిలి రాజభక్తిగలవారు. మొత్తం ఎనిమిది మంది మంత్రులు దశరథుడి కొలువులో వుండేవారు-వారి పేర్లు: అర్థసాధకుడు, విజయుడు, సిద్దార్థుడు, ధృష్టి, జయంతుడు, మంత్రపాలుడు, అశోకుడు, సుమంత్రుడు. సుమంత్రుడు తప్ప మిగిలి ఏడుగురు మంత్రులంతా ఒక ఎత్తు-సుమంత్రుడు ఒక ఎత్తు. దశరథుడికి చాలా ముఖ్యుడైన సుమంత్రుడికి అంతఃపురం ప్రవేశించే అధికారం వుంది. వశిష్ఠుడు, వాసుదేవుడు అనే ఇద్దరు దశరథుడి రాజ పురోహితులుగా వుండేవారు. ఇద్దరూ సూర్య వంశ పురోహితులుగా వుంటూ, రాజుల మేలుకోరి-వారు అభివృద్ధి చెందేందుకు అవసరమైన శుభకార్యాలు చేయించేవారు.

అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని పిలువబడే నాలుగు రకాలైన రాజ విద్యలను క్షుణ్ణంగా నేర్చుకున్న దశరథ మహారాజు మంత్రులు, చేయకూడని పనులు చేసేందుకు సిగ్గుపడేవారై- ఇంద్రియ చపలత్వం లేకుండా మంచి నీతి మార్గం తెలిసినవారై-బుద్ధి సూక్ష్మత గల వారై- శాస్త్ర జ్ఞానాన్ని మంచిగా కలిగుండి-పరాక్రమంలో ఎదురులేని వీరులై-మంచి కీర్తిని సంపాదించి, రాజ కార్యాలను మనో వాక్కాయ కర్మలతో నెరవేరుస్తూ, తమను చూసేందుకు వచ్చినవారిని సంతోషంగా తామే ముందుగా పలుకరిస్తూ, బల సంపదలతో, దురాశనేది లేకుండా, ప్రాణాపాయ స్థితిలో కూడా నియమం తప్పకుండా ప్రవర్తించేవారు. దేశ విదేశాల్లో జరిగిన-జరుగుతున్న-జరగబోయే వార్తా విశేషాలను, వేగులవారి నుండి తెప్పించుకుని, విశ్లేషించి, ఏ విషయంలో ఎలా ప్రవర్తించాల్నో అలానే చేసేవారు. వ్యవహారం నడపడంలో సమర్థులు. వీరిలో నీతి-నిజాయితీ ఎంత మోతాదులో వుందోనని తెలుసుకోదల్చిన దశరథ మహారాజు, రహస్యంగా వీరిని చేసిన పరీక్షలన్నిటి లోనూ, వారు నిష్కళంక పరిశుద్ధులని తేలింది. దోషం చేసారని తెలిస్తే, తమ కొడుకులనైనా దండించకుండా విడవని పరిశుద్ధ మనస్కులు దశరథుడి మంత్రులు. దోషం చేయని శత్రువునైనా దండించరు. మంత్రులకు తెలియకుండా ఏ వ్యవహారం జరగదు. రాజుకు-రాజ్యానికి అవసరమైన ధనార్జన విషయంలోగాని, సేనలకు జీతాలు-బహుమానాలు ఇచ్చే విషయంలోగాని, సంపాదించిన ధనం వ్యర్థం కాకుండా రక్షించే విషయంలోగాని మంత్రులంతా కడు సమర్థతతో వుంటారు. దశరథ మహారాజు సభలో వుండి మంచి ఆలోచనలు ఇవ్వడంతోపాటు, యుద్ధ సమయంలోనూ వీరులై, తమ ప్రతాపాన్ని ప్రదర్శించేవారు. శత్రువులను జయించడంలోను, మిత్రులను రక్షించడంలోను ఉత్సాహం కనబరుస్తారు. రాజనీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినందున, శుచులై-పురజనులను ధర్మ పద్ధతిలో రక్షించే ఔదార్యం కలిగిన ధైర్యవంతులనిపించుకున్నారు.

దోషం చేసినవాడు బ్రాహ్మణుడైనా-క్షత్రియుడైనా-ఇంకెవరైనా, చేసిన నేరానికి-దోషి యోగ్యతను బట్టి ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష అమలుపర్చేవారు. మంచిమాటలు చెప్పడంలోను, ఆలోచన చేయడంలోను మంత్రులందరూ ఐకమత్యంతో మెలిగేవారు. రాజు ఎంత సమర్థుడైనప్పటికీ, పురోహితులతోనూ-మంత్రులతోనూ ఆలోచించే రాజ్యపాలన చేసే విధంగా మసులుకునేవారా మంత్రులు-పురోహితులు.

వీరు-వారు అనే భేదం లేకుండా అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే. దేహ పుష్ఠికలవారే. అసత్యాలాడనివారే. రాజు మేలుకోరేవారే. అధికారులందరు రాజ్యంలో తాముచేయాల్సిన-చేయాలనుకున్న పనులను కార్యరూపంలో పెట్టి చూపించేవారే కాని, ముందుగానే రహస్యాలు వెల్లడించి కార్యభంగం చేయరు. ఇలా యావన్మంది తనను సేవిస్తుంటే, వేగులవారి ద్వారా లోకంలో జరుగుతున్న విషయాలను కళ్లార చూసినట్లు తెలుసుకుని, తదనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని, మంత్రుల-పురోహితుల సూచనలతో-సలహాలతో రూపొందించే వాడు దశరథ మహారాజు. ఇలా పరిపాలన చేస్తూ, బాలసూర్యుడు కిరణాలతో ప్రకాశించే విధంగా, దశరథ మహారాజు కూడా ప్రకాశించేవాడు.


(సూర్య బింబం కనిపించిన ఏడు నిమిషాల తర్వాత, సూర్య కిరణాలు భూమిని తాకుతాయి. సూర్య బింబం కంటే, సూర్య కిరణాల మూలంగానే, లోకానికి ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా, రానున్న కాలంలో, అవతరించనున్న రామ-లక్ష్మణ-భరత-శత్రుఘ్నలు, దశరథుడికి సూర్య కిరణాల లాంటివారు. ఉదయాన ఎరుపు రంగులో వుండే సూర్యుడు దర్శనానికి పనికి రాడు. ఎండ వ్యాపించి-బింబం తెల్లగా మారిన తర్వాతే దర్శించడానికి యోగ్యుడు. అలాగే, రామాదుల వలనే దశరథుడు లోకమాన్యుడయ్యాడు. జాయానామ పూర్వుడు, స్వనామ పూర్వుడు, పుత్రనామ పూర్వుడు అనే మూడురకాల పురుషులుంటారు. మొదటి వాడికంటే రెండోవాడు-వాడికంటే మూడోవాడు శ్రేష్ఠుడు. దశరథుడు మూడో రకం వాడు).

No comments:

Post a Comment