Monday, December 21, 2015

బాలకాండ మందర మకరందం "నమ" శ్శబ్ద నిర్వచనం - (స్థూల-సూక్ష్మార్థాలు) : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ  మందర మకరందం
"నమ" శ్శబ్ద నిర్వచనం - (స్థూల-సూక్ష్మార్థాలు)
వనం జ్వాలా నరసింహారావు

నమ శ్శబ్దం అఖండమైనప్పుడు  "నమస్కారం"  అనీ, సఖండమైనప్పుడు (+మః) "నాకొరకు కాదు" అని అర్థం. అంటే నమస్కారం నాకొరకు కాదని అర్థం. అలానే ఏ జీవుడికొరకూ కాదు. రామచంద్రమూర్తికి మాత్రమే అని అర్థం."నేను-నాది" అనే పదాలు విషంతో సమానం."నీవు-నీది-నాదికాదు" అనేవి అమృతంతో సమానం. శ్రీమద్రామాయణానికి శ్రీ సీతాదేవి ప్రాణమని విజ్ఞులు చెప్తారు. అదే విధంగా శ్రీమద్రామాయణం దీర్ఘశరణాగతి అని కూడా అంటారు. అట్టి శరణా గతికి నమశ్శబ్దం ప్రాణం. నమశ్శబ్దం లేందే శరణాగతి లేదు. భక్తుల, ప్రపన్నుల చేతిలోని సుదర్శన చక్రంలాంటిదే మనస్సు. భగవంతుడు సుదర్శన చక్రంతో సర్వ లోకాలను జయించినట్లే, భక్తులు-ప్రపన్నులు నమస్సుతో భగవంతుడిని వశపర్చుకుంటారు.

తమకంటే ఉత్కృష్టుడైన ఇతరులను ఉద్దేశించి, వినయంగా దేహాన్ని వంచడాన్నే "నమస్కారం" అంటారు. నమస్కరించేవాడు శేషుడు-జీవుడు. నమస్కరించబడేవాడు శేషి పరముడు. జీవుడిని తన ఇష్టప్రకారం వినియోగించుకునేవాడు భగవంతుడు. అతడే ఉపాధి రహితుడు."నేను" ఉపాధిసహితుడను. భగవంతుడు సర్వదా శ్రేష్టుడు. భక్తవత్సలుడైన భగవంతుడు, తన భక్తులను అణకువతో వంగేటట్లు ప్రేరేపిస్తాడు. అందుకే దానికి "నమస్సు" అని పేరు. త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తేనే పూర్ణ  ఫలితం కలుగుతుంది. దీన్నే కరణపూర్తి అంటారు. ఇక అంగపూర్తి ఆరు రకాలు. ఆత్మ నిక్షేపం, మహా విశ్వాసం, కార్పణ్యం, అనుకూల్య సంకల్పం, ప్రాతికూల్య వర్జనం, గోప్తృత్వ వరణం. ఇలా చేస్తే "సాంగోపాంగ నమస్కారం" అవుతుంది. ఇది స్థూలార్థం.

ఈ వస్తువులు నావి-నావారివి అనే మమత్వాన్ని "మమ్య" అంటారు. సర్వం విష్ణ్వాత్మకం. ఆయనే అంతా, అనే జ్ఞానం, నమస్సుతో కలుగుతుంది. ఇది సూక్ష్మార్థం. నమశ్శబ్దంలో "" కారానికి మార్గం అని అర్థం."" కారంతో ప్రధానం నిరూపితం. విసర్గం పరమేశ్వరుడిని తెలుపుతుంది. కాబట్టి అనాదైన పరమేశ్వరుడనేవాడు శక్తిమంతుడు-పురుషోత్తముడు. ఆ భగవంతుడి ప్రాప్తికి నమస్సు ప్రధానోపాయం. ఇది పరమార్థం. ఈ విధంగా నమశ్శబ్దానికి మూడర్థాలున్నాయి.

కృతి నాయికైన సీతాదేవి స్తుతి

సమస్త ప్రపంచాలనూ ఆశ్రయించి, తనను ఆశ్రయించిన వారికి అండగా వుండి, తనను నమస్కరించిన వారి దీనాలాపాలను దయతో వింటూ, వారిని రక్షించాల్సిందిగా భర్తతో అంటూ, అట్టి రక్షణకు వారి దోషాలను అపహరించి పవిత్రులను చేస్తూ, అత్యంత శక్తి-మహిమ కలదై, భగవంతుడిని ఆశ్రయిచి ఆయనకు ప్రతిఫలాపేక్ష లేక అత్యంత ప్రేమతో సేవ చేస్తూ, శ్రీ అనే సార్థకమైన పేరు కలిగి, మెత్తని మనస్సుతో భర్తకు పరతంత్రురాలిగా వుంటూ, దయ, క్షమలనే కల్యాణ గుణాలు కలదై, ప్రపంచానికంతా తల్లైన సీతాదేవి భక్తులకు శాశ్వత సుఖాలు ప్రసాదించాలి.

శ్రీ శబ్ద నిర్వచనం

తమ-తమ ఉజ్జీవాలను కోరుకునే వారి ద్వారా ఆశ్రయించబడి, వారు కోరుకున్న విధంగా ఉజ్జీవించ చేసేందుకు, స్వయంగా సర్వేశ్వరుడిని ఆశ్రయించేదే "శ్రీ". తన ఆజ్ఞ మీరి ప్రవర్తించే జీవులమీద భగవంతుడు కోపగించినప్పుడు, తల్లైన లక్ష్మీదేవి, తనను ఆశ్రయించిన వారిని రక్షించమని భగవంతుడిని వేడుకుంటుంది. అలాంటి సమయంలో "కరుణా సాగరా, సర్వేశ్వరా, ఎందుకిలా కోపగించారు? పిచ్చుకమీద ఎందుకీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు? నువ్వే కోపిస్తే వీరి గతేంటి? వీరిని రక్షించేదెవరు? ఇలాంటి వారిపై నీ దయా గుణం చూపకపోతే ఇంకెవరిమీద చూపిస్తావు? అపరాధం చేసిన వారందరినీ శిక్షించాలంటే చేయని వారెవరైనా వుంటారా?" అని భగవంతుడిని ప్రార్థించేదే "శ్రీ". అమె ఇలా ప్రార్థించి-బోధించి భగవంతుడిని శాంతపరుస్తుంది. అలా చేయడాన్నే "పురుష కారం" అనంటారు. ఎవరికైనా-ఏదైనా పని కావాల్సినప్పుడు, అది జరిగేందుకు, తనకిష్ఠమైన వేరొకరిని ఆశ్రయిస్తే, అట్లా ఆశ్రయించబడినవారిని  "పురుష కారం" అనాలి. విభీషణుడు రామానుగ్రహం కొరకు వానరులను ఆశ్రయించాడు. సీతాదేవిని ఆశ్రయించిన రాక్షస స్త్రీలను సంహరించకుండా వదిలాడు హనుమంతుడు.

మూర్తీభవించిన భగవత్కరుణారసమే లక్ష్మీదేవి. ఆమె వాత్సల్యం-సౌలభ్యం-స్వభావం కల తల్లి. భగవతి కాబట్టి భగవంతుడి మీద వాలభ్యం కలది. ఆమె మాటను ఆయన తిరస్కరించడు-నిరాకరించడు. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరంలేదు.


భగవంతుడు లక్ష్మీ విశిష్టుడయ్యే లోకాలను సృష్టిస్తాడు-రక్షిస్తాడు-హరిస్తాడు. దీనంతటికీ కారణం దయా గుణం మాత్రమే. భగవంతుడు కరుణా స్వరూపైన లక్ష్మీదేవిని కూడి రక్షకుడవుతున్నాడని సర్వ సిద్ధాంతాలు-వేదాంతాలు చెప్తున్నాయి. "శ్రీ" తనను ఆశ్రయించిన వారి శ్రేయస్సును కోరుతూ విరోధులను నశింపచేస్తుంది. శ్రీరామచంద్రమూర్తి పురుషుడు కనుక తాను పూనిన కార్యాల రక్ష కాని, శిక్ష కాని, స్వతంత్రించి తానే చేస్తాడు. సీతాదేవికి శిక్షించడం అంటే తెలియదు. అపరాధం చేయనివాడే లేడని ఆమె నమ్మకం. అందుకే శత్రువులనైనా రక్షించమని ఆమె అంటుందెప్పుడూ. భక్తులకింతకంటె సేవించతగువారెవ్వరుంటారు? ఈ కారణాన్నే, శ్రీ సీతాదేవి అపరాధులైన వారికి వశ పడి, కష్టమైనా వారిని రక్షించే ప్రయత్నం చేస్తుంది. తన మాట వింటే సంతోషిస్తుంది. వినక పోతే వారిమీద కోపం తెచ్చుకోదు. వారి పాపం వారినే హరిస్తుందని వూరుకుంటుంది. రావణాసురుడి విషయంలోను, రాక్షస స్త్రీల విషయంలోను, అలానే ప్రవర్తించింది. ఋషుల రక్షణార్థం రాక్షసులను సంహరించాలనుకున్న రాముడిని వారించే ప్రయత్నం చేసింది. అందుకే, సీతతో కూడిన శ్రీరామచంద్రమూర్తిని సేవిస్తేనే శుభాలు కలుగుతాయని పెద్దలంటారు. సీత మాత-తల్లి అయినందువల్ల, శీఘ్రంగా, నమస్కార మాత్రాన్నే అనుగ్రహిస్తుంది.

బ్రహ్మ స్తుతి

ఎవరి వాక్యం సత్యమో, ఎవరుండే లోకం సత్యమో, ఎవరి రాత సత్యమో, ఎవరి భార్య సత్య అయిన సరస్వతో, అట్టి బ్రహ్మదేవుడు ఈ కృతికి తన పరిపూర్ణ ఆయువు ఇవ్వడానికి ప్రతిదినం ప్రార్థన చేద్దాం.
(శ్రీరామకథా శ్రవణం వల్ల, పఠనం వల్ల లోకాన్ని తరించ చేయదలిచి బ్రహ్మదేవుడు వాల్మీకి ద్వారా రామాయణాన్ని పలికించాడు. అది సంస్కృత భాషలో వుంది కనుక, సంస్కృత భాషా జ్ఞానం క్షీణించినందున బ్రహ్మ సంకల్పం సార్థకం కాదేమోనని, గ్రంథకర్త భావించి, ఆయన సంకల్పాన్ని సార్థక పర్చేది ఈ ఆంధ్ర వాల్మీకి రామాయణమొక్కటే అని అంటాడు. అందుకే సంస్కృత రామాయణం పైగల అనుగ్రహ బుద్ధి దీని మీదుంచాలని బ్రహ్మను ప్రార్థించారు వాసుదాస స్వామి).

సరస్వతీ స్తుతి

గ్రంథకర్త నిమిత్తమాత్రుడని, పలికింది సరస్వతేననీ ఆయన నమ్మకం. బ్రహ్మ పనుపున సరస్వతీ దేవి వాక్కున నిలిచినందున వాల్మీకితో పలికించింది శ్రీమద్రామాయణం. తన తీవ్ర రోగబాధ, దుర్బలత్వం, అల్ప పాండిత్యం,సహాయహీనత లాంటి కారణాలవల్ల,ఈకృతి భగవత్సంకల్పంతోమాత్రమే నెరవేరగలదని కవి భావన.
శివ స్తుతి

"రమణీ! విష్ణు సహస్ర నామాలకు సరైంది రామ అనే నామం. ఇది జనన-మరణాలనే సంకటాలను వారించి శాశ్వత నిత్యానందం కలిగిస్తుంది" అని పార్వతికి ఉపదేశించిన శంకరుడు తన కృతిని రక్షించాలని కవి కోరుకుంటాడు."శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే సహస్ర నామ త స్తుల్యం, రామ నామ వరాననే". రామ అనే రెండక్షరాలమంత్రం పన్నెండులక్షలసార్లు జపిస్తే సర్వాభీష్ట ఫలసిద్ధి కలుగుతుందంటారు. ఈ రామ పదంతో ఉపాసించబడే మూర్తెవరు? రూప నామ క్రియలు లేని శుద్ధ చైతన్యమా? రావణాది రాక్షసులను సంహరించిన అయోధ్యా వాసి శ్రీరామచంద్రుడా? జ్ఞాన మయుడై, హరియై, మహావిష్ణువై, రఘువంశంలో దశరథుడికి పుట్టి, సర్వ దాత అయిన వాడే రాముడని జ్ఞానులు ప్రకటించారు. ఎవరి చేతిలో రాక్షసులు మరణించారో, అతడే రామచంద్రమూర్తనీ-అభిరాముడనీ చెప్పబడింది. తన నడవడితో ధర్మ మార్గాన్ని-పేరుతో జ్ఞాన మార్గాన్ని-ధ్యానంతో వైరాగ్యాన్ని-తనను పూజించిన వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడే శ్రీరామచంద్రమూర్తి.

పార్వతీ-పరమేశ్వరుల స్తుతి

దేవతల కొరకు-లోకంకొరకు, లోకాలను రక్షించేందుకు శివుడు సముద్ర మధనం చేసేటప్పుడు, హాలాహలాన్ని మింగుతాడు. ఫలితంగా శరీరం మొద్దుబారిపోతుంది. పార్వతికేమీ పాలుపోలేదు. దేవతల శీతోపచారాలు వృధా అయ్యాయి. అప్పుడు రామ నామామృతాన్ని తాగించారు శివుడితో. దాంతో తాపం హరించి, బలం పొంది శివుడు మహేశ్వరుడయ్యాడు. పార్వతి సర్వమంగళ అయింది. ఇలా రామ నామంతో బాగుపడిన  పార్వతీ-పరమేశ్వరులు తన రామాయణాన్ని రక్షించాలని కవి ప్రార్థన చేశారు.

రామదాసుడైన ఆంజనేయుడి స్తుతి

శ్రీరామచంద్రమూర్తి చరణ ద్వయాన్ని హృదయంలో నిలిపి, విఘ్నాలను ఎదుర్కొంటూ సముద్రాన్ని దాటిపోయి, లంకలో ప్రవేశించి, సీతను వెతికి చూసి, ఆమెకు ధైర్యం చెప్పి, సంతోష పరిచి, మరల వచ్చి, శ్రీరామచంద్ర పాదసేవ చేసిన పావన చరిత్రుడైన హనుమంతుడు తన ప్రబంధాన్ని ప్రసిద్ధి చేయాలని కవి ప్రార్థించాడు.
సంస్కృత కవీంద్ర స్తుతి

పాలసముద్రంలో ఆవిర్భవించిన అమృతాన్ని తాగిన దేవతలు స్వర్గంలో వుంటారు. అంతకు మించిన అమృతాన్ని భూలోకంలోని మనుష్యులతో తాగించుదామన్న పరోపకార బుద్ధితో శ్రమించినవాడు వాల్మీకి మహర్షి. ఆదికవి ఆయన. వాల్మీకికి ముందు కావ్యం రచించిన కవి లేడు. శ్లోకాలను నియమబద్ధం చేసినవాడు కూడా వాల్మీకే. బ్రహ్మతో పోల్చదగినవాడు వాల్మీకి. ఇరువురికీ సామ్యముంది. ప్రపంచ సృష్టిలో ప్రధమ కర్త బ్రహ్మైతే, కావ్య సృష్టిలో ప్రధమ కర్త వాల్మీకి. బ్రహ్మ పంపిన సరస్వతి వాల్మీకి నాలుకపై నిలిచి రామాయణాన్ని రచింపచేసింది. బ్రహ్మ సృష్టి జీవకోటికి ఉపకరిస్తే, వాల్మీకి కృతి లోకాలనే ఉద్ధరించింది.

లక్ష్మీదేవికి స్థానమై, మంచినీరుండి, తీయని రసం-తెలియరాని లోతు-విశేష ధ్వని కలిగినదే రామాయణం. మనోహరమైన పాలసముద్రాన్ని మథించిన దేవతలు ఎలా అమృతాన్ని అనుభవించారో, అలాంటి అనుభవమే కలుగుతుంది ఏడు కాండల సీతా చరితమైన రామాయణాన్ని చదివితే. మనోహరమైన నవరస వర్ణనలతో, అర్థ గాంభీర్యంతో, నానా విధ ధ్వన్యర్థాలతో మళ్లీ-మళ్లీ చదవాలనిపించే కావ్యం రామాయణం. ఇట్టి రామాయణాన్ని చదివినవారికి ఇహమందు సుఖం-పరమందు మోక్షం కలుగుతుంది.         

జ్ఞానహీన మానవులను ఇహ-పరాలలో రక్షించేందుకు, వేదం వినే అధికారం లేదని భావించే స్త్రీలను, శూద్రులను, అధమ బ్రాహ్మణ, క్షత్రియ, వ్యైశ్యులను ధర్మ-అధర్మాలు తెలుసుకొని బాగుపర్చేందుకు, శ్రీ మహాభారతాన్ని రచించిన వ్యాసమహర్షిని స్తుతించారు కవి. సరస్వతీ దేవిని నూతన తాళాల ప్రకారం ఆడించి, తన వాదనాపటిమతో తార్కికులనే ఏనుగులకు సింహగర్జనమై, రామానుజాచార్యులు స్థాపించిన విశిష్టాద్వైతాన్ని (శ్వేత వరాహ మూర్తి భూదేవిని ఉద్ధరించినట్లు) ఉద్ధరించి, కవి తార్కిక సింహ బిరుదు పొంది, సాదువులతో పొగడబడి, కీర్తి కలిగిన, వైష్ణవ శ్రేష్టుడైన వేదాంత దేశికులకు నమస్కరిస్తారు కవి. ఆ తర్వాత, రఘువంశం రచించిన కాళిదాస కవిని, మహా వీరచరిత్ర-ఉత్తర రామ చరిత్ర రాసిన భవభూత కవిని, ప్రసన్నరాఘవం రాసిన జయదేవ కవిని, బాల రామాయణం రచించిన రాజశేఖర కవిని, అనర్ఘవ రాఘవం రాసిన మురారి కవిని స్తుతించారు కవి.

ఆంధ్ర భాషకు తొలుత లక్షణ లక్ష్య భిక్ష పెట్టిన నన్నయ భట్టారకుని, ఆయన మార్గాన్నే అవలంబించిన ఎర్రాప్రగడ, తిక్కనలను స్తోత్రం చేస్తారు కవి.

సంస్కృత గ్రంథాలను తెనిగించడంలో సర్వజ్ఞులైన పలువురిని మించినవాడు, భగద్విషయం కావడంతో ఇంపైన కవిత్వం అందించిన వాడు, భక్తి రసం ఇమిడిన వర్ణనలు చేసిన వాడు, భక్తి పారవశ్యంతో భగవంతుడిని వర్ణిస్తూ తన దేహాన్నే మరిచిపోయేవాడు, కవి శ్రేష్ఠుడు, దేవతోపాసకుడు, గురు శిక్షణ లేకుండానే పండితుడైన వాడు, శ్రీ భాగవతం తెనిగించి జన్మ సాఫల్యం కలిగించిన కార్యం చేసినవాడు, సత్యవ్రతం కలవాడు, బుద్ధిలో బృహస్పతి, బమ్మెర పోతనామాత్యుడిని కొలుస్తారు కవి.

రామాభ్యుదయం రచించిన అయ్యలరాజు రామభద్రుడిని, ఉత్తర రామాయణ కర్త తిక్కనను, నిర్వచన ఆంధ్ర రామాయణం రాసిన తిమ్మనను, మల్లమ్మను, భాస్కర కవిని, కంకంటి పాపరాజును, రంగనాథుని స్తుతిస్తారు కవి. శ్రీమద్రామాయణం బాల కాండ నుండి యుద్ధ కాండ తుది వరకు ఆంధ్రీకరించిన రామ భక్తుడు గోపీనాథం వేంకయ్య కవిని శ్లాఘిస్తూ నమస్కరిస్తారు గ్రంథకర్త.

అల్పజ్ఞుడనని, అపండితుడనని, దీర్ఘ శ్వాస రోగినని, పరాధీన జీవినని, పారతంత్ర్య నరక నివాసినని, తన గ్రంథమందెన్నో దోషాలుండవచ్చునని, ఆ కారణం వల్ల దాన్ని నిరసించక దయతో ఆదరించాలని సత్కవి శ్రేష్ఠులను, ఇతరులకు మేలుచేసే గుణాలున్న వారిని, తన కాలపు ఉత్తమ కవులను కోరుతారు కవి. గ్రంథంలో సారం లేకపోయినా, రామాయణం అన్న గౌరవ బుద్ధితోనన్నా, తన కృతిని దయతో అంగీకరించాలని భావితరాల పండితులకు నమస్కరిస్తూ కోరుతారు కవి.

మిత్ర ప్రశంస

సీతమ్మ-రాఘవయ్యల తనయుడు, కుప్పమ్మ భర్త, హూణాంధ్ర-ద్రావిడ-కన్నడ-మరాఠి-హింది భాషలను ఎరిగినవాడు, కారణం లేని దయకలవాడు, లోకంలో లేని ప్రతిభ కలవాడు, మృధు-మధుర వాక్కులతో కవిత చెప్పగలవాడు, కౌశిక గోత్రీకుడు, లంకలపల్లె ఇంటి పేరుకలవాడైన వేంకట సుబ్బార్యుడిని కవి ప్రశంశిస్తాడు. జ్యోతిష్కుడు వేంకటనరసయ్య- సరమ్మల కుమారుడు, అన్నపూర్ణమ్మ భర్త, హరితస గోత్రీకుడు, కోలంక-వీరవరం గ్రామాల జమీందారైన శ్రీరాజారావు చెల్లమాంబారావు గారి ఆశ్రితుడు, రామకృష్ణ శాస్త్రి తమ్ముడు, క్రొత్తపల్లె ఇంటి పేరున్నవాడు, సద్గుణాలు-సన్మార్గ ప్రవర్తన గలవాడైన పద్మనాభ శాస్త్రిని తలచుకుంటారు కవి. తనకాయన ఎల్లవేళలా శ్రేయస్సులను కలిగించారనీ, తాను పోషించిన తన సమీప బంధువులు తన కష్టకాలంలో వదిలిపెట్టి పోతే శాస్త్రిగారు మందులిచ్చి ప్రాణాలు కాపాడారనీ, పూర్వ జన్మ పుణ్యం లేకుండా అట్లాంటి స్నేహితులు దొరకరనీ గుర్తుచేసుకుంటారు. తన ఈ మిత్రులు సత్కావ్యాలు రచించేందుకు తనను ప్రేరేపించారనీ, రచనా సమయంలో క్షయ వ్యాధికి గురైతే ఆదుకుని ప్రోత్సహించారనీ, రచన పూర్తయిన తదుపరి ప్రచురించి లోకంలో కీర్తి తెచ్చారనీ, అటువంటి మిత్రులు లభించడం తన అదృష్టమని రాసుకుంటారు. రాముడి కరుణతో మిత్రులైన పద్మనాభశాస్త్రి, వేంకట సుబ్బయ్యలకు సంపత్తు-సంతతి కలిగి, తన రామాయణం ముద్రించిన తర్వాత చాలాకాలం జీవించి వున్నారని అంటారు.
జయన్తినో సుకృతినో రస సిద్ధాః కవీశ్వరామ్ః

నాస్తితే షాం యశః కాయే జర మరణజం భయమ్" 

No comments:

Post a Comment