Saturday, March 2, 2019

మాయ జింకను చంపాల్సిందేనని లక్ష్మణుడికి చెప్పిన రాముడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-50 : వనం జ్వాలా నరసింహారావు


మాయ జింకను చంపాల్సిందేనని లక్ష్మణుడికి చెప్పిన రాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-50
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (03-03-2019)
         సీతాదేవి కోరిన విధంగా మృగాన్ని పట్టుకోవాలని భావించిన శ్రీరామచంద్రమూర్తి సంతోషంగా లక్ష్మణుడితో అన్నాడిలా: “ లక్ష్మణా! చూశావా! ఈ జింక మీద సీతకు ఎంత ఆశ కలిగిందో? ఆడవారి మాటలకు, కోరికలకు ఏముంది అంటావా? అది వేరే సంగతి. మనం కూడా ఇలాంటి సౌందర్యంకల జింకను చూశామా? మున్ముందు చూడగలమా? ప్రపంచమంతా మనం చూశామా? ఎక్కడేముందో ఎవరికి తెలసు అంటావేమో? చూడకపోతే పోనివ్వు. ఈ లోకంలో కాకపొతే పోనీ. ఇంద్రుడి నందనవనంలో కుబేరుడి చైత్ర రథం వుందని ఎవరైనా చెప్పగా విన్నామా? లేదుకదా? దీని (జింక) కాంతి ఆకాశాన్ని తాకుతున్నది కదా? బంగారు వన్నెతో ప్రకాశించే చుక్కల సమూహంతో అందంగా వుందికదా? వెంట్రుకలు కొన్ని అనులోమంగా, కొన్ని ప్రతిలోమంగా వున్నాయి కదా? అది ఆవలిస్తే మేఘం నుండి వెలువడ్డ మెరుపు లాగా అగ్నిజ్వాల లాంటి నాలుక నోటి నుండి బయటకు వస్తున్నది”.

         “ఈ జింక ముఖం ఇంద్రనీల కాంతి లాగా, కడుపు శంఖం లాగా ముత్యంలా తెల్లగా, ఠీవి సౌందర్యంలో అతి గొప్పగా వుంది. ఇలాంటిది ఎవరి మనసు హరించదు? అనేకమైన రత్నకాంతులతో నిండి, బంగారు వన్నెతో కూడి, రూపం చూడగానే సీత మాట ఎలావున్నా, ఏ మనుష్యుడి మనస్సు కరగకుండా వుంటుంది? రాజులు మాంసంకొరకు వేటలో మృగాలను చంపుతారు. ధాతువులనే మణులను, బంగారాన్ని, ధనసమూహాన్ని, వేటలోనే సంపాదిస్తారు. రాజుకు సర్వం అడవిలోనే దొరుకుతుంది. ఈ మృగాన్ని చంపడం వల్ల ఏవిధంగా విశేషార్థ లాభం కలుగుతుంది అంటావా? బంగారుమయమైన ఈ శ్రేష్టమైన జింక చర్మం మీద సీతాదేవి నాతొ కలిసి కూర్చోవాలని ఆశపడుతున్నది. మృగజాతుల్లో భూమ్మీద ఈ జింక, ఆకాశంలో చంద్రుడిలోని జింక, రెండే మనోహరమైనవి కాని మిగతవన్నీ కావని నా అభిప్రాయం. ఇది మాయామృగం. జీవితంలో పట్టుబడదు. అందుకే దీన్ని చంపాలి”.

         శ్రీరాముడు లక్ష్మణుడితో ఇంకా ఇలా అన్నాడు. ”ఈ కారణాన పరాక్రమంతో దీన్ని చంపడమే తగిన పని. ఈ ప్రదేశంలోనే పూర్వం వాతాపి అనే రాక్షసుడు మునుల కడుపుల్లో ప్రవేశించి తేలులాగా వాళ్ల పొట్టలు పగుల చీల్చి హింసామార్గంలొ నడుస్తుండే వాడు. ఒకనాడు అగస్త్య ముని వాడిని తిన్నాడు. అతడి కడుపులోంచి లేవడానికి ప్రయత్నించే సమయంలో అగస్త్యుడు వాడు భయపడేట్లు, రాక్షసుడు బ్రాహ్మణులంటే లక్ష్యం లేకుండా దయాహీనుడై పాపం పనులు చేస్తున్నాడనీ, శాశ్వతంగా తన కడుపులో జీర్ణమై పోమ్మనీ అన్నాడు. ఆ విధంగా అగస్త్యుడు వాడిని చంపాడు.  వీడూ ఆ వాతాపి అంతటి వాడే! అగస్త్యుడి వల్ల వాడు ఎలా చచ్చాడో, వీడు కూడా మనల్ని మోసగించడానికి వచ్చాడు కాబట్టి, వీడూ చావాల్సిన వాడే. నేను వేటకోసం పోతాను. నువ్వు ధృడ ప్రయత్నంతో సీతకు అపాయం కలగకుండా కాపాడాలి. మన ప్రయత్నాలన్నీ ఈమె మీదే ఆధారపడి వున్నాయి. కాబట్టి శ్రద్ధగా రక్షించు. ఈ మృగం నువ్వు చెప్పినట్లు రాక్షసమాయ అయితే చంపుతాను. లేక సహజ మృగమే అయితే జాగ్రత్తగా పట్టి తెస్తాను. వీట్లో ఏదో ఒకటి చేస్తాను. లక్ష్మణా! సీతాదేవిని చూస్తుండు జాగ్రత్తగా. ఆ మృగం చర్మం మీద ఎంత మొహం పెట్టుకుని చూస్తున్నదో కదా!”


         “కాబట్టి ఒక్క బాణంతో ఈ జింకను చంపి చర్మం తీసుకుని శీఘ్రంగా వస్తాను. ఒక బాణ ప్రయోగానికి ఎంతసేపు పట్తుందో, అంత సేపట్లోనే వస్తాను. నేను బాణం ప్రయోగించడమే ఆలశ్యం. నేను వచ్చేదాకా ఈ సీతను నువ్వు హెచ్చరిక తప్పకుండా ఏకాగ్రమనస్సుతో సర్వదా కాపాడు తమ్ముడా. పక్షిరాజైన జటాయువు కార్యసాధన సమర్థుడు. మంచి బలవంతుడు. కార్యాలోచన, కార్యదక్షత, ధైర్యం కలవాడు. ఆయన నీకు సహాయకుడుగా ఈ సీతాదేవిని ప్రతిక్షణం, ఏ మూల ఏం జరుగుతుందో అన్న ఏమరుపాటుతో, ఏమాత్రం పొరపాటు చేయకుండా ఒక వ్రతంగా భావించి రక్షిస్తాడు”.

         (శ్రీరాముడి చర్య వలన గ్రహించాల్సిన నీటి వుంది. ఆయన భ్రమ పడడమే కాకుండా, లక్ష్మణుడు చెప్పినా వినలేదు. మారీచుడి మాయ అని నమ్మితే, ఉన్నచోటే వుండి బాణ ప్రయోగం చేయవచ్చుకదా? జింక వెంట పోవాల్సిన పని లేదు. కాకాసురుడి వెంట పడి పోలేదుకడా? కాబట్టి అది నిజమైన జింకే అన్న భ్రాంతి వదలలేదు. సీతాదేవి లోకమాన్య స్త్రీ అవుతుందా? ఆమెకు తెలియని విషయాలు లేవు కదా? బంగారు జింక లోకంలో వుండదని తెలియదా? పరమ భక్తికల సీత ఎందుకు ఒక క్షుద్ర మృగానికై భర్తను వదిలి వుండాలని అనుకుంది? కాబట్టి కర్మానుసారం బుద్ధి అనే నీటి బలపడుతున్నది.

         పరమార్థం విచారిస్తే....మనుష్యులకు కోరికలు కోరే స్వాతంత్ర్యం వుంది. దాన్ని నెరవేర్చే భారం భగవంతుడి మీద వుంది. ఎవరే కోరికలు గట్టిగా కోరినా భగవంతుడు దాన్ని నెరవేరుస్తాడు. కాని దాని ఫలం అనుభవించమని అంటాడు. కాబట్టి మంచి కోరికలు కోరేవారికి మంచి ఫలమే కలుగుతుంది. చెడు కోరికలు కోరేవారికి కలిగేది చెడు ఫలమే! ప్రకృతి విషయమైన కోరికలు కోరేవారందరికీ సీతాదేవికి పట్టిన గేటు పట్తుంది. మారీచుడి మాయే ప్రకృతి. ప్రపంచంలో మనం చూసేవి, వినేవి అన్నీ ప్రకృతి చిత్రాలే! సీతాదేవి మాయ జింకను చూసి భ్రమించి ఆశపడినట్లు మనం కూడా చిత్ర-విచిత్రమైన ప్రకృతి పదార్థాలను చూసి సత్యమని భ్రమ పడుతున్నాం. ఇవి సత్యం కావు. క్షణభంగురాలు. ఆ జింక వల్ల సీతాదేవి ఎలా సుఖపడాలని కోరుకుందో అలాగే మనం ప్రకృతి పదార్థాలవల్ల ఆనందపడాలని కోరతాం. రామచంద్రమూర్తి సీతాదేవి కోరిక నేరవేర్చినట్లే మనకోరికనూ నెరవేరుస్తాడు. సీతాదేవి అనుభవించిన ఫలం మనం కూడా అనుభవించబోతున్నాం. సీతకు ఏం ఫలం కలిగింది? అది మున్ముందు తెలుసుకుంటాం).

No comments:

Post a Comment