Monday, June 1, 2020

ఆరోజుల్లో నియంత్రిత సాగే! ..... వనం జ్వాలానరసింహారావు


ఆరోజుల్లో నియంత్రిత సాగే!
వనం జ్వాలానరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (02-06-2020)
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియంత్రిత నియమావళి ఆధారిత వ్యవసాయం గురించి పదే-పదే చెప్తుంటే, గ్రామాలతో, వ్యవసాయంతో అంతో-ఇంతో అనుబంధం వున్న నా లాంటి వారికి, వారిప్పుడు ఏ వ్యాపకంలో వున్నా సరే, పాత రోజులు, పాత సంగతులు గుర్తు రాక మానవు. ఒకానొక రోజుల్లో గ్రామ వాతావరణం, అందులో అగ్రగామిగా వుండే వ్యవసాయం, ఆ వ్యవసాయానికి అనుబంధంగా వుండే పనిముట్లు, నైపుణ్యంతో వ్యవసాయానికి అవసరమైన పనులను చక్కదిద్దే వ్యక్తులు, విద్య లేకపోయినా అనుభవంతో ఏ పంట ఎప్పుడు వేస్తే లాభదాయకమో తెలియచెప్పే కొందరు గ్రామస్తులు, ఇలా అనేక విధాలుగా అలరారుతుండేది.

భారత దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, వ్యవసాయానికి వేల సంవత్సరాల చరిత్ర వుంది. అనునిత్యం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రగతికి, విస్తరిస్తున్న ప్రపంచ మార్కెట్లకు, ప్రతిస్పందనగా, గత శతాబ్ది కాలంగా వ్యవసాయం గణనీయమైన మార్పులకు, చేర్పులకు గురవుతోంది. మానవ, సహజ వనరుల స్థానంలో యంత్రాలు, సింథటిక్ ఎరువులు, క్రిమిసంహారక మందులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణాన పంట దిగుబడులు పెరిగినప్పటికీ, వాతావరణ సమతుల్యం దెబ్బ తినడం, ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు నెలకొనడం కూడా జరిగింది.

గ్రామీణ, వ్యవసాయ వాతావరణ నేపధ్యంలో పెరిగిన ప్రతివారికీ వరి పొలాలు, మల్లె తోట, మామిడి తోట, మిరప, మొక్క జొన్న తోటలు, తోటలలోని మోటబావులు, జొన్న చేలు, చేలలోని దోసకాయలు, మంచె, అరకలు, ఎద్దులు, పాడి పశువులు, మేకలు, వరి గడ్డి వాములు, ఇంట్లో గిలక బావి, బావి పక్కనున్న నిమ్మ-అరటి చెట్లు, ఇంటి వెనుక ఉదయాన్నే చల్ల చిలికే ప్రక్రియ, అందులో వచ్చిన వెన్న పూస ఆస్వాదించడం, ఉదయాన్నే తిన్న చద్ది అన్నం మామిడి వూరగాయ కారంతో తినడం, సాయంత్రం ఇంటి ముందు నీళ్లు చల్లి నవారు-నులక మంచాలు వేసుకోవడం, పడుకోని ఆకాశంవైపు చూసి ఆనందించడం, ఇలా ఎన్నో విషయాలు గుర్తుకు రావడం సహజం. చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలంగా పండిన పుట్ల కొద్దీ వడ్లు (పుట్టికి 75 కిలోల బరువుండే ఎనిమిది బస్తాలు), జొన్నలు, వేరు శనగ, కందులు, పెసలు, మిరప కాయలు, గుర్తుకు రానివారు వుండరు. ప్రతి రైతు పాడి పశువుల మేత కొరకు అతడికున్న భూమిలో కొంత బీడు భూమిగా వదిలే వాళ్ళు.

సాధారణంగా వ్యవసాయపు పనులు వేసవి కాలంలోనే మొదలయ్యేవి. పొలాలకు పెంట (పశువుల ఎరువు) తోలే ప్రక్రియతో వ్యవసాయపు పనులు మొదలయ్యేవి. మొదలు యజమాని తన సొంత పాడి పశువుల వల్ల పోగైన పెంటను తోలే వాళ్లు. ఆ పెంటను నిలవ చేయడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని ఉపయోగించుకునే వాళ్లు. దీనికి అదనంగా కొందరు రైతులు పొలాలు లేని వారి దగ్గర నుంచి పెంట ఖరీదు చేసి కొని పొలాలకు తోలే వాళ్లు. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణగానే జరిగేది. ఇలా తోలే పెంట కాకుండా, వందల సంఖ్యలో వుండే జీవాలను పొలాలలో రాత్రింపగళ్లూ వుంచేవాళ్లు. అదీ ఖరీదుకే. అలా వుంచడం వల్ల పొలాలలో జీవాల పెంట పోగయ్యేది. అది పొలాలకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. అప్పట్లో రసాయనిక ఎరువుల వాడకం అలవాటు ఇంకా సరిగ్గా కాలేదు. ఇళ్లలో పోగైన పెంటను, జీవాల పెంటను మాత్రమే ఎరువులాగా వాడే వాళ్లు.

అదనంగా, చెరువు పూడిక తీసి మట్టిని పొలాలకు తోలే వాళ్లు. తెల్లవారు జామునుంచే పెంట బండ్లను కట్టే ప్రక్రియ మొదలయ్యేది. మధ్యాహ్నం పన్నెండు (రెండు జాములు అనే వాళ్ళు) గంటల సమయం వరకు తోలి ఇళ్లకు తిరిగి వచ్చే వారు. పొద్దున్నే చద్ది అన్నం తినే వాళ్ళు. మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు భోజనం వగైరాలు కానిచ్చి, ఎడ్లకు దానా వేయడం, నీళ్లు పెట్టడం లాంటివి చూసుకునేవారు. ఆ సంవత్సరానికి కావాల్సిన వ్యవసాయ పనులకు సంబంధించిన వాటిని ఒక గంట-రెండు గంటల పాటు చూసుకునేవారు. ఉదాహరణకు తాళ్లు పేనడం. మళ్లీ నాలుగు గంటల ప్రాంతంలో పెంట బండ్ల కార్యక్రమం మొదలయ్యేది. వెన్నెల రోజుల్లో రాత్రుళ్లు కూడా బండ్లు తోలేవారు. ఇలా తొలకరి జల్లులు కురిసే వరకు కొనసాగేది.

తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో దున్నడం, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన పెంటను తోలడం కొనసాగించేవారు. వేరు శనగ, అందులో కంది పంటలు వేసే వాళ్లు. చెరువులకు నీళ్లు రావడం జరుగుతే వరి నాట్లు వేసే వాళ్లు. ఆ తరువాత జొన్న పంట వేసే వాళ్లు.

వరి నాట్లు వేయడానికి ముందర పొలాన్ని మొదలు నాగళ్లతో, తరువాత బురద నాగళ్లతో దున్నడం జరిగేది. సాధారణంగా వరి నాట్లు మహిళలే వేసేవారు. పాటలు పాడుకుంటూ, హుషారుగా నాట్లు వేసేవారు. నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం జరిగేది. ఒక్కో సారి రాత్రుళ్లు పోయి వంతుల వారీగా నీళ్లు పెట్టే వాళ్లు. నీళ్లు సరిపోకపోతే పొలాలలో ఒక పక్కన కొంత లోతు వరకు తవ్వి, నీటిని తీసి చేది పోయడం జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలుగు నెలల తరువాత కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమయం చూసుకుని, వాతావరణం అనుకూలించినప్పుడు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇంటికి తోలడం జరిగేది. ఈ ప్రక్రియ జరిగినన్నాళ్లు వరి పొలంలోనే రాత్రుళ్లు నిద్రించే వాళ్లు. నాటు కూలి, కోత కూలి, ఇతర కూలి అంతా ధాన్యం రూపేణగానే. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా వుండేది.


ఇక వేరు శనగ పంట వ్యవహారం మరో విధంగా వుండేది. విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది. రైతులు ఇంటికి కూలి వాళ్లను పిలిచి, క్రితం సంవత్సరం పండిన వేరు శనగ కాయలను కొలిచి, వాటినుంచి విత్తులను తీయమని వాళ్లకు చెప్పే వాళ్లు. వాళ్లలో కొందరు తమ ఇంటికి తీసుకెళ్లి చేసేవారు, కొందరు రైతు ఇంట్లోనే చేసేవారు. సాయంత్రం కల్లా వాళ్ల-వాళ్ల సామర్ధ్యాన్ని పట్టి కుండెడో-రెండు కుండలో కాయ కొట్టి విత్తులను తీసే వాళ్లు. వాళ్ళకు కూలీ ధాన్యం రూపేణగానే ముట్టేది. విత్తులు తీసేటప్పుడు కొంత భాగం పప్పు అయ్యేది. ఆ పప్పుతో శనగ నూనె చేయించి ఇంట్లో ఉపయోగించే వాళ్లు. గ్రామాలలో వేరు శనగ ముఖ్యమైన పంట. వేరు శనగ కాపుకొచ్చాక కూలీలతో  పీకించి కొట్టిస్తారు. తయారైన కాయను "డబ్బాల" తో కొలిచి కూలీ నిర్ణయించేవారు. "డబ్బా" కు 16 "మానికలు". మానికంటే రెండు శేర్లు. డబ్బా కాయ కొట్టినవారికి మూడు "సోల" ల నుండి ఒక "మానిక" వరకు జొన్నలు కొలిచి కూలీగా ఇచ్చేవారు.

వర్షాలు పడగానే, భూమిని దున్ని అదను కుదిరినప్పుడు "ఎద" (విత్తనం) పెట్టే వాళ్లు. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. అతి క్లిష్టమైన ఈ ప్రక్రియ అందరికీ చేత కాదు. పైగా శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్దతి ప్రకారం ఎద పెట్టాలి. శనగ పంట ముందు చేతికొస్తుంది. ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. పై పాటు చేసే అరకలను అందరూ తోలలేరు. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగి పోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. అదెంతో ముచ్చటేసేది. మూడు నెలల తరువాత కూలి వాళ్లతో శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేయించే వాళ్లు. మరో రెండు నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా తెచ్చుకునే వాళ్లు.

ఇక మరో పంట జొన్న. వీటినే పచ్చ జొన్నలనే వాళ్లు. దీనికి కూడా ఎద పెట్టడం వుంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వాళ్లు. కూలీ కింద కట్టలనే ఇచ్చే వాళ్లు. ప్రతి ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది. ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పార బట్టడం, ధాన్యాన్ని ఇంటికి-మార్కెట్‌కు చేర్చడం జరిగేది. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది. అప్పట్లో వేసే పంటలన్నీ నియంత్రిత విధానంలోనే, పంటల మార్పిడి పద్ధతిలోనే వుండేవి.

ధాన్యం కొలవడానికి ఉపయోగించే "కుండ"లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" వూరి రైతుల్లో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే వుండేవి. కుండకు పదిన్నర మానికలు, మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు, తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు, సోలకు నాలుగు గిద్దెలు, ఇదీ కొలత. అలానే, ఐదు కుండలైతే ఒక "బస్తా" ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి" అవుతుంది. కొలత కొలిచేటప్పుడు కుండకు కాని, మానికకు కాని, తవ్వకు కాని, సోలకు కాని, గిద్దెకు కాని, ధాన్యం పూర్తిగా నిండి పై వరకు వచ్చే విధంగా పోయాలి. ఎడ్ల బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో కాని, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. ఆశ్చర్యకరమైన విషయం, పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది, కోట్లాది రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి వుండేది. ఏ రైతుకు కూడా అభధ్రతా భావం వుండకపోయేది.

ఈ పంటలకు తోడు మిరప తోట వేసే వాళ్లు కొందరు. మధ్యలో బంతి పూల చెట్లు వేసే వాళ్లు. తోటలలో మోట బావి వుండేది. మోట తోలడం కూడా కష్టమైన పనే. మోట తోలడానికి కట్టిన ఎద్దులను వెనుకకు నడిపించుకుంటూ, భావి ముందరకు తీసుకెళ్లాలి. భావిలో మోట బక్కెట్ (చాలా పెద్దగా వుంటుంది) పూర్తిగా మునిగి నీరు నిండే లాగా ఎద్దులను వెనక్కి తేవాలి. అప్పుడు మునిగి-నిండిన బకెట్ పైకి రావడానికి ఎద్దులను ముందుకు తోలాలి. బకెట్ కట్టిన తొండం లోంచి నీరు భావిదగ్గరున్న కాలువలో పడి ప్రవహించుకుంటూ మిరప చెట్లను తడుపుకుంటూ పోతుంది. మోట తోలడం సరదాగా కూడా వుంటుంది.

అలానే చాలా మంది పొగాకు పంట కూడా వేసే వాళ్లు. మరో తోటలో మొక్క జొన్న వేసే వాళ్లు. కొందరు దినుసు గడ్డలు, వుల్లి గడ్డలు కూడా సాగు చేసేవారు. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా పండించేవారు మరికొందరు. ఇక మామిడి తోట సరేసరి. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి. అవి అక్కడనే కొడవలితో కోసుకుని, మంచెపైకెక్కి కూచుని తినే వాళ్లు. జొన్న వూస బియ్యం కూడా కొట్టించుకుని, పలుకు రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినే వాళ్లు. చేనులో దొరికే పెసలు తినే వాళ్లు.

పండిన ప్రతిపంటలో కొంత భాగం, అవసరం మేరకు, విత్తనాల కింద ప్రత్యేకంగా తీసేవారు. ఇప్పటిలాగా విత్తనాలు కొనుక్కోవడం అప్పుడు లేదు. రసాయినిక ఎరువుల వాడకం, క్రిమి సంహారక మందుల వాడకం చాల తక్కువగా, దాదాపు, లేనట్లే వుండేది. ఎప్పుడైతే వాటి ఉపయోగం పెరిగిందో, సమాంతరంగా విత్తనాలు ప్రత్యేకంగా దాచిపెట్టడం వెనకడుగు వేయడం మొదలైంది. అధిక దిగుబడి వంగడాల ఉపయోగం పెరగడంతో విత్తనాలు కొనుక్కోవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడిక వేరే గత్యంతరం లేకుండా పోయింది.

ఇటీవల ముఖ్యమంత్రి చెప్పినట్లు మళ్లీ వెనకటి రోజులు రావాలి. ఎరువులు కానీ, క్రిమిసంహారక మందులు కానీ అతిగా వాడడం ఆగిపోవాలి. ఏ గ్రామానికి కావాల్సిన విత్తనాలు ఆ గ్రామంలోనే పండాలి. సీఎం సూచించినట్లు, వ్యవసాయ విస్తరణ అధికారుల సలహా మేరకు, ఏ భూమికి ఏ పంట అనువుగా వుంటుందో ఆ పంటనే వేయాలి. వ్యవసాయం లాభసాటి కావాలంటే నియంత్రిత విధానంలో పంటలు వేయడం తప్పనిసరి. (స్వానుభవం ఆధారంగా)

No comments:

Post a Comment