Friday, November 18, 2011

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి " ప్రాక్టీసుకు నేపధ్యం": వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 4

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి ప్రాక్టీసుకు నేపధ్యం

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో నాలుగవ అధ్యాయం ఇది).

రాధాకృష్ణమూర్తిగారిని దత్తత తీసుకున్న పెదనాన్న యలమంచిలి సీతారామయ్యగారు, బాగా చదువుకున్న వారే కాకుండా, సంఘ సంస్కర్త కూడా. దత్తత పోవడంతో తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ కాగలిగారు రాధాకృష్ణమూర్తిగారు. దరిమిలా అన్నతో సహా, తమ్ములను కూడా పైకి తీసుకో రావాల్సిన బాధ్యత ఆయనపై పడింది. ఆ బాధ్యత నేపధ్యంలో, ఎంబిబిఎస్ పూర్తయిన తర్వాత, వైద్యంలో ఉన్నత చదువులు చదివే అవకాశం లేకుండా పోయింది. రాధాకృష్ణమూర్తి ఎంబిబిఎస్ సహాధ్యాయులందరూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి, ప్రొఫెసర్స్ స్థాయికి ఎదిగిన వారే. 1950లో, ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో, ఆయన ఎంబిబిఎస్ చదువు పూర్తయింది. ఆయన చదువుకున్న కళాశాలలో అధ్యాపకులందరూ, బ్రిటీష్ వారు కాని, తమిళ, మళయాళీలు కాని వుండే వారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆ అధ్యాపకులందరూ, మద్రాస్ రాష్ట్రంలో వుండిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ కారణాన, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రొఫెసర్లుగా పనిచేయాలంటే, అవసరమైన పోస్టు గ్రాడ్యుయేషన్ చదువు కొరకు, దరఖాస్తు చేసుకున్న ప్రతి అభ్యర్థికి సీటు దొరికింది. అప్పట్లో ఉద్యోగం చేసుకుంటూ పీజీ చేసే అవకాశం కలిగించారు. కొందరిని, ప్రభుత్వమే ఖర్చులు కూడా భరించి, విదేశాలకు పంపించింది ఉన్నత చదువుల కొరకు. అలాంటి వారిలో ప్రఖ్యాత వైద్యులు, న్యూరో చికిత్స నిపుణులు డాక్టర్ బాల పరమేశ్వరరావును ఇంగ్లండ్ పంపించింది. రాధాకృష్ణమూర్తిగారి కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన, డాక్టర్ వెంకట రావును కూడా ఇంగ్లాండుకు పంపించింది అలానే. ఆయన ప్రధాన అనస్థటిస్టుగా ఉస్మానియా ఆసుపత్రిలో పని చేశారు. యలమంచిలి సహాధ్యాయులు, సీనియర్లు, జూనియర్లందరూ ప్రొఫెసర్లుగానో, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగానో, వైద్య శాఖ డైరెక్టర్ల గానో పనిచేశారు.

1950 డిసెంబర్‍లో ఎంబిబిఎస్, 1951-1952ల్లో హౌజ్ సర్జన్‍షిప్ పూర్తవుతున్నప్పుడు, తదుపరి ఏం చెయ్యాలనే ప్రశ్న వచ్చింది ఆయనకు. ఇంకా పై చదువు (ఎం. డి) చదివి, వైద్య కళాశాలలో పనిచేయాలనే కుతూహలం బలంగా వుండేది డాక్టర్ గారికి. అప్పుడు ఆయనకు సీటు లభించడం సమస్యే కాదు. కాకపోతే, 2,3 సంవత్సరాలు విశాఖ పట్నంలో సొంత ఖర్చుతో చదువుకోవాలి. అంత ఆర్థిక స్థోమత లేదు. భూస్వామి - భాగ్యవంతుడైన మామ గారు మౌనం వహించారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం వస్తే, అది చేసుకుంటూనే చదువుకునే అవకాశం వచ్చేది. కాని, ఇంకా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో, ఆ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఆరంభం కాలేదు.

ఆ సమయంలోనే, ఆర్మీలో షార్ట్ సర్వీస్ రెగ్యులర్ కమీషన్ కు పిలుస్తే ఢిల్లీ వెళ్లి, ఇంటర్వ్యూలో నెగ్గి, సెలెక్టయి వచ్చారు. పిలుపు కోసం వేచి వున్నారు. కలకత్తాలోని "స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్" లో సీట్ కొరకు దరఖాస్తు చేస్తే, డి.టి.ఎం లో సీటొచ్చింది. సదరన్ రైల్వే మెడికల్ ఆఫీసర్స్ కోసం ప్రకటన వస్తే, మద్రాస్ వెళ్ళి, సెలెక్టయ్యారు. అంతా ఒక చౌరాస్తాలాగ వుందప్పుడాయనకు. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో, తన అభిమాన ప్రొఫెసర్ డాక్టర్ అనంతా చారి గారిని సలహా కొరకు సంప్రదించారు. తన ప్రధమ ఆప్షన్ ఎం. డి చదవడంగా వుండాలన్నారు. ఆర్థిక స్థోమత లేదన్నారీయన. మిలిటరీ ఉద్యోగం అసలే చేయొద్దన్నారు. కలకత్తా డి.టి.ఎం కోర్సు తనకు చాలా చిన్నదని సూచించారు. ఇవేమీ కాకుంటే, తిన్నగా వెళ్ళి తనకు దగ్గరలో వున్న పట్టణంలో ప్రాక్టీసు పెట్టుకుంటే, మంచి ఫలితాలను సాధిస్తావని భరోసాగా - నమ్మకంగా చెప్పారు. ఇంకా రాష్ట్ర సర్వీస్ పై ఆశ పోని డాక్టర్ గారు, అప్పటికే పిలుపొచ్చిన రైల్వే సర్వీసులో, తాత్కాలికంగా చేరారు. మద్రాస్ పెరంబూర్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రిలో పోస్టింగ్ వస్తే చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సహాధ్యాయులు కూడా అక్కడే చేరారు. అక్కడి నుండి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ డిస్పెన్సరీ, ఆవడి డిస్పెన్సరీ, చివరకు ఆర్కోణం జంక్షన్ లో వున్న కాస్తంత పెద్ద డిస్పెన్సరీకి మార్చుకుంటూ వచ్చారు.

రైల్వే ఉద్యోగంలో వుండగా...అలనాటి అనుభూతులను, అప్పటి పరిస్థితులలో తనకు అనుభవంలో కొచ్చిన కొన్ని నగ్న సత్యాలను నెమరేసుకున్నారు డాక్టర్‌గారు. తాను అనుకున్న-కోరుకున్న ఉద్యోగం దొరకక అప్పటికి ఏదో ఒకటి లెమ్మని రైల్వే ఉద్యోగంలో చేరారు డాక్టర్‌గారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లాగానే, అప్పట్లో, ఉమ్మడి సదరన్ రైల్వే (ఇంకా దక్షిణ మధ్య రైల్వే ఏర్పడలేదు) ప్రధాన కార్యాలయం (మద్రాస్ పెరంబూర్ లో వుండేది) ఆసుపత్రిలో డాక్టర్‌గారు, ఆయన మిత్రుడు-క్లాస్ మేట్ కె. విశ్వనాథరావు ఏకకాలంలో రిపోర్టు చేశారు. వారి జీతం నెలకు రు. 200 +రు. 100 కరువుభత్యం. ఆ మొత్తంలో ఒక రూపాయి రెవెన్యూ స్టాంపుకు మినహాయించుకొని, చేతికి రు. 299 లు ఇచ్చేవారు. అప్పటికి మిత్రుడు బ్రహ్మాచారే. డాక్టర్‌గారు తప్పనిసరి బ్రహ్మచారి. ఇద్దరికీ వుండడానికి కాంపస్‌లోనే క్వార్టర్స్ ఇచ్చారు. అరవ హోటల్లో భోజనం 60 టికెట్ కూపన్ల పుస్తకానికి (ఒకేసారి కొంటే) రు. 55.

ఆసుపత్రిలో ఔట్ పేషంట్‍లో డ్యూటీ. వారికి అరవం బొత్తిగా రాదు. పేషంట్లంతా అరవంలోనే మాట్లాడేవారు. అటెండరే దుబాసీ. నెమ్మదిగా చిన్నచిన్న మాటలు అర్థం చేసుకోవడం మొదలైంది. "వైత్‍వరి"(వళ్లు నొప్పులు), "మారువలి"(ఛాతినొప్పి), "వాంగో, ఉకారు"(రండి, కూర్చోండి), ఎన్న, ఎంగి, అప్పడియా, పార్కలాం, ఇరికె పదాలతోపాటు భోజనానికి వెళ్లినప్పుడు అవసరమయ్యే మాటలను కూడా నేర్చుకున్నారు. సాపాటు, సాంబార్, కూట్, మోర్, మోర్ కొళింబి, పోరుం, వేండా లాంటి కొన్ని నేర్చుకోక తప్పలేదు.

డాక్టర్‌గారు మద్రాస్‌లో వుండగానే పొట్టి శ్రీరాములుగారి ఆమరణ నిరాహార సత్యాగ్రహ దీక్ష మొదలైంది. ఆయన ప్రాణత్యాగం (ఆంధ్రా నాయకుల మొండితనం) చూశామన్నారు. ఆ తరువాత జరిగిన సంతాప సమావేశాలు, ఆగ్రహావేశాలు, ప్రదర్శనలు మౌన సాక్షులుగా గమనించారు.

అవి "హిందీ-చీనీ భాయీ-భాయీ" అనుకునే రోజులు. అప్పట్లో (బహుశా) కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు, చైనా సాంస్కృతిక బృందం ఒకటి మిగతా నగరాలతోపాటు మద్రాస్‌కు కూడా వచ్చిందట. ఆ సందర్భంగా ఒక పెద్ద స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ప్రస్తావించారు. సంగీతం, నాటకం, నృత్యం, ఏక్రోబాటిక్స్ లాంటివెన్నో రెండు-మూడు గంటలపాటు అద్భుతంగా ప్రదర్శించారట. ప్రతి ఐటమ్‍కు, హాజరైన నలబైవేల మంది ప్రేక్షకులనుండి మిన్నంటే కరతాళ ధ్వనులు వినిపించాయట. వారు విముక్తి చెంది అప్పటికింకా నాలుగు సంవత్సరాలేనని, బహుశా వారి సాంస్కృతిక సంపదకు నూతన ప్రభుత్వం చాలా మెరుగులు దిద్ది వుండాలని అంటారు డాక్టర్‌గారు.

స్నేహితులిద్దరు కలిసి ప్రతిరోజూ సాయంత్రం బజారుకెళ్లేవారు. ఒకనాడు చైనా బజారు, ఒకరోజు మౌంటు రోడ్డు (ఇప్పటి అన్నాసలై), మరోనాడు ట్రిప్లికేన్ బీచ్‍లో తిరిగి, తరువాత సినిమా చూసి వచ్చే వాళ్లు. ఆ రోజుల్లోనే జరిగిన విదేశీ సినిమాల పనోరమా గుర్తుచేసుకున్నారు. పరుశువాకంలోని ఒక సినిమాహాలులో రెండు రోజులు ఇటలీ సినిమాలు, రెండు రోజులు జపాన్ సినిమాలు చూసే అవకాశం కలిగింది వారికి. వాటిలో ఇటాలియన్ ప్రసిద్ధ దర్శకుడు(Vittorio De Sica) తీసిన "బైసికిల్ థీఫ్", జపాన్ ప్రసిద్ధ దర్శకుడి(Akira Kurosawa) "రోషోమోన్" తనకిప్పకిటికీ జ్ఞాపకం వున్న మాస్టర్ పీసెస్‍ అన్నారు డాక్టర్‌గారు.

డాక్టర్‌గారి మిత్రుడు విశ్వనాధరావుది విజయనగరపు సనాతన బ్రాహ్మణ కుటుంబం. ఆయన మాత్రం మంచి మాంస ప్రియుడట. వారుండే అడ్డాలోని బుఖారీ హోటల్లో తినేవారు. కొన్నాళ్ల తరువాత ఆవడి డిస్పెన్సరీకి, ఆ తరువాత మరో వూరు ఆర్కోణం జంక్షన్‌కు డాక్టర్‌గారిని ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ డాక్టర్‌గారికంటే సీనియర్ అసిస్టెంట్ సర్జన్ ఒకరుండేవారు. ఆయన తమిళ బ్రాహ్మణుడు. మంచి వ్యక్తి. కానీ వ్యవస్థలోని లోటుపాటులకు అలవాటు పడిపోయారట. ఆయన దగ్గర కొచ్చే పేషంట్లు చాలామంది లీవ్ సర్టిఫికేట్ కోసమే వచ్చేవారట. రైల్వే ఉద్యోగంలో పెళ్ళికైనా-చావుకైనా శెలవులు దొరకడం కష్టమట. అందుకోసం డాక్టర్ సర్టిఫికేట్లకు గిరాకీ. ఐదు రూపాయలు కాగితం బల్లమీద పెట్టి అడిగేవారు. డాక్టర్‌గారికి అది చూస్తే చాలా అసహ్యమనిపించేది. ఇక జూనియర్ డాక్టర్ "ఆన్ కాల్ డ్యూటీ” లో వుండేవారు. అవసరమొచ్చినప్పుడల్లా బయటకెళ్లాలి. ఆర్కోణం స్టేషన్‌కు టెలిగ్రాం వస్తుందట. ఫలానా స్టేషన్ వున్న వూళ్లో రైల్వే క్వార్టర్స్ లో ఫలానా ఉద్యోగికి సుస్తీగా వుందని దాని సారాంశం. వెంటనే అటెండ్ కమ్మని, రాత్రయినా-పగలైనా, ఏ రైలు దొరికితే అది పట్టుకుని, ఏదీ లేకపోతే గూడ్సు బండైనా ఎక్కి వెళ్లాల్సి వుండేదట. చాలా సార్లు వెళ్లారట కూడా. తీరా అక్కడకు వెళ్లిన తరువాత, పేషంటుగా కనిపించాల్సిన వ్యక్తి లుంగీ సర్దుకుంటూ, తలుపు తీసి దర్శనం ఇచ్చేవాడు. నవ్వుకుంటూ, పది రూపాయల నోటు జేబులో పెట్టి, "శెలవు కావాలి సార్" అని అడిగేవాడు. అది చాలా ఇబ్బందికరంగా వుండేదట. ఇవన్నీ చెప్పి, ఏం చెయ్యాలని సీనియర్‌ను అడిగితే, "ఎడ్జెస్ట్ అవడం ఇద్దరికీ మంచిది" అని సమాధానం వచ్చేది. డాక్టర్‌గారు రాజీనామా కాగితం పంపితే, డి.ఎం.ఓ వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. ఇక తన వల్ల కాలేదన్నారు. ఉద్యోగంనుంచి వైదొలగారు. డాక్టర్‌గారితో పాటు చేరిన వారి క్లాస్ మేట్స్ విశ్వనాధరావు, సత్యనారాయణ దక్షిణ మధ్య రైల్వేలో మంచి ఉన్నత స్థాయిలో, రైల్వే లాలా గూడా ఆసుపత్రిలో పదవీ విరమణ చేశారు.

"ఎడ్జెస్ట్ కాకపోతే ఎక్కడైనా సరే ఇబ్బందులు తప్పవు అని చెప్పిన ఆ పాఠం ఇప్పటికీ నాకు ఒంటపట్టలేదు" అంటారు డాక్టర్‌గారు.

రైల్వే ఉద్యోగంలో వుండగానే, రాష్ట్ర సర్వీస్ కమీషన్ మెడికల్ ఆఫీసర్స్ సెలక్షన్ కు పిలిచారు. కాని ఆయన విషయంలో పోలీసు రిపోర్టు సెలక్షన్‍కు అడ్డుపడింది. ఆ నాడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఆంధ్ర జిల్లాలుండేవి. రాష్ట్ర ముఖ్య మంత్రిగా శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారి వుండేవారు. ఆయన కమ్యూనిస్టులను తన మొదటి శత్రువు గాను, పి.డబ్ల్యు.డి శాఖ వారిని రెండో శత్రువు గాను వర్ణించేవారు. రాధాకృష్ణమూర్తి గారు తన మెడిసిన్ నాలుగో సంవత్సరంలో వుండగానే (1949) అరెస్టు కాబడి, కమ్యూనిస్ట్ గా ముద్రపడి వున్నాడు. ఆ రికార్డంతా ప్రభుత్వం దగ్గర, సెలక్షన్ కమిటీ దగ్గర వుంది. ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు సర్జరీ ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ రమణమూర్తి గారే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా వున్నారు. ఐనా ఆశ ఆవిరైపోయింది. రైల్వే ఉద్యోగం నచ్చలేదు. రాజీనామా చేసి, డాక్టర్ గారు, భార్య సరళా దేవి, ఒకటిన్నర సంవత్సరాల వయసున్న కూతురు నిర్మలతో ఖమ్మం పట్టణానికి వచ్చి, ప్రయివేట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.

గాంధీ చౌక్‍లో, గాంధీ విగ్రహానికి సరిగ్గా ఎదురుగా వుండే ఒక బంగళాలో, క్రింద పోర్షన్ లో క్లినిక్ పెట్టుకునేందుకు, నెలకు రు. 25 అద్దెకు కుదిరింది. సరిగ్గా అదే బంగళాపైన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయం వుండేది. ఆ భవనం షరాబు మల్లయ్య గారనే స్థానిక వైశ్య ప్రముఖుడి ది. ఆయన గారు అప్పటికే వయసులో చాలా పెద్దవారు. వారి పెద్దబ్బాయి రామ్మూర్తి డాక్టర్ గారిలాగానే దత్తుడు. పెద్దాయన ప్రేమ, రామ్మూర్తి స్నేహం యలమంచిలిని ఎంతగానో ఉత్సాహపరిచింది. వుండడానికి, మామిళ్లగూడెంలో లక్ష్మారెడ్డి గారి డాబాలో, ఒక పోర్షన్ దొరికింది. వీరు తీసుకున్న పక్క పోర్షన్ లో, స్థానిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న యలమాటి సిద్దయ్య గారి కుటుంబం వుండేది. ఆయన చాలా గౌరవనీయులు. అందరికీ సహాయపడే స్వభావం కల వ్యక్తి. మంచి కుటుంబ నేపధ్యం. వారి కుటుంబంతో రాధాకృష్ణమూర్తి కుటుంబానికి అప్పుడేర్పడిన సాన్నిహిత్యం, నేటికీ కొనసాగడం ఒక ప్రత్యేకతగా చెప్పారాయన. వారి పెద్దబ్బాయి విద్యాసాగరరావు, తర్వాత డాక్టరై, ఉస్మానియా ఆసుపత్రిలో సర్జన్‍గా పని చేసి రిటైర్ అయ్యారు. రెండవ కుమారుడు సత్యనారాయణ ఇంజనీరింగ్ చదివి, అమెరికాలో పి హెచ్ డి చేసి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేసి, మంచి పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకుని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. కూతుళ్లు కొందరు అమెరికాలో, కొందరు దేశంలో స్థిరపడ్డారు. లక్ష్మారెడ్డి గారింట్లో అద్దెకున్న కొద్ది మాసాల్లో, సిద్దయ్య గారి కుటుంబం యలమంచిలి యువ దంపతుల మీద కనబరిచిన ఆప్యాయత-సహాయం మరువలేనిదంటారాయన.

మామిళ్లగూడెం ఇల్లు క్లినిక్‍కు దూరం అనిపించింది. ఆ రోజుల్లో ఖమ్మంలో రిక్షాల సౌకర్యం కూడా లేదు. ఒకటి-రెండు గుర్రపు బగ్గీలు మాత్రం వుండేవి. క్లినిక్‍కు వెళ్లి రావడం ఇబ్బందిగా వుండేది. దగ్గరగా వుండేందుకు, డాబాల బజారులో, మొదటి బిల్డింగైన, నోముల రాజయ్యగారింట్లో, పై అంతస్తులో, ఒకటిన్నర గదుల చిన్న పోర్షన్‍కు మారారు. డాక్టర్‍గారి పెద్ద కుమారుడు రాంకోటేశ్వరరావు 1953లో, చిన్న కుమారుడు రవీంద్రనాథ్ 1955లో అక్కడ వీరుండగానే కలిగారు. నెలకు రు. 21 అద్దె ఇచ్చే వారు. ఎందుకో తెలియదు గాని, రాజయ్యగారికి, డాక్టర్‍గారి కుటుంబం మీద ప్రత్యేకమైన అభిమానం వుండేది. ఏ చిన్న సదుపాయం కావాలన్నా నిమిషాలలో చేయించి పెట్టేవారు. వీరుండే ఇంట్లోనే, పక్క పోర్షన్లలో తూము హైమావతమ్మ గారు, వారి తోటి కోడలు, ఆర్టీసి ఉద్యోగి రంగారావు గారు, ఇండియన్ బాంక్ ఉద్యోగి కుటుంబం వుండేవారు. "మేమంతా కలిసి మెలిసి ఎంతో ప్రేమగా వుండేవారమని" చెప్పారు డాక్టర్‌గారు. 1957లో ఇప్పటి సొంత ఇంటికి మారారు. 1960లో ఇప్పటి ఆసుపత్రి భవనంలోకి మారారు.

"నా సహచరులూ, నా కింద పనిచేసేవారూ, నా ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తరువాత నేను దిగ్భ్రాంతి చెందాను. నేను అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకునేవాడిని’ అనుకుంటూ వుండేవాడిని. కాని, నా కింద పనిచేసేవారు, ’నేను ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వ్యవహరిస్తానని’ అనుకునేవారు. నేను అందరినీ స్వేచ్ఛగా మాట్లాడనిస్తానని అనుకునేవాడిని. కాని, నా బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడేవారిని అడ్డుకుంటానని నా సహచరులు అనుకునేవారు. ఇలా నేను నా బలాలుగా ఏ ఏ అంశాలుగా భావించానో, అవన్నీ నా బలహీనతలుగా తరువాత బయట పడ్డాయి" - ఆర్. గోపాలకృష్ణన్ "టాటా రిఫ్లెక్షన్స్" - ఏ మేనేజర్ గివ్స్ హిజ్ ఎక్స్ పీరియెన్సెస్: బుక్ - "వెన్ ద పెన్నీ డ్రాప్స్" లో…..

No comments:

Post a Comment