Monday, November 28, 2011

ఎవరు హంతకులు? విప్లవకారులెవరు? కమ్యూనిస్టులంటే మావోయిస్టులేనా?: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (4-12-2011)
ఎవరు హంతకులు? విప్లవకారులెవరు?

కమ్యూనిస్టులంటే మావోయిస్టులేనా?

వనం జ్వాలా నరసింహారావు

మరో విప్లవ తార రాలిపోయింది. మల్లోజుల కోటేశ్వరరావుకు సొంత వూరు "పెద్దపల్లి” తో సహా యావత్ విప్లవ భారతావని లాల్‌ సలాం పలికింది. కిషన్‌ జీ అంతిమ యాత్ర శోక సముద్రాన్ని తలపించింది. సద్భ్రాహ్మణ వంశంలో జన్మించిన ఆయనకు విప్లవ సంప్రదాయంలో అంత్యక్రియలు జరిగాయి. పలువురు కామ్రేడ్సు‍తో సహా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కిషన్‌జీకి నివాళి అర్పించింది. మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీని చిత్రహింసలు పెట్టి చంపివేశారా? లేక అవి కేవలం ఆరోపణలేనా? అధికారికంగా ఆయనది బూటకపు ఎన్‌కౌంటర్ కాదనేందుకు నిదర్శనంగా ఆయన పోస్టుమార్టం నివేదికలోని ముఖ్యమైన అంశాలను బహిర్గతం చేసింది ప్రభుత్వం. భద్రతా బలగాలను ఎదుర్కొనే క్రమంలో జరిగిన కాల్పుల్లోనే కిషన్‌ జీ మరణించినట్టు ఆ నివేదిక సారాంశమట.

కిషన్‌ జీ మృతిపై, ప్రజా సంఘాల ఆరోపణలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తనదైన శైలిలో దీటుగా సమాధానమిచ్చారు. ఎన్‌కౌంటర్‌ను తప్పించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనీ, లొంగిపోయేందుకు ఆయనకిచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదని, మావోయిస్టు నేతలు తుపాకిలు దించలేదని, మూడురోజులు ఎదురుచూసినా స్పందన లేదనీ, పోలీసు బలగాలపై ఎదురు దాడికి దిగడంతో గత్యంతరం లేక ఎన్‌కౌంటర్ చేయక తప్పలేదనీ వివరణ ఇచ్చింది. పైగా బలగాల పైకి ఆ మూడు రోజుల్లో వెయ్యి రౌండ్లకు పైగా కాల్పులు జరిపారని కూడా మమత పేర్కొంది. మరో అడుగు మందుకు పోయి. కిషన్‌ జీ ఎన్‌కౌంటర్‌తో "వందలాది మంది అమాయక ఆదివాసీల ప్రాణాలు" పోకుండా రక్షించడం జరిగిందని కూడా ఆమె అన్నారు. కిషన్‌ జీ నేతృత్వంలో సమావేశమైన మావోయిస్టులు రాష్ట్రంలో భారీ ఎత్తున విధ్వంసకాండ సృష్టించేందుకు సిద్ధపడ్డారని ఆమె ఆరోపించింది. మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలని చూస్తున్నవారి కలలు నెరవేరవని, విప్లవోద్యమ నాయకత్వాన్ని దేశ భవిష్యత్తు కోసం భావి తరాలు కాపాడుకోవాలని, మావోయిస్టు నాయకులు ఎన్‌కౌంటర్‌కు ప్రతిగా స్పందించారు.

ఈ నేపధ్యంలో ఒక్క సారి గతంలోకి తొంగి చూసి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగవచ్చనే అంశాలపై దృష్టి సారిస్తే మంచిదేమో!

కిషన్‌ జీ

పశ్చిమబెంగాల్ లో మొదటి కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర మాసాలకే, ప్రజా విముక్తి యుద్ధం అనే పేరిట ఒక నినాదాన్ని పశ్చిమబెంగాల్, డార్జిలింగ్ జిల్లా నగ్జల్బరీ ప్రాంతంలోని గిరిజన రైతాంగంలో పనిచేసే కిసాన్ కార్యకర్తల (“కమ్యూనిస్టు విప్లవకారులు”) గ్రూపొకటి లేవదీసింది. వారు మావో-సే-టుంగ్ ఆలోచనా ధోరణిని అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ, భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీపైన, కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటన ప్రభుత్వంలో పనిచేయాలన్న దాని రాజకీయ విధానంపైన తిరుగుబాటు చేశారు. పార్టీ విప్లవానికి ద్రోహం చేసిందని వారు ఖండించారు. గ్రామీణ విముక్తి ప్రాంతాలను ఏర్పరచి, ప్రజా విముక్తి సైన్యాన్ని నిర్మించేందుకు తాము రైతాంగ గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించినట్లు వారు ప్రకటించారు. రైతాంగ విముక్తి యుద్ధాన్ని ప్రారంభించి, దాన్ని నడపడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని వారు స్పష్టంగా చెప్పారు. సాయుధ గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాలనే తమ ఎత్తుగడలను సమర్ధించుకొనే రాజకీయ థీసిస్‌ ప్రతిపాదించారు. భారతదేశం అమెరికా వలస దేశంగా మారిపోయిందని, ప్రభుత్వం అమెరికా తొత్తని, పరిస్థితులు సాయుధ విప్లవానికి పరిపక్వమై వున్నాయని, భూస్వాముల పైన- ప్రజా పీడకులపైన సాయుధ దాడులు చేస్తే జనసామాన్యం ఉత్తేజం పొందుతుందని, "మావో ఆలోచనా విధానం" అనుసరించాలని చెప్పింది నాయకత్వం. విప్లవంలోకి అనేకమంది సమరశీల విద్యార్ధులను, యువకులను, పెట్టి బూర్జువా మేధావులను ఆకర్షించగలిగారు.

నక్సల్‍బరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి చాలా మంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. రాష్ట్రస్థాయిలో పార్టీని వీడి నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖులలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి ముఖ్యులు. రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో. పలువురు విద్యార్థి నాయకులు, గ్రామ-పట్టణ నాయకులు, ఆ ఉద్యమంలోకి వెళ్లకుండా వుండలేకపోయారు.

నక్సలైట్ మాతృ సంస్థ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆదిలోనే చెప్పినట్లు, నక్సలైట్ ధోరణి అతివాద దుందుడుకు విధానంగా మారలేదా? పెట్టి బూర్జువా విప్లవ తత్వంగా పరిగణించకూడదా? నక్సలైట్లలో చిత్తశుద్ధి, విప్లవ సాధన పట్ల సదుద్దేశాలున్న వారు అనేకమంది వుండవచ్చు. అంతమాత్రాన, నక్సలైట్ ఉద్యమం అరాచకమైనదని, వ్యక్తిగత హింసావాదమని అనడంలో తప్పేమైనా వుందా? ఏమో! నక్సలైట్ల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించిన ప్రతి ఒక్కరికి రైతాంగ గెరిల్లా యుద్ధమని, వ్యవసాయ విప్లవమని, ప్రజా యుద్ధమని మాట్లాడిన మాటలు ఆచరణలో పూర్తిగా కాకపోయినా కొంతైనా బూటకమని బహుశా తోచక మానదు. పలువురు సంచరించే ప్రదేశాలలో బాంబులను వేయడం, మందుపాతరలను పట్టడం, కనీసం అడపాదడపానన్నా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవడం, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్ధి, యువజన, కిసాన్, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలను హత్య చేయడం, పోలీస్ వారిని, సివిలియన్ ఆఫీసర్లను చంపడం, ఏదో కారణాన ఎవరినైనా చంపడానికి సిద్ధపడటం, కారణాలు ఏమైనా, చాలా సార్లు జరగడం వాస్తవమే కదా! ఎంతమంది కార్మికులను, కర్షకులను వారు ఉత్తేజపరచగలిగారు?

నక్సలైట్ల తత్వాన్ని, రాజకీయాలను, వారి ఆచరణను గుడ్డిగా సమర్థించేవారు, తీవ్రంగా వ్యతిరేకించేవారు వున్నారు. కాకపోతే, వారు అవలంబిస్తున్న హింసా మార్గానికి మద్దతు ఇచ్చేవారు అతికొద్ది మంది మాత్రమే! అయితే, ఈ ఉగ్రవాద, అతివాద, తీవ్రవాద ఆలోచనా విధానం కేవలం భారతదేశానికే పరిమితమైన వ్యవహారం కాదు. సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ తీవ్రవాదం విభిన్న ధోరణులలో తలెత్తడం తెలిసిన విషయమే. అతివాద ధోరణికి ప్రజల నిరాశ, నిస్పృహలే కారణమైనప్పటికీ, ఈ ధోరణికి మధ్యతరగతికి చెందిన కొన్ని వర్గాల ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ, ఆ ధోరణి పొరపాటు కావచ్చనీ, అశాస్త్రీయం కూడా కావచ్చనీ, విస్మరించరాదు. విప్లవ కార్మికోద్యమానికి కూడా అంతో-ఇంతో హానికరం కూడా కావచ్చు. తీవ్రవాదుల్లో (నక్సలైట్లలో, మావోయిస్టులలో) అనేకమంది సదుద్దేశ్యాలున్న వారు, త్యాగ ధనులు, నిస్వార్ధపరులైన వ్యక్తులు వుండవచ్చు. విప్లవం పేరిట వారు సాగించే సాహస చర్యలకు మధ్యతరగతి ప్రజల్లోని కొన్ని వర్గాల హర్షామోదాలుండవచ్చు. అంతమాత్రాన వారు చేస్తున్న ప్రతి పనీ (హింస) సరైందని అనడం తగదు. వ్యక్తులుగా-దళాలుగా ఏర్పడి, హింసాత్మక సంఘటనలకు పాల్పడడం వలన జనసామాన్యాన్ని పీడన, దోపిడీ, సాంఘిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఎదురు తిరిగేందుకు ఉత్తేజ పరచడానికి బదులు, సామాన్య ప్రజల, ప్రజాతంత్ర ప్రజల ఏవగింపులకూ, తీవ్రమైన నిరసన భావానికి గురౌతున్నాఏమో అనిపిస్తోంది.

ఈ నేపధ్యంలో, భారత దేశంలో పరిస్థితులు విప్లవానికి అనుకూలంగా లేవని, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు లేవని, చైనాను భారత దేశంతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్‌ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్టాలిన్ స్పష్టం చేసిన విషయం గమనించదగ్గది. భారత (నెహ్రూ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్. మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

భారత-సోవియట్ ప్రతినిధి వర్గాల మధ్య జరిగిన చర్చల వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. అందులోని విషయాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ(లు) అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్సలైట్లుగా, మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగే యులుగా, మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి.

డాక్యుమెంటులో అనేక విధానపరమైన ప్రశ్నలు కూడా వున్నాయి. భారత దేశంలోని రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? సాయుధ పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత దేశంలోని పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. భారత దేశం ఇంకా ఆ దశలకు చేరుకోలేదని ఆయన అభిప్రాయం. సామ్రాజ్యవాదమంటే ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, “జాతీయ బూర్జువాలకుఅది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం చేయాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయవద్దని హెచ్చరించాడు. పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

సాక్షాత్తు కమ్యూనిస్ట్ అగ్రనేత స్టాలిన్ స్థాయి నాయకుడే అలా అభిప్రాయపడ్డాడే. అలాంటప్పుడు, ఇంకెంత కాలం, ఇలా మావోయిస్టులు తమ విప్లవ పంథాను విడనాడకుండా ఇతరుల ప్రాణాలను తీస్తూ, తమ ప్రాణాలను కోల్పోతారు? దీనికి అంతం లేదా? పరిపూర్ణ నిబద్ధతతో పాటు, మనసా వాచా కర్మణా, మావోయిస్టు సిద్ధాంతాలను అనుసరించి అసువులు కోల్పోయిన వారే కాకుండా, ఆ మార్గమే సరైందని గుడ్డిగా నమ్మి ప్రాణాలను కోల్పోయిన అమాయక కామ్రేడ్సులు కూడా చాలామంది వున్నారు. ప్రపంచంలో సిద్ధాంత ధోరణులు మారుతున్నాయి. సమసమాజం ఏర్పడడానికి విప్లవ మార్గమొక్కటే ఏకైక మార్గమనే రోజులు పోతున్నాయి. ప్రధమ కమ్యూనిస్టు దేశమే మరో దిశగా పయనిస్తోంది. విప్లవమార్గం మినహా మరో దారిలో సమానత్వం సాధించలేమను కోవడం మూర్ఖత్వం కాదా? ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

మూడు-నాలుగు దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్ నక్సల్‍బరీ ఆరంభమైన వామపక్ష తీవ్రవాద ఉద్యమం, ఆంధ్ర ప్రదేశ్ కు పాకింది. అల నాడు సైద్ధాంతికంగా ఉద్యమంపట్ల ఆకర్షితులైన వారు కొందరైతే, తరువాత కాలంలో మరికొందరు మరెన్నో కారణాలవల్ల ఉద్యమంలో చేరారని ఆరోపణలున్నాయి. వీరిలో ఉద్యమంలో ఇమడలేనివారు జనజీవన స్రవంతిలో కలిశారు. వారిలో కొందరు ప్రభుత్వంద్వారా లబ్ది పొందారు. మరికొందరు ప్రాణాలను కోల్పోయారు. కారణాలేవైనా ఉద్యమం అప్పుడు-ఇప్పుడూ ఒకరకంగా ప్రస్థానం సాగించడంలేదనేది వాస్తవం. ప్రజా ఉద్యమాలు, విప్లవాలు, తిరుగుబాటులు, ప్రపంచ చరిత్రలో వలస వాద-సామ్రాజ్యవాద-నిరంకుశ ప్రభుత్వాలను కూల్చివేసిన-మార్చివేసిన సందర్భాలు అనేకం వున్నాయి. ఐతే, వాటి స్థానంలో అధికారంలో కొచ్చిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలా? నిరంకుశ ప్రభుత్వాలా? అని ప్రశ్నించుకుంటే, సమాధానం ఇదమిద్ధంగా ఇదేనని రాదు. ప్రజాస్వామ్యంలో కూడా "పీపుల్స్ డెమొక్రసీ" అని, "పార్లమెంటరీ డెమొక్రసీ" అని, "ప్రెసిడెన్షియల్ డెమొక్రసీ" అని వివిధ రకాలున్నాయి. ఇంకా అనేక పేర్లతో పిలిచే ప్రజాస్వామ్యాలూ వున్నాయి. ఏదేమైనా ప్రజాస్వామ్యం అంటే "ప్రశ్నించే హక్కు" గల పరిపాలన అనడంలో తప్పులేదు. ఐతే ఆ ప్రశ్నించే హక్కును సద్వినియోగం చేసుకోవాలా? దుర్వినియోగం చేసుకోవాలా? అని ఆలోచించాలి.

విప్లవాల పేరిట, ఉద్యమాల పేరిట, తిరుగుబాటు నెపంతో, అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చా? అస్థిరత కలిగించవచ్చా? హింసలకు, ప్రతి హింసలకు వారో-వీరో పాల్పడితే నష్టపోయేది సామాన్య ప్రజలే!

2 comments:

  1. జ్వాలా నరసింహారావు గారూ,
    మళ్లీ ఇక్కడ కలుస్తున్నాం. మీరు నెల్లును పొల్లును వేరు చేస్తూ చాలా సంయమనంగా హింస ప్రతి హింసలపై తీర్పు చెబుతూ చక్కటి వ్యాసం రాశారు సంతోషం.

    కాని స్టాలిన్ భారతీయ కమ్యూనిస్టులను పిలిపించి చెప్పినవి మీరు ఉటంకిస్తున్నప్పుడు వాళ్లకు స్టాలిన్ చెప్పనివి కూడా మీరు పేర్కొని ఉంటే బాగుండేది. నాకు తెలిసిన వి కొన్ని మీ ముందుకు తీసుకు వస్తానండి

    స్టాలిన్ పరిమితమైన తెలంగాణా ప్రాతంలో భారత సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చెయ్యవద్దని, గొరిల్లా యుద్ధం వద్దని చెప్పి ఉంటారనడంలో సందేహం లేదు. కాని ఆయన సాయుధ పోరాటాన్ని తుంగలో తొక్కి పార్లమెంటు, అసెంబ్లీల్లోకి దూరిపోమ్మంటూ సలహా ఇచ్చినట్లు నేనెక్కడా చదవలేదండి. కార్యకర్తలు ఎత్తిన కాడిని కిందికి దింపించి చింతపండు వ్యాపారమూ, కాస్త నాజూకుగా పొగాకు వ్యాపారమూ చేసుకోమని స్టాలిన్ చెప్పినట్లు లేదండి. ప్రజాకళారూపాలకు ప్రాణం పోసిన మేటి కళాకారులను సినిమాల్లోకి చేరిపోయి బతుక్కోమని కూడా ఆయన ఎక్కడా అన్నట్లు లేదండి.

    బూర్జువా పార్టీలతో సమానంగా లేక పోటీగా, రాజసౌదాల వంటి కార్యాలయ భవనాలను, గ్రంధాలయ భవంతులను నిర్మించుకుని ఊరేగమని కూడా స్టాలిన్ ఎక్కడా చెప్పలేదండి. రాష్ట్రంలో, దేశంలో కూడా ఎవరికీ సాధ్యం కానంత నేర్పరితనంతో షాపులు పెట్టుకుని పుస్తకాల వ్యాపారం చేసుకుని బతకమని కూడా స్టాలిన్ ఎప్పుడూ చెప్పినట్లు నేను చదవలేదండి..

    పార్లమెంటులో నాలుగు సీట్లు, అసెంబ్లీలో రెండు సీట్ల కోసం 'బాబు' పార్టీలతో, అమ్మ, అయ్య పార్టీలతో దశాబ్దాలుగా అంటకాగమని స్టాలిన్ ఎక్కడా చెప్పలేదండి..

    ముఖ్యంగా హింసలకు ప్రతిహింసలకు వారో వీరో పాల్పడితే నష్టపోయేది సామాన్య ప్రజలే అంటూ అసలు సిసలు జర్నలిస్టిక్ నైపుణ్యంతో నడుస్తున్న చరిత్రపై తీర్పులు చెప్పే రోజులు వస్తాయని కూడా స్టాలిన్ ఎక్కడా చెప్పినట్లు నేను చదవలేదండి.

    ఇవన్నీ స్టాలిన్ ఎక్కడైనా, ఏ సందర్భంలో అయినా చెప్పి ఉన్నట్లు చూపిస్తే నా వ్యాఖ్యలోని ప్రతి అక్షరాన్ని ఉపసంహరించుకుంటానని మీకు మాట ఇస్తున్నానండి.

    మీరు నాకు మిత్రులు. సందేహం లేదు. కాని మీరు రాసిన ఈ వ్యాస సారాంశం మాత్రం నాకు మిత్రురాలు కాదండి.

    క్షమాపణలండీ.

    (ఈ వ్యాఖ్యను సుజనరంజని లో పోస్ట్ చేయాలని చూస్తే అక్కడ ఎందుకో అనుమతించలేదు. అందుకే నేరుగా మీకే పోస్ట్ చేస్తున్నాను.)

    రాజు.
    ఎవరు హంతకులు? విప్లవకారులెవరు? కమ్యూనిస్టులంటే మావోయిస్టులేనా?
    http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan12/vanam.html

    ReplyDelete
  2. ఈ ఉద్యం వెనుక నక్సలైట్లు వున్నారని ఏ కొంచం రాజకీయ అవగాహన వున్న ఏ వ్యక్తైనా చెప్పగలడు.. ఇది ముమ్మాటికీ నిజం ... ఈ ..తెలంగాణాను వారి
    షెల్టర్ జోన్ గా వుపయోగించుకొనేందుకే వారి ప్రయత్నం అని ఇట్టే అర్ధమై పోతుంది.. దేశం ముందుకు వెళ్ళాలనే వూపు మీద వున్నప్పుడు కాళ్ళుపట్టుకొని కిందకు గుంజే వారే నక్సలైట్లు.. ( వాళ్ళు తమని మావోఇస్టులు అని పిలవమన్నారని మనం మావోయిస్టులు అని పిలిచి గౌరవించాల్సిన పని లేదు.. మనుషులు ప్రశాంతంగా జీవించటం వీళ్ళకు ఇష్టముండదు.. నిత్యం సమస్యలు వుండటమే వీళ్ళకు కావల్సింది.. వీళ్ళు కోరుకొనే లోకం ప్రపంచం లో ఎప్పుడూ ఎక్కడా సాధ్యం కాదు.. ప్రజలారా ఒక్క సోంపేట విషయం లోనే వీళ్ళ పిల్లిమొగ్గలు గమనించండి.. ( సోంపేట ఉద్యమం వెనుక మేమున్నామని వీళ్ళు బాహాటంగానే అంగీకరిస్తారు.. ) ఒక ప్రాంతం లోని ప్రజలు స్థిర ఆదాయాలతో అభివృద్ధి చెందాలంటే పారిశ్రామీకీకరణ తప్పనిసరి అని వీళ్ళు
    గుర్తించమంటారు.. సరే .. గుర్తించాము.. అందుకే సోంపేట లో పరిశ్రమ పెట్టాలనుకున్నాము.. అంతే.. ఇక వీళ్ళకు కావలసిన సమస్యల ముడి సరుకు దొరికినట్లే.. స్థళ సేకరణ దగ్గరనుండి.. స్థానిక ఉద్యోగ అవకాశాల వరకు పెట్టని పేచీ అంటూ వుండదు.. వాటన్నిటికీ తగు సమాధానమిచ్చినా పర్యావరణ సమస్యలు లేవనెత్తుతారు.. నిజమే పర్యావరణం కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మానవుడిపై వున్నది ..ఇది ముమ్మాటికీ సత్యం.. అంటే పరిశ్రమలు పెట్టే చోట జనసాంద్రత తక్కువగా వుండాలి.. పరిశ్రమల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బ తినరాదు.. అలాంటి చోటే పరిశ్రమలు పెట్టాలి.. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఈ
    లక్షణాలన్నీ సమన్వయ పరిచి చూడండి.. ఇప్పటి దాకా ఈ రాస్ట్రం లో జరిగింది వీళ్ళు చెప్పే వాస్తవ సిద్ధాంతమే.. సహజం గానే తీరాంధ్ర ప్రాంతం లో జనసాంద్రత ఎక్కువగా అదేసమయం లో వ్యవసాయ యోగ్య భూములు ఎక్కువగా వుంటాయి..అందువల్లనే తీర ఆంధ్ర ప్రాంతం వ్యవసాయానికి ఆలవాలమై తెలంగాణా ప్రాంతం పరిశ్రమలకు నిలయ మైనది.. అలా పరిశ్రమలు కేంద్రీకరింపబడ్డ తరువాత ఇప్పుడు అక్కడినుండి వెళ్ళగొట్టాలనే వాదనకూ వీళ్ళే నాయకత్వం / కతృత్వం వహిస్తారు.. సరే మంచో చేడో ..మా ప్రాంతం లో మేం పరిశ్రమలు పెట్టుకుంటాం అంటే అడ్డం కొట్టటానికి వీళ్ళే ముందుంటారు.. గమ్మత్తేమంటే రాజకీయనాయకులు ప్రాంతాల వారీగా చీలినా వీళ్ళల్లో చీలిక రాలేదు.. తెలంగాణా వాదులు చెప్పినట్లు సీమాంధ్రులు నీటి దొంగలే అనుకుందాం.. ఆదొంగతనం చేసి తెచ్చిన నీళ్ళు ఓ లగడపాటో, రాయపాటో, మేకపాటో ముడ్డి కడుక్కోలేదుగా.. పొలాల మీదకు పారించారు.. అంటే ఇక్కడున్న పేద వ్యవసాయ కూలీలకు పని దొరికింది.. రెండుపుటలా తిండి దొరుకుతున్నది.. అదే
    వీళ్ళ బాధ.. నిజంగా సీమాంధ్రా నక్సలైట్లకు ఈ ఙాఞం వుంటే తెలంగాణా లో ఈ ఉద్యమం ఇంత తీవ్రమయ్యేది కాదు.. ఎవడ్రా వీళ్ళను దేశద్రోహులు కాదనేది.
    naagini...

    ReplyDelete