Saturday, November 19, 2011

రెండో ఎస్సార్సీ అవసరమా ?: వనం జ్వాలా నరసింహా రావు

సూర్య దినపత్రిక (19-11-2011)

వనం జ్వాలా నరసింహా రావు

{పొంతన లేని కాంగ్రెస్‌ ప్రతినిధుల ప్రకటనలు; యూపీతో లంకె ఎందుకు?; మాట మారుస్తున్న కాంగ్రెస్‌ నేతలు; తడబడుతున్న భారతీయ జనతా పార్టీ; అన్ని రాష్ట్రాల ఏర్పాటుకు ఎస్సార్సీ వేశారా?; తెలంగాణ’కు మాత్రం ఎస్సార్సీ ఎందుకు? .... ఎడిటర్ సూర్య}

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తనదైన శైలిలో కాంగ్రెస్‌ నాయకత్వం - యుపిఎ ప్రభుత్వం నాన్చివేత ధోరణి కొనసాగింపుగా, రెండో ఎస్సార్సీ ఏర్పాటును తెర పైకి తెచ్చింది. బోడి గుండుకు మోకాలు ముడిపెట్టే చందాన, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలను, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చేయాలన్న డిమాండును, తెలంగాణ అంశానికి లంకె వేసింది. సూర్య దినపత్రిక పేర్కొన్నట్లు ఉత్తరప్రదేశ్ లో "ఎన్నికలు ముగిసి, ఫలితాలలో పార్టీ అదృష్టం బయట పడిన తర్వాతే తెలంగాణ విషయంలో కసరత్తును పునరుద్ధరించాలని ఏఐసీసీ నాయకత్వం భావిస్తున్నట్టు" స్పష్టమైన సంకేతాలందిస్తోంది కేంద్రం. ఒకవైపు పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ నేమో రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేసి రాష్ట్రాల పునర్విభజన జరపాలా వద్దా అని నిర్ణయించడమే అఖిలభారత స్థాయిలో కాంగ్రెస్ విధానమని ప్రకటిస్తే, దానికి భిన్నంగా, ఇప్పుడిప్పుడే రెండవ ఎస్సార్సీ లాంటి ప్రతిపాదనలేవీ ఉండబోవని మరో సీనియరు నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ తాజాగా ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి చేసిన డిమాండ్‌ను దిగ్విజయ్‌ సింగ్‌ సమర్థిస్తే, ప్రణబ్ ముఖర్జీ వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ విధానం చిన్న రాష్ట్రాల ఏర్పాటా? కాదా? కాకపోతే అసలు దాని విధానమేంటి అనేది భగవంతుడికే తెలియాలి! అంతలోనే తెలంగాణ విషయంలో త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని మళ్లీ మాట మారుస్తున్నారు అదే ప్రణబ్ ముఖర్జీ. వారికి ఇదొక ఆటలాగా - రాజకీయ క్రీడలాగా ఐపోయిందనాలి.

రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వాస్తవానికి, ఒక అర్థరహిత, అసమంజస, కారణ రహిత, విడ్డూరమైన అసంబద్ధ రాజకీయ తెలివితక్కువ ఆలోచన అనాలి. తెలంగాణ సమస్యకు ఇది పరిష్కారమార్గం కానే కాదు. కాజాలదు కూడా. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఈ ఆలోచన నచ్చి స్వాగతించారే మో కాని, ఒక్కరంటే ఒక్క తెలంగాణ వాది కూడా పిసరంత మాత్రమైనా అంగీకరించిన దాఖలాలు లేనే లేవు. అంగీకరించే సమస్యే ఉత్పన్నం కాదు. మాయావతి ఆలోచనకు ముందస్తుగా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదేమో కాని, పరోక్షంగా తన గోతి తానే తవ్వుకుంటున్నదన్న సంగతి మర్చిపోతోంది. అదేం విచిత్రమో కాని, తెలంగాణ ఏర్పాటుకొరకు రెండో ఎస్సార్సీ అవసరం లేదని వాదిస్తూ వచ్చిన, తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరితో ముందుకొచ్చిన, పార్లమెంటులో చర్చకు సహితం నోటీసిచ్చిన ఏకైక జాతీయ పార్టీ - భారతీయ జనతా పార్టీ కూడా, ఉత్తర ప్రదేశ్ సంగతి వచ్చేసరికల్లా, రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్రానికి సూచన ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ ఐక్య కార్యాచరణ నాయకులు, తెలంగాణ టిడిపి-కాంగ్రెస్ నాయకులు ఎస్సార్సీ ఏర్పాటు ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు.

మొదటి పర్యాయం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ ఏర్పాటు చేయడానికి ఒక చారిత్రక నేపధ్యం, పాలనాపరమైన అత్యవసర ఆవశ్యకత వుండేది. అలాంటిదేమీ ఇప్పుడు కించిత్తైన లేదు. ఆంగ్లేయుల పాలనలోని భారతావని (1858–1947), స్వాతంత్ర్యోద్యమం (1857–1947), దేశ విభజన (1947), స్వతంత్ర్యానంతరం రాజకీయ సమగ్రతల పరిరక్షణ (1947–49) నేపధ్యంలో మొదటి ఎస్సార్సీ ఆవశ్యకత కలిగింది. భారత దేశంలోని వివిధ రాష్ట్రాలను, ప్రాంతాలను, భౌగోళికంగా హద్దుల ఏర్పాటు చేసేందుకు, పాలనా సౌలభ్యంగా వాటిని మలిచేందుకు, మొదటి ఎస్సార్సీ చట్టం 1956 లో తీసుకుని రావడం జరిగింది. అదో ప్రాముఖ్యత సంతరించుకున్న రాజకీయ సంస్కరణ. ఆ చట్టం మూలాన, భౌగోళికంగా హద్దులు నిర్ణయించడానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రాతిపదికగా తీసుకున్నారు. స్వతంత్రం రావడానికి పూర్వం ఆచరణలో వున్న మూడు రకాల (ఎ, బి, సి) రాష్ట్రాల స్థానంలో ఒకే తరహా రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి మొదటి ఎస్సార్సీని ఉపయోగించుకుంది ప్రభుత్వం. తరువాత కొన్ని రాష్ట్రాలను మరో మారు విభజించినప్పటికీ, ఇంతవరకూ, ఎన్నడూ ఎస్సార్సీ లను ఏర్పాటు చేసి ఆ పని చేయలేదు. ఇప్పుడలా చేయాల్సిన అవసరమూ లేదు. స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒక్క సారి ఇంతవరకు ఎస్సార్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మరిప్పుడెందుకు చేయాలి?

భారత దేశానికి స్వతంత్రం రాక పూర్వం, బ్రిటీష్ ఇండియాలో రెండు విధాలైన దేశ భూభాగాలుండేవి. లండన్ లోని ఇండియా కార్యాలయం కింద, భారత గవర్నర్ జనరల్ కింద నేరుగా అధీనంలో వున్న బ్రిటీష్ ఇండియా ప్రదేశాలు కొన్నైతే, వారసత్వ పాలనలో వున్నటువంటి ప్రిన్సిలీ రాష్ట్రాలు మరి కొన్ని వుండేవి. వాటిపై అంతర్జాతీయ సంబంధాల విషయంలో మాత్రమే బ్రిటీష్ ప్రభుత్వ అజమాయిషీ వుండేది. అదనంగా, ఫ్రెంచ్, పోర్చుగల్ అధీనంలో వున్న వలస ప్రాంతాలు కూడా వుండేవి. వీటన్నిటినీ ఒకే గొడుగు కింద తెచ్చే రాజకీయ సమాకలనం - రాజకీయ ఏకీకరణ, అలనాటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో సర్దార వల్లభాయ్ పటేల్, బ్రిటీష్ ఇండియాలో అత్యున్నత స్థానానికి ఎదిగిన భారతీయ సివిల్ సర్వెంట్ వి. పి. మీనన్ చేసిన అవిరళ కృషి ఫలితంగా, దాదాపు చాలా ప్రిన్సిలీ రాష్ట్రాలతో సహా అన్నీ భారత దేశంలో విలీనం కావడానికి అంగీకరించాయి. ఫ్రెంచ్, పోర్చుగల్ అధీనంలో వున్న వలస ప్రాంతాలు కూడా విలీనం దిశగా నడిచాయి. కాశ్మీర్, హైదరాబాద్, మణిపూర్, త్రిపురలాంటి కొన్ని రాష్ట్రాలు స్వతంత్రంగా వుండేందుకు ప్రయత్నాలు చేసినా చివరకు ఫలించలేదు. చిట్ట చివరి బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బేటన్ లాంటి వారు కూడా భారత జాతీయ కాంగ్రెస్ ప్రయత్నాలలో సహాయ పడ్డారు. ఆగస్ట్ 15, 1947 న బ్రిటీష్ ఇండియా, భారత పాకిస్తాన్ దేశాలుగా విడిపోయి, భారత దేశానికి స్వాతంత్ర్యం లభించింది.

జనవరి 26, 1950 న భారత దేశానికి కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారత దేశం అవతరించింది. అలా అవతరించిన దేశంలోని వివిధ ప్రాంతాలను కొన్నింటిని రాష్ట్రాలుగా, మరి కొన్నింటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా పిలవడం ప్రారంభించారు. రాష్ట్రాలకు స్వతంత్రంగా పాలన చేసుకునే అధికారాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండే విధంగాను పాలనాపరమైన వీలు కలిగించింది రాజ్యాంగం. కాకపోతే వీటన్నిటినీ, మూడు రకాల రాష్ట్రాలుగా పాలనా సౌలభ్యంకొరకు విభజించడం జరిగింది. "ఎ" విభాగం కింద బ్రిటీష్ ఇండియాలో సరాసరి గవర్నర్ జనరల్ అజమాయిషీ కింద వుండే రాష్ట్రాలకు ఎన్నికైన గవర్నర్, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల శాసన సభలుండేవి. అలాంటి తొమ్మిది రాష్ట్రాలలో అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, బాంబే, మధ్య ప్రదేశ్ (గతంలోని కేంద్ర ప్రావిన్సులు, బీరార్ ప్రాంతం), మద్రాస్, ఒరిస్సా, తూర్పు పంజాబ్, ఉత్తర ప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్సెస్) వున్నాయి. "బి" విభాగంలో గతంలోని ప్రిన్సిలీ రాష్ట్రాలుండేవి. రాష్ట్రపతి నియామకం చేసిన రాజప్రముఖ్, ఎన్నికైన శాసన సభల ఆధ్వర్యంలో పాలన సాగే దక్కడ. అవి హైదరాబాద్, సౌరాష్ట్ర, మైసూర్, ట్రావన్‍కోర్-కొచ్చిన్, మధ్య భారత్, వింధ్యా ప్రదేశ్, పాటియాలా, పెప్సు, రాజస్థాన్ రాష్ట్రాలు. ఢిల్లీ, కచ్, హిమాచల్ ప్రదేశ్, బిలాస్ పూర్, కూర్గ్, భోపాల్, మణిపూర్, అజ్మీర్-మేర్వార్, త్రిపుర రాష్ట్రాలు "సి" విభాగం కింద వుండేవి. జమ్ము-కాశ్మీర్ కు కొంతకాలం ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగింది. అండమాన్-నికోబార్ దీవులను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో ఏర్పాటైంది ఎస్సార్సీ.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అక్కడక్కడా ఉద్యమాలు మొదలయ్యాయి. మద్రాస్ రాష్ట్రం నుంచి తమను విడదీయాలని తెలుగు మాట్లాడే వారు ఉద్యమించడంతో, 1953 లో, తెలుగు మాట్లాడే పదహారు జిల్లాలను మద్రాస్ రాష్ట్రం నుండి విడదీసి, "ఆంధ్ర రాష్ట్రం" గా ఏర్పాటు చేయడం జరిగింది. 1950-1956 మధ్య కాలంలో కొన్ని చిన్న చిన్న భౌగోళిక మార్పులు చేసి కొన్ని రాష్ట్రాల సరిహద్దులను మార్చడం జరిగింది. జులై నెల 1954 లో హిమాచల ప్రదేశ్ లో బిలాస్ పూర్ ను విలీనం చేశారు. 1955 లో ఒకనాటి ఫ్రెంచ్ కాలనీ చందర్ నగర్ ను పశ్చిమ బెంగాల్ లో కలిపారు. ఫజల్ అలీ, కవలం మాధవ ఫణిక్కర్, హెచ్. ఎన్. కుంజ్రు సభ్యులుగా మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ ఏర్పాటైంది. 1955 లో "ఎస్సార్సీ నివేదిక" సమర్పించడం, అందులో మిగతా వాటితో పాటు తెలంగాణ ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. నివేదికలోని 369 నుండి 389 పేరాలలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, మద్రాస్ నుండి విడదీసిన ఆంధ్ర రాష్ట్రం కలిపి "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం గా ఏర్పాటు కావడానికి సంబంధించిన అంశాలున్నాయి.

స్సార్సీ నివేదిక ఆధారంగా నవంబర్ 1, 1956 న అమలులోకి వచ్చిన కొత్త రాష్ట్రాల ఏర్పాటులో "ఎ, బి, సి" విభాగాలు లేకుండా అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన పాలనా పరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనే రెండు రకాలు మాత్రం కొనసాగాయి.

ఇక ఆ తరువాత పంజాబ్ నుంచి హర్యానాను విడదీసినప్పుడైనా, మధ్య ప్రదేశ్ నుంచి ఛత్తీస్‌ఘడ్ ను ఏర్పాటు చేసినప్పుడైనా, లేదా జార్ఖండ్, ఉత్తరాంచల్ విషయంలోనైనా ప్రస్తావనకు రాని ఎస్సార్సీ ఇప్పుడెందుకు రావాలి? ఏ ప్రయోజనం కొరకు ఆ అంశాన్ని ఎవరు లేవనెత్తుతున్నారు? ఉత్తర ప్రదేశ్ ను విడదీసినా, విదర్భ ఏర్పాటు చేసినా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎస్సార్సీ వేయనక్కర లేనే లేదు. End

1 comment:

  1. రెండో SRC వేస్తె తెలంగాణా ప్రక్రియ వెనకకి పోతుందనే పేరాశ తప్ప దీని వల్ల ఆంధ్రా వారికి ఒరిగిందేమీ లేదు. ఇది ఏదో ఒక రకంగా తెలంగాణా ప్రజల కోరికను అణగగొట్టాలనే భయంకర కుట్ర. In other words, a scorched earth policy that takes pleasure from the misery of others.

    కొత్త రాష్ట్రాల వ్యవస్థకు హేతుకత మళ్ళీ నిర్వచించాల్సిన అవసరం లేదు. SRC చెప్పినట్టు ప్రజల అభిమతం (దేశ ప్రయోజనాలకు భంగం కానంతవరకు) మేరకే రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మున్ముందు కూడా ఇదే ప్రమాణం పాటిస్తే సరిపోతుంది.

    ReplyDelete