Sunday, December 25, 2011

1977 లో పౌరహక్కుల సభలు: వనం జ్వాలా నరసింహారావు


తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 17
1977 లో పౌరహక్కుల సభలు
వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పదిహేడవ అధ్యాయం ఇది).

1977లో ఎమర్జెన్సీ ఎత్తి వేశాక, కేంద్రంలో అధికారంలోకొచ్చిన జనతా ప్రభుత్వం, ఎమర్జెన్సీలో జరిగిన అకృత్యాల అధ్యయనం కోసం, "షా కమీషన్" ఏర్పాటు చేసింది. ఆ స్ఫూర్తితో తిరిగి పౌర హక్కుల ఉద్యమాన్ని జిల్లాలో ప్రారంభించే ప్రయత్నం చేశారు డాక్టర్ గారు. అప్పటికి సిపిఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తదితరులతో కాంగ్రెస్ నాయకులు గెల్లా కేశవరావుగారు, పూర్వ కమ్యూనిస్ట్ నాయకులు గండ్ర సుబ్బారెడ్డిగారు, జనతా పార్టీ నాయకులు చేకూరి కాశయ్యగారు సహకరించారు. కొన్ని కార్యక్రమాలు జరిగాయి. రిటైర్డ్ జస్టిస్ తార్కుండే గారి నాయకత్వాన ఒక కమిటీ, పౌర హక్కుల ఉల్లంఘనలపై ఒక పెద్ద నివేదిక విడుదల చేసింది. నివేదికను హైదరాబాద్‌లో ఆవిష్కరించిన తరువాత ఖమ్మంలో ఆవిష్కరించే ఏర్పాట్లు చేశారు. వర్తక సంఘం భవనంలో పెద్ద సదస్సు జరిగింది. హైదరాబాద్ నుండి కన్న భీరన్ గారు, ప్రముఖ హేతువాది అడ్వకేట్ ఎం. వి. రామ్మూర్తి గారు, కాళోజీ నారాయణరావుగారు హాజరయ్యారు.

ఎమర్జెన్సీ కాలంలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారి ఆధ్వర్యంలో, ఆనాటి నక్సల్స్ పై జరిగిన మారణకాండపై, విషయ సేకరణ కోసం ప్రభుత్వం జస్టిస్ భార్గవ కమీషన్‌ను నియమించింది. ఈ కమీషన్ హైదరాబాద్‌లో విచారణ ప్రారంభించింది. సుందరయ్య, ఓంకార్‍గార్లు విచారణలో పాల్గొన్నారు. కన్నభీరన్‍గారు న్యాయ సంబంధమైన వివరణలు ఇచ్చారు. ఆ కమీషన్ కార్య కలాపాలకు పత్రికలు పెద్ద ఎత్తున ప్రాముఖ్యం ఇవ్వడంతో, ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కమీషన్ విచారణ బహిరంగంగా చేయరాదని, గుంభనంగా మాత్రమే జరగాలని ఆదేశించింది. అందుకు జస్టిస్ భార్గవ కాని, కన్నభీరన్, సుందరయ్యగార్లు కాని సుముఖంగా లేకపోవడంతో దాన్ని మూసి వేశారు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లాలో కూడా చాలా ఘోరాలు జరిగాయి. సత్తుపల్లికి చెందిన అడ్వకేట్ బత్తుల వెంకటేశ్వరరావును నక్సలైట్ పేరుతో అమానుషంగా పోలీసులు చంపివేశారు. అది పెద్ద సంచలనం సృష్టించింది.

ఆ కేసు తదితర కేసులకు సంబంధించిన వివరాలు డాక్టర్ వై.ఆర్.కె, ఆయన మిత్రులు కర్నాటి రామ్మోహనరావు, బోడేపూడి వెంకటేశ్వరరావు(అడ్వకేట్), ఆయా ప్రదేశాలకు వెళ్లి, సమాచారం సేకరించి, భార్గవ కమీషన్ ముందుకు పంపించారు.

అదే సమయంలో వెంగళరావు అవినీతి అంశంపై విచారణకు "జస్టిస్ విమద్ లాల్ కమీషన్" ఏర్పాటైంది. అది చేకూరి కాశయ్య గారి చొరవతో వేయబడ్డ కమీషన్. దానితో డాక్టర్ వై.ఆర్.కె కు సంబంధం లేదు. కాని, ఆ కమీషన్ కూడా, జస్టిస్ గారి మెతక వైఖరి వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. ఆ నాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేపట్టిన వారందరికీ నిరాశ కలిగించింది.

భార్గవ కమీషన్
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, బూటకపు ఎన్‌కౌంటర్లలో అనేక మంది పోలీసుల చేతుల్లో చనిపోయారు. ఆ ఘటనలను విచారించి, నిజానిజాలను కనిపెట్టి బహిరంగంగా బయట పెట్టి బాధ్యులకు శిక్ష విధించాలన్న ఉద్యమం మొదలైంది. ఎమర్జెన్సీ ముగిసిపోయి, జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. ఆ పాటికే ప్రముఖ పౌర హక్కుల ఉద్యమ నాయకుడు విఎం. తార్కుండే అధ్యక్షుడుగా, ఎనిమిది మంది సభ్యులతో ఏప్రిల్ 1977లో ఏర్పాటైన "తార్కుండే కమిటీ" సాక్ష్యాల సేకరణలో నిమగ్నమైంది. అనేక ప్రాంతాలలో కమిటీ సభ్యులు పర్యటించి, సమాచారాన్ని సేకరించి, నివేదికలను రూపొందించి, ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‌కు, హోం మంత్రి చరణ్ సింగ్‍కు పంపింది కమిటీ. ఆ కమిటీ సభ్యులలో కన్నబిరాన్, కాళోజీ నారాయణరావు, బి.జి. వర్గీస్, అరుణ్ శౌరి లాంటి ప్రముఖులున్నారు. ప్రధానిని, హోం మంత్రిని కన్నభీరన్ పలుసార్లు స్వయంగా కూడా కలుసుకున్నారు. నివేదికలు చదివిన మొరార్జీ దేశాయ్ విచారణ కమీషన్ వేయాల్సిన అవసరం వుందనే అభిప్రాయానికి వచ్చారు. కాకపోతే అలాంటి కమీషన్‌ను వేసే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వుందనేది గమనించాల్సిన అంశం. కేంద్రం జోక్యం తప్పని సరి అని కన్నభీరన్ ప్రభృతులు ప్రధానిని కోరడంతో, రాజీ ఫార్ములాగా, కేంద్రం సూచించిన న్యాయమూర్తిని రాష్ట్ర ప్రభుత్వం నియమించి విచారణ జరిపించాలన్న నిర్ణయం జరిగింది.

పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వశిష్ట భార్గవ నాయకత్వంలో, వెంగళరావు ప్రభుత్వం, భార్గవ కమీషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ భార్గవకు నిజాయితీపరుడని, ముక్కు సూటిగా మాట్లాడే వాడని, జిల్లా జడ్జీగా-హైకోర్టు జడ్జీగా-సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడని గుర్తింపు వుంది. కమీషన్ కార్యదర్శిగా బీనాదేవిగా ప్రసిద్ధిగాంచిన రచయిత బి. నరసింగ రావును నియమించింది ప్రభుత్వం. ఆయన కార్యదర్శిగా జులై 1977 చివరి వారంలో, కమీషన్‌కు సంబంధించిన తొలి విచారణ బహిరంగ ప్రకటన వెలువడింది. హైదరాబాద్ దిల్ కుషా ప్రభుత్వ అతిధి గృహంలో విచారణ జరిగింది. మొట్ట మొదటి వాంగ్మూలం తార్కుండే ఇచ్చారు. తార్కుండే కమిటీ పక్షాన ఎం. వి. రామమూర్తి, కన్నబిరాన్ వాదనలు వినిపించేవారు. పి. శివశంకర్‌ను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఆయా రంగాలలో నిపుణులైన మరి కొందరిని కూడా కమీషన్ నియమించింది.  

ప్రభుత్వం సాగించిన అమానుష హత్యాకాండపై న్యాయ విచారణ
ఖమ్మం జిల్లా పౌరహక్కుల పరిరక్షణ సదస్సు డిమాండ్
(విశాలాంధ్ర: జూన్ 19, 1977)
        ఎన్నో ఘోరాలు చేసి, ఎన్నో నిండు ప్రాణాలను బలిగొన్న ఆంధ్రపదేశ్ ప్రభుత్వ అమానుష హత్యాకాండపై న్యాయవిచారణ జరగాలని, బాధ్యులైన  వారెంతటి ఉన్నత పదవుల్లో వున్నా, వారిని వెంటనే సస్పెండ్ చేసి, న్యాయవిచారణలో దోషులుగా రుజువైన వారందరినీ కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఖమ్మంజిల్లా పౌరహక్కుల పరిరక్షణ సదస్సు తీర్మానించింది.

           న్యాయవిచారణ సక్రమంగా జరగడానికై ఈలోగా రికార్డులు మాయమయ్యేందుకు గాని సాక్షులను బాధ పెట్టేందుకు గాని పోలీసులకు, ప్రభుత్వానికి అవకాశం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సదస్సు కోరింది

ఖమ్మం జిల్లా పౌరహక్కుల పరిరక్షణ అఖిల పక్ష సదస్సు ఈ నెల 12వ తేదినుండి (1977) స్థానిక వర్తక సంఘం భవనంలో జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా సమితి, జిల్లా మార్క్సిస్టు పార్టీ, జనతాపార్టీ, జమాతే--ఇస్లామి పార్టీలతోను, ఇతర మేధావులతోను ఏర్పడి, సన్నాహక సంఘం పిలిపుపైన జరిగిన ఈ సదస్సుకు జిల్లా అన్ని ప్రాంతాలనుంచి వివిధ పార్టీలకు చెందిన వారు, పట్టణ మేధావంతులు, విదార్ధులు, యువకులు, కార్మికులు, డాక్టర్లు, న్యాయవాదులు, 15 వందల మందికి పైగా పాల్గొన్నారు

సన్నాహక సంఘ కన్వీనర్ డాక్టర్ ఎలమంచిలి రాధాకృష్ణమూర్తి స్వాగతం పలికారు. సదస్సుకు న్యాయవాది శ్రీ కొమరిగిరి సుందర రామారావు అధ్యక్షత వహించారు

శ్రీ కాళోజీ నారాయణరావు సదస్సును ప్రారంభిస్తూ గత 30 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో పౌరహక్కులు లేకుండా పోయాయని, ముఖ్యంగా నక్సలైట్స్ పేరుతో అనేకమందిని పట్టుకుని కాల్చివేసిందని, వారు గావించిన పాపాలన్నిటిని విచారణ జరిపి, దోషులందరినీ జైళ్ళాలో పెట్టే పరిస్థితి ఈనాడు ఏర్పడిందని అన్నారు.

తరువాత శ్రీ కన్నాభిరాం సందేశమిస్తూ సంఘబలం ద్వారానే ప్రభుత్వాలను అదుపులో పెట్టగలమనిచెపుతూ, తార్కుండే కమిటీ ఏర్పడిన విధానం, అవి ఇప్పటివరకు పరిశోధించిన కేసులు, వాటి స్వరూప స్వభావాలు వివరిస్తూ యీ కమిటీ చేసిన పని యావత్తూ సాక్ష్యాధాలతో సహా ప్రజల ముందుంచుకుంటానని చెప్పారు.

శ్రీ నార్ల వెంకటేశ్వరరావు పంపిన సందేశాన్ని సదస్సులో చదివారు.

సాయంత్రం 4 గంటలకు తార్కుండే కమిటీ ప్రకటించిన రెండవ నివేదికను కమిటీ సభ్యుడైన యం.వి. రామమూర్తి సదస్సులో సందేశాన్నిచ్చారు.

సదస్సులో 9 అంశాలతో కూడుకొన్న తీర్మానాన్ని శ్రీ పాటిబండ్ల రవికుమార్ (అడ్వకేట్) ప్రతిపాదించగా వివిధ పార్టీల నాయకులు దానిపై తమ తమ అభిప్రాయాలను చెపుతూ వాటికి తమ సంపూర్ణ సహకారాన్ని ప్రకటించిన తర్వాత తీర్మానాన్ని సదస్సు కరతాళ ధ్వనుల మధ్య ఆమోదించింది.

తీర్మానంపైన జరిగిన చర్చల్లో కమ్యూనిస్టుపార్టీ తరపున శ్రీ పారుపల్లి పుల్లయ్య, శాసన సభ్యులు శ్రీ మహమ్మద్ రజబ్ ఆలీ, మార్క్సిస్టూపార్టీ తరపున శ్రీ టి.వి.ఆర్. చంద్రం, శ్రీ కె.యల్. నర్సింహారావు, జనతాపార్టీ తరపున శాసనసభ్యులు శ్రీ చేకూరు కాశయ్య, శ్రీ గండ్ర సుబ్బారెడ్డి, జమాత్--ఇస్లామి తరపున శ్రీ మహమ్మద్ ఇలియాస్, నక్సలైట్స్ తరపున శ్రీ జానారెడ్డి కోటేశ్వరరావులు పాల్గొన్నారు.

చివరిలో సదస్సు కన్వీనర్ డా. రాధాకృష్ణమూర్తి చర్చలను ముగిస్తూ విభిన్న ధృక్పదాలు కలిగియున్న పార్టీలన్నీ ఏకమై పౌరహక్కుల పరిరక్షణ సదస్సును జరుపుకోవడంవల్ల యీ జిల్లాలో నూతనాధ్యాయానికి నాంది పలికిందని అన్నారు.

శ్రీ అడపా గోపాలకృష్ణమూర్తి వందన సమర్పణతో సదస్సు జయప్రదంగా ముగిసింది.

నూతన కమిటీ
          సదస్సులో ఈ క్రింది వారితో జిల్లా పౌరహక్కుల పరిరక్షణ కమిటీని ఏకగ్రీవంగా యెన్నుకున్నారు
          డా. వై. రాధాకృష్ణమూర్తి (కన్వీనర్), శ్రీయుతులు చేకూరి కాశయ్య (ఎం.ఎల్.), మహమ్మద్. రజబ్ ఆలీ (ఎం.ఎల్.), కొమరిగిరి సుందర రామారావు (ఆద్వకేట్),, అజహర్ ఆలీ (అడ్వకేట్), విరాధాకృష్ణ (అడ్వకేట్), డా. వి. రామనాధంవాసిరెడ్డి కోటేశ్వరరావు, అడపా గోపాలకృష్ణమూర్తి, పువ్వాడ నాగేశ్వరరావు (కమ్యూనిస్టు పార్టీ), పాదుపల్లి పుల్లయ్య (కమ్యూనిస్టుపార్టీ), టి.వి.ఆర్.చంద్రం (మార్క్సిస్టు పార్టీ), కె.ఎల్. నర్సింహారావు (మార్క్సిస్టు పార్టీ), గండ్ర సుబ్బారెడ్డి (జనతాపార్టీ), మహమ్మద్ ఇలియాజ్‌ (జమాత్--ఇస్లామి), యం. రామచంద్రారావు (ఎస్.పహె.), సిద్ధి వెంకటేశ్వర్లు (యువజన సమాఖ్య).

          రాజకీయ ఖైదీల పై నేరవిచారణ పేరుతో కుట్ర కేసులు బనాయించి సంవత్సరాల తరబడి నేర విచారణ తతంగాన్ని పొడిగించి వారిని దీర్ఘకాల కారాగార బాధితుల్ని చేయటం, అందులో నిర్దోషులుగా పేర్కొనబడిన వారుకూడా ఈ మొత్తం కాలం అనవసరంగా శిక్షలను అనుభవించవలసి రావటం, నేరం రుజువు కాకుండానే కఠిన శిక్షను అమలుపర్చే ప్రభుత్వ కుట్రగా భావించి సదస్సు తీవ్రంగా ఖండించింది.

          రాజకీయ నాయకులను చంపిగాని, ప్రాణాలతోగాని వచ్చిన వారికి పారితోషికాలు ప్రకటించి, మన ప్రభుత్వంవలన ప్రభుత్వాల అమానుషత్వాన్ని తలదన్నిందిఅట్టి విధానాన్ని రద్దుచేసి నాగరిక ప్రభుత్వ పద్ధతులను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

          జైళ్ళలో ఇప్పటికీ మగ్గిపోతూవున్న రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదలచేయాలని, రాజకీయ ప్రత్యర్ధులపై మోపిన అన్ని కేసులను, వారంట్లను ఉపసంహరించాలని డిమాండ్ చేసింది.

          మీసా, డి..ఆర్. వంటి రాక్షస చట్టాలను రద్దు చేయాలని, కల్లోలిత ప్రాంతాల ప్రకటనను రద్దుచేయాలని, రాజకీయ వివక్షతతో ఉద్యోగాలనుండి తొలగించిన వారిని తిరిగి చేర్చుకోవాలని సదస్సు కోరింది.

          ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు తెలిసినవారు మానవతా దృక్పథంతో వాస్తవాలను బహిరంగ పరచ వలసిందిగా సదస్సు కోరింది.

No comments:

Post a Comment