Tuesday, December 27, 2011

ఖమ్మం జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పిన శీలం సిద్దారెడ్డి: వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-12-2011)
(శీలం సిద్దారెడ్డి 26-12-2011 న మరణించిన సందర్భంగా)
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, బాణాపురం గ్రామంతో సహా చుట్టుపక్కల అనేక గ్రామాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తల మధ్య హింసా కాండ కొనసాగింది. ఇరు పక్షాలలో ఎంతోమంది చనిపోయారు. పక్క గ్రామమైన వల్లభిలోనూ, మండల కార్యాలయమున్న ముదిగొండ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ రాజకీయ హత్యలెన్నో జరిగాయి. వీటన్నిటి వెనుక కేవలం కమ్యూనిస్టు-కాంగ్రెస్ పార్టీల మధ్య తగాదాలే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ జిల్లా నాయకుల మధ్య జరిగిన ప్రచ్చన్న ఆధిపత్య పోరాటం కూడా కారణమే అన్న విషయం అలనాటి జిల్లా రాజకీయాలను అర్థం చేసుకున్న ప్రతి వారికీ తెలుసు.
రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఖమ్మం జిల్లాకొక ప్రత్యేక స్థానం ఉంది. వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణ శాఖ ఏర్పడడం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రాంకిషన్‍రావు, రావెళ్ళ సత్యనారాయణ వంటి యోధులు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పార్టీ చీలిపోవడంతో సీపీఎం (కమ్యూనిస్ట్ పార్టీ-మార్క్సిస్ట్) బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తంలో సీపీఎంకు పట్టున్న జిల్లాగా పేరు తెచ్చుకుంది.
తొలి రోజుల్లో, ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలోనూ, ప్రత్యేకించి జిల్లా రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు, కొంతకాలం రాష్ట్ర రాజకీయాలను శాసించి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా ఉన్న జలగం వెంగళరావుల చుట్టూ ఖమ్మం జిల్లా రాజకీయాలు తిరుగుతుండేవి. శీలం సిద్దారెడ్డి రాజకీయంగా ఎదిగి, మంత్రివర్గంలో స్థానం సంపాదించి, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలగడంతో, జిల్లా కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో, జలగం-శీలం వర్గాలుగా ఖమ్మం కాంగ్రెసు రాజకీయాలు సాగాయి. కమ్యూనిస్టులు జిల్లాలోనూ, ప్రత్యేకించి ముదిగొండ ప్రాంతంలోనూ, పరిస్థితులను బట్టి శీలం వర్గానికి మద్దతివ్వడమో, తీసుకోవడమో జరిగేది.
జలగం-శీలం వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతున్న రోజుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఖమ్మం తాలూకా పాలేరు-తిరుమలాయపాలెం పరిధిలోని గ్రామాల్లో సిద్దారెడ్డి వర్గానికి కమ్యూనిస్టుల మద్దతు లభిస్తే, ఖమ్మం సమితి పరిధిలోని గ్రామాలలో కమ్యూనిస్ట్ అభ్యర్థులకు సిద్దారెడ్డి వర్గం మద్దతు లభించేది. ఆ విధంగా చెరొక సమితి దక్కించుకుని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించేవారు. అయితే కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత సీపీఐ జలగం పక్షాన, సీపీఎం సిద్దారెడ్డి వర్గంతోనూ కలిసి పనిచేశాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కొంత మారింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి, ఇంకో సారి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చేవారు. వారి మద్దతుతో వీలై నన్ని ఎక్కువ స్థానాలు ఆయా ఎన్నికల్లో సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు. కమ్యూనిస్ట్ పార్టీలు స్వయంకృషితో ఎదగడం ఒకవిధంగా, రోజులుగడుస్తున్నకొద్దీ, ఆగిపోయిందనే అనాలి
ఇలాంటి రాజకీయ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా, గత శతాబ్దం అరవయ్యో దశకంలో, మిగతా జిల్లాల్లో మాదిరిగానే ఖమ్మంలో కూడా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగడం, ఎన్నికైన సర్పంచులు సమితి అధ్యక్షుడినీ, వీరంతా కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకోబోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిందని రాజకీయ విశ్లేషకులందరూ భావించే "సీల్డ్ కవర్‌" రాజకీయాలకు అపర చాణక్యుడుగా పేరుపడ్డ బొమ్మకంటి సత్యనారాయణరావు ఆ రోజుల్లోనే శ్రీ కారం చుట్టి, తన సమీప బంధువైన రావులపాటి సత్యనారాయణ రావుని, ‘పాలేరుసమితి అధ్యక్షుడిని చేశారు. అప్పట్లో రావులపాటిని తప్ప వేరెవరిని ప్రతిపాదించినా సమితి అధ్యక్ష పదవికి తాము కూడా పోటీలో ఉంటామని కమ్యూనిస్టు నాయకులు ప్రకటించడంతో, సర్పంచ్‌ కూడా కాని ఆయనను కో-ఆప్షన్‌ సభ్యునిగా ఎంపిక చేయించి అధ్యక్షుడిగా చేశారన్న విషయం ఆ ప్రాంతవాసులందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి బొమ్మకంటి నిర్ణయంవల్ల రాజకీయంగా ఎక్కువ నష్టపడింది ఆయన మరో బంధువు అయితరాజు రాం రావు. అప్పటికే రాజకీయంగా బొమ్మకంటితో సమాన స్థాయికి ఎదిగిన ఆయన ఎదుగుదలను ఆపుచేసేందుకే బొమ్మకంటి తన చాణక్య నీతిని ప్రదర్శించాడంటారు. వల్లభి గ్రామ వాస్తవ్యుడైన రాం రావు శీలం గారికి అత్యంత సన్నిహితుడు.
ఈ నిర్ణయంతో బొమ్మకంటి నుండి కొందరు అయినవారు దూరం కావడం, జలగం వర్గం వారికి కోపం కలగడం దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు. ఆ నేపథ్యంలో, ముదిగొండ, పరిసర గ్రామాల రాజకీయాలు క్రమేపీ వేడెక్కాయి. కక్షలకు దారి తీసాయి. అప్పటి వరకూ కలసిమెలసి ఉంటున్న వారిమధ్య చిచ్చు రేగింది. బొమ్మకంటికి అత్యంత సన్నిహితుడిగా అప్పటివరకూ ఉంటూ వస్తున్న సమీప గ్రామానికి చెందిన ఓ భూస్వామికీ, సమితి అధ్యక్షుడికి భూమితగాదాతో ప్రారంభమైన పేచీ చిలికి చిలికి తుఫానుగా మారింది. సమితి అధ్యక్షుడికి అండగా దళితులు, పేదలతో సహా, సాక్షాత్తు ఆయన్ను వ్యతిరేకించిన భూస్వామి కొడుకు పక్షాన పరోక్షంగా స్థానిక కమ్యూనిస్టులు నిల్చారు. దీర్ఘకాలం సాగిన ఆ పోరాటంలో సమితి అధ్యక్షుడి పక్షానున్న భూస్వామి కొడుకును ఆయన తండ్రి నాయకత్వంలోని వైరి వర్గాల వారు హత్య చేయించారని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. దీని ప్రభావం అదే మండలంలోని అనేక గ్రామాల్లో- ముందుగా వల్లభిగ్రామంలో పడింది. అలనాటి తగాదాలలో శీలం సిద్దారెడ్డి తన మద్దతును దళితుల పక్షాన నిలిచిన సమితి అధ్యక్షుడికి ఇచ్చారు.
 ముదిగొండలో ఇరుపక్షాల కాంగ్రెస్‌ వారి మధ్య పోరు సాగినంత కాలం శీలం వర్గం రావుల పాటికి అండగానూ, జలగం వర్గం ఆయనకు వ్యతిరేకంగానూ నిల్చింది. అయితే దళితులు, పేదలు రావులపాటికి మద్దతు ఇస్తుండడంతో, వారికి మద్దతుగా కమ్యూనిస్టులు నిల్చారు. ఆ ప్రాంత-జిల్లా, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన రాయల వెంకటేశ్వర్లు, రావిళ్ల సత్యం పార్టీ పరంగా ముందున్నారు. రాయల వెంకటేశ్వర్లు ముదిగొండ పంచాయితీలో ఒకప్పుడు భాగమైన వెంకటాపురం గ్రామానికి, రావిళ్ల సమీప గ్రామమైన గోకినేపల్లికి చెందినవారు. తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా జలగం వర్గీయుడు, ముదిగొండ సమీపంలోని మేడేపల్లి గ్రామానికి చెందిన నాటి కాంగ్రెస్‌ యువనేత ఉపేంద్రయ్య గెలుపొందారు. సమితి స్థాయిలో తిరుగులేని నాయకుడిగా, జలగం వర్గంలో ముఖ్యుడిగా, అనతి కాలంలో ఎదిగాడు. అప్పటికే జలగం, శీలం వర్గాలుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఆధిపత్యం పోరులో కూరుకుపోయింది. ఆ ప్రభావం ముదిగొండ పరిసర గ్రామాల్లో పడింది. జలగం గ్రూప్‌ పక్షాన పలుకుబడిగలిగిన ఒక అగ్రవర్ణం వారు చేరగా, శీలం వైపున మరో అగ్రవర్ణం వారే చేరారు. దళితుల్లో మెజార్టీ శీలం వర్గానికి చెందిన అగ్రవర్ణాల పక్షాన నిల్చారు.
సమితి అధ్యక్షుడిని తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన రావడం, అదీ, కాంగ్రెస్‌నుంచే రావడంతో ఆ ప్రాంత రాజకీయాలు మరో మారు వేడెక్కాయి. సీపీఎం సర్పంచ్‌లు ఉపేంద్రయ్యను పూర్తిగా వ్యతిరేకించగా, సీపీఐకి చెందిన కొందరితో సహా పార్టీ మద్దతుతో గెల్చిన మరి కొందరి మద్దతు ఆయనకు లభించింది. కాకపోతే అలా మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు సర్పంచులు చివరకు పార్టీని వీడి, ఉపేంద్రయ్య అండతో, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులపై పోరాటం చేసారు. ఇరుపక్షాలకు చెందిన కొందరు నాయకులు హత్యకు కూడా గురయ్యారు. రాజకీయంగా పలుకుబడి కోల్పోతున్న సమయాన ఉపేంద్రయ్య కూడా హత్యా రాజకీయాలకు బలైపోయారు
అవిశ్వాస తీర్మానంలో ఉపేంద్రయ్యకు అండగా నిలవని సర్పంచులపై కక్ష బూనిన జలగం వర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర వర్ణాల వారికి, అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళితులకు ముదిగొండ మండలంలోని వల్లభిగ్రామం మరో భూ పోరాటానికివేదికైంది. దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన ఆ గ్రామ అగ్ర వర్ణాల వారికి, దళితులకు తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. చనిపోయిన వ్యక్తి అగ్రవర్ణానికి చెందిన వాడైనందున దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులకు అండగా నిలిచిన ఆ గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, స్వర్గీయ అయితరాజు రాం రావు గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మొత్తం రాజకీయ పోరాటంలో శీలం సిద్దారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడైన రాం రావు పక్షాన నిలిచారు.
ఈ సమస్యకు పరిష్కారం గాంధేయ మార్గంతప్ప మరోటి కాదని గ్రహించిన అయితరాజు రాం రావు, స్నేహితుల సహాయంతో గాంధి-వినోబా బావేల శిష్యుడైన ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు. పోరాటం కన్నా శాంతే మేలని భావించాడు. వల్లభికి భన్సాలీ వచ్చిన మరుక్షణమే, దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. అంతవరకూ నిరాహార దీక్షలో ఉంటానని శపథం చేసాడు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది. నాటి గవర్నర్‌ ఖండూభాయ్ దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి అంగీకరించాల్సిందెవరో కాదు. కాంగ్రెస్‌లోని ఇరు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు: జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి. జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌, ముఖ్యమంత్రి భన్సాలి దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో, బహుశా దేశంలోనే దళితుడు పూజారిగా ఉన్న మొదటి రామాలయం వల్లభి గ్రామంలో ఉంది. అప్పటి జాతీయ, అంతర్జాతీయ వార్తా పత్రికల్లో ఈ విశేషాలన్నీ ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. వల్లభి గ్రామ భూపోరాటంలో అక్కడి కమ్యూనిస్టులు దళితుల పక్షాన పోరు సల్పిన కాంగ్రెస్‌ వర్గానికి మద్దతిచ్చారు
ఆ ప్రాంత రాజకీయాలు హత్యా రాజకీయాలుగా, భౌతికంగా ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకోసాగాయి. మళ్ళీ సమితి ఎన్నిక లొచ్చే సరికి, ఆ ప్రాంతంలోని ప్రతి గ్రామ సర్పంచ్‌ ఓటు అత్యంత ప్రాముఖ్యంగా మారడం విశేషం. చివరకు శీలం వర్గం కాంగ్రెస్‌ సర్పంచుల సహకారంతో సిపిఎం సమితి పీఠాన్ని దక్కించుకుంది. అయితే అంతకుముందు, ఆ తర్వాత, చోటు చేసుకున్న పరిణామాల్లో, ఎంతోమంది కమ్యూనిస్టు-కాంగ్రెస్‌ నేతలు హత్యకు గురయ్యారు. బాణాపురం గ్రామానికి చెందిన మార్క్సిస్ట్ నాయకుడు ముక్క చిన నరసింహతో ఆరంభమైన హత్యాకాండ ఎంతో మందిని బలి తీసుకుంది. కాంగ్రెస్‌-కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోరులో సిపిఎం నాయకులు గంధసిరి గ్రామ వాసి గండ్ర వీరభద్రా రెడ్డి, బాణాపురం గ్రామవాసి గండ్లూరు కిషన్‌రావు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ కమ్యూనిస్టు కోయ వెంకటరావుతో సహా చాలా మంది చనిపోయారు. పోలీసు క్యాంపులు ఆ ప్రాంతాల్లో అలవాటుగా మారిపోయాయి కొంత కాలం.
శీలం సిద్దారెడ్డికి ఆ విధంగా ఖమ్మం జిల్లా రాజకీయాలతో ఎన్నో విధాల అనుబంధం వుండేది. ఆయన తుది శ్వాస విడిచేంతవరకు కూడా, ఆయన ప్రభావం అంతో-ఇంతో ఖమ్మం జిల్లా రాజకీయాలపై పడుతూనే వుండేదంటే అతిశయోక్తి కాదేమో! చిన్న తనంలో ప్రాధమిక విద్యాభ్యాసం స్వగ్రామం బనిగళ్లపాడులో చేసిన సిద్దారెడ్డి, ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో హైస్కూల్ చదువు పూర్తి చేసుకున్నారు. ఇంటర్ రెండేళ్లు, బిఏ రెండేళ్లు, లా రెండేళ్లు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాష్ట్ర సహకార బాంక్ అధ్యక్షుడుగా, కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం కార్యదర్శిగా పనిచేశారు. ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల కోటానుండి 1958 లో ఎన్నికైన సిద్దారెడ్డికి 1967 లో మొదటిసారి బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో చోటు దొరికింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో మూడో పర్యాయం ఆయన మంత్రి అయ్యారు. నాలుగో సారి పివి నరసింహారావు మంత్రివర్గంలో స్థానం దక్కింది సిద్దారెడ్డికి. ఆయనకు ఎప్పుడూ నీటిపారుదల శాఖనే కేటాయించేవారు.
(రచయిత స్వగ్రామం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో వుంది)

No comments:

Post a Comment